ప్రధాన మంత్రి కార్యాలయం
అహమదాబాద్ మెట్రో ప్రాజెక్టు తాలూకు ఫేజ్- 2, సూరత్ మెట్రో ప్రాజెక్టు ల భూమి పూజ సందర్బం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Posted On:
18 JAN 2021 2:29PM by PIB Hyderabad
గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ గారు, కేంద్ర మంత్రిమండలి లో నా సహచరులు అమిత్ శాహ్ గారు, హర్ దీప్ సింగ్ పురీ గారు, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ గారు, గుజరాత్ ప్రభుత్వ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, అహమదాబాద్ కు, సూరత్ కు చెందిన నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా, నమస్కారం.
ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ దినాన అహమదాబాద్ నివాసులకు, సూరత్ నివాసులకు ఎంతో ముఖ్యమైన కానుక అందుతోంది. దేశం లో రెండు ప్రధాన వాణిజ్య కేంద్రాలు అయిన అహమదాబాద్, సూరత్ లలో మెట్రో నిర్మాణం ఆ నగరాల లో సంధానాన్ని మరింత పటిష్ఠపరచే పని ని పూర్తి చేయనుంది. కేవడియా కు కొత్త రైలుమార్గాలను, కొత్త రైళ్లను ఆదివారం ప్రారంభించడం జరిగింది. ఆధునిక జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ ఇప్పుడు అహమదాబాద్ నుంచి కేవడియా కు ప్రయాణించనుంది. ఈ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని గుజరాత్ ప్రజలకు శుభాకాంక్షలను, అభినందనలను తెలియచేస్తున్నాను.
సోదర సోదరీమణులారా,
ఇవాళ 17,000 కోట్ల రూపాయలకు పైబడిన పెట్టుబడి తో మౌలిక సదుపాయాల పనులు ప్రారంభం అయ్యాయి. కరోనా కష్ట కాలం లో సైతం దేశం మౌలిక సదుపాయాల నిర్మాణానికి నిరంతరాయం గా కృషి చేస్తున్నట్టు ఈ 17,000 కోట్ల రూపాయల పెట్టుబడి నిరూపిస్తోంది. గత కొద్ది రోజుల్లో వేలాది కోట్ల రూపాయల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు లు ప్రారంభం కావడమో, లేదా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభం కావడమో జరిగింది.
మిత్రులారా,
అహమదాబాద్, సూరత్.. ఈ రెండూ ఒక్క గుజరాత్ కే కాక యావత్తు భారతదేశం స్వయంసంవృద్ధి కి అండ గా నిలచే నగరాలే. అహమదాబాద్ లో మెట్రో ప్రారంభమైన అద్భుత క్షణం నాకు గుర్తుంది. ప్రజలు ఇళ్ల కప్పుల పై నిలబడి ఆ ఘట్టాన్ని వీక్షించారు. ఆ వేళ లో ప్రజల ముఖాలలో కనిపించిన ఆనందాన్ని ఏ ఒక్కరైనా మరచిపోవడం చాలా కష్టం. అలాగే అహమదాబాద్ కల లు, గుర్తింపు సైతం మెట్రో తో ముడిపడ్డ సంగతి ని నేను గమనించాను. ఈ రోజు న అహమదాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణం ప్రారంభం కాబోతోంది. అహమదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు లో ఇప్పుడు మోటేరా స్టేడియమ్ నుంచి మహాత్మ మందిర్ వరకు ఒక కారిడార్ ఏర్పాటు అవుతుం. రెండో కారిడార్ ద్వారా జిఎన్ఎల్ యు, గిఫ్ట్ సిటీ లు ఒకదానితో మరొకటి జోడింపబడతాయి. దీని తాలూకు ప్రయోజనం నగరం లోని లక్షలాది నివాసులకు అందుతుంది.
మిత్రులారా,
అహమదాబాద్ తరువాత గుజరాత్ లో రెండో పెద్ద నగరం అయిన సూరత్ కు ఇప్పుడు మెట్రో వంటి ఆధునిక ప్రజారవాణా వ్యవస్థ అందుబాటు లోకి వస్తోంది. సూరత్ లోని ఈ మెట్రో నెట్ వర్క్ మొత్తం నగరం లోని కీలక వ్యాపార కేంద్రాలన్నింటినీ కలుపుతుంది. ఒక కారిడార్ సర్ థనా ను డ్రీమ్ సిటీ తో సంధానిస్తే మరో కారిడార్ భేసన్ ను సరోలి లైన్ తో సంధానిస్తుంది. రాబోయే సంవత్సరాల అవసరాలను కూడా దృష్టి లో పెట్టుకొని నిర్మాణం కావడం ఈ మెట్రో ప్రాజెక్టు ల ప్రత్యేకత. అంటే ఈ రోజు న పెడుతున్న పెట్టుబడులు మన నగరాల్లో రానున్న ఎన్నో సంవత్సరాల పాటు మెరుగైన వసతులు అందుబాటులో ఉంచుతాయి.
