రైల్వే మంత్రిత్వ శాఖ

జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న రైలు సర్వీసులకు మార్గదర్శకాలు

రైలు సర్వీసులు దశలవారీ పునరుద్ధరణ

శ్రామిక్ రైళ్లు మినహా ఇతర రైళ్లలో ప్రయాణించాలనుకునే వలసదారుల సహాయానికి చర్యలు

శ్రామిక్ రైళ్లు కాకుండా పెద్ద సంఖ్యలో నడపనున్న ఇతర రైళ్లకు వర్తించనున్న నిబంధనలు

జాబితాలో 100 జతల రైళ్లు

టికెట్ల బుకింగ్, చార్టింగ్, కోటా, రాయితీ, రద్దు, రిఫండ్లు, హెల్త్ స్క్రీనింగ్, కాటరింగ్, లినెన్ వంటి సదుపాయాలకు నిబంధనలు

21 నుంచి అన్ని రైళ్లకు బుకింగ్ ప్రారంభం

రెగ్యులర్ గా తిరిగే అన్ని మెయిల్/ ఎక్స్ ప్రెస్, పాసింజర్, సబర్బన్ సర్వీసులు తదుపరి ఆదేశాలు వెలువడే వరకు రద్దు

రైళ్లలో అన్ రిజర్వ్ డ్ కోచ్లుండవు

రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తున్న జనరల్ కోచ్ ల (జిఎస్) టికెట్ ధరలు యథాతథం, సెకండ్ సిటింగ్ (2ఎస్) కోచ్ లకు మాత్రం టికెట్ చార్జీతో పాటు సీటు కూడా కేటాయింపు

ఐఆర్ సిటిసి వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఆన్ లైన్ లోనే ఇ-టికెటింగ్ జారీ, రైల్వే స్టేషన్లలోని రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్ల బుకింగ్ ఉండదు

అడ్వాన్స్ రిజర్వేషన్ కు గరిష్ఠ గడువు 30 రోజులు

కన్ ఫర్మ్ డ్ టికెట్లు గల వారికే రైల్వే స్టేషన్ లో ప్రవేశం

రైలు ఎక్కే ముందు అందరు ప్రయాణికులకు స్ర్క

Posted On: 20 MAY 2020 10:25PM by PIB Hyderabad

రైల్వే మంత్రిత్వ శాఖ కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్ఎఫ్ డబ్ల్యు), హోం మంత్రిత్వ శాఖతో సంప్రదించి జూన్ 1వ తేదీ నుంచి మరి కొన్ని సర్వీసులు పాక్షికంగా పునరుద్ధరించాలని నిర్ణయించింది.
జాబితాలోని (అనుబంధంగా పొందుపరిచిన జాబితా) 200 ప్రయాణికుల సర్వీసులను భారత రైల్వే ప్రారంభిస్తుంది. ఈ రైళ్లన్నీ జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఈ రైళ్ల బుకింగ్ మే 21వ తేదీ నుంచి  ప్రారంభమవుతుంది. మే 1వ తేదీ నుంచి ప్రారంభించిన శ్రామిక్ స్పెషల్ రైళ్లు, 12వ తేదీ నుంచి ప్రారంభమైన స్పెషల్ ఎసి రైళ్లు (30 రైళ్లు) కాకుండా అదనంగా ఈ రైలు సర్వీసులు నడుస్తాయి.
ఇతర మెయిల్/ ఎక్స్ ప్రెస్ సర్వీసులు సహా అన్ని రకాల ప్రయాణికుల సర్వీసులు, సబర్బన్ సర్వీసులు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు రద్దులోనే ఉంటాయి.

రైలు వర్గీకరణ : ఇవన్నీ రెగ్యులర్ రైలు సర్వీసుల వలె తిరిగే ప్రత్యేక రైళ్లు
ఇవన్నీ ఎసి, నాన్ ఎసి కోచ్ లుండే పూర్తి రిజర్వేషన్ తో నడిచే రైళ్లు. జనరల్ కోచ్ ల్లో (జిఎస్) అందరికీ కూచునేందుకు రిజర్వ్ డ్ సీటు కేటాయిస్తారు. ఈ రైళ్లలో అన్ రిజర్వ్ డ్ కోచ్ లుండవు.
ఈ రైళ్లలో జనరల్ కోచ్ ల టికెట్ చార్జీలు కూడా సాధారణ రైళ్ల చార్జీలే  ఉంటాయి. సెకండ్ సిటింగ్ (2ఎస్) కోచ్ లో టికెట్ చార్జీలతో పాటు ప్రయాణికులకు సీటు కేటాయిస్తారు. 
టికెట్ల బుకింగ్, చార్టింగ్
i. ఐఆర్ సిటిసి వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఆన్ లైన్ లో ఇ-టికెటింగ్ మాత్రమే ఇస్తారు. ఏ రైల్వే స్టేషన్ లోని రిజర్వేషన్ కౌంటర్ లోనూ బుకింగ్ ఉండదు. అలాగే ఏజెంట్ల ద్వారా (ఐఆర్ సిటిసి ఏజెంట్లు, రైల్వే ఏజెంట్లు) కూడా టికెట్ల బుకింగ్ అనుమతించరు.     
ii. ఎఆర్ పి (అడ్వాన్స్ రిజర్వేషన్ కాలపరిమితి) గరిష్ఠంగా 30 రోజులు 
iii. నిబంధనలకు అనుగుణంగా ఆర్ ఏసి, వెయిటింగ్ లిస్ట్ కూడా కేటాయిస్తారు. కాని వెయిటింగ్ లిస్ట్ లోని ప్రయాణికులు రైలు ఎక్కేందుకు అనుమతించరు.       
iv.  అన్ రిజర్వుడు టికెట్లు (యుటిఎస్) జారీ చేయరు. ప్రయాణం సమయంలో రైలులో కూడా టికెట్ ఇవ్వరు.       
v. తత్కాల్, తత్కాల్ ప్రీమియం బుకింగ్ అనుమతించరు.  
vi. రైలు బయలుదేరే సమయానికి 4 గంటల ముందు మొదటి చార్టు, 2 గంటల ముందు రెండవ చార్టు (సాధారణ రైళ్లలో అయితే 30 నిముషాలకు భిన్నంగా) తయారుచేస్తారు. మొదటి, రెండవ చార్టులు తయారైన తర్వాత కూడా ఆన్ లైన్ లోనే కరెంట్ బుకింగ్  అనుమతిస్తారు.    
vii. ప్రయాణికులందరికీ స్క్రీనింగ్ తప్పనిసరి. ఎలాంటి లక్షణాలు లేని ప్రయాణికులు మాత్రమే రైలు ఎక్కేందుకు అనుమతిస్తారు.       
viii. ఈ స్పెషల్ సర్వీసుల్లో ప్రయాణించే వారందరూ ఈ దిగువ ముందు జాగ్రత్తలు  పాటించాలి.  
1. కన్ ఫర్మ్ డ్ టికెట్లున్న వారిని మాత్రమే రైల్వే స్టేషన్ లో  ప్రవేశించేందుకు అనుమతిస్తారు.      
2. స్టేషన్ లో ప్రవేశించే సమయంలోను, ప్రయాణ సమయంలోను ప్రయాణికులందరూ ఫేస్ కవర్లు/  మాస్క్ లు ధరించి తీరాలి.          
3. స్టేషన్ లో థర్మల్ స్క్రీనింగ్ చేయడానికి వీలుగా ప్రయాణికులందరూ కనీసం 90 నిముషాల ముందుగా స్టేషన్ కు రావాలి. ఎలాంటి వ్యాధి లక్షణాలు లేని వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు.         
4. స్టేషన్ లోనూ, రైళ్లలోనూ ప్రయాణికులు భౌతిక దూరం పాటించాలి.
5. ప్రయాణికులు తమ గమ్యాలకు చేరిన అనంతరం సంబంధిత రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం నిర్దేశించిన ఆరోగ్య నిబంధనలు పాటించి తీరాలి.
కోటాకు అనుమతి : 
ఈ ప్రత్యేక రైళ్లలో రెగ్యులర్ రైళ్లలో వలెనే అన్ని రకాల కోటా అనుమతిస్తారు. ఇందుకోసం పరిమిత సంఖ్యలో రిజర్వేషన్ కౌంటర్లు (పిఆర్ఎస్) తెరుస్తారు. కాని కౌంటర్ల ద్వారా సాధారణ టికెట్ల బుకింగ్ ఉండదు. 
రాయితీలు :  నాలుగు రకాల దివ్యాంగ రాయితీలు, 11 రకాల రోగుల రాయితీలు ఈ ప్రత్యేక రైళ్లకు అనుమతిస్తారు. 
రద్దు, రిఫండ్ నిబంధనలు :  రైల్వే ప్రయాణికుల (టికెట్ల రద్దు, చార్జీల వాపసు) నిబంధనలు-2015 వర్తిస్తాయి. 
ఇవి కాకుండా ప్రయాణానికి అర్హత లేని కరోనా లక్షణాలున్న వారికి టికెట్ల రిఫండ్ పై ఈ దిగువ నిబంధనలు జారీ చేశారు. అవన్నీ అమలులో ఉంటాయి. 
హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ప్రయాణికులందరికీ స్ర్కీనింగ్ తప్పనిసరి. రోగ లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే రైలులో ప్రవేశించేందుకు లేదా ఎక్కేందుకు అనుమతిస్తారు. 

స్క్రీనింగ్ సమయంలో ప్రయాణికులెవరికైనా అత్యధిక ఉష్ణోగ్రత/  కోవిడ్-19 లక్షణాలేవైనా కనిపిస్తే కన్ ఫర్మ్ డ్ టికెట్ ఉన్నా ప్రయాణానికి అనుమతించరు. అలాంటి సందర్భంగా ఈ దిగువ అంశాల ఆధారంగా చార్జీ పూర్తిగా రిఫండ్  చేస్తారు.
(i) సింగిల్ ప్రయాణికుని పిఎన్ఆర్        
(ii) గుంపు టికెట్ తీసుకున్న ప్రయాణికుల్లో ఎవరైనా ప్రయాణానికి అనర్హులుగా తేలితే వారితో పాటు అదే పిఎన్ఆర్ పై ఉన్న ఇతర ప్రయాణికులు కూడా ప్రయాణించకూడదని నిర్ణయించుకుంటే అందరికీ కూడా పూర్తి రిఫండ్ ఇస్తారు.      
(iii) గుంపు టికెట్ తీసుకున్న ప్రయాణికుల్లో ఎవరైనా ప్రయాణానికి అనర్హులుగా తేలినా వారితో పాటు అదే పిఎన్ఆర్ పై ఉన్న ఇతర ప్రయాణికులు యథాతథంగా ప్రయాణించాలని నిర్ణయించుకుంటే  ప్రయాణం రద్దయిన ప్రయాణికునికి మాత్రం పూర్త చార్జీ రిఫండ్ చేస్తారు.  
ఈ కేసులన్నింటిలోనూ ప్రయాణికునికి ఎంట్రీ/  చెకింగ్/  స్ర్కీనింగ్ పాయింట్లలో సాధారణంగా అమలులో ఉండే విధానానికి  దీటుగానే “ఆ గుంపులో ఒకరు లేదా ఎక్కువ మంది ప్రయాణికులకు కోవిడ్-19 లక్షణాలు కనిపించినందు వల్ల వారు ప్రయాణం చేయలేదని” ప్రత్యేకంగా రాసి  టిటిఇ సర్టిఫికెట్   జారీ చేస్తారు. 
టిటిఇ సర్టిఫికెట్ పొందిన అనంతరం ప్రయాణ తేదీ నుంచి 10 రోజుల్లోగా ప్రయాణం చేయని వారి చార్జీల రిఫండ్ కోరుతూ ఆన్ లైన్ టిడిఆర్ దాఖలు చేస్తారు. టిటిఇ ఇచ్చిన ఒరిజినల్ సర్టిఫికెట్ ను ప్రయాణికులు నిబంధనల ప్రకారం ఐఆర్ సిటిసికి పంపాల్సి ఉంటుంది.  అనంతరం ప్రయాణం చేయని వారందరి టికెట్ ధరను ఐఆర్ సిటిసి తమ కస్టమర్ ఖాతాలో జమ చేస్తుంది.
ఇందుకు వీలుగా కోవిడ్-19 లక్షణాల కారణంగా ప్రయాణం చేయని వారి టిడిఆర్ దాఖలుకు సంబంధించిన నిబంధనల్లో సిఆర్ఐఎస్, ఐఆర్ సిటిసి తగు మార్పులు చేస్తాయి. “అత్యధిక ఉష్ణోగ్రత/  కోవిడ్-19 లక్షణాల కారణంగా ప్రయాణికుల్లో ఒక్కరు/ అందరూ ప్రయాణించేందుకు అనుమతించలేదు అనే ఆప్షన్” అందుబాటులో ఉంటుంది.  
కాటరింగ్ : 
టికెట్ చార్జీలో కాటరింగ్ చార్జీలు చేర్చలేదు. భోజనానికి ముందస్తు బుకింగ్, ఇ-కాటరింగ్ ను రద్దు చేశారు. పాంట్రీ కారు జత చేసిన ఎంపిక చేసిన రైళ్లలో మాత్రం ఐఆర్ సిటిసి చెల్లింపు ప్రాతిపదికన పరిమిత సంఖ్యలో తినే వస్తువులు, ప్యాక్ చేసిన మంచినీరు సరఫరా చేస్తుంది. టికెట్ బుకింగ్ సమయంలోనే ప్రయాణికులకు ఈ సమాచారం అందిస్తారు.
ప్రయాణికులు సొంతంగానే ఆహారం, మంచినీరు తెచ్చుకోవడాన్ని రైల్వే శాఖ ప్రోత్సహిస్తుంది.
రైల్వే స్టేషన్లలోని కాటరింగ్, వెండింగ్ యూనిట్లు (మల్టీపర్పస్ స్టాల్స్, బుక్ స్టాల్స్, ఔషధ విక్రయ శాలలు) తెరిచి ఉంటాయి. ఫుడ్ ప్లాజా, రిఫ్రెష్ మెంట్ గదులు గల చోట్ల వండిన పదార్థాలు తీసుకువెళ్లేందుకు అనుమతిస్తారు తప్ప కూచుని తినే ఏర్పాట్లుండవు.   
లినెన్, దుప్పట్లు :
రైళ్లలో లినెన్, దుప్పట్లు, కర్టెన్ల సదుపాయం ఉండదు. ప్రయాణానికి అవసరమైన లినెన్ ప్రయాణీకులే తెచ్చుకోవాలి. ఇందుకు అనుగుణంగా ఎసి కోచ్ లలో టెంపరేచర్ ను తగు విధంగా ఉండేలా నియంత్రిస్తారు.
వచ్చే పోయే ప్రయాణికులు ఒకరికొకరు ఎదురెదురుగా రాకుండా నివారించేందుకు రైల్వే స్టేషన్లన్నింటిలోనూ వీలైనంత వరకు వేర్వేరుగా ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు ఏర్పాటు చేయాలని జోనల్ రైల్వేలకు ఆదేశాలు జారీ చేశారు. జోనల్ రైల్వే శాఖ స్టేషన్లు, రైళ్లలో భౌతిక దూరం మార్గదర్శకాలు, భద్రత, రక్షణ, పారిశుధ్య నిబంధనలు తుచ తప్పకుండా ఆచరిస్తుంది.
ప్రయాణికులందరూ ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకుని వినియోగించడం తప్పనిసరి. వీలైనంత తేలికపాటి లగేజితోనే ప్రయాణం చేయాలని సూచన. 
ఎంహెచ్ఏ మార్గదర్శకాల ప్రకారం ప్రయాణికులు, రైల్వే స్టేషన్ కు ప్రయాణికులను చేరవేసే, స్టేషన్ నుంచి వారిని తీసుకువెళ్లే డ్రైవర్లను కన్ ఫర్మ్ డ్ ఇ-టికెట్ ద్వారా అనుమతిస్తారు.

 



(Release ID: 1625989) Visitor Counter : 419