జల శక్తి మంత్రిత్వ శాఖ

గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛభారత్ దివస్ నిర్వహించిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ స్వచ్చభారత్ పురస్కారాల ప్రదానం

ప్రధానమంత్రి మార్గదర్శక, నాయకత్వంలో స్వచ్ఛ భారత్ గ్రామీణ్ కార్యక్రమం గ్రామీణ భారతావని రూపురేఖలను మార్చేసింది. జన ఉద్యమంగా రూపుదాల్చింది. బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలపై విధించిన లక్ష్యాన్ని నిర్దేశిత గడువుకు ముందే సాధించింది. :కేంద్ర మంత్రి షెకావత్

Posted On: 02 OCT 2020 4:44PM by PIB Hyderabad

గాంధీ జయంతి సందర్భంగా 2020 అక్టోబరు 2న స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛ భారత్ పురస్కారాన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రదాన కార్యక్రమం జరిగింది. స్వచ్ఛ భారత్ పథకం అమలులో ఉత్తమ ప్రతిభను కనబరిచిన రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు, జిల్లాల యంత్రాంగాలకు, బ్లాకులకు, గ్రామ పంచాయతీలకు వివిధ కేటగిరీల్లో స్వచ్ఛ భారత్ (2020) అవార్డులను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్, సహాయ మంత్రి రత్తన్ లాల్ కటారియా ప్రదానం చేశారు. స్వచ్ఛభారత్ పథకం ఆరవ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో నిర్వహించారు. తాగునీటి, పారిశుద్ధ్య శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగిన  ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్రాల, జిల్లాల స్థాయిలోని స్వచ్ఛ భారత్ గ్రామీణ్ (ఎస్.బి.ఎం.జి.) వ్యవస్థకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

   గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా, తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్, తదితర రాష్ట్రాలకు అగ్రశ్రేణి పురస్కారాలు లభించాయి. రాష్ట్రాల కేటగిరీలో గుజరాత్ కు ప్రథమ బహుమతి లభించింది. తమిళనాడులోని తిరుల్వేలి జిల్లాకు ఉత్తమ జిల్లాగా అవార్డు దక్కింది. మధ్యప్రదేశ్ లోని ఖాచ్రోడ్, ఉజ్జయిని ఉత్తమ బ్లాకులుగా సత్కారం అందుకున్నాయి. 2019 నవంబరు 1నుంచి, 2020 ఏప్రిల్ నెలాఖరు వరకూ నిర్వహించిన స్వచ్ఛ సుందర్ సాముదాయక శౌచాలయ (ఎస్.ఎస్.ఎస్.ఎస్.) పథకానికి సంబంధించి, సేలంలోని చిన్నౌర్ గ్రామం,.. ఉత్తమ గ్రామ పంచాయతీగా పురస్కారం అందుకుంది. 2020, జూన్ 15నుంచి సెప్టెంబరు 15వరకూ నిర్వహించిన సాముదాయక శౌచాయల అభియాన్ (ఎస్.ఎస్.ఎ.) పథకానికి సంబంధించి రాష్ట్రాల కేటగిరీలో ఉత్తరప్రదేశ్ (జి.కె.ఆర్.ఎ.), గుజరాత్ (నాన్ జి.కె.ఆర్.ఎ.) లకు పురస్కారాలు లభించాయి. జిల్లాల కేటగిరీలో ప్రయాగ్ రాజ్ (జి.కె.ఆర్.ఎ.), బరైలీ (నాన్ జి.కె.ఆర్.ఎ.)లకు అవార్డులు దక్కాయి. అస్సాం రాష్ట్రం, బొంగైగావ్ జిల్లాలోని బోరిగావ్ కు ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు లభించింది. 

   మురికినుంచి ముక్తికోసం గందగీ ముక్త్ భారత్ (జి.ఎం.బి.) పేరిట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 8న ప్రారంభించిన పథకంలో గరిష్ట స్థాయి శ్రమదాన భాగస్వామ్యానికి గుర్తింపుగా  తెలంగాణ రాష్ట్రం అగ్రశ్రేణి అవార్డు  అందుకుంది. హర్యానాలోని మోగా జిల్లాలో గరిష్ట స్థాయి గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహితం (ఒ.డి.ఎఫ్. ప్లస్ గా)గా తీర్చిదిద్దినందుకు హర్యానాకు అగ్రశ్రేణి పురస్కారం లభించింది. కార్యక్రమంపై ప్రజల అవగాహనకోసం ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ (ఐ.ఇ.సి.) పద్ధతిలో గోడలపై పెయింటింగుల ద్వారా గరిష్ట స్థాయిలో సందేశాలు వ్యాప్తి చేసినందుకు పంజాబ్ కు అగ్రశ్రేణి అవార్డు దక్కింది. వీటికి తోడు వివిధ కేటగిరీల్లో పలు రకాల పురస్కారాల ప్రదానం జరిగింది.

