కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

స్పీడ్ పోస్టు ద్వారా ఔషధాల సరఫరా

Posted On: 13 APR 2020 6:49PM by PIB Hyderabad

ఈ లాక్డౌన్ సమయంలో ఔషధాలను స్పీడ్ పోస్టు ద్వారా గమ్యానికి చేరవేయడానికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని   కేంద్ర ప్రసార/వార్తా, న్యాయ & ఐటి శాఖామాత్యలు శ్రీ రవిశంకర్ ప్రసాద్ పోస్ట్స్ కార్యదర్శికి ఆదేశాలు పంపారు. లాక్డౌన్ సమయంలో ఏ ఒక్కరూ ఔషధాలను పంపడంలోకానీ లేదా గ్రహించడంలో కానీ ఎటువంటి సమస్యలను ఎదుర్కోరాదని అందుకు పోస్టల్ శాఖ సిబ్బంది అందరూ సహకరించాలని కోరారు. ఇందు కోసం రాష్ట్రాల మధ్య మరియు రాష్ట్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేశారని తెలిపారు. కొవిడ్-19 పరీక్షా కిట్లు, వెంటీలేటర్ల వంటి వైద్య పరికరాలు, అత్యవసర ఔషధాలను త్వరితంగా గమ్యస్థానాలకు చేర్చడానికి ఎరుపు రంగు మెయిల్ వ్యాన్లను రవాణా కోసం నియమించారని, వీటిని సరుకు రవాణా చేసే విమానాలతో మరియు ప్రత్యేక పార్శిల్ రైళ్ళతో సమన్వయపరచి వాటిని సమయానికి అందించడానికి కృషిచేస్తున్నామని తెలిపారు. భారతీయ ఔషధ తయారీ సంస్థ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ మరియు ఆన్లైన్ ఫార్మా కంపెనీలతో అనుసంధానం చేసుకుని వేల టన్నుల ఔషధాలు మరియు వైద్య పరికరాలను ఆయా ప్రాంతాలకు చేరవేశామని తెలిపారు. ఈ కార్యక్రమాలతోపాటు, ఆసుపత్రుల వద్దకు మరియు  వ్యక్తిగత వినియోగదారుల కోసం ఔషధాలను సరియైన సమయానికి చేరవేయడానికి పోస్టల్ శాఖ అధికారులు మరియు ఉద్యోగులు నిరంతరం 24 గంటలూ పనిచేస్తూనే ఉన్నారని మంత్రి తెలిపారు.



(Release ID: 1614174) Visitor Counter : 145