సోదర సోదరీ మణులారా,
దేశం లో మెట్రో నెట్ వర్క్ ల విస్తరణ తీరుతెన్నులే గతంలోని ప్రభుత్వాలకు, మా ప్రభుత్వానికి మధ్య గల తేడా ఏమిటో స్పష్టంగా వివరిస్తాయి. 2014వ సంవత్సరానికి ముందు 10-12 సంవత్సరాల కాల వ్యవధి లో కేవలం 225 కిలోమీటర్ల నిడివి గల మెట్రో మార్గాలు ప్రారంభం కాగా గత ఆరేళ్లలోనే 450 కిలోమీటర్ల కు పైగా మెట్రో లైన్ లు అందుబాటు లోకి వచ్చాయి. ప్రస్తుతం దేశంలోని 27 నగరాల్లో 1000 కిలోమీటర్లకు పైగా నూతన మెట్రో నెట్ వర్క్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి.
మిత్రులారా,
ఒకప్పుడు దేశం లో మెట్రో నిర్మాణం పై ఆధునిక ఆలోచనా ధోరణి గాని, చక్కని విధానం గాని లేవు. ఆ కారణంగానే విభిన్న సాంకేతిక పరిజ్ఞానాలతో మెట్రో నెట్ వర్క్ లు ఏర్పడ్డాయి. భిన్న నగరాల్లోని వ్యవస్థ లు భిన్నం గా ఉన్నాయి. పైగా నగరాల్లోని ఇతర రవాణా వ్యవస్థల కు, మెట్రో కు మధ్య సమన్వయం లేదు. ఈ రోజు న మేం నగరాల్లోని విభిన్న రవాణా వ్యవస్థలను సంఘటితం చేస్తున్నాం. అంటే బస్సులు, మెట్రో, సాధారణ రైళ్లు దేనికది వేర్వేరు వ్యవస్థలు గా పని చేయడం కాకుండా ఒక దానికి మరొకటి బలం గా నిలుస్తాయి. నేను అహమదాబాద్ సందర్శించిన సమయం లో నేశనల్ కామన్ మొబిలిటీ కార్డు ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది భవిష్యత్తు లో రవాణా వ్యవస్థలు మరింత సంఘటితం కావడానికి దోహదపడుతుంది.
మిత్రులారా,
నగరాల తక్షణ అవసరాలేమిటి, రాబోయే 10-20 సంవత్సరాల కాల వ్యవధి లో ఎలాంటి అవసరాలు ఏర్పడతాయి అనే ముందు చూపు తో మేం పని చేయడం ప్రారంభించాం. ఉదాహరణ కు సూరత్, గాంధీనగర్ లనే పరిశీలిద్దాం. రెండు దశాబ్దాల క్రితం, సూరత్ నగరం ఆ నగర అభివృద్ధి కంటే ప్లేగ్ వంటి మహమ్మారి కారణంగానే వార్తలలోకెక్కింది. అయితే సూరత్ నివాసులలో అందరినీ అక్కున చేర్చుకొనే స్వాభావిక గుణం ఏదయితే ఉందో, అది స్థితులను మార్చివేయడాన్ని మొదలుపెట్టింది. మేం ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యాపార సంస్థ ను అక్కున చేర్చుకొనే సూరత్ స్ఫూర్తి ని బలపర్చాం. ఈ రోజు న జనాభా పరం గా దేశం లో ఎనిమిదో పెద్ద నగరం అయిన సూరత్ ప్రపంచం లోనే త్వరిత గతి న విస్తరిస్తున్న నాలుగో పెద్ద నగరం గా కూడా గుర్తింపు పొందింది. ప్రపంచం లోని ప్రతి 10 వజ్రాలలో 9 వజ్రాలను సూరత్ లో సానబట్టడం జరుగుతోంది. ఈ రోజు న దేశం లో మొత్తం మనిషి తయారుచేసే వస్త్రాలలో 40 శాతం, మనుషులే నేసే ఫైబర్ లో 30 శాతం ఉత్పత్తి మన సూరత్ లో జరుగుతోంది. ఇవాళ సూరత్ దేశం లో అన్ని నగరాల కంటే పరిశుభ్రమైనటువంటి నగరాలలో రోండో నగరం గా ఉంది.