(పురస్కార గ్రహీతల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

  స్వచ్ఛభారత్ ఆరవ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి మార్గదర్శక, నాయక్వంలో స్వచ్ఛ భారత్ గ్రామీణ్ కార్యక్రమం గ్రామీణ భారతావని రూపురేఖలను మార్చేసిందన్నారు. ఇది క్రమంగా జన ఉద్యమంగా రూపుదాల్చిందని. బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలపై విదించిన లక్ష్యాన్ని నిర్దేశిత గడువుకు ముందే సాధించిందని చెప్పారు. అసాధారణ విజయానికి కొనసాగింపుగా, స్వచ్ఛ భారత్ గ్రామీణ్  పథకం 2వ విడతను ఈ ఏడాది మొదట్లో ప్రారంభించారు. గ్రామాల్లో సమగ్ర పారిశుద్ధ్యం లక్ష్యంగా గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దడం, ఘన, ద్రవ వ్యర్థాల తొలగింపులో సక్రమ విధానాలు అనుసరించడం వంటి పనులపై 2వ విడతలో దృష్టిని కేంద్రీకరించారు.

  స్వచ్ఛ సుందర్ సాముదాయక శౌచాలయ (ఎస్.ఎస్.ఎస్.ఎస్.), సాముదాయక శౌచాలయ అభియాన్ (ఎస్.ఎస్.ఎ.), గందగీ ముక్త్ భారత్ (జి.ఎం.బి.) వంటి పథకాలు,.. గత ఏడాదిగా సాగుతూ,  బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలపై లక్ష్య సాధనకు దోహదపడుతున్నాయని. సామాజిక మరుగుదొడ్లు, ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ (ఎస్.ఎల్.డబ్ల్యు.ఎం.) కార్యక్రామలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఇది సాధ్యమైందని మంత్రి షెకావత్ చెప్పారు. జన ఉద్యమంగా స్వచ్ఛ భారత్ ను విజయవంతం చేసినందుకు గుర్తింపుగా ఈ అవార్డులు ప్రదానం చేశామన్నారు. 

  కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి రత్తన్ లాల్ మాట్లాడుతూ,..స్వచ్ఛ భారత్ మిషన్ పథకం అమలుతో ప్రమేయం ఉన్న అన్ని భాగస్వామ్య వర్గాలకు అభినందనలు తెలియజేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి, ఉత్తమ పారిశుద్ధ్య ప్రమాణాలను నెలకొల్పినందుకు పురస్కార గ్రహీతలను ఆయన అభినందించారు. స్వచ్ఛ భారత్ మిషన్ రెండవ విడతలో కూడా అదే స్ఫూర్తితో పనిచేయాలన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై ప్రజల్లో ఏర్పడిన అవగాహన, ఉత్సాహం చూస్తుంటే ఒ.డి.ఎఫ్. ప్లస్ లక్ష్యాలను కూడా త్వరగా చేరుకోగలమన్న ఆశాభావం కలుగుతోందన్నారు.

  తాగునీరు, పారిశుద్ధ్య శాఖ కార్యదర్శి యు.పి. సింగ్ మాట్లాడుతూ, తొలి విడత స్వచ్ఛ భారత్ పథకం విజయవంతం చేసినందుకు రాష్ట్రాలను అభినందించారు. అయితే, రెండవ లక్ష్యాల సాధనకు మరింత ఎక్కువ ప్రాధాన్యమివ్వాలన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించిపెట్టడమేకాక, మన జీవితాల్లో పరిశుభ్రత ఎంత ముఖ్యమైనదో తెలియజెప్పిన మహా మనీషి మహాత్మాగాంధీ మన దేశంలో జన్మించడం మనకు గర్వకారణమన్నారు.

  ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ 2020 పేరిట లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. ఎస్.ఎస్.ఎస్.ఎస్., ఎస్.ఎస్.ఎ.లపై ఈ-బుక్ ను ఆవిష్కరించారు. ఆ తర్వాత స్వచ్ఛ భారత్ దివస్ పురస్కారాల ప్రదానం జరిగింది. స్వచ్ఛ భారత్ గ్రామీణ్ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో సురక్షితమైన సామాజిక పారశుద్ధ్య సదుపాయాల మెరుగుదలకోసం గత ఏడాదిలో 50వేలకు పైగా సామాజిక మరుగుదొడ్ల సముదాయాలను నిర్మించారు. జి.ఎం.బి. పథకం కింద నిర్వహించిన పెయింటింగ్, వ్యాస రచన కార్యక్రమాల్లో 24.4లక్షల మంది విద్యార్థులు పాలువంచుకున్నారు. ఐ.ఇ.సి. మెస్సేజీల పంపిణీ కింద 8.48 లక్షల సందేశాలను గోడలపైనా, బిల్ బోర్డులపైనా చిత్రించారు.

స్వచ్ఛ భారత్ దివస్ (ఎస్.బి.డి.) 2020 ఈ-బుక్ ను చూడటానికి ఇక్కల క్లిక్ చేయండి.

***



(Release ID: 1661238) Visitor Counter : 272