సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కోవిడ్ - 19 కాలంలో సమస్యల పరిష్కారం మీద

ప్రజాస్పందన నేరుగా తెలుసుకున్న కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర

కోవిడ్ - 19 సమయంలో ప్రజాసమస్యల పరిష్కారం దిశగా
లక్ష మైలు రాయి దాటిన డి ఎ ఆర్ పి జి కి అభినందన

Posted On: 15 JUN 2020 4:22PM by PIB Hyderabad

ప్రజాసమస్యలను పరిష్కరించిన తీరుమీద ఫిర్యాదుదారుల స్పందన తెలుసుకోవటానికి కేంద్ర సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు ప్రజలతో సంభాషించారు. కోవిడ్ - 19  నేపథ్యంలో ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి, వాటి పరిష్కారానికి వీలుగా ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే, అయితే, ఆ విధంగా సమస్యలు పరిష్కారమైనవారి అభిప్రాయాలు తెలుసుకోవటమే ధ్యేయంగా ఈరోజు మంత్రి స్వయంగా ఫిర్యాదు దారులతో మాట్లాడారు. అలాంటి ఫిర్యాదులను పరిష్కరించటంలో ఇప్పటివరకూ లక్ష మైలురాయిని దాటిన డిఎ ఆర్ పి జి ని ఆయన అభినందించారు.

 



 స్ఫూర్తిదాయకమైన ప్రధాని నాయకత్వం సామాన్యుడు సమస్యలను పరిషరించటానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చేట్టు చేసిందన్నారు.



కోవిడ్ - 19  సమయంలో ప్రజలు వెలిబుచ్చిన సమస్యల పరిష్కారం విషయంలో ఇలా నేరుగా ప్రజలతో మాట్లాడిన తొలి సీనియర్ మంత్రి ఆయనే కావటం విశేషం. మరిన్ని మంత్రిత్వశాఖలు కూడా ఇదే బాటలో ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవటానికి ఈ స్పందన కార్యక్రమం బాటలు వేస్తుంది.

డి ఎ ఆర్ పి జి ఈ స్పందన కాల్ సెంటర్ ను ఏర్పాటు చేయటంలో బి ఎస్ ఎన్ ఎల్ సహకారం తీసుకుంది.  భువనేశ్వర్, గువాహతి, జంషెడ్పూర్, వడోదర, అహమ్మదాబాద్, లక్నో. అజ్మీర్. గుంటూరు, కోయంబత్తూరు, గుంతకల్ నగరాలలో మొత్తం 1406 కాల్ సెంటర్స్ ఏర్పాటు చేయటం ద్వారా ఈ కాల్ సెంటర్స్ ను వినియోగంలోకి తెచ్చింది.

కోవిడ్ - 19  మీద వచ్చిన లక్షా 28 వేల ప్రజాఫిర్యాదులకు ప్రభుత్వ స్పందన మీద వ్యక్ర్తిగతంగా ఒక్కో పౌరుడి సంతృప్తి స్థాయిని తెలుసుకోవటం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 30/3/2020 నుంచి  30/5/2020 వరకు సిపిగ్రామ్స్ మీద నమోదైన ఫిర్యాదుల ఆధారంగా వారితో సంభాషిస్తారు. ఫిర్యాదు దారులను ఎలాంటి ప్రశ్నలు అడగాలో కాల్ సెంటర్ ఆపరేటర్లకు బాగా అర్థమయ్యేలా చేపట్టిన శిక్షణాకార్యక్రమం జూన్ 9న పూర్తయింది. ఈ సరికొత్త కాల్ సెంటర్లు హిందీ, ఇంగ్లీష్, గుజరాతి, మరాఠీ, పంజాబీ, కన్నడ, కొంకణి, మలయాళం, తమిళం, తెలుగు, ఒరియా, బెంగాలీ, అస్సామీస్, రాజస్థానీ భాషల్లో పనిచేస్తాయి.

కోవిడ్-19 కు సంబంధించి ఫిర్యాదు చేసి మూడు రోజుల్లోనే పరిష్కారం పొందిన నలుగురు పౌరులతో ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సంభాషించారు. మంత్రి మాట్లాడిన వారిలో కర్ణాటక లోని బీజాపూర్ కు చెందిన శ్రీమతి రేణుకా వి. పరసప్పగోల్ ఉన్నారు. కెనరా బాంక్ నుంచి తిరిగి రావాల్సిన సొమ్ము విషయమై ఆమె సమస్యను ఆర్థిక సేవల విభాగం పరిష్కరించింది. గుజరాత్ లోని వడోదరకు చెందిన శ్రీ గోర్ధాన్ భాయ్ జెథాభాయ్ పటేల్ గడువు తీరిన మదుపు గురించి చెప్పుకోగా తాపాలాశాఖ వెంటనే పరిష్కరించింది. ఢిల్లీ కి చెందిన లక్ష్మీనారాయణన్ తన కూతురి చికిత్స గురించి ప్రస్తావించగా ఎయిమ్స్ సానుకూలంగా స్పందించి చికిత్సనందించింది. ఇక నాలుగో వ్యక్తి తమిళనాడులోని చెన్నై నగరానికి చెందిన శ్రీ మృత్యుంజయన్. ఆయన నెలవారీ డిపాజిట్లు చేయటానికి అవకాశం కొరగా తపాలాశాఖ ఆమోదించింది. ప్రజా సమస్యలమీద కోవిడ్-19 జాతీయ పర్యవేక్షణ ఏర్పాటైనట్టు తెలుసుకొని ఫిర్యాదు చేయగా ప్రభుత్వం సకాలంలో సంతృప్తికరంగా స్పందించినందుకు వారంతా కృతజ్ఞతలు తెలియజేయటాన్ని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.

మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, మోదీ రెండో విడత పాలనలో విప్లవాత్మకమైన సంస్కరణలు, పాలనలో మార్పులు కారణంగా దేశ వ్యాప్తంగా సమస్యల పరిష్కార విధానం సమగ్రంగా రూపుదిద్దుకున్నదన్నారు. ఫిర్యాదులు అందే అవకాశమున్న20 మంత్రిత్వశాఖలు, విభాగాలలో ఫిర్యాదుల స్వీకరణకు, పరిష్కారానికి వెసులుబాటు కల్పించటంతోబాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సమస్యలు కూడా అందుకోగలిగే ఏర్పాటు చేయటం, ఫీడ్ బాక్ కాల్ సెంటర్లు ఏర్పాటు చేయటం ఆశించిన ఫలితాలనిస్తున్నదన్నారు. కోవిడ్-19 సంక్షోభం డిజిటల్ అవకాశాలను సృష్టించి భారత పౌరులను ఈ దిశలో బలోపేతం చేసిందని, డిఎ ఆర్ పి జి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నదని డాక్టర్ జితేంద్ర సింగ్ అభివర్ణించారు. సంక్షోభానంతర సంస్కరణలను ముందు ముందు మరింత సమర్థంగా వినియోగించుకోవాలని కోరారు. ప్రజాసమస్యలను విజయవంతంగా పరిష్కరిస్తున్న నేపథ్యంలో అలాంటి విజయగాథలను సంకలనం చేయాలని డిఎపిఆర్ జి కి సూచించారు. సమస్యలపట్ల ప్రభుత్వం ఎంత సానుకూలంగా స్పందిస్తుందో తెలుసుకోవటానికి ప్రజలకు ఇదొక ప్రేరణగా నిలుస్తుందన్నారు.



ఈ కాల్ సెంటర్ ప్రారంభ కార్యక్రమంలో డిఎ ఆర్ పి జి కార్యదర్శి డాక్టర్ శివాజీ, అదనపు కార్యదర్శి శ్రీ వి శ్రీనివాస్, బిఎస్ ఎన్ ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పికె పుర్వార్, డిఎఆర్ పిజి సంయుక్త కార్యదర్శి శ్రీమతి జయాదూబే. ఎయిమ్స్, తపాలాశాఖ, బిఎస్ ఎన్ ఎల్ కుఇ చెందిన పలువురు సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. వీరితోబాటు దాదాపు 1500  మంది బి ఎస్ ఎన్ ఎల్ కాల్ సెంటర్ ఆపరేటర్లు, సమస్యలు పరిష్కారమైన పౌరులు కూడా హాజరయ్యారు.

 

<><><>



(Release ID: 1631715) Visitor Counter : 252