వ్యవసాయ మంత్రిత్వ శాఖ

లాక్‌డౌన్ సమయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలను ప్రోత్సహించేలా దేశంలో వివిధ చ‌ర్య‌లు చేప‌ట్టిన వ్యవసాయ, సహకారం, రైతు సంక్షేమ శాఖ

- లాక్‌డౌన్ కాలంలో క్రాప్‌ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించి 1.25 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ ర‌సాయ‌నాల దిగుమ‌తుల‌కు 33 అనుమతులు జారీ చేసిన సీఐబీ అండ్ ఆర్‌సీ
- ఏపీఈడీఏ ద్వారా రవాణా, కర్ఫ్యూ పాస్లు మరియు ప్యాకేజింగ్ యూనిట్లకు సంబంధించిన సమస్యల ప‌రిష్కారం
- బియ్యం, వేరుశనగ, ప్రాసెస్ చేసిన ఆహారం, మాంసం, పౌల్ట్రీ, పాలు, సేంద్రీయ ఉత్పత్తులతో స‌హా అన్ని ప్రధాన ఉత్పత్తుల ఎగుమతులు ప్రారంభం

Posted On: 11 APR 2020 6:55PM by PIB Hyderabad

లాక్‌డౌన్ స‌మ‌యంలో క్షేత్రస్థాయిలో రైతుల‌కు సౌల‌భ్యంగా ఉండేలా మరియు వ్యవసాయ కార్యకలాపాలను సులభతరం చేయడానికి కేంద్రం వ్యవసాయ సహకారం మరియు రైతు సంక్షేమ శాఖ వివిధ‌ చర్యల‌ను చేప‌డుతోంది. లాక్‌డౌన్ వేళ కేంద్ర క్రిమిసంహారక మండలి & రిజిస్ట్రేషన్ కమిటీ (సీఐబీ & ఆర్‌సీ) త‌న క్రాప్ సాఫ్ట్‌వేర్‌ను గ‌రిష్ట స్థాయిలో ఉపయోగించే ప్రయత్నాలు చేస్తోంది. సంస్థ‌లోని నిపుణులు, అధికారులు త‌మ ఇంటి నుండి వ‌ర్క్‌ఫ్రం హోం విధానంలో ధ్రువపత్రాలు జారీ చేయడానికి వీలుగా వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ను(వీపీఎన్) వినియోగిస్తోంది.
సస్య సంర‌క్షణ రసాయనాలు, పంట‌లు మేటిగా పండేందుకు ఉప‌యోగ‌ప‌డే ర‌సాయ‌నాల ఉత్ప‌త్తి యూనిట్లు, ప్లాంట్‌లు సజావుగా పనిచేయడానికి అవసరమ‌య్యే ధ్రువ‌ప్ర‌తాల‌ను ఈ డిజిట‌ల్ వేదిక‌పై జారీ చేస్తున్నారు. స్వ‌దేశంలో పంట రసాయనాలు, ఇంట‌ర్‌మీడియ‌ట్స్‌, త‌గిన ముడి పదార్థాల దిగుమతికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల జారీకి గాను ఈ ప్రయత్నం గణనీయంగా దోహద ప‌డుతోంది. దేశంలో రైతుల‌కు స‌కాలంలో క్రిమి సంహార‌క మందులు, స‌స్య సంర‌క్ష‌ణ మందులు అందుబాటులో ఉండేలా సీఐబీ & ఆర్‌సీ అన్ని వివిధ మార్గాల‌లో ప‌లు చ‌ర్య‌ల‌ను చేప‌డుతోంది.
వేగంగా ఆన్‌లైన్‌లో అనుమ‌తులు..
- లాక్‌డౌన్ వేళ 1.25 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వివిధ పంట రసాయనాలను దిగుమతికి వీలుగా సీఐబీ & ఆర్‌సీ ఇప్ప‌టి వ‌ర‌కు 33 దిగుమతి అనుమతులను జారీ చేసింది. దీనికి తోడు పురుగు మందుల ఎగుమతిని సులభతరం చేయడానికి ఎగుమతులకు దాదాపు 189 ధ్రువీకరణ పత్రాల‌ను జారీ చేసింది. పురుగు మందుల స్వదేశీ తయారీని సులభతరం చేసేలా వివిధ విభాగాలలో 1263 ధ్రువ‌ పత్రాలు జారీ చేసింది.
16న ఖ‌రీఫ్ పంట‌ల‌పై జాతీయ స‌మ‌వేశం..
