కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

'డాక్ పే' డిజిటల్ చెల్లింపుల సేవలను ప్రారంభించిన ఇండియా పోస్ట్ పెమెంట్స్ బ్యాంక్

బ్యాంకింగ్ కార్యకలాపాలలో నూతన అధ్యాయం
'డాక్ పే'తో ఆన్ లైన్ చెల్లింపులు,ఇళ్ల వద్దకే ఆర్థిక సర్వీసుల సేవలు మరింత పటిష్టం -- కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్

Posted On: 15 DEC 2020 1:58PM by PIB Hyderabad

తపాలా శాఖ మరియు ఇండియా పోస్ట్ పెమెంట్స్ బ్యాంకు (ఐపీపీబి)లు ఈ రోజు ' డాక్ పే' డిజిటల్ చెల్లింపుల యాప్ ను ప్రారంభించాయి. దేశవ్యాపితంగా డిజిటల్ ఆర్ధిక లావాదేవీలను అందుబాటులోకి తీసుకుని రావడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా తపాలా శాఖ, ఇండియా పోస్ట్ పెమెంట్స్ బ్యాంకు ఈ యాప్ ను ప్రారంభించాయి. వర్చ్యువల్ విధానంలో యాప్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
' డాక్ పే' యాప్ ను కేవలం డిజిటల్ చెల్లింపుల యాప్ గా కాకుండా వివిధ రకాల ఆర్ధిక సేవలను తన పోస్టల్ వ్యవస్థ ద్వారా అందించేవిధంగా తపాలా శాఖ రూపొందించింది. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు తమ ఆత్మీయులకు నగదును పంపించడానికి ( దేశంలో నగదు బదిలీ-డిఎంటి), సేవలు పొందడానికి, కొనుగోళ్ల కోసం క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి డిజిటల్ చెల్లింపులు చేయడానికి( యూపిఐ తో వర్చ్యువల్ డెబిట్ కార్డ్), బయో మెట్రిక్ విధానంలో నగదు రహిత లావాదేవీలను సాగించడానికి వీలు కల్పించడంతో పాటు ఏ బ్యాంకు ఖాతాదారులైన కార్యకలాపాలను సాగించడానికి, వివిధ రకాల బిల్లులను చెలించడానికి అవకాశం కలిగించే విధంగా ఈ యాప్ ను రూపొందించారు.
యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రసంగించిన కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ కొవిడ్-19కి వ్యతిరేకంగా పోరాటం సాగుతున్న సమయంలో ప్రజల ఇళ్ల వద్దకు బ్యాంకింగ్ కార్యకలాపాలను అందుబాటులోకి తీసుకుని రావడానికి తపాలా శాఖ మరియు ఇండియా పోస్ట్ పెమెంట్స్ బ్యాంకులు చేసిన కృషిని అభినందించారు. దీనివల్ల ఇంతవరకు బ్యాంకింగ్ కార్యకలాపాలకు దూరంగా ఉన్న వారికి ప్రయోజనం కలుగుతుందని అన్నారు. '' దేశంలో లాక్ డౌన్ విధించిన సమయంలో తపాలా శాఖ ఎలాంటి అంతరాయం లేకుండా తన అన్ని సేవలను ప్రజలకు అందించింది. ' డాక్ పే' యాప్ తో తపాలా శాఖ దేశంలోని ప్రతి ఇంటికి తన సేవలను అందుబాటులోకి తేవడంలో విజయం సాధించి తన చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని ఆవిషరించింది ఆవిష్కరించింది. ఈ వినూత్న సేవతో బ్యాంకింగ్, పోస్టల్ సేవలు ఆన్ లైన్ లో అందుబాటులోకి వస్తాయి. ఇంటి నుంచే తమకు అవసరమైన సేవలను కోరి పొందవచ్చును. దేశవ్యాపితంగా యంత్రాంగాన్ని కలిగి ఉన్న తపాలా శాఖ ప్రారంభించిన కార్యక్రమం బ్యాంకింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఆర్ధిక స్వేచ్ఛ కలిగిన ఆత్మ నిర్బర్ భారత్ రూపుదిద్దు కోవాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆశయ సాధనకు ఇది మరింత దోహద పడుతుంది.' అని మంత్రి వివరించారు.
ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడిన ఐపీపీబి బోర్డు చైర్మన్ శ్రీ ప్రదీప్త కుమార్ బిషోయ్ యాప్ లేదా పోస్టుమేన్ ద్వారా ప్రజలు తమకు అవసరమైన బ్యాంకింగ్, చెల్లింపుల సేవలను మరింత సులువుగా పొందవచ్చునని అన్నారు. డాక్ పే యాప్ ను ప్రతి ఒక్కరూ సులువుగా వాడవచ్చునని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క భారతీయుని ఆర్ధిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని యాప్ కు రూపకల్పన చేశామని ఆయన వివరించారు.
డాక్ పే తో ఐపీపీబి చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభం అయ్యిందని ఐపీపీబి ఎండీ మరియు సీఈఓ శ్రీ జె. వెంకట్ రాము వ్యాఖ్యానించారు. ' సమగ్ర బ్యాంకింగ్ వ్యవస్థకు రూపకల్పన చేయాలన్న మా లక్ష్యం ఈ యాప్ తో సాకారం అయ్యింది. ప్రతి ఒక్క ఖాతాదారుడూ మా బ్యాంకుకి ముఖ్యమైన ఖాతాదారుడే, ప్రతి ఒక్క కార్యకలాపం ప్రతి ఒక్క డిపాజిట్ మాకు విలువైనది' అని ఆయన అన్నారు.
ఐపీపీబి :
ఐపీపీబిని తపాలా శాఖ ప్రారంభించింది. దీనిలో కేంద్ర ప్రభుత్వం 100% వాటాను కలిగి వుంది. 2018 సెప్టెంబర్ ఒకటవ తేదీన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ ఐపీపీబిని ప్రారంభించారు. భారతదేశంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో, నమ్మకమైన బ్యాంకు సేవలను అందించాలన్న లక్ష్యంతో ఐపీపీబిని ప్రారంభించడం జరిగింది. బ్యాంకింగ్ కార్యకలాపాలకు దూరంగా ఉన్న ప్రజలందరికి బ్యాంకింగ్ కార్యకలాపాలను అందించాలని దేశంలో ప్రతి మారుమూల ప్రాంతానికి విస్తరించాలన్న లక్ష్యంతో ఐపీపీబి పనిచేస్తున్నది. దేశవ్యాపితంగా ఉన్న 155,000 ( 135,000 గ్రామీణ ప్రాంతాల్లో) తపాలా కార్యాలయాలు, 300,000 మంది పోస్టల్ ఉద్యోగుల ద్వారా ఐపీపీబి తన లక్ష్య సాధన కోసం పనిచేస్తున్నది.
కాగితాలు, నగదు రహిత బ్యాంకింగ్ వ్యవస్థను ప్రజలందరికి సౌకర్యవంతమైన సురక్షిత బ్యాంకింగ్ కార్యకలాపాలను అందించడానికి ఐపీపీబి చర్యలను తీసుకుంటున్నది. స్మార్ట్ ఫోన్, బయో మెట్రిక్ సాధనాల ద్వారా సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని పనిచేస్తున్న ఐపీపీబి 13 భారతీయ భాషలలో సరళమైన బ్యాంకింగ్ కార్యకలాపాలను అందుబాటులోకి తీసుకుని వస్తున్నది.
డిజిటల్ ఇండియా ఆవిష్కరణకు నగదు రహిత లావాదేవీలు జరిగేలా చూడడానికి ఐపీపీబి ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రతి భారతీయుడు ఆర్ధికంగా బలపడి,సురక్షితంగా ఉన్నపుడు మాత్రమే భారతదేశం అభివృద్ధి చెందుతుందని గుర్తించిన ఐపీపీబి ఈ దిశలో తన కార్యకలాపాలను సాగిస్తూ ప్రతి ఒక్క ఖాతాదారుడు, ఖాతా, డిపాజిట్ కు ప్రాధాన్యత ఇస్తున్నది. ఐపీపీబికి సంబందించిన పూర్తి సమాచారాన్ని www.ippbonline.com లో చూడవచ్చును.

***



(Release ID: 1680803) Visitor Counter : 253