ప్రధాన మంత్రి కార్యాలయం

బిహార్ లో పిఎం మత్స్య సంపద యోజన, ఇ-గోపాల యాప్ లతో పాటు అనేక ఇతర కార్యక్రమాలను కూడా ప్రారంభించిన ప్రధాన మంత్రి


ఈ పథకం చేపల ఉత్పత్తిదారుల కు సరికొత్త మౌలిక సదుపాయాలను, ఆధునిక పరికరాలను, కొత్త మార్కెట్ లను అందుబాటులోకి తీసుకువస్తుంది : ప్రధాన మంత్రి

రాబోయే మూడు నాలుగేళ్లలో చేపల ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యం: ప్రధాన మంత్రి

Posted On: 10 SEP 2020 3:39PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బిహార్ లో ‘పిఎం మత్స్య సంపద యోజన’, ‘ఇ-గోపాల యాప్’ లతో పాటు చేపల ఉత్పత్తి కి సంబంధించిన అధ్యయనాలు, పరిశోధనలే కాకుండా అనేక ఇతర కార్యక్రమాలను కూడా వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు.

ఈ సందర్బం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ రోజు న ప్రారంభించిన ఈ పథకాలన్నింటి వెనుక ఉన్న ఉద్దేశం మన రైతులకు సాధికారత ను కల్పించి, భారతదేశాన్ని 21వ శతాబ్దం లో స్వావలంబన కలిగిన దేశం (ఆత్మనిర్భర్ భారత్) గా తీర్చిదిద్దడమేనని అన్నారు.

‘మత్స్య సంపద యోజన’ ను కూడా ఇదే ఉద్దేశం తో ప్రారంభిస్తున్నట్లు ప్రధాన మంత్రి తెలిపారు.  దేశం లో 21 రాష్ట్రాల లో దీనిని ప్రారంభిస్తున్నట్లు, రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో ఆ రాష్ట్రాలలో ఈ పథకం కోసం 20,000 కోట్ల రూపాయల పెట్టుబడి ని పెడుతున్నట్లు ఆయన వివరించారు.  దీనిలో, 1700 కోట్ల రూపాయల విలువైన పథకాలకు ఈ రోజు న శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు.

ఈ పథకం లో భాగం గా పాట్నా, పూర్ణియా, సీతామఢీ, మధేపురా, కిషన్ గంజ్, సమస్తీపుర్ లలో అనేక సదుపాయాలను ప్రారంభించడమైంది అని ఆయన తెలిపారు.

ఈ పథకం చేపల ఉత్పత్తిదారులకు సరికొత్త మౌలిక సదుపాయాలను, ఆధునిక పరికరాలను, కొత్త మార్కెట్ లను అందుబాటులోకి తీసుకువస్తుందని ప్రధాన మంత్రి అన్నారు.  వీటితో పాటు సాగు ద్వారా, ఇతర మార్గాల ద్వారా లభించే అవకాశాలు కూడా పెరుగుతాయి అని ఆయన చెప్పారు. స్వాతంత్యం వచ్చిన తరువాత, దేశం లో చేపల రంగం కోసం ఇంత భారీ పథకాన్ని ప్రారంభించడం ఇదే మొట్టమొదటి సారి అని ఆయన అన్నారు.

ఈ రంగానికి ఉన్న ప్రాముఖ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, మత్స్య రంగానికి సంబంధించిన వివిధ సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం లో విడిగా ఒక మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీ మోదీ చెప్పారు.  ఇది మన మత్స్యకారులతో పాటు, చేపల సాగు తో, చేపల అమ్మకం తో సంబంధం ఉన్న వారి ఇబ్బందులను తీరుస్తుందని ఆయన అన్నారు.

రాబోయే మూడు, నాలుగేళ్ల లో చేపల ఎగుమతులను రెండింతలు చేయడం కూడా ఒక లక్ష్యమని ప్రధాన మంత్రి అన్నారు.  ఇది ఒక్క చేపల రంగం లోనే లక్షల కొద్దీ కొత్త ఉద్యోగావకాశాల ను సృష్టిస్తుందని ఆయన చెప్పారు.  ఈ రంగంలోని నా స్నేహితులతో ఈ రోజు మాట్లాడిన తరువాత, నా విశ్వాసం మరింతగా పెరిగిందని ప్రధాన మంత్రి అన్నారు.

