PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

• దేశంలో కోవిడ్‌-19 తాజా నిర్ధారిత కేసుల సంఖ్య 6,412 కాగా, 199 మరణాలు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడి కోలుకున్న/నయమైన 503 మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు.
• ప్రపంచ మహమ్మారిపై పోరాటంలో మిత్రదేశాలకు శక్తివంచన లేకుండా చేయూతనిస్తాం: ప్రధానమంత్రి
• కోవిడ్‌-19పై పోరులో భాగంగా నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, సామాజిక/మత సామూహిక కార్యకలాపాలను అనుమతించరాదని రాష్ట్రాలకు/కేంద్రపాలిత ప్రాంతాలకు దేశీయాంగ శాఖ ఆదేశాలు.
• పీసీ-పీఎన్‌డీటీ చట్టం అమలు నిలిపివేయలేదు: ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టీకరణ
• వెంటిలేటర్లు, పీపీఈ, టెస్ట్‌ కిట్లు, మాస్కుల దిగుమతిపై కస్టమ్స్‌ డ్యూటీ-హెల్త్‌ సెస్‌ మినహాయింపు

Posted On: 10 APR 2020 7:01PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 

 

కోవిడ్‌-19పై ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి తాజా సమాచారం

దేశవ్యాప్తంగా కోవిడ్‌-19పై తాజా సమాచారం ప్రకారం- నిర్ధారిత కేసుల సంఖ్య 6,412 కాగా- 199 మరణాలు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడి కోలుకున్న/పూర్తిగా నయమైన 503 మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. రోగ నిర్ధారణ పరీక్షల సదుపాయాలు పెరిగిన నేపథ్యంలో 146 ప్రభుత్వ, 67 ప్రైవేటు లేబొరేటరీలు, 16,000కుపైగా నమూనాల సేకరణ కేంద్రాలతో అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు సత్వర నిర్ధారణ కిట్లు మంజూరు కాగా, వాటి కొనుగోలు, వినియోగానికి మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

మరిన్ని వివరాలకు...

ప్రపంచ మహమ్మారిపై పోరాటంలో మిత్రదేశాలకు శక్తివంచన లేకుండా చేయూత: ప్రధానమంత్రి

ప్రపంచ మహమ్మారిపై పోరాటం దిశగా మిత్రదేశాలకు సాధ్యమైనంత మేర చేయూతనిస్తామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌కు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఔషధం సరఫరా చేయాలన్న భారత నిర్ణయంపై ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ట్విట్టర్‌ద్వారా కృతజ్ఞత తెలిపిన నేపథ్యంలో శ్రీ నరేంద్ర మోదీ ఈ మేరకు స్పందించారు.

మరిన్ని వివరాలకు...

కోవిడ్‌-19 నిరోధంలో 11 సాధికార బృందాల కృషిపై పీఎంవో సమీక్ష

కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో సవాళ్ల పరిష్కారం కోసం అధికారులు సభ్యలుగా ఏర్పాటు చేసిన సాధికార బృందాల కృషిని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఇవాళ సమీక్షించింది. ప్రపంచ మహమ్మారిపై పోరులో ప్రస్తుత కృషిపై పీఎంవో పర్యవేక్షణలో భాగంగా వివిధ స్థాయులలో సాగే సమీక్షలలో ఇది తాజా సమావేశం.

మరిన్ని వివరాలకు...

కోవిడ్‌-19పై పోరులో భాగంగా దిగ్బంధం నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు దేశీయాంగ శాఖ ఆదేశం; సామాజిక/మతసంబంధ సామూహిక కార్యకలాపాలను అనుమతించరాదని స్పష్టీకరణ

ఏప్రిల్‌ 2020లో పలు పండుగలు రానున్న నేపథ్యంలో దిగ్బంధం నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను దేశీయాంగ శాఖ ఆదేశించింది. ఈ మేరకు ఎలాంటి సామాజిక/మతసంబంధ సామూహిక కార్యకలాపాలను అనుమతించరాదని స్పష్టం చేసింది.

