నీతి ఆయోగ్

కర్బన నిర్మూలీకరణ, ఇందన పరివర్తనపై నెదర్లాండ్స్ తో అంగీకారం

ఎస్.ఐ.ఒ.పై నీతీ ఆయోగ్, నెదర్లాండ్స్ ఎంబసీ సంతకాలు

Posted On: 30 SEP 2020 1:27PM by PIB Hyderabad

మరింత ఇంధనం, స్వచ్ఛమైన ఇంధనం లక్ష్యంగా, కర్బన నిర్మూలీకరణ, ఇంధన పరవర్తన అజెండాపై నీతీ ఆయోగ్, నెదర్లాండ్స్ రాయబార కార్యాలయం అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు స్టేట్ మెంట్ ఆఫ్ ఇంటెంట్ (ఎస్.ఒ.ఐ.)పై 2020 సెప్టెంబర్ 28వ తేదీన సంతకాలు జరిగాయి.

  ఎస్.ఒ.ఐ.పై నీతీ ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సి.ఇ.ఒ.) అమితాబ్ కాంత్, భారతదేశంలో నెదర్లాండ్స్ రాయబారి మార్టెన్ వాన్ డెన్ బెర్గ్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఉభయపక్షాల మధ్య ఒక సమగ్రమైన పరస్పర సహకార అవగాహనకు వీలవుతుంది. విధాన నిర్ణయకర్తలు, పారిశ్రామిక సంస్థలు, ప్రైవేటు సంస్థలు, ఉత్పత్తి దారులు, పారిశ్రామిక సంస్థలు, ప్రైవేటు సంస్థలు, ఉత్పత్తి దారులు, నిపుణులు కలసి ఈ అజెండాపై పనిచేయడానికి వీలవుతుంది.   ఇంధనపరమైన సమస్యలకు సంబంధించి ఉభయపక్షాలూ కలసి సృజనాత్మక సాంకేతిక పరిజ్ఞాన పరిష్కారాలను కనుగొనేందుకు వీలవుతుంది. ఇందుకోసం ఉభయపక్షాల నిపుణులను పరస్పరం వినియోగించుకునే విషయమై దృష్టిని కేంద్రీకరించేందుకు ఈ అవగాహన దోహపడుతుంది. పరిజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడం, కలసి కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా లక్ష్యసాధన వీలవుతుంది.  ఎస్.ఒ.ఐ.లో కీలకమైన అంశాలు ఇలా ఉన్నాయి. i) పారిశ్రామిక, రవాణా రంగాల్లో కర్బనం ఆనవాళ్లను తగ్గించడం, ii) అవసరమైన మేరకు సహజవాయువు వినియోగించుకోవడం, జీవఇంధన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం iii) గాలిలో కాలుష్య రేణువులను తగ్గించే అంశాన్ని పర్యవేక్షిస్తూ, స్వచ్ఛమైన గాలి కోసం సాంకేతిక పరిజ్ఞానం అమలుచేయడం. iv) కొత్త తరం సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడం, రసాయన కాలుష్యాన్ని తగ్గించేందుకు హైడ్రోజెన్, కార్బన్ క్యాప్చర్ విధానాన్ని అనుసరించడం, వివిధ రంగాల్లో ఇంధన సామర్థ్యం పెంచే చర్యలు తీసుకోవడం, v) వాతావరణ మార్పులను ఎదుర్కొనే చర్యలకోసం తగిన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయడం.

  ఎస్.ఒ.ఐ. కుదిరిన సందర్భంగా నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, సుస్థిర ఇంధనానికి  సంబంధించి భారత్, నెదర్లాండ్స్ లకు బృహత్తరమైన లక్ష్యాలు ఉన్నాయన్నారు. స్వచ్ఛమైన ఇంధనాల సాధనలో ఉభయ పక్షాలూ ఒకే రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నాయన్నారు. వాతావరణంలో కర్బనం ఉద్గాగారాలను తగ్గించ గలిగే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ సమర్థవంతమైన ధరలో అందించగలదన్న నమ్మకం నాకు ఉంది. ఈ విషయంలో నెదర్లాండ్స్ నిపుణులతో కలిస్తే ఉభయపక్షాల మధ్య సహకార సంబంధాలు మరింత గట్టిపడతాయి. కర్బన నిర్మూలీకరణ, ఇంధన పరివర్తన అజెండా లక్ష్యాల సాధనలో కచ్చితంగా విజయవంతంగా పనిచేయగలుతాం. అన్నారు.

