పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

లాక్‌డౌన్‌ సమయంలో 247 లైఫ్‌లైన్‌ ఉడాన్ విమాన‌ సేవ‌లు దేశ వ్యాప్తంగా దాదాపు 418 టన్నుల వైద్య సామ‌గ్రి రవాణా

Posted On: 16 APR 2020 7:26PM by PIB Hyderabad

దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా అవసరమ‌య్యే వైద్య సరుకులను రవాణా చేయడానికి లైఫ్‌లైన్ ఉడాన్ విమాన సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. ఇందుకు గాను ప్ర‌ధాన భాగ‌స్వామ్య ప‌క్షాల వారితో పౌర విమాన‌యాన శాఖ ఒక కోర్ గ్రూపును ఏర్పాటు చేసింది. కోవిడ్‌-19 వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డికి భారత్ చేస్తున్న పోరుకు మద్దతుగా వైద్య సరుకుల రవాణాకు మార్చి 26 నుండి హబ్ అండ్‌ స్పోక్ లైఫ్‌లైన్‌ సేవలు ప్రారంభించిన‌ట్టుగా పౌర విమాన‌యాన శాఖ ఏడీజీ (మీడియా) రాజీవ్ జైన్ వివ‌రించారు. గురువారం నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో రాజీవ్  జైన్ మాట్లాడుతూ లాక్‌డౌన్ నేప‌థ్యంలో పౌర విమాన‌యాన శాఖ (ఎమ్‌వోసీఏ) చేప‌ట్టిన లైఫ్‌లైన్ ఉడాన్ చొర‌వ గురించి వివ‌రించారు. లాక్‌డౌన్ వేళ ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్, ఐఎఎఫ్ మరియు ప్రైవేట్ సంస్థ‌ల‌కు చెందిన 247 విమానాలను లైఫ్‌లైన్ ఉడాన్ కార్య‌క్ర‌మంలో భాగంగా న‌డిపించి వైద్య సరుకులను రవాణా చేప‌ట్టిన‌ట్టు ఆయ‌న వివ‌రించారు. వీటిలో 154 విమానాలను ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్ల‌కు చెందిన‌వే ఉన్న‌ట్టు తెలిపారు. వీటి ద్వారా ఇప్పటి వరకు 418 టన్నుల కంటే ఎక్కువగానే స‌రుకుల రవాణా చేయబడినట్టు ఆయ‌న వివ‌రించారు. ఇప్పటి వరకు లైఫ్‌లైన్‌ ఉడాన్ విమానాలు ప్ర‌యాణించిన దూరం దాదాపు 2.45 లక్షల కిలోమీటర్ల కంటే ఎక్కువేన‌ని ఆయ‌న వివ‌రించారు.
కీల‌క ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు తోడ్పాటునందించేలా..
ఈశాన్య ప్రాంతం, ఇతర ద్వీప ప్రాంతాలు, కొండ ప్రాంతాల‌తో కూడిన రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించి వైద్య సామాగ్రితో సహా అవసరమైన వస్తువులను పంపిణీ చేయడానికి ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్, ఐఎఎఫ్, ప్రైవేట్ క్యారియర్లు విమానాలను నడుపుతున్నాయ‌ని రాజీవ్  జైన్ వివ‌రించారు. ఎయిర్ ఇండియా, ఐఏఎఫ్ లు జ‌మ్ము కాశ్మీర్‌, లడాఖ్, ఈశాన్య ప్రాంతాలు ఇతర ద్వీప ప్రాంతాల ర‌వాణాకు ప్ర‌ధానంగా సహకరించాయ‌న్నారు. జ‌మ్ము కాశ్మీర్‌, లడాఖ్‌తో స‌హా దేశపు ఈశాన్య ప్రాంతాల‌లో క్లిష్టమైన వైద్య సరుకులు, రోగుల రవాణాకు పవన్ హన్స్ లిమిటెడ్‌తో సహా వివిధ సంస్థ‌ల హెలికాప్టర్ సేవలు పనిచేస్తున్నాయ‌న్నారు.
కృషి ఉడాన్ కింద విదేశాల‌కు వైమానిక సేవ‌లు..
కోవిడ్ నేప‌థ్యంలో అంత‌ర్జాతీయంగా అత్య‌వ‌స‌రాల నిమిత్తం వైమానిక‌ సేవ‌ల‌ను ప్రారంభించారు.  ఔష‌ధాలు, వైద్య ప‌రిక‌రాలు ఇత‌ర కోవిడ్‌-19 ఉప‌శ‌మ‌న స‌రుకుల ర‌వాణా కోసం ఈ నెల 4వ తేదీ నుంచి చైనాకు ప‌రిమితంగా వైమానిక సేవ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. దక్షిణాసియా ప‌రిధిలో
ఎయిర్ ఇండియా సంస్థ కొలంబోకు వైద్య సామాగ్రిని రవాణా చేసింది. కృషి ఉడాన్ కార్యక్ర‌మంలో భాగంగా ఏప్రిల్ 13న ముంబ‌యి మరియు లండన్ మధ్య ఎయిర్ ఇండియా విమాన‌ సేవ‌ల‌ను ప్రారంభించింది. 29 టన్నుల పండ్లు మరియు కూరగాయలను లండన్‌కు తీసుకెళ్లి దాదాపు 15.6 టన్నుల సాధారణ కార్గో సామగ్రితో భార‌త్‌కు ఈ విమానం తిరిగి వచ్చింది. కృషి ఉడాన్ కార్యక్రమం కింద ఎయిర్ ఇండియా తన రెండో విమానాన్ని ఏప్రిల్ 15 న ముంబ‌యి మరియు ఫ్రాంక్‌ఫర్ట్ మధ్య న‌డిపింది. 27 టన్నుల సీజ‌న‌ల్ పండ్లు మరియు కూరగాయలను ఫ్రాంక్‌ఫర్ట్‌కు తీసుకెళ్లిన ఈ విమానం దాదాపు 10 టన్నుల సాధారణ సరుకుతో తిరిగి అక్క‌డి నుంచి భార‌త్‌కు చేరుకుంది.

 



(Release ID: 1615216) Visitor Counter : 173