మరిన్ని వివరాలకు...

భారత-నేపాల్‌ ప్రధానమంత్రుల మధ్య టెలిఫోన్‌ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గౌరవనీయులైన నేపాల్‌ ప్రధానమంత్రి శ్రీ కె.పి.శర్మ ఒలితో టెలిఫోన్‌ ద్వారా సంభాషించారు. ప్రస్తుత కోవిడ్‌-19 సంక్షోభం, దీని ఫలితంగా తలెత్తిన ఆరోగ్య సవాళ్లు, రెండు దేశాల-ప్రాంతీయ పౌరుల భద్రత తదితరాలపై దేశాధినేతలిద్దరూ చర్చించారు. అలాగే ఈ ప్రపంచ మహమ్మారి నిరోధంపై తమతమ దేశాల్లో చేపట్టిన చర్యలపైనా చర్చించారు.

మరిన్ని వివరాలకు...

భారత-జపాన్‌ ప్రధానమంత్రుల మధ్య టెలిఫోన్‌ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గౌరవనీయులైన జపాన్‌ ప్రధానమంత్రి శ్రీ షింజో అబెతో టెలిఫోన్‌ ద్వారా సంభాషించారు. అంతర్జాతీయంగా కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి విసిరిన ఆరోగ్య, ఆర్థిక సవాళ్లపై దేశాధినేతలిద్దరూ చర్చించారు. ఈ సంక్షోభ నివారణకు తమతమ దేశాల్లో చేపట్టిన చర్యలపైనా వారు చర్చించారు.

మరిన్ని వివరాలకు...

ఎన్నడూలేనంత పటిష్టంగా భారత్‌-బ్రెజిల్‌ భాగస్వామ్యం: ప్రధానమంత్రి

భారత్‌-బ్రెజిల్‌ దేశాల భాగస్వామ్యం ప్రస్తుత సంక్షోభ సమయంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. బ్రెజిల్‌కు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ సరఫరా చేయాలన్న భారత్‌ నిర్ణయంపై ఆ దేశాధ్యక్షుడు జైర్‌ ఎం.బొల్సొనారో ట్విట్టర్‌ద్వారా కృతజ్ఞతలు తెలిపిన నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ మేరకు స్పందించారు.

మరిన్ని వివరాలకు...

భారత-పాకిస్థాన్‌, భారత-బంగ్లాదేశ్‌ సరిహద్దులలో రక్షణ ఏర్పాట్లపై సరిహద్దు భద్రత దళంతో కేంద్ర దేశీయాంగ శాఖ మంత్రి సమీక్ష

భారత-పాకిస్థాన్‌, భారత-బంగ్లాదేశ్‌ల మధ్య సరిహద్దుల రక్షణ ఏర్పాట్లపై కేంద్ర దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా సమీక్షించారు. ఈ మేరకు నిన్న దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సరిహద్దు భద్రత దళ కమాండ్‌-సెక్టార్‌ ప్రధాన కార్యాలయాలతో చర్చించారు. కోవిడ్‌-19 పరిస్థితుల గురించి సరిహద్దు ప్రాంతాల రైతులకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. ఆ ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి నిరోధానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా అక్కడి ప్రజలు యథాలాపంగా సరిహద్దులను అతిక్రమించకుండా జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని బీఎస్‌ఎఫ్‌ అధికారులకు సూచించారు.

మరిన్ని వివరాలకు...