  భారతదేశంలో నెదర్లాండ్స్ రాయబారి మార్టెన్ వాన్ డెన్ బెర్గ్ మాట్లాడుతూ,.. భారత్, నెదర్లాండ్స్ తమ ఇంధన పరివర్తన కృషిని కొనసాగిస్తూ ఉండగా, లక్ష్యాల సాధనకు మేం కట్టుబడి ఉంటాం. వాతావరణ మార్పులను తట్టుకుని నిలవగలిగే బలమైన దేశాలుగా భారత్, నెదర్లాండ్స్ ఎదగడానికి ఎస్.ఒ.ఐ. ద్వారా చూపిన చొరవ ఎంతో దోహదపడుతుంది. రెండు లక్ష్యాల సాధనకు భారత్ తో కలసి పనిచేయడం మాకు చాలా ముఖ్యం. ఆర్థిక ప్రగతిని సృష్టించడం, భావితరాలకోసం పర్యావరణ స్వచ్ఛతను రక్షించడం అనే రెండు లక్ష్యాలకోసం కలసి పనిచేస్తాం. ఉభయపక్షాలకు బృహత్తరమైన సుస్థిర లక్ష్యాలు ఉన్నాయి కాబట్టి, ఇంధన రంగంలో ఉభయదేశాల మధ్య సహకారానికి ఎంతో అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య సహకార సామరస్యాన్ని ఎస్.ఒ.ఐ. బలోపేతం చేస్తుంది. దీనితో రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు వృద్ధి చెందడంతోపాటుగా, ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు వీలవుతుంది. అని అన్నారు.

  నీతీ ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి అమితాబ్ కాంత్ మాట్లాడుతూ,  వాతావరణంలోకి వెలువడే కాలుష్య ఉద్గారాల తీవ్రతను 2030కల్లా 33 లేదా 35శాతం తగ్గించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. కర్బన ఉద్గారాలు తక్కువ స్థాయిలో వెలువడేందుకు ఆస్కారం ఉన్న పారిశ్రామికీకరణకే భారత్ ఇకపై అవకాశమిస్తుంది. పునరుత్పాదన ఇంధనానికి ప్రస్తుతం ఇస్తున్న ప్రాధాన్యాన్ని కొనసాగిస్తూనే, విద్యుత్ వాహనాలను వేగంగా ప్రవేశపెట్టడానికి భారత్ కట్టుబడి ఉంది. ఇంధన పరివర్తన, వాతావరణ మార్పు అంశాలపై నెదర్లాండ్స్ తో భారత్ బాగస్వామ్యం ఉభయదేశాలకు ఎంతో ప్రయోజనకరం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఇది ఎంతగానో దోహదపడుతుంది.’ అని అమితాబ్ కాంత్ అన్నారు.

  నీతీ ఆయోగ్ అదనపు కార్యదర్శి డాక్టర్ రాకేశ్ సర్వాల్ మాట్లాడుతూ,.సుస్థిర అభివృద్ధి సాధనకు స్వచ్ఛమైన ఇంధనం చాలా కీలకం. ప్రపంచ దేశాల అజెండాలో కూడా దీనికి ప్రధమ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో, సుస్థిర అభివృద్ధి సాధనకు సమర్థవంతంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో, సవాళ్లను అధిగమించడంలో ఉభయ దేశాల మధ్య సహకారం ఎంతగానో ఉపకరిస్తుంది. దీనితోపాటుగా, దేశం ఉత్పాదక సామర్థ్యం కూడా మరింత బలోపేతమవుతుంది. అని అన్నారు.

  వాణిజ్యం, పెట్టుబడి రంగాల్లో నెదర్లాండ్స్, భారత్ దేశాలకు ఎంతో సుదీర్ఘమైన చరిత్ర ఉంది. భారత్ కు నెదర్లాండ్స్ ఆరవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశం. యూరప్ వెళ్లే ఎగుమతుల్లో దాదాపు 20శాతం నెదర్లాండ్స్ ద్వారానే రవాణా అవుతాయి. దీనితో భారత్ కు యూరప్ ప్రవేశ ద్వారంగా వెదర్లాండ్స్ కొనసాగుతోంది. మన దేశంలో పెట్టుబడి పెట్టే 5అగ్రదేశాల్లో నెదర్లాండ్స్ కూడా ఉంది. భారత దేశానికి తరలివచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో నెదర్లాండ్స్  3వ స్థానంలో ఉంది.

  భారత్ తో వాణిజ్య సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవడానికి నెదర్లాండ్స్ ఎంతో శ్రద్ధ చూపుతోంది. యూరప్ తో వాణిజ్యం విషయంలో భారత్ కు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించాలని నెదర్లాండ్స్ భావిస్తోంది. భవితవ్యాన్ని తీర్చిదిద్దుకునేందుకు,  ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించుకునేందుకు, ప్రత్యేకించి ఇంధన రంగంలో, వాతావరణ మార్పుల ఎదుర్కొవడంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉభయదేశాల భాగస్వామ్యం ఎంతగానో దోహదపడుతుంది.

*****



(Release ID: 1660374) Visitor Counter : 236