హోం మంత్రిత్వ శాఖ

డిల్లిలోని నిజాముద్దీన్ వద్ద జరిగిన ప్రార్ధనా సమావేశానికి హాజరైన తబ్లీగ్ జమాత్ (టిజె) దేశీయ కార్యకర్తలలో కోవిడ్-19 పాజిటివ్ వచ్చినవారిని గుర్తించి, విడిగా ఉంచి మరియు క్వారెంటైన్ శిబిరాలకు పంపడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

తెలంగాణలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు బయటికి వచ్చిన తరువాత దేశంలోని తబ్లీగ్ జమాత్ కార్యకర్తల వివరాలను కేంద్ర హోం శాఖ మార్చి 21వ తేదీన అన్ని రాష్ట్రాలకు తెలియజేసింది
ఇప్పటివరకు 1339 మంది తబ్లీగ్ జమాత్ కార్యకర్తలను నరేలా, సుల్తాన్ పురి మరియు బక్కర్ వాలా క్వారెంటైన్ సౌకర్యాలకు, ఆసుపత్రులకు పంపడం జరిగింది
తబ్లీగ్ జమాత్ విదేశీ కార్యకర్తల వీసాలను రాష్ట్ర పోలీసులు పరిశీలించి వీసా షరతులను ఉల్లంఘించినట్లయితే వారిపైన తదుపరి చర్యలు తీసుకుంటారు

Posted On: 31 MAR 2020 6:00PM by PIB Hyderabad

తెలంగాణలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు బయటికి వచ్చిన తరువాత దేశంలో ఉన్న విదేశీ, భారత తబ్లీగ్ జమాత్ కార్యకర్తల వివరాలను 2020 మార్చి 21వ తేదీన కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు పంపింది. 

 

సమావేశానికి హాజరైన కార్యకర్తలలో  కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయిన వారిని గుర్తించి, విడిగా ఉంచి మరియు క్వారెంటైన్ శిబిరాలకు పంపాలనే  ఉద్దేశంతో కేంద్ర శాఖ సత్వర చర్యలు తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలకు, పోలీసు డైరెక్టర్ జనరళ్ళకు, డిల్లి పోలీసు కమిషనర్ కు సూచనలు జారీచేసింది.  మార్చి 28, 29 తేదీలలో అవే సూచనలను కేంద్ర గూఢచార విభాగం డైరెక్టర్ కూడా అన్ని రాష్ట్రాల పోలీసు డైరెక్టర్ జనరళ్ళకు మళ్ళీ పంపారు. 

ఇదిలా ఉండగా డిల్లీలోని మర్కజ్ లో ఉంటున్న టిజె కార్యకర్తలకు చెప్పి ఒప్పించి  రాష్ట్ర అధికారులు, పోలీసులు వైద్య పరీక్షలకు పంపారు. మార్చి 29 నాటికి దాదాపు 162 మంది టిజె కార్యకర్తలకు వైద్య పరీక్షలు నిర్వహించి క్వారెంటైన్ కేంద్రాలకు పంపడం జరిగింది. ఇప్పటివరకు 1339 మంది తబ్లీగ్ జమాత్ కార్యకర్తలను నరేలా, సుల్తాన్ పురి మరియు బక్కర్ వాలా క్వారెంటైన్ సౌకర్యాలకు,  ఎల్ ఎన్ జె పి, ఆర్ జి ఎస్ ఎస్, జి టి బి, డి డి యు మరియు ఎయిమ్స్, జాజ్జర్ ఆసుపత్రులకు పంపడం జరిగింది.  మిగిలిన వారికి కోవిడ్-19 నిర్ధారణ కోసం వైద్య పరీక్షలు చేస్తున్నారు. 

సాధారణంగా తబ్లీగ్ బృందం సభ్యులుగా ఇండియాకు వచ్చే విదేశీయులు టూరిస్ట్ వీసా పైన వస్తుంటారు. టూరిస్ట్ వీసాపైన వచ్చే వారు మత కార్యక్రమాలలో పాల్గొనరాదని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇదివరకే మార్గదర్శకాలను జారీ చేసింది.  రాష్ట్ర పోలీసులు విదేశీ తబ్లీగ్ కార్యకర్తల వీసాలను పరిశీలించి, వీసా షరతులను ఉల్లంఘించినట్లయితే తదుపరి చర్యలు తీసుకుంటారు. 

నేపధ్యం 

తబ్లీగ్ జమాత్ ప్రధాన కేంద్రం (మర్కజ్) డిల్లీలోని నిజాముద్దీన్ లో ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మరియు విదేశాల నుంచి మత నిష్ఠగల ముస్లింలు మత కార్యకలాపాల కోసం మర్కజ్ సందర్శిస్తుంటారు.  కొంతమంది బృందాలుగా ఏర్పడి తబ్లీగ్ పనుల కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు కూడా వెళ్తుంటారు.  ఇది ఏడాది పొడవునా సాగే ప్రక్రియ. 

మార్చి 21వ తేదీన సుమారుగా 824 మంది తబ్లీగ్ జమాత్ కార్యకర్తలు దేశంలోని వివిధ ప్రాంతాలకు మతప్రచారం కోసం వెళ్లారు.  వారితో పాటు దాదాపు 216 మంది విదేశీ జాతీయులు మర్కజ్ లో బస చేశారు.  వారు కాకుండా 1500 మందికి పైగా భారత తబ్లీగ్ జమాత్ కార్యకర్తలు కూడా మర్కజ్ లో ఉన్నారు.  అదే సమయంలో దాదాపు 2100 మంది భారత తబ్లీగ్ జమాత్ కార్యకర్తలు మత ప్రచారం పని మీద దేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. మార్చి 23వ తేదీన లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి రాష్ట్ర అధికారులు /నిజాముద్దీన్ లో చుట్టుపక్కలతో పాటు డిల్లి అంతటా పోలీసులు నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయడం వల్ల తబ్లీగ్ పని నిలిచిపోయింది. 

ఇండియాలో తబ్లీగ్ కార్యకలాపాలపై పత్రం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 



(Release ID: 1609762) Visitor Counter : 192