చేపల సాగు అనేది చాలా వరకు స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండడం పై ఆధారపడి ఉంటుందని ప్రధాన మంత్రి అన్నారు.  ఈ విషయం లో ‘మిషన్ క్లీన్ గంగా’ మరింత సహాయకారి అవుతుంది అని ఆయన చెప్పారు.  గంగా నది చుట్టుపక్కల ప్రాంతాలలో నదీ మార్గ రవాణా ఏర్పాట్ల దిశ గా సాగుతున్న పనులు కూడా చేపల పెంపకం రంగానికి ప్రయోజనాన్ని అందించనున్నాయని ప్రధాన మంత్రి వివరించారు.  ఈ ఏడాది ఆగస్టు 15న ప్రకటించిన ‘మిషన్ డాల్ఫిన్’ కూడా మత్స్య రంగం పై తనదైన ప్రభావాన్ని చూపనుందని ఆయన అన్నారు.
 
ప్రతి కుటుంబానికి సురక్షితమైన తాగు నీటి ని సరఫరా చేయడానికి గాను బిహార్ ప్రభుత్వం చేసిన కృషి ని ప్రధాన మంత్రి ప్రశంసించారు.  బిహార్ లో నాలుగైదు సంవత్సరాల లో కేవలం 2 శాతం ఇళ్లు నీటి సరఫరా కనెక్షన్ లతో ముడిపడ్డాయని, ప్రస్తుతం బిహార్ లో 70 శాతానికి పైగా కుటుంబాలు స్వచ్ఛమైన తాగునీటి సరఫరా తో జతపడ్డాయని ఆయన చెప్పారు.  భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన‘జల్ జీవన్ మిషన్’ తో బిహార్ ప్రభుత్వ ప్రయత్నాలు మరింత మద్దతును అందుకొంటున్నాయి అని ప్రధాన మంత్రి తెలిపారు.

కరోనా కాలం లో కూడా, బిహార్ లో దాదాపుగా 60 లక్షల ఇళ్లకు పంపుల నుంచి నీరు అందుతోందని, ఇది నిజంగానే ఒక పెద్ద సాఫల్యం అని ప్రధాన మంత్రి అన్నారు.  సంక్షోభ కాలం లో దేశం లో ఇంచుమించు ప్రతి పనీ నిలిచిపోగా, మన గ్రామాలలో మాత్రం పనులు ఎలా సాగాయో తెలిపే ఒక ఉదాహరణ గా ఇది నిలిచిందని ఆయన చెప్పారు.  మన పల్లెల శక్తి వల్లే కరోనా కాలం లో సైతంమార్కెట్ల కు ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాడి కేంద్రాలకు పాలు తరలివస్తూనే ఉన్నాయని ఆయన తెలిపారు.
 
ఇదొక్కటే కాదు, పాడి పరిశ్రమ కూడా ఈ సంకట స్థితిలో రికార్డు కొనుగోళ్లను నమోదు చేసింది అని ఆయన అన్నారు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి సైతం దేశం లో 10 కోట్ల మంది కి పైగా రైతుల బ్యాంకు ఖాతాల లోకి డబ్బు ను నేరు గా బదిలీ చేసింది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ 10 కోట్ల మంది రైతుల లో బిహార్ రైతులే దాదాపు 75 లక్షల మంది ఉన్నారని ఆయన చెప్పారు.

ఈ పని కూడా ప్రశంసాపాత్రమైందేనంటూ, దీనికి కారణం బిహార్ కూడా కరోనా తో పాటు వరదలను ధైర్యంగా ఎదుర్కొంది అని ప్రధాన మంత్రి అన్నారు. సహాయక కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేయడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొన్నట్లు ఆయన చెప్పారు.

ఉచిత రేషన్ పథకం, ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ ల ప్రయోజనాలు బిహార్ లో అవసరార్ధులకు ప్రతి ఒక్కరికే కాకుండా బయటి నుంచి తిరిగివచ్చిన ప్రతి ఒక్క వలస కుటుంబానికి అందాలని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.  దీని కోసమే ఉచిత రేషన్ పథకాన్ని జూన్ తరువాత దీపావళి, ఛఠ్ పూజ ల వరకు పొడిగించడమైందని ఆయన అన్నారు.

