రైల్వే మంత్రిత్వ శాఖ

గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ కింద సెప్టెంబరు 18కల్లా 9,79,000కిపైగా పనిదినాలు కల్పించిన రైల్వేశాఖ

అమలుచేసిన ప్రాజెక్టులకోసం కాంట్రాక్టర్లకు రూ. 2056.97కోట్లు విడుదల

164 రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో
6 రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో పథకం అమలు,

బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా,
రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లలో పనిదినాల కల్పన

పథకం ప్రగతి, వలసకూలీలకోసం సృష్టించిన
అవకాశాలపై రైల్వే మంత్రి పర్యవేక్షణ

Posted On: 20 SEP 2020 9:33AM by PIB Hyderabad

   గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ పథకం కింద 2020 సంవత్సరం సెప్టెంబరు 18కల్లా  6 రాష్ట్రాల్లో 9,79,000కిపైగా పనిదినాలు భారతీయ రైల్వే శాఖ కల్పించింది. బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పథకం అమలు జరుగుతోంది.

  పథకం కింద చేపట్చిన పనుల ప్రగతిని, ఆయా రాష్ట్రాల వలసకూలీల కోసం ఉపాధి పనుల కల్పన తీరును రైల్వేలు, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ నిశితంగా పర్యవేక్షిస్తూ వస్తున్నారు. రైల్వే మౌలిక సదుపాయాలకు సంబంధించిన దాదాపు 164 ప్రాజెక్టులను  ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు.

    పథకం అమలుకోసం 2020 సెప్టెంబరు 18కల్లా 12,276 మంది కార్మికులను వినియోగించారు. కాంట్రాక్టర్లకు చెల్లింపుకోసం 2,056.97కోట్ల రూపాయలు విడుదలైంది.

  పథకం అమలులో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో పూర్తి స్థాయి సమన్వయం కోసం ప్రతి జిల్లాకు, రాష్ట్రానికి నోడల్ అధికారులను నియమించారు.

  గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ కింద ప్రస్తుతం అమలవుతున్న పనుల సంఖ్యను రైల్వే శాఖ ఎంపిక చేసింది. (i) రైల్వే క్రాసింగులకు అప్రోచ్ రోడ్ల నిర్మాణం - నిర్వహణ, (ii) రైలు మార్గాల వెంబడి కాలువలు, డ్రెయిన్ల నిర్మాణం-నిర్వహణ, (iii) రైల్వే స్టేషన్లకు అప్రోచ్ రోడ్ల నిర్మాణం-నిర్వహణ, (iv) రైలు మార్గం ప్రస్తుత కట్టడాలను విస్తరింపజేయడం, (v)  రైల్వే స్థలాల చివరి హద్దులవద్ద చెట్ల పెంపకం, (vi)  ప్రస్తుతం రైల్వేల అధీనంలో ఉన్ననిర్మాణాల, వంతెనల రక్షణ పనులను పథకం కింద చేపట్టారు.

   కోవిడ్-19 మహమ్మారి దెబ్బతో ఉపాధిని కోల్పోయి పెద్దసంఖ్యలో తమ సొంత ప్రాంతాలకు, గ్రామాలకు తిరిగి వచ్చిన వలస కూలీలకు ఆయా ప్రాంతాల్లో జీవనోపాధిని, ఆర్థిక సాధికారతను కల్పించడమే లక్ష్యంగా గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ పథకాన్ని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ స్థాయిలో ప్రారంభించిన విషయాన్ని ఇక్కడ  ప్రస్తావించుకోవాలి.  2020 జూన్ 20 తేదీన ప్రధానమంత్రి   భారీ ఉపాధి కల్పానా పథకాన్ని ప్రారంభించారు. గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ పథకం కింద మన్నిగల గ్రామీణ మౌలిక సదుపాయాల ఏర్పాటుకోసం 50వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనున్నట్టు ప్రధానమంత్రి ప్రకటించారు.

    125 రోజుల పథకం అమలును ఒక పవిత్ర ఉద్యమం తరహాలో చేపట్టారు. వలస కూలీల జనాభా ఎక్కువగా ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో 25 రకాల ప్రధాన పనులను, కార్యకలాపాలను చేపట్టారు. పథకం కింద చేపట్టిన ప్రజా ప్రయోజన పనుల వనరుల విలువ 50వేల కోట్ల రూపాయల వరకూ ఉంటుంది.

  12 మంత్రిత్వ శాఖలు, విభాగాలు పథకం అమలులో పాలుపంచుకున్నాయి. పంచాయతీ రాజ్, రోడ్డు రవాణా, రహదారుల శాఖ, గనుల శాఖ, తాగునీరు పారిశుద్ధ్య శాఖ, పర్యావరణ శాఖ, రైల్వే శాఖ, పెట్రోలియం సహజ వాయువుల శాఖ, నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ, సరిహద్దు రహదారుల విభాగం, టెలికమ్యూనికేషన్లు, వ్యవవసాయ శాఖ పథకం అమలులో భాగస్వామ్యం వహించాయి. 25 ప్రజాప్రయోజన పనులు, జీవనోపాధి అవకాశాలను కల్పించే పనుల్లో శాఖలన్నీ పాలుపంచుకున్నాయి.

*****



(Release ID: 1656993) Visitor Counter : 147