గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

'గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌' ఏడో వారంలో రూ.16,768 కోట్ల వ్యయంతో దాదాపు 21 కోట్ల పనిదినాలు కల్పన

కరోనా నేపథ్యంలో, వలస కూలీలు, గ్రామీణ ప్రాంత ప్రజల ఉపాధి, జీవనోపాధి అవకాశాల వృద్ధి కోసం ఈ కార్యక్రమం ప్రారంభం

Posted On: 20 AUG 2020 4:50PM by PIB Hyderabad

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి, బిహార్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లోని స్వగ్రామాలకు తిరిగివచ్చిన వలస కూలీలకు ఉపాధి కల్పించేందుకు 'గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌' (జీకేఆర్‌ఏ) కింద యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. ఈ రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో జీవనోపాధి అవకాశాలను ఈ పథకం మెరుగుపరుస్తుంది.

    'గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌' ఏడో వారం నాటికి, రూ.16,768 కోట్ల వ్యయంతో దాదాపు 21 కోట్ల పనిదినాలు కల్పించారు. ఈ పథకం లక్ష్యాల సాధనలో భాగంగా.., 77,974 జల సంరక్షణ నిర్మాణాలు, 2.33 లక్షల గ్రామీణ గృహాలు, 17,933 పశువుల షెడ్లు, 11,372 నీటికుంటలు, 3,552 సామాజిక మరుగుదొడ్లు నిర్మించారు. దీంతోపాటు, జిల్లాల నిధుల నుంచి 6300 పనులు, 764 గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్‌ అనుసంధానం, రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా 25,487 మందికి నైపుణ్య శిక్షణను అందించారు.

    వలస కార్మికులు, గ్రామీణ సమాజాలకు భారీ ప్రయోజనాలు అందించిన పన్నెండు మంత్రిత్వ శాఖలు/విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలను జీకేఆర్‌ఏ విజయంగా చూడవచ్చు. 

    కరోనా నేపథ్యంలో నగరాల నుంచి స్వగ్రామాలకు తిరిగివచ్చిన వలస కూలీలతోపాటు, గ్రామీణ ప్రాంత ప్రజల ఉపాధి, జీవనోపాధి అవకాశాల వృద్ధి కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరాల నుంచి తిరిగివచ్చి స్వగ్రామాల్లోనే స్థిరపడాలనుకున్న వారి ఉపాధి, జీవనోపాధి కోసం ఈ పథకం ద్వారా దీర్ఘకాలిక వేదికను సిద్ధం చేశారు.

***



(Release ID: 1647419) Visitor Counter : 216