వెంటిలేటర్లు, పీపీఈ, కోవిడ్‌ టెస్ట్‌ కిట్లు, ఫేస్‌-సర్జికల్‌ మాస్కుల దిగుమతిపై ప్రాథమిక కస్టమ్స్‌ డ్యూటీ-హెల్త్‌ సెస్‌కు ప్రభుత్వం మినహాయింపు

కోవిడ్‌-19 పరిస్థితుల నేపథ్యంలో వెంటిలేటర్లు ఇతర సామగ్రి తక్షణావశ్యకతను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం కింద పేర్కొన్న సామగ్రి దిగుమతిపై ప్రాథకమి కస్టమ్స్‌ డ్యూటీని, హెల్త్‌ సెస్‌ను తక్షణం మినహాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు వెంటిలేటర్లు, ఫేస్‌-సర్జికల్‌ మాస్కులు, వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ), కోవిడ్‌-19 టెస్ట్‌ కిట్లు తదితరాలతోపాటు వాటి తయారీకి అవసరమైన సరంజామాపైనా మినహాయింపు వర్తిస్తుంది.

మరిన్ని వివరాలకు...

కోవిడ్‌-19 సంబంధిత వైద్యపరికరాల తయారీలోగల ఎంఎస్‌ఎంఈలకు ప్రాధాన్యం ప్రాతిపదికన సదుపాయాలు కల్పించాలి: శ్రీ నితిన్‌ గడ్కరీ

కోవిడ్‌-19 నేపథ్యంలో వ్యాధి వ్యాప్తి, అది విసిరిన ఆర్థిక సవాళ్లపై మన దేశం ఏకకాలంలో రెండు యుద్ధాలు చేయాల్సి ఉందని కేంద్రమంత్రి అన్నారు. కోవిడ్‌-19 వ్యాప్తి కారణంగా గడచిన నెలరోజులలో వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, మాస్కులు, పరిశుభ్ర ద్రవాలు తదితరాలకు హఠాత్తుగా డిమాండ్‌ పెరిగిందన్నారు. దీంతో కొరత ఏర్పడగా, ఈ లోటును పూడ్చేందుకు సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ) రంగం ఈ ఉత్పత్తుల తయారీని పెంచిందని పేర్కొన్నారు. అందువల్ల ఈ కృషిలో నిమగ్నమైన ఎంఎస్‌ఎంఈలకు ప్రాధాన్యం ప్రాతిపదికన సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు.

మరిన్ని వివరాలకు...

జాతీయ ఆహారభద్రత చట్ట పరిధిలో లేనివారికి రాష్ట్ర ప్రభుత్వ రేషన్‌ కార్డులుంటే తక్కువ ధరకు ఆహారధాన్యాల పంపిణీ

జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలోకి రానివారికి రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన రేషన్‌ కార్డులు ఉన్నట్లయితే మూడు నెలలపాటు ప్రతివ్యక్తికీ నెలకు 5కిలోల వంతున ఆహార ధాన్యాలను తక్కువ ధరకు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐని ఆదేశించింది. ఈ మేరకు బియ్యం కిలో రూ.22 వంతున, గోధుమలు కిలో రూ.21వంతున సరఫరా చేయాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు 2020 జూన్‌ 30లోగా ఈ ఆహారధాన్యాల నిల్వలను నెలవారీగా లేదా ఒకేసారి తీసుకోవచ్చని తెలిపింది.

మరిన్ని వివరాలకు...

గర్భధారణకు ముందు-తర్వాత పిండ లింగనిర్ధారణ పరీక్ష నిషేధించే పీసీ-పీఎన్‌డీటీ చట్టాన్ని సస్పెండ్‌ చేయలేదు: కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ

గర్భధారణకు ముందు-తర్వాత పిండ లింగనిర్ధారణ పరీక్షను నిషేధించే పీసీ-పీఎన్‌డీటీ చట్టం అమలును నిలిపివేయలేదని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాబట్టి ఈ చట్టం నిర్దేశిస్తున్న ప్రకారం... ప్రతి అల్ట్రాసౌండ్‌ క్లినిక్‌, జన్యు సలహా కేంద్రం-ప్రయోగశాల, జన్యు క్లినిక్ ఆయా రికార్డులను రోజువారీగా నిర్వహించాల్సిందేనని పేర్కొంది. సదరు రికార్డులను సంబంధిత అధికారులకు సమర్పించే గడువును మాత్రమే 2020 జూన్‌ 30వరకూ పొడిగించినట్లు విశదం చేసింది. అంతేతప్ప పీసీ-పీఎన్‌డీటీ చట్టానికి కట్టుబాటు నిబంధనలను సడలించలేదని స్పష్టీకరించింది.

