ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల కార్యక్రమం మీద తాజాసమాచారం


ఏప్రిల్ నెలంతా సెలవుల్లేకుండా అన్ని కేంద్రాల్లో కోవిడ్ టీకాలు

Posted On: 01 APR 2021 1:27PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని కోవిడ్ టీకా కేంద్రాలన్నీ వాడకంలో పెట్టాలని కూడా ప్రకటించింది. ఇవి ఏప్రిల్ నెల మొత్తం 1వ తేదీ నుంచి 30 వరకు సెలవుదినాలతో సహా  పనిచేస్తాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది.  

మార్చి 31న రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో చర్చించిన మీదట కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.  అన్ని కోవిడ్ టీకా కేంద్రాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కోరింది. టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేసి ఎక్కువమందికి టీకాలు అందించాలని ఆ లేఖలో సూచించింది.  కోవిడ్ మీద సాగిస్తున్న పోరులో భాగమే ఈ వేగవంతమైన టీకాల కార్యక్రమమని కూడా కేంద్రప్రభుత్వం తెలియజేసింది.

దేశంలో కరోనా సోకటానికి అవకాశమున్న వర్గాలను కాపాడటమే ధ్యేయంగా టీకాల కార్యక్రమం చేపట్టినట్టు ప్రభుత్వం ఆ లేఖలో స్పష్టం చేసింది. అందువలన దీని అమలును ఎప్పటికప్పుడు  క్రమం తప్పకుండా ఉన్నత స్థాయిలో సమీక్షించాలని కోరింది. కోవిడ్ టీకాల నిర్వహణమీద ఏర్పాటైన జాతీయ నిపుణుల బృమ్దం ఇచ్చిన సలహా మేరకు 45 ఏళ్ళు దాటినవారందరికీ 1నుంచి టీకాలు వేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

 

***



(Release ID: 1709015) Visitor Counter : 245