సోదర సోదరీమణులారా,
మెరుగైన ప్రణాళిక, సమ్మిళిత ఆలోచనా ధోరణి తోనే ఇవన్నీ సాధ్యమయ్యాయి. గతంలో సూరత్ లో 20 శాతం జనాభా మురికివాడల్లో నివసించే వారు. పేదలకు పక్కా ఇళ్లను కేటాయించిన తరువాత ఇప్పుడు మురికివాడలలో నివసించే వారి సంఖ్య ఆరు శాతాని కి తగ్గింది. నగరం లో రద్దీ ని తగ్గించేందుకు కూడా మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ సహా అనేక చర్యలను తీసుకోవడమైంది. ఈ రోజు న సూరత్ లో 100కి పైగా ఫ్లై ఓవర్ లు ఉన్నాయి. వాటిలో 80 ఫ్లై ఓవర్ లు గత 20 సంవత్సరాల కాలం లో నిర్మించగా, ప్రస్తుతం 8 నిర్మాణం లో ఉన్నాయి. అలాగే మురుగు నీటి శుద్ధి ప్లాంటు ల సామర్థ్యాన్ని కూడా పెంచడం జరిగింది. ఈ రోజు న సూరత్ లో 12కి పైగా మురుగునీటి శుద్ధి ప్లాంటులు ఉన్నాయి. ఈ రోజు న సూరత్ ఒక్క మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ద్వారానే 100 కోట్ల రూపాయలకు పైబడి ఆదాయాన్ని సంపాదిస్తోంది. గత కొద్ది సంవత్సరాల కాలం లో సూరత్ లో ఆధునిక ఆస్పత్రుల నిర్మాణం కూడా జరిగింది. ఈ చర్యలన్నీ జీవన సౌలభ్యాన్ని పెంచాయి. ఈ రోజు న సూరత్ ‘‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’’ కు చక్కని ఉదాహరణ గా మారింది. పూర్వాంచల్, ఒడిశా, ఝార్ ఖండ్, పశ్చిమ బంగాల్, ఈశాన్య రాష్ట్రాల ప్రజలు సంపూర్ణ కలల తో ఇక్కడకు రావడం వల్ల సూరత్ బుల్లి భారత్ గా అభివృద్ధి చెందింది. శ్రమించే తత్వం గల మన ప్రజలు అంకిత భావంతో పని చేస్తున్నారు. సూరత్ ను అభివృద్ధి లో కొత్త శిఖరాలకు చేర్చడం లక్ష్యం గా ఈ రోజు న ఈ ప్రజలంతా కృషి చేస్తున్నారు.
మిత్రులారా,
అదే విధం గా గతం లో గాంధీనగర్ గుర్తింపు ఏమిటి? అది రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వోద్యోగుల ఆవాస ప్రదేశం గా, సోమరితనం విలసిల్లే ప్రాంతం గా ప్రాచుర్యం లో ఉండేది. అయితే గాంధీనగర్ కు గల ఈ గుర్తింపు కొన్ని సంవత్సరాలు గా మారుతూ వచ్చింది. ఇప్పుడు గాంధీనగర్ లో ఎక్కడకు వెళ్లినా ఉత్సాహం చిందులు వేసే యువత ను, వారి కలలను మనం గమనిస్తాం. ఇప్పుడు గాంధీనగర్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఐఐటి గాంధీనగర్, గుజరాత్ జాతీయ న్యాయ విద్యాలయం, జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయం, రక్షా శక్తి విశ్వవిద్యాలయం, నిఫ్ట్ ల వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. పండిత్ దీన్ దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేశన్, ధీరూభాయి అంబానీ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేశన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడి), బాయిసెగ్ (భాస్కరాచార్య ఇన్స్ టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేశన్స్ ఎండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ వంటి సంస్థ లు ఉన్నాయి. అంత తక్కువ కాలంలోనే లెక్కలేనన్ని సంస్థ లు వచ్చాయి. భారత భవిష్యత్తు ను తీర్చి దిద్దుతున్నాయి. విద్యారంగాన్ని మార్చడంలో ఇలాంటి సంస్థలే కాదు, పలు కంపెనీలు తమ కేంపస్ లను ఏర్పాటు చేసి అహమదాబాద్ యువత కు ఉపాధి అవకాశాలు ఇవ్వజూపుతున్నాయి. అలాగే గాంధీనగర్ లో మహాత్మ మందిర్ కాన్ఫరెన్స్ టూరిజంకు ఉత్తేజం కల్పిస్తోంది. ఇప్పుడు వృత్తి నిపుణులు, దౌత్యవేత్తలు, మేధావులు, నాయకులు కూడా సదస్సుల్లో పాల్గొనేందుకు ఇక్కడకు వస్తున్నారు. ఇది కూడా నగరానికి కొత్త గుర్తింపు, దిశ అందిస్తోంది. ఈ రోజు విద్యాసంస్థలు, ఆధునిక రైల్వే స్టేషన్లు గాంధీనగర్ కు ప్రత్యేక ఆకర్షణ. గిఫ్ట్ సిటీ, ఆధునిక మౌలిక వసతుల ప్రాజెక్టుల తో గాంధీనగర్ ఆశల కు ఊపిరులు పోసే చలనశీల నగరం గా మారింది.