మరిన్ని వివరాలకు...

రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో కేంద్ర వ్యవసాయ మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నేపథ్యంలో తీసుకున్న పలు నిర్ణయాలపై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలకు సమాచారమిచ్చిన కేంద్ర ప్రభుత్వం

ధరల మద్దతు పథకం (పీఎస్‌ఎస్‌) కింద పప్పులు, నూనెగింజల కొనుగోలు తేదీని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించుకోవచ్చునన కేంద్రం నిర్ణయించింది. అయితే, ప్రారంభ తేదీనుంచి 90 రోజులపాటు కొనుగోళ్లు కొనసాగాలని స్పష్టం చేసింది. అలాగే త్వరగా పాడయ్యే వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు గిట్టుబాటు ధరకు భరోసా ఇచ్చే విపణి జోక్యం పథకం వివరాలను అన్ని రాష్ట్రాలకూ పంపించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేసేట్లయితే కొనుగోలు వ్యయంలో 50 శాతాన్ని (ఈశాన్య రాష్ట్రాల్లో 75 శాతాన్ని) కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.

మరిన్ని వివరాలకు...

పత్రికా-ప్రసార మాధ్యమాలకు రైల్వే మంత్రిత్వ శాఖ సలహా

దిగ్బంధం తర్వాత రైళ్లు నడపడానికి సంబంధించిన వివిధ విధానాలు రూపొందినట్లు పత్రికా, ప్రసార మాధ్యమాలలో రెండు రోజులుగా కథనాలు వస్తున్నాయి. అలాగే నిర్దిష్ట తేదీనుంచి నిర్దిష్ట సంఖ్యలో రైళ్లు బయల్దేరనున్నాయని కూడా పేర్కొంటున్నాయి. అయితే, పైన పేర్కొన్న అంశాలకు సంబంధించి తుది నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉంది.. అందువల్ల ప్రస్తుత అసాధారణ సమయంలో అటువంటి అంశాలకు ప్రాచుర్యం కల్పించడం ప్రజలలో అనవసర, అనివార్య ఊహాగానాలకు తావిస్తుందని స్పష్టం చేసింది.

మరిన్ని వివరాలకు...

దిగ్బంధం నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాలకూ నిత్యావసరాల సరఫరా కొనసాగిస్తున్న రైల్వేశాఖ

రైల్వేశాఖ 2020 మార్చి 23వ తేదీనుంచి ఇప్పటిదాకా సుమారు 6.75 లక్షల వ్యాగన్లదాకా వివిధ వస్తువులను రవాణా చేసింది. ఇందులో 4.50 లక్షల వ్యాగన్ల మేర ఆహారధాన్యాలు, ఉప్పు, చక్కెర, వంటనూనెలు, బొగ్గు, పెట్రో ఉత్పత్తులవంటి నిత్యావసరాలు రవాణా అయ్యాయి. అలాగే 2 ఏప్రిల్‌ 2020 నుంచి ఏప్రిల్‌ 8తో ముగిసిన వారంలో 2,58,503 వ్యాగన్లలో వస్తురవాణా చేయగా, ఇందులో 1,55,512 వ్యాగన్లు నిత్యావసరాలను తీసుకెళ్లాయి.

మరిన్ని వివరాలకు...

