గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

పి.ఎం.ఎ.వై.(యు) కింద వలస కూలీలకు, పేదలకు అందుబాటులో అద్దె ఇళ్ల సముదాయాల నిర్మాణం

నిర్మాణ సంస్థలకు పలు రాయితీలు, ప్రయోజనాలు :కేంద్రమంత్రి హర్ దీప్ పూరి

ప్రత్యేక వెబ్ సైట్, అంగీకార్ ఉద్యమ కార్యక్రమంపై జాతీయ నివేదిక ఆవిష్కరణ

Posted On: 14 OCT 2020 5:25PM by PIB Hyderabad

  పట్టణ ప్రాంతంలో అమలుచేసే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పి.ఎం.వై.ఎ.-యు) కింద పట్టణ వలసదారులకు, నిరుపేదలకు అందుబాటులో అద్దె ఇళ్ల సముదాయాల నిర్మాణంలో భాగంగా  పలు ప్రోత్సాహకాలు, ప్రయోజనాలుత అందిస్తున్నట్టు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల సహాయ (ఇన్ చార్జి) మంత్రి హర్ దీప్ సింగ్ పూరి చెప్పారు. నిర్మాణ సంస్థలకు ఉచితంగా ఫ్లోర్ ఏరియా రేషియో (ఎఫ్.ఎ.ఆర్.), రాయితీపై ఉదారంగా ప్రాజెక్టు రుణ సదుపాయం, రహదారులకు సంబంధించిన కీలకమైన మౌలిక సదుపాయాలు వంటి ప్రయోజనాలను కల్పిస్తున్నట్టు చెప్పారు. పారిశ్రామిక, నిర్మాణ రంగ కార్మికులు, ఆతిథ్య రంగ కార్మికులు, మార్కెట్లో, వాణిజ్య సంఘాల్లో, విద్యా, ఆరోగ్య సంస్థల్లో పనిచేసే వలస కూలీలు, దీర్ఘకాలిక పర్యాటకులు, సందర్శకులు సహా వివిధ వర్గాల పట్టణ వలస వాదులకు, పేదలకు గౌరవ ప్రదమైన జీవితాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు  చెప్పారు. అందుబాటు రేట్లలో అద్దె ఇళ్ల సముదాయాల నిర్మాణానికి సంబంధించి రూపొందించిన వెబ్ పోర్టల్ ను ప్రారంభించిన సందర్భంగా 2020, అక్టోబర్ 14న ఢిల్లీలో నిర్వహించిన వెబినార్ సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సంబంధిత పథకానికి సంబంధించిన మార్గదర్శక సూత్రాలను, మార్గదర్శక పుస్తకాన్ని కూడా  కేంద్రమంత్రి ఆవిష్కరించారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. అందుబాటు రేట్లలో అద్దె ఇళ్ల సముదాయాల నిర్మాణ పథకానికి సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణ ప్రయోజనాలపై ప్రచురణలను కూడా ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పట్టణ స్థానిక పరిపాలనా సంస్థలతో కుదుర్చుకోవలసిన ఒప్పదం పత్రాలు, నిర్వహణా పరమైన ఇంగ్లీషు మార్గదర్శక సూత్రాలు తదితర అంశాలతో సహా ఒక నాలెడ్జ్ ప్యాక్ ను ఇదివరకే ప్రారంభించారు.  