లాక్‌డౌన్ స‌మ‌యంలో ఖరీఫ్ పంట నిర్వహణలో ఎదుర‌య్యే సవాళ్లు అవ‌లంభించాల్సిన వివిధ‌ వ్యూహాలపై చ‌ర్చించేందుకు గాను ఈ నెల 16న  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖరీఫ్ పంటలపై జాతీయ సమావేశాన్ని నిర్వహించాలని డిపార్ట్‌మెంట్ నిర్ణయించింది. ఇందులో కేంద్ర వ్యవసాయ మంత్రి, వ్య‌వ‌సాయ శాఖ స‌హాయ మంత్రులు, మంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారులు చర్చలు జరపనున్నారు. ఖరీఫ్ సాగు సమయంలో పంట నిర్వహణ సవాళ్లు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు మరియు వ్యవసాయ యంత్రాలను సకాలంలో లభ్యత, బ్లాక్ స్థాయిలో
పంటల‌ నిర్వహణకు సంబంధించిన ఇతర సమస్యలపై రాష్ట్రాల‌తో చ‌ర్చించి త‌గిన మార్గనిర్దేశం చేయనున్నారు.
అపెడా నేతృత్వంలో వివిధ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం..
- లాక్‌డౌన్ స‌మయంలో పంట ఉత్ప‌త్తుల ర‌వాణా, కర్ఫ్యూ పాస్‌లు, ప్యాకేజింగ్ యూనిట్‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి వ్యవసాయ, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులు ఎగుమతి అభివృద్ధి ప్రాధికారిక సంస్థ (అపెడా) ప‌లు చ‌ర్య‌ల‌ను చేప‌ట్టింది. బియ్యం, వేరుశనగ, ప్రాసెస్ చేసిన ఆహారం, మాంసం, పౌల్ట్రీ, పాలు, సేంద్రీయ ఉత్పత్తులతో స‌హా అన్ని ప్రధాన ఉత్పత్తుల ఎగుమతులు ప్రారంభించింది.
రైల్వే ద్వారా వేగంగా స‌ర‌ఫ‌రా ప‌నులు..
దేశవ్యాప్తంగా నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల సరఫరా నిరంత‌రాయంగా సాగేందుకు గాను భారతీయ రైల్వే
దేశ వ్యాప్తంగా 67 మార్గాల‌లో 236 పార్శిల్‌ స్పెషల్స్ (వాటిలో 171 టైమ్ టేబుల్ పార్శిల్) రైళ్ల‌ను ప్రవేశపెట్టింది. త్వ‌ర‌గా పాడైపోయే ఆస్కారం ఉన్న ఉద్యాన పంట‌ల ఉత్పత్తులు, వ్యవసాయ సాగు ఉత్ప‌త్తులు, పాలు, పాల ఉత్పత్తులను రైతులు, ఎఫ్‌పీఓలు, వ్యాపారులు, త‌యారీ సంస్థ‌లు వేగంగా సరఫరా చేయడానికి రైల్వే చేప‌డుతున్న ర‌వాణా చ‌ర్య‌లు ఎంతో
ఉప‌యుక్తంగా నిలుస్తున్నాయి. రైల్వేలు దేశంలోని ప్రధాన నగరాల మధ్య మరియు రాష్ట్ర ప్రధాన కేంద్రాల‌ నుండి అన్ని ప్రాంతాల మధ్య నిరంత‌రాయంగా స‌రుకుల ర‌వాణా జరిగేలా వివిధ చ‌ర్య‌లు చేప‌ట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ఈ-కామర్స్ సంస్థలు మరియు ఇతర వినియోగదారులకు  త్వరితగతిన రవాణా జ‌ర‌ప‌డాన‌కి గాను రైల్వే పార్శిల్ వ్యాన్లను కూడా ఏర్పాటు చేసింది. పార్శిల్‌
ప్రత్యేక రైళ్లకు సంబంధించిన వివరాలను.. indianrailways.gov.in అనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. 

 



(Release ID: 1613464) Visitor Counter : 193