అత్యవసర వైద్య సరఫరాల కోసం 1,66,000 కిలోమీటర్లు ప్రయాణించిన180కిపైగా లైఫ్‌లైన్‌ ఉడాన్‌ విమానాలు

కోవిడ్‌-19 దిగ్బంధం కొనసాగుతుండగా ఎయిరిండియా, అలయెన్స్‌ ఎయిర్‌ సంస్థలు 114, భారత వాయుసేన 58 వంతున లైఫ్‌లైన్‌ ఉడాన్‌ విమానాలను నడిపాయి. అలాగే ప్రైవేటు విమాన సంస్థలు కూడా సుమారు 2,675 టన్నుల మేర వైద్య సరఫరాలను రవాణా చేశాయి.

మరిన్ని వివరాలకు...

దేశంలో ఆన్‌లైన్‌ విద్యా పర్యావరణ వ్యవస్థ మెరుగు కోసం సామూహిక ఆలోచనల సేకరణ దిశగా ‘భారత్‌ పఢే అన్‌లైన్‌’ పేరిట ప్రచార వారోత్సవం ప్రారంభించిన హెచ్‌ఆర్‌డి శాఖ

దేశంలో ఆన్‌లైన్‌ విద్యాపర్యావరణ వ్యవస్థకుగల పరిమితులను అధిగమించేందుకు సలహాలు/సూచనలను తమతో నేరుగా పంచుకోవాలని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగాగల మేధావులను కోరుతోంది. ఈ మేరకు ‘భారత్‌ పఢే ఆన్‌లైన్‌’ (#BharatPadheOnline) పేరిట ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. తదనుగుణంగా ట్విట్టర్‌ద్వారా @HRDMinistry, @DrRPNishankసహా bharatpadheonline.mhrd[at]gmail[dot]com ద్వారా 2020 ఏప్రిల్‌ 16దాకా సందేశాలు పంపవచ్చునని సూచించింది.

మరిన్ని వివరాలకు...

కోవిడ్‌-19పై పోరాటంలో భాగంగా 10 రోజులలో 1.37 భవిష్యనిధి చందాదారుల సొమ్ము స్వీకరణ అభ్యర్థనలను పరిష్కరించిన ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ

కేంద్ర కార్మిక-ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ పరిధిలోని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ దేశవ్యాప్తంగా 1.37 లక్షల మేర భవిష్యనిధి చందాదారుల అభ్యర్థనలను 10 రోజుల వ్యవధిలో పరిష్కరించింది. ఈ మేరకు కోవిడ్‌-19పై చందాదారుల పోరాటంకోసం ఈపీఎఫ్‌ పథకం చట్టాన్ని సవరించి కొత్తగా చేర్చిన నిబంధన కింద రూ.279.65 కోట్ల మొత్తాన్ని పంపిణీ చేసింది.

మరిన్ని వివరాలకు...

సందర్శకులకు జలియన్‌వాలాబాగ్‌ స్మారకం మూసివేత 15.06.2020 వరకూ కొనసాగింపు

కోవిడ్‌-19 సంక్షోభం కారణంగా స్మారకం పునర్నవీకరణ పనులు కుంటుపడ్డాయి.

మరిన్ని వివరాలకు...

కోవిడ్‌-19పై పోరు కోసం ఐసీఏఐ, ఐసీఎస్‌ఐ, ఐసీఏఐల నుంచి ‘పీఎం కేర్స్‌’ నిధికి రూ.28.80 కోట్ల విరాళం

కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని మూడు వృత్తినైపుణ్య సంస్థలు- ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ), ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ), ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ)లు కోవిడ్‌-19పై పోరాటం కోసం ‘పీఎం కేర్స్‌’ నిధికి రూ.28.80 కోట్ల విరాళం ప్రకటించాయి.

మరిన్ని వివరాలకు...