మిత్రులారా,
గాంధీనగర్ తో పాటు అహమదాబాద్ కు ప్రత్యేక గుర్తింపు తీసుకు రాగల అనేక ప్రాజెక్టు లు అమలు జరుగుతున్నాయి. సాబర్ మతీ రివర్ ఫ్రంట్ కావచ్చు, కాంకరియా లేక్ ఫ్రంట్ కావచ్చు, వాటర్ ఏరోడ్రోమ్ కావచ్చు, బస్ ర్యాపిడ్ ట్రాంజిట్ వ్యవస్థ కావచ్చు, మోటేరా లో గల ప్రపంచం లోకెల్లా అతి పెద్దదైన స్టేడియమ్ కావచ్చు, సర్ ఖేజ్ లో ఆరు లేన్ ల గాంధీనగర్ హైవే కావచ్చు.. అనేకానేక ప్రాజెక్టులు గడచిన సంవత్సరాలలో నిర్మాణం అయ్యాయి. మరో విధంగా చెప్పాలంటే అహమదాబాద్ పౌరాణికతను పరిరక్షించుకొంటూనే ఆధునికత ను కూడా సంతరించుకొన్న నగరం గా తీర్చిదిద్దడం జరుగుతోంది. భారతదేశం లో తొలి ‘‘ప్రపంచ వారసత్వ నగరం’’ గా అహమదాబాద్ ను ప్రకటించడమైంది. అహమదాబాద్ లోని ధోలేరా లో కొత్త విమానాశ్రయం కూడా నిర్మాణం కానుంది. ఈ విమానాశ్రయాన్ని అహమదాబాద్ తో కలపడం కోసం అహమదాబాద్-ధోలేరా మోనోరైల్ కు కూడా ఇటీవలే స్వీకృతి ని ఇవ్వడమైంది. ఇదే విధంగా అహమదాబాద్ ను, సూరత్ ను దేశ ఆర్థిక రాజధాని ముంబయి తో కలిపే బులెట్ ట్రయిన్ ప్రాజెక్టు పనులు కూడా పురోగమిస్తున్నాయి.
మిత్రులారా,
కొన్ని సంవత్సరాలుగా, గుజరాత్ లోని నగరాలతో పాటు గ్రామీణాభివృద్ధి లో కూడా అపూర్వమైన వృద్ధి చోటు చేసుకొంది. ముఖ్యం గా గత రెండు దశాబ్దాలుగా గుజరాత్ గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారులు, విద్యుత్తు, నీటి సదుపాయాలు రాష్ట్ర అభివృద్ధి పథం లో అతి ముఖ్యమైన అధ్యాయాలు గా చెప్పుకోవాలి. ప్రస్తుతం, గుజరాత్ లోని ప్రతి గ్రామానికీ అన్ని రకాల వాతావరణాల్లో ఉపయోపగడగలిగేలా రహదారి సంధానం ఉంది. ఆదివాసి ప్రాంతాలలో కూడా మెరుగైన రహదారులు ఉన్నాయి.
మిత్రులారా,
గతం లో గుజరాత్ లోని గ్రామీణ ప్రాంతాలకు నీటి ని రైళ్ళ ద్వారాను, ట్యాంకర్ల ద్వారాను తెచ్చుకోవడం మనలో చాలా మందిమి చూసి ఉన్నాం. ప్రస్తుతం, గుజరాత్ లో ప్రతి గ్రామానికీ నీటి సరఫరా సదుపాయం ఉంది. అంతే కాదు, దాదాపుగా 80 శాతం కుటుంబాలు ఇప్పుడు పంపు నీటి ని అందుకొంటున్నాయి. జల్ జీవన్ మిశన్ లో భాగం గా రాష్ట్రం లో 10 లక్షల కొత్త నీటి కనెక్షన్ లను అందించడమైంది. అతి త్వరలో గుజరాత్ లోని ప్రతి కుటుంబం నల్లా ల ద్వారా నీటిని అందుకోనుంది.
