మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

దేశంలో ఎవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా పరిస్థితి

Posted On: 15 JAN 2021 6:17PM by PIB Hyderabad

ఈనెల 15వ తేదీ వరకు, మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌, రాజ్‌ఘర్‌, దిండోరి, ఛింద్వారా, మంద్లా, హర్దా, ధార్‌, సాగర్‌, సంతా జిల్లాల్లో కాకులు, నెమళ్లలో; ఉత్తరాఖండ్‌ డెహ్రాడూన్‌ జిల్లాలో కాకులు, గద్దల్లో; దిల్లీ రోహిణి ప్రాంతంలో కాకుల్లో; రాజస్థాన్‌లోని జైపూర్‌ జిల్లాల్లో బాతులు, కొంగల్లో ఎవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా (ఏఐ)ను గుర్తించారు. 

    మధ్యప్రదేశ్‌ రాష్ట్రం హర్దా జిల్లాలోని ఆనంద్‌/భగీరథ్‌ కలోసియాలోని పౌల్ట్రీలో, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బలోద్‌ జిల్లాలోని జీఎస్‌ పౌల్ట్రీ ఫారంలోనూ వైరస్‌ నిర్ధారణ అయింది. ఇప్పటివరకు దేశంలోని 11 రాష్ట్రాలు ఏఐ బారినపడ్డాయి.

    వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించి, అపోహలు తొలగించే చర్యలను అధికారులు ఇప్పటికే చేపట్టారు. 

    అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పశు సంవర్దక శాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో చర్చించిన అంశాల ప్రకారం, కేంద్ర పశు సంవర్దక శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలకు లిఖితపూర్వక సూచనలు చేశారు. ఏఐ మన దేశానికి కొత్త కాదని, 2006 నుంచి ఏటా వస్తున్నదేనని పేర్కొన్నారు. ఆ వైరస్‌ను మన దేశం సమర్థవంతంగా నియంత్రిస్తున్నట్లు స్పష్టం చేశారు. 70 డిగ్రీలు సెంటిగ్రేడ్‌ దాటిన ఉష్ణోగ్రత వద్ద వైరస్‌ సులభంగా నాశనమవుతుందని, చక్కగా ఉడికించిన పౌల్ట్రీ ఉత్పత్తులు తినడం సురక్షితమేనని వెల్లడించారు. ఏఐ లేని ప్రాంతాలు/రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన పౌల్ట్రీ ఉత్పత్తులపై నిషేధం విధించకుండా, అమ్మకాలను అనుమతించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని డీఏహెచ్‌డీ కార్యదర్శి లిఖితపూర్వక సూచనల్లో కోరారు.

 

***



(Release ID: 1689001) Visitor Counter : 86