కరోనా సంక్షోభం నేపథ్యం లో నగరాల నుంచి తిరిగి తమ గ్రామాలకు చేరుకున్న వలస కార్మికులు పశు సంవర్ధకం వైపు దృష్టి సారించారని, కేంద్ర ప్రభుత్వం, బిహార్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల ను వినియోగించుకుని ప్రయోజనం పొందుతున్నారని ప్రధాన మంత్రి అన్నారు. ప్రభుత్వం కొత్త ఉత్పత్తులు, కొత్త ఆవిష్కరణల తో పాడి రంగాన్ని విస్తృతపరచడం వల్ల పశువుల పెంపకందారులు, రైతులు ఆదాయాన్ని పెంచుకోగలిగారని చెప్పారు. దీనితో పాటు, దేశంలో పశు సంపద నాణ్యత ను మెరుగుపర్చడం, వాటి పరిశుభ్రత, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, పోషకాహారం అందుబాటులో ఉంచడం వంటి వాటిపై దృష్టి పెట్టాలని ప్రధాన మంత్రి అన్నారు. ఈ లక్ష్యం తో, 50 కోట్ల కు పైగా పశువులకు గాలి కుంటు వ్యాధి నుంచి, బ్రూసెల్లోసిస్ నుంచి రక్షణ కోసం టీకాలు వేయడానికి ఉచిత టీకా ప్రచారాన్ని ఈ రోజు ప్రారంభించినట్లు ప్రధాన మంత్రి చెప్పారు. పశువులకు శ్రేష్టమైన దాణా కోసం వివిధ పథకాల ద్వారా కేటాయింపులు జరపడమైందన్నారు.

దేశం లో మెరుగైన దేశీయ జాతులను అభివృద్ధి చేయడానికి ‘మిషన్ గోకుల్’ కు రూపకల్పన జరుగుతోందని ప్రధాన మంత్రి అన్నారు. ఒక సంవత్సరం క్రితం దేశవ్యాప్తంగా కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం లో మొదటి దశ ఈ రోజు న పూర్తయిందన్నారు.

నాణ్యమైన స్వదేశీ జాతుల అభివృద్ధి కి బిహార్ ఇప్పుడు ప్రధాన కేంద్రం గా మారుతోందని ప్రధాన మంత్రి అన్నారు. జాతీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యం లో పూర్ణియా, పాట్నా, బరౌనిలలో నిర్మించిన ఆధునిక సౌకర్యాల తో బిహార్ పాడి రంగం లో బలోపేతం కానుంది. పూర్ణియా లో నిర్మించిన ఈ కేంద్రం భారతదేశం లో అతిపెద్ద కేంద్రాలలో ఒకటి. ఇది బిహార్‌ కు మాత్రమే కాకుండా తూర్పు భారతదేశం లో చాలా ప్రాంతాలకు ప్రయోజనాలను అందిస్తుంది. 'బచౌర్', 'రెడ్ పూర్ణియా' వంటి బిహార్ దేశీయ జాతుల అభివృద్ధి కి, పరిరక్షణ కు ఈ కేంద్రం మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆయన అన్నారు.

సాధారణం గా ఒక ఆవు సంవత్సరం లో ఒక దూడకు జన్మనిస్తుంది, కానీ ఐవిఎఫ్ టెక్నాలజీ సహాయం తో, సంవత్సరం లో చాలా దూడ ల పుట్టుక సాధ్యమే అని ప్రధాన మంత్రి వివరించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం తో ప్రతి గ్రామానికి చేరుకోవడమే తమ లక్ష్యమని అన్నారు. జంతువుల మంచి జాతి తో పాటు, వాటి సంరక్షణ గురించి సరైన శాస్త్రీయ సమాచారం కూడా అంతే ముఖ్యమని ఆయన చెప్పారు. ఈ రోజు న ప్రారంభించిన ఇ-గోపాల యాప్ ఆన్‌లైన్ డిజిటల్ మాధ్యమం గా ఉంటుంది, ఇది రైతులకు మెరుగైన నాణ్యమైన పశువులను ఎన్నుకోవటానికి, మధ్యవర్తుల నుంచి విముక్తి ని పొందటానికి సహాయపడుతుంది. ఈ యాప్ పశువుల సంరక్షణ కు, ఉత్పాదకత నుంచి, దాని ఆరోగ్యం, ఆహారం వరకు అన్ని విధాల సమాచారాన్ని ఇస్తుంది. ఈ పని పూర్తయ్యాక, పశువుల ఆధార్ నంబర్‌ ను ఇ-గోపాల యాప్‌లో చేర్చడం వల్ల ఆ పశువు కు సంబంధించిన మొత్తం సమాచారం సులభం గా లభిస్తుంది. ఇది పశువుల యజమానుల కు కొనుగోలు, అమ్మకం లను సులభతరంగా మార్చివేస్తుంది.