మిత్రులారా,
ఒక్క తాగునీరే కాదు, ప్రస్తుతం, వ్యవసాయ పరం గా గుజరాత్ లో నీటి పారుదల సౌకర్యం అసాధ్యం అని భావించిన ప్రాంతాలకు కూడా నీరు చేరుకొంది. ఇది సాధ్యపడుతుందని ఎవ్వరూ ఊహించ లేదు. సర్ దార్ సరోవర్ ఆనకట్ట, సౌని యోజన లేదా వాటర్ గ్రిడ్ స్ నెట్వర్క్ తో గుజరాత్ లోని కరవు ప్రభావిత ప్రాంతాలను హరిత మయం చేయడానికి చాలా సమగ్రమైన పనే జరిగింది. మాత నర్మద నది జలాలు ఇప్పుడు వందల కిలోమీటర్ల దూరం లో ఉన్న కచ్ఛ్ కు కూడా చేరుకొంటున్నాయి. సూక్ష్మ సేద్యం విషయం లో దేశం లోని ముఖ్యమైన రాష్ట్రాలలో గుజరాత్ కూడా ఉంది.
సోదర సోదరీమణులారా,
గుజరాత్ ఒకప్పుడు తీవ్ర విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొంది. ముఖ్యం గా గ్రామాల్లో ఈ సంక్షోభం మరీ ఎక్కువ గా ఉండేది. అయితే నేడు గుజరాత్ తగినంత శక్తి ని కలిగివుండడమే కాకుండా సౌర శక్తి అభివృద్ధి లో దేశం లోనే అగ్రగామి గా ఉంది. గుజరాత్ లోని కచ్ఛ్ లో ప్రపంచం లోనే అతి పెద్ద పునరుత్పాదక ఇంధన కర్మాగారం కోసం కొద్ది రోజుల క్రితం పనులు ప్రారంభం అయ్యాయి. సర్వోదయ యోజన లో భాగం గా నీటి పారుదల కోసం రైతులకు ప్రత్యేకంగా విద్యుత్తు ను అందించే మొదటి రాష్ట్రం గా గుజరాత్ అవతరిస్తోంది. ఆరోగ్య రంగం విషయానికి వస్తే, గుజరాత్ ప్రభుత్వం రాష్ట్రం లోని గ్రామాలలో నిరంతర ఆరోగ్య సేవలు అందిస్తోంది. గత ఆరేళ్ళ లో దేశం లో ప్రారంభమైన ఆరోగ్య సంరక్షణ పథకాలు కూడా గుజరాత్ కు ఎంతో సమగ్రమైన ప్రయోజనాన్ని చేకూర్చుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ పథకం లో భాగం గా గుజరాత్ లోని 21 లక్షల మంది కి ఉచిత చికిత్స లభించింది. మందులను తక్కువ ధరలకే రోగులకు అందించే నిమిత్తం రాష్ట్రం లో నేడు 525 పైగా జన్ ఔషధ కేంద్రాలు పనిచేస్తున్నాయి. దీంతో గుజరాత్ లోని మధ్య తరగతి కి, దిగువ తరగతి కి చెందిన అనేక సాధారణ కుటుంబాలు సుమారు 100 కోట్ల రూపాయలు ఆదా చేసుకొనే వీలు కలుగుతుంది. గ్రామీణ పేదల కు గృహాల ను సరసమైన ధర లో అందించడం లో కూడా గుజరాత్ వేగం గా పురోగతి ని సాధిస్తోంది. గుజరాత్ గ్రామాల్లో పిఎమ్ ఆవాస్ యోజన (గ్రామీణ) పరిధి లో 2.5 లక్షలకు పైగా ఇళ్ళు నిర్మించారు. అదే విధం గా స్వచ్ఛ్ భారత్ మిశన్ ఆధ్వర్యం లో గుజరాత్ గ్రామాల్లో 35 లక్షలకు పైగా టాయిలెట్ లను నిర్మించారు. గుజరాత్ గ్రామాల అభివృద్ధి కి పనులు ఎంత వేగం గా జరుగుతున్నాయో చెప్పడానికి మరొక ఉదాహరణ డిజిటల్ సేవా సేతు. దీని ద్వారా రేశన్ కార్డులు, భూమి సంబంధిత పత్రాలు, పెన్షన్ పథకాలు, వివిధ రకాల ధ్రువపత్రాల వంటి అనేక సేవలను గ్రామాల ప్రజలకు విస్తరిస్తున్నారు. ఎలక్ట్రానిక్ సేతు గత ఏడాది అక్టోబర్ లో ప్రారంభమైంది. అంటే నాలుగైదు నెలల క్రితం. త్వరలో ఈ డిజిటల్ సేతు 8,000 గ్రామాలకు అందుబాటు లోకి వస్తుందని నాకు చెప్పారు. దీని ద్వారా 50కి పైగా ప్రభుత్వ సేవలు గ్రామాల ప్రజలకు నేరు గా లభిస్తాయి. ఈ కార్యక్రమానికి గాను యావత్తు గుజరాత్ ప్రభుత్వ బృందాన్ని నేను అభినందిస్తున్నాను.