కోవిడ్‌-19 సహాయ కార్యక్రమాల కోసం స్థానిక సంస్థలు/ప్రభుత్వాలకు సిపెట్‌ ఇన్‌స్టిట్యూట్లు/కేంద్రాల నుంచి రూ.86.5 లక్షల విరాళం

కోవిడ్‌-19పై పోరాట కృషికి తోడ్పాటుగా కేంద్ర రసాయనాలు-ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్రీయ ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ సంస్థలు రూ.86.5 లక్షల విరాళాన్ని స్థానిక సంస్థలు, పురపాలక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేశాయి.

మరిన్ని వివరాలకు...

కోవిడ్‌-19పై పోరు దిశగా రోగకారక నిర్మూలన దారి, రోడ్డు పరిశుభ్రత పరికరాలకు CSIR-CMERI దుర్గాపూర్‌ ప్రయోగశాల రూపకల్పన

పంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) మహమ్మారిపై పోరులో తనవంతుగా శాస్త్ర-సాంకేతిక పరిష్కారాల అన్వేషణ కృషిని ‘భారత శాస్త్ర-పారిశ్రామిక పరిశోధన మండలి’ (CSIR) ముమ్మరం చేసింది. ఈ మేరకు సంస్థకు చెందిన దుర్గాపూర్‌లోని కేంద్రీయ మెకానికల్‌ పరిశోధన సంస్థ (CMERI) ప్రయోగశాలలో వైరస్‌ బెడదను ఎదుర్కొనే దిశగా కొత్త ఆవిష్కరణలకు రూపమిచ్చింది.

మరిన్ని వివరాలకు...