   కోవిడ్-19 మహమ్మారి వైరస్ వ్యాప్తి సంక్షోభంతో భయాందోళన చెందిన దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కూలీలు, పట్టణప్రాంత కార్మికులు తమ సొంత ప్రాంతాలకు తిరిగివచ్చారు. దీనితో గృహ నిర్మాణం అన్నది సమస్య ప్రధాన అంశంగా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో 'ఆత్మనిర్భర భారత్' పేరిట ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుమేరకు అందుబాటు ధరలో అద్దెఇళ్ల సముదాయాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం 2020, జూలై 8వ తేదీన ఆమోదం తెలిపింది. పట్టణ ప్రాంతంలో చేపట్టే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి ఉప పథకంగా, పట్టణ వలస కూలీలకు, నిరుపేదలకు సౌకర్యవంతమైన జీవితం, ఆవాసం కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, విఫభాగాలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య వర్గాలతో పలుదఫాలుగా చర్చలు జరిపిన అనంతరం అందుబాటు ధరల్లో అద్దెఇళ్ల సముదాయాల నిర్మాణ పథకాన్ని (ఎ.ఆర్.హెచ్.సి.) రూపొందించారు. ఈ పథకం అమలులో సంబంధిత భాగస్వామ్య వర్గాలకు మద్దతు అందించేందుకు ఒక నాలెడ్జ్ ప్యాక్ ను రూపొందించారు. ఈ పథకం విజయవంతగా అమలుచేయడానికి నిరంతరాయంగా సహకారం కొనసాగించడంవల్ల పట్టణ ప్రాంత వలసకూలీలకు, నిరుపేదలకు ప్రయోజనం కలగడమేకాక, అద్దె ఇళ్ల మార్కెట్లో పెట్టబడులు, వ్యాపార తత్వం మరింత వేగంగా పెంపొందుతుంది. ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. పనుల్లో భాగస్వామ్యం వహించే వారందరికీ ప్రయోజనం కల్పించే ఈ పథకం నమూనా, మరోవైపు ప్రైవేటు సంస్థలను కూడా ఎంతో విశేషంగా ఆకర్షించగలిగింది.

రెండు నమూనాల్లో ఎ.ఆర్.హెచ్.సి. అమలు:

  మొదటి నమూనా (మోడల్-1): ప్రభుత్వ నిధులతో నిర్మాణమై ప్రస్తుతం ఖాళీగా ఉంటున్న ఇళ్లను,.. ప్రైవేటు భాగస్వామ్యం, ప్రభుత్వ సంస్థల ప్రమేయం ద్వారా 25సంవత్సరాల వ్యవధితో ఎ.ఆర్.హెచ్.సి.లుగా మార్చడం ఈ మోడల్ లక్ష్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధ్వర్యంలోని వివిధ పథకాల కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్మితమై, ప్రస్తుతం ఖాళీగా ఉంటున్న ఇళ్లను ఎ.ఆర్.హెచ్.సి.గా మార్చేందుకు ఈ నమూనా అవకాశం కల్పిస్తుంది. ఇందుకు సంబంధించిన రెక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ టెండర్ నమూనాను ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు పంపించారు.

  రెండవ నమునా (మోడల్-2): ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమకు అందుబాటులో ఉన్న సొంత ఖాళీ స్థలంలో ఎ.ఆర్.హెచ్.సి. పథకం ఇళ్లను నిర్మించి 25ఏళ్ల పాటు వాటిని నిర్వహించేందుకు అవకాశం ఇవ్వడం ఈ నమూనా లక్ష్యం. పలు పరిశ్రమలు, వాణిజ్య సంఘాలు, తయారీ సంస్థలు, విద్యా, ఆరోగ్య సంస్థలు, అభివృద్ధి ప్రాధికార సంస్థలు, గృహనిర్మాణ సంస్థలు, కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వ రంగ సంస్థలు, తదితర సంస్థల అజమాయిషీలో ఉండే ఖాళీ స్థలాల్లో ఎక్కువ భాగం ఏ వినియోగం లేకుండా పడి ఉన్నాయి. విధానపరంగా తగిన మద్దతు అందించడం, తగిన నిబంధనలతో, ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ఈ ఖాళీ స్థలాలన్నింటినీ సమర్థవంతంగా  వినియోగించుకోవచ్చు. ఈ స్థలాల్లో  వలస కూలీల, నిరుపేదల ప్రయోజనాలకోసం అందుబాటు రేట్లలో అద్దె ఇళ్ల సముదాయాల నిర్మాణం చేపట్టవచ్చు. దీనికి తోడు, ఈ ఇళ్లను నిర్మించి, నిర్వహించే తగిన సంస్థలను పట్టణ స్థానిక పరిపాలనా సంస్థలు ఎంపిక చేసేందుకు వీలుగా కేంద్ర గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆసక్తీ వ్యక్తీకరణ టెండర్లను జారీ చేస్తుంది.