మిత్రులారా,
ప్రస్తుతం, భారతదేశం ఆత్మవిశ్వాసం తో నిర్ణయాలు తీసుకోవడమే కాదు, వాటిని వేగం గా అమలు చేస్తోంది కూడాను. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పనులు పెద్ద ఎత్తున చేపట్టడమే కాదు, చాలా మెరుగ్గా చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచం లోనే అతి పెద్ద విగ్రహం భారతదేశం లో ఉంది. ప్రస్తుతం ప్రపంచం లోనే అతిపెద్ద అందుబాటు ధరల ఇళ్ల నిర్మాణం కార్యక్రమాన్ని భారతదేశం చేపట్టింది. ప్రస్తుతం ప్రపంచం లోనే అతి పెద్దదైన ఆరోగ్య సంరక్షణ హామీ కార్యక్రమం కూడా భారతదేశం లో నడుస్తోంది. ఆరు లక్షల గ్రామాలను వేగవంతమైన ఇంటర్ నెట్ తో కలిపే పని కూడా భారతదేశం లో జరుగుతోంది. కరోనా సంక్రమణ కు వ్యతిరేకం గా ప్రపంచం లోనే అతి పెద్ద టీకా కార్యక్రమం భారతదేశం లో రెండు రోజుల కిందటే మొదలైంది.
ఇక్కడ గుజరాత్ లోనే, ఇటీవల రెండు ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యాయి. వీటిని నేను ప్రత్యేకం గా చెప్పాలనుకుంటున్నాను. ఒకటి ఘోఘా, హజీరా ప్రాంతాల మధ్య రోపాక్స్ సేవ కల్పించడం, మరొకటి గిర్ నార్ రోప్ వే. వేగం గా పూర్తి అయ్యే ప్రాజెక్టులు ప్రజల జీవితాలను ఎలా మారుస్తాయో చెప్పడానికి ఇవి చక్కటి ఉదాహరణ లు.
మిత్రులారా,
గత ఏడాది నవంబర్ లో, అంటే నాలుగు నెలల క్రితం, ఘోఘా, హజీరా ల మధ్య రోపాక్స్ సర్వీసు ప్రారంభం కావడం తో సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతాల ప్రజల ఏళ్ళతరబడి నిరీక్షణకు తెరపడింది, ఈ సేవ తో అక్కడి ప్రజలకు చాలా ప్రయోజనం లభిస్తుంది. ఘోఘా, హజీరా ల మధ్య గల 400 కిలోమీటర్ల రహదారి దూరాన్ని సముద్రం గుండా 90 కిలోమిటర్లకు కుదించే వీలు ఈ రోపాక్స్ సేవ తో కలిగింది. అంటే ప్రయాణ సమయం 10-12 గంటల నుండి కేవలం 4-5 గంటలకు తగ్గింది. ఇది వేలాది ప్రజలకు సమయాన్ని ఆదా చేస్తుంది. పెట్రోల్, డీజిల్ ఖర్చులను తగ్గిస్తుంది. ఇంకా రహదారి మార్గం పై తిరిగే వాహనాలు తక్కువ కావడం తో కాలుష్యాన్ని తగ్గించడం లో నూ తోడ్పాటు లభించింది. కేవలం రెండు నెలల్లోనే, 50,000 మంది కి పైగా ఈ కొత్త సదుపాయాన్ని ఉపయోగించుకొన్నారని నాకు చెప్పారు. రోపాక్స్ ఫెరీ సర్వీస్ ద్వారా 14 వేల కు పైగా వాహనాలను రవాణా చేశారు. సూరత్ తో పాటు సౌరాష్ట్ర లో కొత్త గా సంధానించిన ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని సౌరాష్ట్ర కు చెందిన రైతులు, పాడి పరిశ్రమ రైతులు పండ్లను, కాయగూరలను, పాలను సూరత్ కు రవాణా చేసుకోగలుగుతున్నారు. గతంలో పండ్లు, కూరగాయలు, పాలు రోడ్డు మార్గం లో రవాణా చేస్తున్నప్పుడు అవి చాలా వరకు పాడైపోయి, పనికిరాకుండా మిగిలేవి. ఇప్పుడు రైతులు పండించిన ఉత్పత్తులు, పాడి పరిశ్రమ రైతుల ఉత్పత్తులు సముద్ర మార్గం గుండా వేగం గా నగరాలకు చేరుతున్నాయి. అదేవిధం గా సూరత్ లోని వ్యాపారవేత్తలకు, కార్మిక వర్గానికి ఈ ఫెరీ సర్వీస్ ద్వారా రాకపోకలను సాగించడం చాలా సులభం అయిపోయింది.