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • కేరళ: బ్రిటిష్‌ పౌరులు నలుగురు ఇవాళ కోలుకోవడంతో చికిత్స పొందుతున్నవిదేశీయులందరి ఆరోగ్యం బాగుపడింది; కాసరగోడ్‌లో నేడు 15 మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు; నిన్న 12 కొత్త కేసులు నమోదు కాగా, 13 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 258 మంది చికిత్స పొందుతున్నారు.
  • తమిళనాడు: దిగ్బంధాన్ని మరో రెండు వారాలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వైద్యనిపుణుల బృందం సిఫారసు చేసింది. కాగా, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 2 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 7కు చేరింది.
  • కర్ణాటక: ఇవాళ కొత్తగా 10 కేసులు రాగా- ఇందులో మైసూర్‌ 5, బెంగళూరు నగరం 2, రూరల్‌లో 2, కల్బుర్గిలో 1 వంతున నమోదయ్యాయి. దీంతో మొత్తం నిర్ధారిత కేసుల సంఖ్య 207కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఆరుగురు మరణించగా ముగ్గురు కోలుకుని ఇళ్లకు వెళ్లారు.
  • ఆంధ్రప్రదేశ్‌: కోవిడ్‌-19పై పోరాటంలో రాష్ట్రానికి సహకరిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రికి టాటా ట్రస్ట్‌ చైర్మన్‌ రతన్‌ టాటా లేఖ రాశారు. కాగా, కర్నూలులో రోగనిర్ధారణ ప్రయోగశాల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇవాళ ఐసీఎంఆర్‌కు ప్రతిపాదనలు సమర్పించింది. అనంతపురం జిల్లాలో నేడు రెండు కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 365కు చేరగా, 10 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు.
  • తెలంగాణ: రాష్ట్రంలోని వేములవాడలో ఇవాళ ఒక కేసు నమోదైంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 472కు చేరింది. ప్రజలు ఇళ్లనుంచి బయటకు వస్తే మాస్కులు ధరించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
  • గుజరాత్‌: రాష్ట్రంలో గడచిన 12 గంటల్లో 46 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 308కి చేరింది. నగరాలవారీగా- అహ్మదాబాద్‌ 11, వడోదర 17, పటాన్‌ 2, రాజ్‌కోట్‌ 5, కచ్‌ 2, భరూచ్‌ 4, గాంధీనగర్‌ 1, భావ్‌నగర్‌ 4 వంతున కొత్త కేసులు నమోదయ్యాయి.
  • రాజస్థాన్‌: రాష్ట్రంలో ఇవాళ 26 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 489కి చేరింది. కొత్త కేసులలో 25 ఇతరులతో స్పర్శకారణంగా వచ్చినవని తేలింది. మరొకరికి ఎలా సంక్రమించిందీ తెలియాల్సి ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
  • మధ్యప్రదేశ్‌: రాష్ట్రంలోని 15 జిల్లాల్లో 46 ప్రాంతాలను తీవ్ర కరోనా ముప్పు ఉన్నవిగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ జిల్లాల పరిధిలో ఇప్పటివరకూ మొత్తం 75 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం గమనార్హం.
  • మహారాష్ట్ర: దిగ్బంధం ఉత్తర్వుల ఉల్లంఘన ఆరోపణపై డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సంస్థకు చెందిన కపిల్‌ వాధ్వాన్‌సహా ఆయన కుటుంబసభ్యులు, పనివాళ్లు మొత్తం 22 మందిపై మహబలేశ్వర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. నిబంధనల ఉల్లంఘనపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సంస్థ ఇప్పటిదాకా 16 రోగనిరోధక ప్రాతిపదిక సత్వర పరీక్షలను నిర్ధారించింది. వాటిలో 8 సంతృప్తికరంగా ఉన్నట్లు ప్రకటించింది.
  • అరుణాచల్‌ ప్రదేశ్‌: రాష్ట్రంలో 2020 ఏప్రిల్‌ 1 నుంచి ఏడాదిపాటు ప్రజాప్రతినిధులందరి జీతాల్లో 30 శాతం మేర తగ్గించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ నిధులను కోవిడ్‌-19పై పోరాటానికి వినియోగించాలని తీర్మానించింది.
  • అసోం: కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో రంగోలి బిహు వేడుకల సందర్భంగా 5 మంది మాత్రమే జెండా ఎగురవేయాలని రాష్ట్రంలోని బిహు కమిటీలకు డీజీపీ విజ్ఞప్తి చేశారు.
  • మణిపూర్‌: చైనా నుంచి మయన్మార్‌ మీదుగా మణిపూర్‌ చేరుకున్న చురాచండీపూర్‌ యువతిపై దిగ్బంధం నిబంధనను ఉల్లంఘించినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు.
  • మిజోరం: రాష్ట్రంలోని 11 జిల్లాల్లో కోవిడ్‌-19 సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధినుంచి రూ.2.33 కోట్లను ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఇందులో ఐజ్వాల్‌కు అత్యధికంగా రూ.62 లక్షలు కేటాయించారు.
  • మేఘాలయ: రాష్ట్రంలో ముందస్తు అనుమతి లేకుండా కోవిడ్‌-19 నమూనాల సేకరణ, పరీక్షలు చేయరాదని ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీచేసింది.
  • నాగాలాండ్‌: విమాన సర్వీసులు ప్రారంభమైతే రాష్ట్రానికి రావాలని భావించేవారు ఆ సందర్శనను వాయిదా వేసుకోవాలని, లేనిపక్షంలో వారిని దిగ్బంధ పర్యవేక్షణ శిబిరాలకు పంపుతామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక జారీచేసింది.
  • సిక్కిం: ప్రభుత్వంవద్ద పేర్లు నమోదు చేసుకున్న భవన-ఇతర నిర్మాణ పనుల కార్మికుల వ్యక్తిగత ఖాతాలకు రూ.2000 వంతున నగదు బదిలీ చేయనున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ ప్రకటించింది.
  • త్రిపుర: త్రిపురలో విద్యార్థులు ఇళ్లనుంచే విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ మేరకు వివిధ మాధ్యమ సంస్థల సహకారం తీసుకుంటున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపారు.

 



(Release ID: 1613154) Visitor Counter : 179