వ్యవసాయం, పశుపోషణ, మత్స్య పరిశ్రమ వంటి రంగాలను వేగంగా అభివృద్ధి చేయడానికి గ్రామం లో శాస్త్రీయ పద్ధతులను అవలంబించడం, ఆధునిక మౌలిక సదుపాయాలను నిర్మించడం అవసరమని ప్రధాన మంత్రి అన్నారు. వ్యవసాయానికి సంబంధించిన విద్య కు, పరిశోధనలకు బిహార్ ఒక ముఖ్యమైన కేంద్రం గా ఉంది. ఢిల్లీ లోని పూసా ఇన్స్ టిట్యూట్ బిహార్‌ లోని సమస్తిపూర్ సమీపం లోని పూసా పట్టణాన్ని సూచిస్తుందని చాలా కొద్ది మందికి తెలుసు. వలసరాజ్య పాలన కాలం లోనే సమస్తిపూర్ లోని పూసా లో జాతీయ స్థాయి వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటు అయింది. స్వాతంత్య్రానంతరం ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లినందుకు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జన నాయక్ కర్పూరీ ఠాకూర్ వంటి దూరదృష్టి గల నాయకులను ఆయన ప్రశంసించారు.

ఈ ప్రయత్నాల నుంచి ప్రేరణ పొంది 2016 లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కేంద్ర విశ్వవిద్యాలయం గా గుర్తించారని ప్రధాన మంత్రి తెలిపారు. దీని తరువాత విశ్వవిద్యాలయం లో, దానికి అనుబంధ కళాశాలల్లో కోర్సులను విస్తరించడం జరిగింది. దీనిని మరింత ముందుకు తీసుకుపోతూ, స్కూల్ ఆఫ్ అగ్రి-బిజినెస్ అండ్ రూరల్ మేనేజ్‌మెంట్ కొత్త భవనాన్ని ప్రారంభించడమైంది. అదనం గా, కొత్త వసతి గృహాలు, స్టేడియాలు మరియు అతిథి గృహాలు కూడా నిర్మించడమైంది.

వ్యవసాయ రంగం ఆధునిక అవసరాలను పరిగణనలోకి తీసుకుని, 5-6 సంవత్సరాల క్రితం ఒక కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం మాత్రమే ఉన్న పరిస్థితులతో పోలిస్తే, దేశం లో ఇప్పుడు 3 కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడమైందని చెప్పారు. బిహార్‌ లో ప్రతి సంవత్సరం వచ్చే వరదల నుంచి వ్యవసాయాన్ని కాపాడటానికి ఇక్కడ మహాత్మా గాంధీ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధం గా, వ్యవసాయాన్ని విజ్ఞాన శాస్త్రంతో, సాంకేతిక విజ్ఞానం తో సంధానించడానికి మోతీపుర్‌ లోని చేపల ప్రాంతీయ పరిశోధన, శిక్షణ కేంద్రం, మోతీహరి లోని పశు సంవర్ధక, పాల అభివృద్ధి కేంద్రం.. ఇలా అనేక సంస్థలు  ప్రారంభమయ్యాయి.

గ్రామాల సమీపంలో ఆహార శుద్ధి పరిశ్రమ లు, పరిశోధన కేంద్రాల సమూహాలను ఏర్పాటు చేయాలని, దానితో ‘జయ్ కిసాన్, జయ్ విజ్ఞాన్, జయ్ అనుసంధన్’ అనే నినాదాన్ని సాకారం చేయగలమని ప్రధాన మంత్రి అన్నారు.  నిలవ వసతి, శీతల గిడ్డంగులు, ఇతర సౌకర్యాల ను అభివృద్ధి చేయడానికి ఎఫ్‌పిఓల కు, సహకార సమూహాలకు సహాయం చేసేందుకు, ,ప్రత్యేక మౌలిక సదుపాయాల అభివృద్ధిపరచేందుకు  1 లక్ష కోట్ల రూపాయల తో వ్యవసాయ  నిధి ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ప్రధాన మంత్రి వివరించారు.

మహిళా స్వయం సహాయక సమూహాలు సైతం మంచి మద్దతు ను అందుకొంటున్నాయని, ఈ సహాయం గత 6 సంవత్సరాల్లో 32 రెట్లు పెరిగిందని ప్రధాన మంత్రి అన్నారు.  భారతదేశాన్ని స్వయంసమృద్ధియుతంగా తీర్చిదిద్దడం లో భాగం గా దేశంలో అన్ని గ్రామాలను వృద్ధి ఇంజిన్ లుగా మలచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.


 

***



(Release ID: 1653062) Visitor Counter : 182