మిత్రులారా,
ఈ ఫెరీ సర్వీసు కు కొన్ని వారాల ముందు, గత ఏడాది అక్టోబర్ నెలలో గిర్ నార్ లో రోప్ వే ప్రారంభం అయింది. గతం లో గిర్ నార్ పర్వతాన్ని సందర్శించాలంటే 9,000 మెట్లు ఎక్కి వెళ్ళడం ఒక్కటే మార్గం గా ఉండేది. ఇప్పుడు రోప్ వే భక్తులకు మరో సౌకర్యాన్ని ఇచ్చింది. ఇదివరకు ఆలయాన్ని చేరుకోడానికి 5-6 గంటల సమయం పట్టేది, ఇప్పుడు ప్రజలు కేవలం కొద్ది నిమిషాల్లో ఆ దూరాన్ని చేరుకోగలుగుతున్నారు. కేవలం రెండున్నర నెలల్లో 2.13 లక్షల మందికి పైగా ఈ సౌకర్యాన్ని వినియోగించుకొన్నట్లు నా దృష్టికి వచ్చింది. ఒక్కసారి ఊహించుకోండి, కేవలం రెండు నెలల్లో రెండు లక్షలకు పైగా జనం అంటే, ఈ సర్వీస్ పరిమాణం ఎలాంటిదో. ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని ఆలయాన్ని సందర్శిస్తున్న వృద్ధ మాతృమూర్తులు, సోదరీమణులు, ముఖ్యం గా కుటుంబం లోని వయోధిక వ్యక్తులు నా లాంటి చాలా మందిని ఆశీర్వదిస్తున్నారు. ఇది మాకు ఇంకా మరింత అధికంగా పాటుపడడానికి బలాన్నిస్తుంది.
సోదర సోదరీమణులారా,
మనం త్వరితగతి న పని చేస్తూ ప్రజల అవసరాలను, ఆకాంక్షలను అవగాహన చేసుకోవడం ద్వారా న్యూ ఇండియా సాధన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. ఈ దిశ లో మనం చేయవలసిన కృషి మరొకటి ఉంది. దాని ని గురించి చర్చించవలసినంతగా చర్చించడం జరుగలేదు. దాని పేరు ‘ప్రగతి’ (PRAGATI). అది ఒక కేంద్ర స్థాయి పథకం. నేను గుజరాత్ లో ఉన్నప్పుడు స్వాగత కార్యక్రమానికి సంబంధించి భారీ ఎత్తు న చర్చ జరుగుతుండేది. ఇప్పుడు దేశం లో అమలవుతున్న ప్రగతి కార్యక్రమం అనేది దేశం లో వివిధ పథకాలను, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చయడం లో కీలక పాత్ర ను పోషిస్తోంది. ఇక్కడ ప్రభుత్వం తో కలసి పని చేస్తున్నవారికి నేను చేస్తున్న కృషి గురించి తెలుసు. ప్రగతి కార్యక్రమ సమావేశాల్లో గంటల తరబడి కూర్చొని ప్రతి ప్రాజెక్టు ను గురించి సూక్ష్మ స్థాయి లో రాష్ట్ర అధికారులతో చర్చించి, వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నాను. దశాబ్దాల తరబడి మూలబడ్డ ప్రాజెక్టు ల సమస్యలను పరిష్కరించడానికిగాను ప్రగతి సమావేశాల్లో సంబంధిత వ్యక్తులందరితో నేరుగా మాట్లాడి పరిష్కారం కనుగొనడానికిగాను నేను ప్రయత్నిస్తున్నాను. రూ. 13 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులపై గత ఐదు సంవత్సరాల కాలం లో ‘ప్రగతి’ కార్యక్రమాలలో సమీక్షించడమైంది. ఎన్నో ఏళ్ల తరబడి అసంపూర్ణం గా మిగిలివున్న ముఖ్యమైన ప్రాజెక్టుల సమస్యలను ఈ సమీక్షల ద్వారా పరిష్కరించడం జరిగింది.
