పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

'వందే భారత్‌' మిషన్‌ ద్వారా స్వదేశానికి చేరిన 6037 మంది భారతీయులు

మే 7, 2020 నుంచి ఇప్పటివరకు 31 విమానాల ద్వారా సేవలు
తొలిదశలో 14,800 మందిని స్వదేశానికి చేర్చాలన్న లక్ష్యం

Posted On: 12 MAY 2020 2:15PM by PIB Hyderabad

లాక్‌డౌన్‌ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి చేర్చే 'వందే భారత్‌' మిషన్ చురుగ్గా సాగుతోంది. ఈ మిషన్‌ కింద మే 7, 2020 నుంచి ఇప్పటివరకు ‍(5 రోజుల్లో) 31 విమానాలను 'ఎయిర్‌ ఇండియా', 'ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌' నడిపాయి. వీటిద్వారా 6037 మంది భారతీయులను స్వదేశానికి చేర్చాయి.
 

    విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అతి పెద్ద మిషన్‌ 'వందే భారత్'‌. ఇది మే 7, 2020న ప్రారంభమైంది. పౌర విమానయాన, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ మిషన్‌లో పనిచేస్తున్నాయి. 

    'ఎయిర్‌ ఇండియా', 'ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌' కలిసి.., అమెరికా, బ్రిటన్‌, బంగ్లాదేశ్‌, సింగపూర్‌, సౌదీ అరేబియా, కువైట్‌, ఫిలిప్పీన్స్‌, ఈఏయీ, మలేసియా వంటి 12 దేశాలకు 66 విమానాలను నడుపుతున్నాయి. ఇందులో ఎయిర్‌ ఇండియా విమానాలు 42 కాగా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాలు 24. ఆయా దేశాల్లో చిక్కుకుపోయిన 14,800 మంది భారతీయులను మొదటి దశలో ఇవి స్వదేశానికి తీసుకురానున్నాయి.

    భారత ప్రభుత్వం, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్దేశించిన భద్రత, పరిశుభ్రత ప్రమాణాల ప్రకారం వందే భారత్‌ మిషన్‌లోని ప్రతి అంశం కొనసాగుతోంది. ప్రయాణీకులతోపాటు విమాన సిబ్బంది, ఈ మిషన్‌లో పాల్గొంటున్న క్షేత్రస్థాయి సిబ్బందికి సంబంధించిన భద్రతా ప్రాధాన్యంలో ఎలాంటి అలసత్వానికి తావులేకుండా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ), ఎయిర్‌ ఇండియా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విస్తృతమైన, కచ్చితమైన భద్రత ఏర్పాట్లు చేశాయి.



(Release ID: 1623276) Visitor Counter : 292