శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 పై దృష్టి సారించే అంటు వ్యాధుల పరమాణు నిర్ధారణలో క్రాష్ కోర్సును ప్రారంభిస్తున్న - జే.ఎన్.సి.ఏ.ఎస్.ఆర్



సైద్ధాంతిక జ్ఞానంతో పాటు, ఆచరణాత్మక శిక్షణ కూడా అందించే విధంగా ఈ కోర్సును రూపొందించారు


వ్యాపింప జేసే వైరస్ లేని అనుకరణ నమూనాలను మాత్రమే శిక్షణ కోసం ఉపయోగించారు

Posted On: 24 JUN 2020 12:48PM by PIB Hyderabad

కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న జాతీయ పోరాటానికి అవసరమైన సామర్ధ్యాన్ని పెంపొందించడానికి, భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక శాఖ కింద స్వయం ప్రతిపత్తి పరిశోధన సంస్థ, జవహర్ లాల్ నెహ్రూ ఆధునిక శాస్త్రీయ పరిశోధన కేంద్రం (జే.ఎన్.సి.ఏ.ఎస్.ఆర్) తన జక్కూరు ప్రాంగణంలో ఒక అత్యాధునిక కోవిడ్ వ్యాధి నిర్ధారణ శిక్షణా కేంద్రాన్ని స్థాపించింది.

 

కోవిడ్-19 తో సహా అంటువ్యాధుల నిర్ధారణ మరియు ట్రాకింగ్‌లో రియల్ టైమ్ పి.సి.ఆర్. వంటి పరమాణు సంబంధమైన వ్యాధి నిర్ధారణ పద్ధతులు కీలక పాత్ర పోషిస్తాయి.  దురదృష్టవశాత్తు, క్లినికల్ రోగనిర్ధారణకు రియల్ టైమ్ పి.సి.ఆర్. నిర్వహణలో సమర్థులైన నిపుణులు భారతదేశంలో లేరు. దేశం యొక్క కీలకమైన మరియు అపరిష్కృతమైన అవసరాలను గమనించిన జె.ఎన్.సి.ఏ.ఎస్.ఆర్., కోవిడ్-19 కోసం రియల్ టైమ్ పి.సి.ఆర్.‌లో సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి అత్యాధునిక రోగనిర్ధారణ శిక్షణా సదుపాయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  రియల్ టైమ్ పి.సి.ఆర్. ‌లో బృందాల వారీగా ఒక్కొక్క బృందానికి  6 నుండి 10 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాలనేది ఈ కార్య్రక్రమం యొక్క ప్రాధమిక లక్ష్యం.

 

ఒక వారం రోజుల పాటు నిర్వహించే ఈ క్రాష్ కోర్సును రాబోయే నెలల్లో బ్యాచ్ తరువాత బ్యాచ్  పద్దతిలో అభ్యర్థులకు వరుసగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. మొదటి బ్యాచ్ 2020, జూన్ 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు, జె.ఎన్.సి.ఏ.ఎస్.ఆర్. లోని కోవిడ్ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందింది.

 

ఒక వారం రోజుల పాటు నిర్వహించే ఈ విస్తృతమైన క్రాష్-కోర్సులో తరగతి గది బోధనలతో పాటు లేబరేటరీ ప్రయోగాలు కూడా ఉంటాయి.  సైద్ధాంతిక జ్ఞానంతో పాటు, ఆచరణాత్మక శిక్షణ కూడా అందించే విధంగా ఈ కోర్సును రూపొందించారు.  ప్రాక్టికల్ లాబొరేటరీ క్లాసుల్లో పాల్గొనే అభ్యర్థులకు అంటు వ్యాధుల నమూనాల ప్రాసెసింగు, న్యూక్లియిక్ ఆమ్లం వెలికితీత మరియు సంరక్షణ, రియల్ టైమ్ పి.సి.ఆర్. మరియు ఇతర పరమాణు పద్ధతులు, డేటా విశ్లేషణతో పాటు ముఖ్యంగా, క్లినికల్ వ్యాధినిర్ధారణలో  ప్రామాణిక ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ (ఎస్ఓపి)ను అనుసరించడంలో శిక్షణ ఇస్తారు.  వ్యాపింప జేసే వైరస్ లేని అనుకరణ నమూనాలను మాత్రమే శిక్షణ కోసం ఉపయోగించారు.  ఈ కోర్సును పూర్తిచేసుకున్న అభ్యర్థులు, క్లినికల్ వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో చేరడానికి, క్లినికల్ సెటప్ ‌లో నమూనాలను సేకరించి, పరిశీలించడంతో పాటు, కోవిడ్ కి మాత్రమే కాకుండా ఏదైనా ఇతర అంటువ్యాధులు సోకే ఆస్కారమున్న జీవికి రియల్ టైమ్ పి.సి.ఆర్. చేసే సామర్ధ్యం కలిగి ఉంటారు.

 

అంటు వ్యాధుల నమూనాల నిర్వహణ మరియు ప్రాసెసింగ్, రియల్-టైం పి.సి.ఆర్. మరియు ఇతర మాలిక్యులర్ వ్యాధి నిర్ధారణ, డేటా విశ్లేషణ మరియు క్లినికల్ వ్యాధి నిర్ధారణ సౌకర్యం యొక్క  ప్రామాణిక ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ (ఎస్.ఓ.పి) అనుసరించడంలో శిక్షణ మొదలైనవి, కోవిడ్-19 సమయంలో అదనపు ప్రాముఖ్యతతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి బెదిరింపులను వేగంగా పరిష్కరించడానికి దేశం యొక్క సంసిద్ధతను నిర్ధారించడానికి కూడా ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. అని డి.ఎస్.టి., కార్యదర్శి, ప్రొఫెసర్ అశుతోష్ శర్మ పేర్కొన్నారు.

 

భారతదేశంలోని ఏదైనా వైద్య సంస్థ అందించే మెడికల్ లాబొరేటరీ టెస్టింగ్ (ఎం.ఎల్.‌టి) లో గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న యువ అభ్యర్థులు ఈ కార్యక్రమంలో చేరవచ్చు.   ప్రస్తుతం క్లినికల్ సేవలు మరియు రోగనిర్ధారణ ప్రయోగశాలల్లో నిమగ్నమైన సిబ్బంది ఈ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రోత్సహిస్తున్నారు.  ఇన్స్టిట్యూట్ ఉచిత బోర్డింగ్ మరియు బసతో పాటు రిజిస్టర్డ్ సిబ్బందికి తగిన పారితోషికం ఇస్తారు. 

 

శిక్షణా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు :

 

JNCASRJNCASR1

JNCASR2JNCASR3

******



(Release ID: 1634027) Visitor Counter : 207