స్నేహితులారా,
చాలా కాలం గా ఆగిపోయిన పథకాలు ప్రారంభం కావడం వల్ల సూరత్ లాంటి నగరాలు ప్రగతి ని సాధించడానికిగాను తగిన బలం వస్తుంది. దేశం లోని పరిశ్రమలు, ముఖ్యం గా చిన్న తరహా పరిశ్రమలు, ఎమ్ఎస్ఎమ్ ఇ లు, తగిన ప్రోత్సాహాన్ని అందుకొంటాయి. అభివృద్ధి చెందిన దేశాల బజారుల తో పోటీ పడుతాయి. అంతే కాదు, వాటి స్థాయి లోనే మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకొంటాయి. ఆత్మనిర్భర్ భారత్ ఉద్యమం లో భాగం గా దేశం లోని చిన్న తరహా పరిశ్రమల కోసం అనేక ముఖ్య నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. దేశం లోని చిన్న తరహా పరిశ్రమలు సంక్షోభంలో నుంచి గట్టెక్కడానికిగాను వేల కోట్ల రూపాయల విలువైన రుణాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరో వైపున ఎమ్ఎస్ ఎమ్ఇలకు మరిన్ని అవకాశాలను ఇవ్వడానికిగాను అనేక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం తీసుకొన్న అతి పెద్ద నిర్ణయం ఎమ్ఎస్ ఎమ్ఇలకు కొత్త గా నిర్వచనాన్ని ఇవ్వడం. అంతే కాదు పెట్టుబడుల పరిధి లో మార్పు చేయడం. గతం లో ఎమ్ఎస్ ఎమ్ఇ ల విస్తరణ ను పారిశ్రామిక వేత్తలు వద్దనుకొనే వారు. ప్రభుత్వ పరం గా ప్రోత్సాహకాలు పోతాయేమోననే భయం తో అలా చేసే వారు. అలాంటి నిబంధనలను తొలగించి నూతన అవకాశాలను కల్పించడం జరిగింది. దీనికి తోడు కొత్త గా ఇచ్చిన నిర్వచనం ప్రకారం తయారీ సంస్థలకు, సేవా సంస్థలకు మధ్య ఉన్న వివక్ష తొలగిపోయింది. తద్వారా సేవా రంగం లోని సంస్థలకు నూతన అవకాశాలను కల్పించడం జరిగింది. ప్రభుత్వం చేపట్టే సేకరణల్లో భారతదేశ ఎమ్ఎస్ ఎమ్ఇల కు అధిక అవకాశాలు దక్కేలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మన చిన్న తరహా పరిశ్రమలు లబ్ధి ని పొందాలని ప్రగతి సాధించాలని, వాటిలో పని చేసే కార్మికులు మంచి సదుపాయాలను పొంది, మెరుగైన జీవన ప్రమాణాలు సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యం.
స్నేహితులారా,
ప్రభుత్వం భారీ గా చేస్తున్న ఈ కృషి కి వెనుక 21వ శతాబ్ది భారతదేశం యువత నిలబడివుంది. వారికి సంబంధించిన అపారమైన ఆకాంక్షలు దాగి వున్నాయి. మౌలిక సదుపాయాలు, భద్రత లేకపోతే వారి ఆకాంక్షలు నెరవేరడం కష్టం. ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని తొలగిస్తామని నాకు నమ్మకముంది. కలలు పండుతాయి. తీసుకున్న నిర్ణయాలు అమల్లోకి వస్తాయి. నేడు అహమదాబాద్, సూరత్ లలో ప్రారంభమైన మెట్రో ప్రాజెక్టు ల నిర్మాణాలనేవి ఈ రెండు నగరాల్లోని ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాయని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను.
ఈ నమ్మకం తో, గుజరాత్ లోని సోదరులకు, సోదరీమణులకు ముఖ్యం గా అహమదాబాద్, సూరత్ నగరాల్లోని సోదరులకు, సోదరీమణులకు ఇవే నా అభినందనలు.
అనేకానేక ధన్యవాదాలు.
అస్వీకరణ: ఇది ప్రధాన మంత్రి ప్రసంగానికి ఇంచుమించు గా చేసిన అనువాదం. ప్రధాన మంత్రి అసలు ప్రసంగం హిందీ భాష లో కొనసాగింది.
***
(Release ID: 1690478)
Visitor Counter : 228
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam