సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

మే 31, 2020 న జరగాల్సిన‌ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష వాయిదా

Posted On: 04 MAY 2020 3:29PM by PIB Hyderabad

కోవిడ్ -19 మ‌హ‌మ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ రెండవ దశ తరువాత పరిస్థితిని సమీక్షించేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) ఈ రోజు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. లాక్‌డౌన్ పరిమితుల పొడిగింపుల‌ను గమనించి ప్రస్తుతానికి పరీక్షలు మరియు ఇంటర్వ్యూలు తిరిగి ప్రారంభించుట ఇప్ప‌ట్లో సాధ్యం కాదని కమిషన్ ఒక అభిప్రాయానికి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో మే 31 న జరగాల్సిన సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్ష ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షకు స్క్రీనింగ్ పరీక్షగా కూడా పని చేస్తుంది కాబట్టి, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా వాయిదా వేయబడింది. మే 20, 2020 న దేశంలో కోవిడ్‌-19 ప‌రిస్థితిని మ‌రోసారి సమీక్షించిన త‌రువాత ఈ పరీక్షల నిర్వ‌హ‌ణ తాజా తేదీల్ని యూపీఎస్‌సీ ఒక నిర్ణ‌యం తీసుకొని త‌న వెబ్‌సైట్‌లో వాటిని స‌మ‌యానుకూలంగా తెలియజేయ‌నుంది.
ఇప్ప‌టికే ప‌లు ప‌రీక్ష‌లు వాయిదా..
కమిషన్ ఇప్పటికే ఈ క్రింది ప‌రాక్ష‌ల‌ను వాయిదా వేసింది: (ఎ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, 2019 లో మిగిలిన అభ్యర్థులకు వ్యక్తిత్వ పరీక్ష; (బి) ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ / ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్, 2020; (సి) సంయుక్త వైద్య సేవల పరీక్ష కోసం నోటిఫికేషన్, 2020; (డి) కేంద్ర సాయుధ పోలీసు దళాల పరీక్ష, 2020 మరియు (ఇ) ఎన్డీఏ & నావల్ అకాడమీ పరీక్ష, 2020 కొరకు నోటిఫికేషన్. వాయిదా వేసిన పరీక్షలు / పరీక్షలకు తేదీలు నిర్ణయించబడినప్పుడు, అభ్యర్థులకు కనీసం 30 రోజుల ముందుగా నోటీసు ఇవ్వబడుతుంది.



(Release ID: 1620911) Visitor Counter : 211