రైల్వే మంత్రిత్వ శాఖ

నిరంతర లాక్‌డౌన్‌ సమయంలోనూ దేశంలోని అన్ని ప్రాంతాలకూ భారత రైల్వే స‌రుకు ర‌వాణా

- 23 మార్చి నుండి 6.75 లక్షల వ్యాగన్ల స‌రుకు ర‌వాణా ఇందులో దాదాపు 4.50 ల‌క్ష‌ల వ్యాగ‌న్ల‌లో నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల ర‌వాణాయే
- ఆహార ధాన్యాలు, ఉప్పు, చ‌క్కెర‌, వంట నూనెలు, బొగ్గు, పెట్రోలియం ఉత్ప‌త్తులు త‌దిత‌రా ల ర‌వాణా..
- గత ఒక వారంలో 2.5 లక్షలకు పైగా వ్యాగన్ల‌ స‌రుకు లోడింగ్.. ఇందులో 1.55 లక్షలకు పైగా వ్యాగన్లలో నిత్య‌వ‌స‌ర వస్తువులు
- అవసరమైన వస్తువుల స‌రఫ‌రాకు గాను వ్యవసాయం, రసాయనాలు & ఎరువులు, ఆహారం & ప్రజా పంపిణీ వంటి వివిధ మంత్రిత్వ శాఖలతో సన్నిహితంగా పనిచేస్తున్న రైల్వే శాఖ‌

Posted On: 10 APR 2020 4:56PM by PIB Hyderabad

కోవిడ్‌-19 వ్యాప్తిని అరిక‌ట్టే ప్ర‌య‌త్నాల‌లో భాగంగా లాక్‌డౌన్‌ అమ‌లులోకి వ‌చ్చిన నేప‌థ్యంలో ఎదుర‌వుతున్న స‌వాళ్లు, ప్ర‌తికూల ప్ర‌భావాల్ని త‌గ్గించేందుకు ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు ద‌న్నుగా నిలిచేలా.. భార‌తీయ‌ రైల్వే త‌న స‌రుకు ర‌వాణా వ్య‌వ‌స్థ‌ను విస్ర్తృత ప‌రిచింది. నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల స‌ర‌ఫ‌రాను చేప‌డుతోంది. లాక్‌డౌన్‌తో అసాధార‌ణ ప‌రిస్థితుల నేప‌థ్యంలో దేశంలో నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల స‌ర‌ఫ‌రా నిరాటంకంగా సాగేలా కేంద్ర‌ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక శ్ర‌ద్ధను క‌న‌బ‌రుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా వ్యవసాయోత్పత్తులను ఆయా రాష్ట్ర్రాల‌లోనూ, అంతర్-రాష్ట్రాలలోనూ స‌ర‌ఫ‌రా చేయ‌డంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా త‌గిన చ‌ర్య‌లు చేప‌డుతోంది. మార్చి 23 నుంచి భార‌తీయ రైల్వే శాఖ దాదాపు 6.75 ల‌క్ష‌ల వ్యాగ‌న్ల వ‌స్తు ర‌వాణా జ‌రిపింది. ఇందులో దాదాపు 4.50 ల‌క్ష‌ల వ్యాగ‌న్లలో నిత్య‌వ‌స‌ర వ‌స్తువులైన ఆహార ధాన్యాలు, ఉప్పు, చ‌క్కెర‌, వంట నూనెలు, బొగ్గుతో పాటు పెట్రోలియం ఉత్ప‌త్తుల ర‌వాణాయే జ‌ర‌గ‌డం విశేషం.
గ‌త వారం రికార్డు స్థాయిలో..
ఏప్రిల్ 8తో ముగిసిన వారంలో రైల్వే శాఖ మొత్తం 2,58,503 వ్యాగ‌న్లలో వ‌స్తు ర‌వాణా చేప‌ట్టింది. ఇందులో 1,55,512 వ్యాగ‌న్లలో నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల ర‌వాణా జ‌ర‌గ‌డం విశేషం.  
21247 వ్యాగ‌న్ల మేర ఆహ‌ర ధాన్యాలు,11336 వ్యాగ‌న్ల మేర‌ ఎరువులు, 124759 వ్యాగ‌న్ల మేర బొగ్గు, 7665 వ్యాగ‌న్లలో పెట్రోలియం ఉత్పత్తుల ర‌వాణాను భార‌తీయ రైల్వే జ‌రిపింది.
వివిధ మంత్రిత్వ శాఖ‌ల‌తో క‌లిసి..
కోవిడ్ లాక్‌డౌన్ నేప‌థ్యంలో రైతులు ఎటువంటి ప్రతికూల ప్ర‌భావానికి గురికాకుండా ఉండేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప‌లు మినహాయింపులు మరియు సడలింపులను మంజూరు చేసింది.
రాబోయే ఖరీఫ్ సీజనుకు కావాల్సినంత‌గా ఎరువుల సరఫరాకు కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖలోని ఫెర్టిలైజ‌ర్ శాఖ అన్ని చ‌ర్య‌ల‌ను చేప‌డుతోంది. ఎరువుల ఉత్ప‌త్తి, నిల్వ‌ల ల‌భ్య‌త‌, స‌ర‌ఫ‌రా గురించి కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ రాష్ట్ర  ప్ర‌భుత్వాలు, రైల్వే మంత్రిత్వ శాఖ‌తో నిరంతరం సంప్ర‌దింపులు జ‌రుపుతోంది. లాక్‌డౌన్ వేళ భార‌తీయ రైల్వే మ‌రోవైపు ఫుడ్ కార్పోరేష‌న్ ఆప్ ఇండియాతో (ఎఫ్‌సీఐ) క‌లిసి ప‌ని చేస్తోంది. మార్చి 24 నుండి దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మెట్రిక్ ట‌న్నుల‌ ఆహార ధాన్యాలను 800 కి పైగా ర్యాక్‌లను తరలించింది. పెరుగుతున్న ఆహార ధాన్యాల డిమాండ్ మేర‌కు ఎఫ్‌సీఐ దేశ వ్యాప్తంగా గోధుమలు, బియ్యం సరఫరాను గ‌రిష్టంగా భార‌తీయ రైల్వే ద్వారా చేప‌డుతోంది.
దేశ వ్యాప్తంగా 109 టైమ్-టేబుల్ పార్శిల్ రైళ్లు..
త్వ‌రాగా పాడైపోయేందుకు ఆస్కారం ఉన్న ఉద్యాన పంట‌ల ఉత్పత్తులు, విత్తనాలు, పాలు, పాల ఉత్పత్తులతో సహా నిత్యావసరమైన వస్తువులను సరఫరా చేయడానికి గాను భార‌తీయ రైల్వే మొత్తం 109 టైమ్-టేబుల్ పార్శిల్ రైళ్లను ప్రవేశపెట్టింది. లాక్‌డౌన్‌ ప్రారంభం నుండి పార్సెల్ ప్రత్యేక రైళ్ల కోసం సుమారు 59 మార్గాల‌ను (109 రైళ్లు) గుర్తించి త‌గిన చ‌ర్య‌ల‌ను తీసుకుంది. దేశంలోని దాదాపు అన్ని ముఖ్యమైన నగరాల‌కు వస్తువులను వేగంగా రవాణా చేయడానికి వీలుగా రైల్వే వివిధ రూట్ల‌ను అనుసంధానించింది. అవ‌స‌రం మేర‌కు రానున్న రోజుల్లో వీటిని మ‌రింత పెంచేలా రైల్వే చ‌ర్య‌లు చేప‌డుతోంది. 



(Release ID: 1613092) Visitor Counter : 167