  ఈ పథకంలో పాల్గొనే సంస్థలకు గిట్టుబాటయ్యే, లాభదాయకమైన వాణిజ్య అవకాశాన్ని కల్పించేందుకు రాయితీపై ఉదారంగా ప్రాజెక్టు రుణ సదుపాయాన్ని అఫోర్డబుల్ హౌసింగ్ ఫండ్ (ఎ.హెచ్.ఎఫ్.), ప్రాధాన్యతా రంగం రుణసహాయ పథకం (పి.ఎస్.ఎల్.) ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. అలాగే, ఆదాయంపన్ను, వస్తుసేవల పన్నులో మినహాయింపు, ఎ.ఆర్.హెచ్.సి. పథకంలో సృజనాత్మక సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని ప్రోత్సహిస్తూ టెక్నాలజీ సృజనాత్మక గ్రాంటు వంటి సదుపాయాలను కూడా ప్రభుత్వ కల్పిస్తుంది. అంతేకాక, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ సంస్థలకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాయి. 50శాతం ఫ్లోర్ ఏరియా రేషియో, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ లను ఉచితంగా అందిస్తాయి. ఇంకా, సింగిల్ విండో పద్ధతిలో నెలరోజుల్లోగా అనుమతులు, రహదారులకు సంబంధించిన కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనలో రాయితీ సదుపాయం, నివాస ప్రాంతం ఆస్తి విలువకు అనుగుణంగా మున్సిపల్ చార్జీలు వంటి రాయితీలను కల్పిస్తారు.

  ఈ సందర్భంగా పి.ఎం.ఎ.వై.-(యు) పథకం అమలుతీరుపై నిర్వహించిన అంగీకార్ ఉద్యమ కార్యక్రమంపై సమర్పించిన జాతీయ నివేదికను కూడా మంత్రి హర్ దీప్ సింగ్ పూరి ఆవిష్కరించారు. ‘అంగీకార్.. 2019,..ఒక జ్ఞాపకం’ పేరిట రూపొందించిన లఘు చిత్రాన్ని కూడా విడుదల చేశారు. పి.ఎం.ఎ.వై.-(యు) కింద 2022 సంవత్సరానికల్లా అందరికీ అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన గృహవసతి కల్పించాలని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. లబ్ధిదారులు పక్కా ఇళ్లలోకి మారినపుడు వారు ఎదుర్కొనే సమస్యలన్నింటినీ పరిష్కరించవలసి ఉందని ఆయన ప్రధానంగా సూచించారు. ఈ పథకం అమలుపై అంగీకార్ పేరిట ఉద్యమ కార్యక్రమాన్ని 2019, ఆగస్టు 29న ప్రారంభించారు.

    జాతిపిత మహాత్మా గాంధీ ప్రబోధించిన పరిశుభ్రత, పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఆరోగ్యం అనే సూత్రాల ప్రాతిపదికగా అంగీకార్ ఉద్యమ కార్యక్రమ లక్ష్యాలను, ఉద్దేశాలను రూపొందించారు. గృహవసతి కల్పనతో లబ్ధిదారులు కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి, వారు స్వయంసిద్ధత సాధించడానికి ఇవి దోహదపడతాయి. లబ్ధదారుల్లో సామాజక పరివర్తనాపరమైన మార్పుకోసం  పట్టణ పథకాలు, వివిధ కేంద్ర పథకాలన్నింటినీ ఏకీకరించారు. తద్వారా, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల పథకాల సహాయంతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లబ్ధిదారులకు వివిధ రకాల సేవలను అందించగలిగాయి. 20లక్షలకు పైగా కుటుంబాలు వివిధ రకాల పథకాల ప్రయోజనాలను పొందగలిగాయి. ఆరోగ్యం, పరిశుభ్రత, పారిశుద్ధ్య విధానాలు, వ్యర్థ పదార్థాల నిర్మూలన, పర్యావరణ రక్షణ, నీటి సంరక్షణ, ఇంధన పొదుపు వంటి అంశాల్లో వారు ఉత్తమ విధానాలను పాటించగలిగారు. ఇందుకు సంబంధించి,..అంగీకార్ ఉద్యమ కార్యక్రమానికి చెందిన దాదాపు 18,500మంది రిసోర్స్ పర్సన్స్ సిబ్బదికి దాదాపు 2,200మంది నిపుణులు శిక్షణ కల్పించారు. పి.ఎం.ఎ.వై. (యు) అమలులో ఉన్న 4,427 నగరాల్లో నగర స్థాయి సాంకేతిక విభాగం ఆధ్వర్యంలో వీరు శిక్షణ అందించారు. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తితో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు తగిన సాధన సంపత్తిని అంగీకార్ ఉద్యమ కార్యక్రమం సమర్థవంతంగా అందించింది.

 

*****



(Release ID: 1664813) Visitor Counter : 162