రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

బి.పి. పి .ఐ., 2019-20 ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సాధించిన 75.48 కోట్ల రూపాయల మేర అమ్మకాల టర్నోవర్ తో పోలిస్తే, 2020-21 మొదటి త్రైమాసికంలో, కోవిడ్ లాక్ డౌన్ పరీక్షా సమయం ఉన్నప్పటికీ, ప్రశంసించదగిన స్థాయిలో, 146.59 కోట్ల రూపాయల మేర అమ్మకాల టర్నోవర్ సాధించింది.

స్థిరమైన మరియు రెగ్యులర్ ఆదాయాలతో స్వయం ఉపాధిని అందిస్తూ, ప్రపంచంలోని అతిపెద్ద రిటైల్ ఫార్మా చెయిన్ “సేవా భీ, రోజ్ గార్ భీ” అనే ట్యాగ్ ‌లైన్ ‌కు న్యాయం చేస్తోంది.

Posted On: 06 SEP 2020 4:44PM by PIB Hyderabad

ప్రధానమంత్రి జన ఔషధీ పరియోజన-పి.ఎం.బి.జె.పి.ని అమలుచేసే ఏజెన్సీ, బ్యూరో ఆఫ్ ఫార్మా పి.ఎస్.‌యు.స్ ఆఫ్ ఇండియా, బి.పి.పి.ఐ., 2019-20 ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సాధించిన  75.48 కోట్ల రూపాయల మేర అమ్మకాల టర్నోవర్ తో పోలిస్తే, 2020-21 మొదటి త్రైమాసికంలో, కోవిడ్ లాక్ డౌన్ పరీక్షా సమయం ఉన్నప్పటికీ, ప్రశంసించదగిన స్థాయిలో, 146.59 కోట్ల రూపాయల మేర అమ్మకాల టర్నోవర్ సాధించింది. 2020 జూలై నెలలో బి.పి.పి.ఐ. మరో 48.66 కోట్ల రూపాయల మేర అమ్మకాలను జోడించింది. దీంతో, 2020 జూలై,  31వ తేదీ వరకు మొత్తం అమ్మకాలు 191.90 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. 

అత్యవసర ఔషధాలు నిరంతరాయంగా అందుబాటులో ఉంచాలనే నిబద్ధతలో భాగంగా, జనౌషధి కేంద్రాలు లాక్ డౌన్ సమయంలో కూడా పనిచేస్తూనే ఉన్నాయి.  ఈ కేంద్రాలు సుమారు 15 లక్షల ఫేస్ మాస్కులు, 80 లక్షల హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు, 100 లక్షల పారాసెటమాల్ మాత్రలను విక్రయించడం ద్వారా సుమారు 1260 కోట్ల రూపాయల మేర పౌరుల ధనాన్ని ఆదా చేశాయి. 

ఈ కేంద్రాలు విక్రయించే ఔషధాల శ్రేణిలో 1250 రకాల మందులు మరియు 204 రకాల శస్త్ర చికిత్సా పరికరాలు ఉన్నాయి.  2024 మార్చి 31వ తేదీ నాటికి ఈ శ్రేణిని 2000 రకాల మందులు మరియు 300 రకాల శస్త్ర చికిత్సా ఉత్పత్తులను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందువల్ల, వీటిలో, అన్ని రకాల చికిత్సలకు పనికి వచ్చే - యాంటీ డయాబెటిక్సు, హృదయ నాళాలలకు సంబంధించిన మందులు, క్యాన్సర్ నివారణ మందులు, అనాల్జెసిక్సు, & యాంటిపైరేటిక్సు, యాంటీ అలెర్జిక్, జీర్ణాశయాంతర ఏజెంట్లు, విటమిన్లు, ఖనిజాలు, ఆహార పదార్ధాలు, ఉష్ణమండల మందులు మొదలైన అన్ని రకాల అవసరమైన మందులు - ఉంటాయి. 

జనౌషధి ఔషధాల ధర కనీసం 50 శాతం మరియు కొన్ని సందర్భాల్లో, బ్రాండెడ్ ఔషధాల మార్కెట్ ధరలో 80 శాతం నుండి 90శాతం వరకు తక్కువ.  ఈ మందులు డబ్ల్యూ.హెచ్.ఓ-జి.ఎమ్.పి. ధృవీకరించిన తయారీదారుల నుండి మాత్రమే ఓపెన్ టెండర్ ప్రాతిపదికన సేకరించబడతాయి.  ఇవి, జాతీయ గుర్తింపు పొందిన ప్రయోగశాలల్లో, రెండు దశల కఠినమైన నాణ్యత తనిఖీ ప్రక్రియకు లోనవుతాయి. 

దుకాణాల సమాఖ్య పరంగా చూస్తే, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రిటైల్ ఫార్మా చెయిన్. ఇది స్థిరమైన మరియు క్రమమైన ఆదాయంతో విద్యావంతులైన నిరుద్యోగ యువతకు మంచి ఉపాధి వనరులను అందిస్తోంది.  ఈ విధంగా ఇది  “సేవా భీ, రోజ్ గార్ భీ” అనే ట్యాగ్ ‌లైన్ ‌కు నిజంగా న్యాయం చేస్తోంది.  అధికారిక సమాచారం ప్రకారం, ఈ పథకంలో పాలుపంచుకోవడం ద్వారా దేశం లోని 11,600 మందికి పైగా విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించాయి. 

కేంద్ర యజమానులకు అందించే ప్రోత్సాహకాన్ని ప్రస్తుతం ఉన్న 2.50 లక్షల రూపాయల నుంచి 5.00 లక్షల రూపాయల నెలవారీ కొనుగోళ్ళకు పెంచారు. వీటిపై 15 శాతం చొప్పున నెలకు 15,000 రూపాయల గరిష్ట పరిమితితో ఈ  ప్రోత్సాహకాన్ని అందజేస్తారు.  ఒక సారి ఇచ్చే ప్రోత్సాహకాల కింద ఈశాన్య రాష్ట్రాల్లోనూ, హిమాలయ ప్రాంతాలు, ద్వీప భూభాగాలు మరియు నీతీ ఆయోగ్ ఆకాంక్ష జిల్లాగా పేర్కొన్న వెనుకబడిన ప్రాంతాలలోనూ ప్రారంభించిన పి.ఎం.బి.జె.పి. కేంద్రాలకు 2.00 లక్షల రూపాయలు అందజేస్తారు. 

జనాభాలోని అన్ని వర్గాలకు, ముఖ్యంగా పేదలు మరియు అణగారిన వర్గాల వారికి నాణ్యమైన ఔషధాలను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో, ఫార్మాస్యూటికల్స్ విభాగం 2008 నవంబర్ నెలలో దేశవ్యాప్తంగా  జన్ ఔషధీ పధకాన్ని ప్రారంభించింది

 

*****



(Release ID: 1651907) Visitor Counter : 189