ప్రధాన మంత్రి కార్యాలయం
యూనివర్సల్ హెల్త్ కేర్ ను గురించి ఐక్య రాజ్య సమితి లో ప్రధాన మంత్రి వ్యాఖ్యలు
प्रविष्टि तिथि:
23 SEP 2019 11:51PM by PIB Hyderabad
నమస్తే,
మిస్టర్ ప్రెసిడెంట్,
ప్రజా సంక్షేమం తోనే ప్రపంచ సంక్షేమం ఆరంభం అవుతుంది. మరి ఆరోగ్యం అనేది దీని తాలూకు ఓ అతి ముఖ్యమైన భాగం. అందువల్ల ఈ అంశం భారతదేశాని కి గొప్ప ప్రాథమ్యం కలిగినటువంటి అంశం గా ఉన్నది.
మేము దీని విషయం లో నాలుగు స్తంభాల తో కూడిన సంపూర్ణమైన వైఖరి ద్వారా కృషి చేస్తున్నాము. మొట్టమొదటి స్తంభం ముందు జాగ్రత్త చర్యల తో కూడిన స్వస్థత. మేము యోగ, ఆయుర్వేదం మరియు దేహ దారుఢ్యం.. ఈ అంశాల కు ప్రత్యేక శ్రద్ధ వహించాము. మేము 1.25 లక్షల కు పైగా వెల్ నెస్ సెంటర్ లను ఏర్పాటు చేస్తున్నాము.
ఇది మధుమేహం, రక్తపోటు, మానసిక కుంగుబాటు తదితర జీవనశైలి రోగాల నియంత్రణ లో తోడ్పడుతోంది.
అదే పని గా పెరుగుతూపోతున్న ఇలెక్ట్రానిక్ సిగరెట్ (ఇ-సిగరెట్) వ్యామోహం తీవ్ర ఆందోళన ను కలిగిస్తున్నది. గంభీరమైనటువంటి ఈ జాడ్యం బారి నుండి యువతరాన్ని కాపాడడం కోసం భారతదేశం ఇ-సిగరెట్ లపై నిషేధాన్ని విధించింది.
లక్షలాది ప్రాణాల ను కాపాడడం లో మా యొక్క స్వచ్ఛ్ భారత్ అభియాన్ దోహద పడింది.
మేము వ్యాధి నిరోధ కార్యక్రమాని కి కూడా ప్రత్యేక శ్రద్ధ ను తీసుకొంటున్నాము. కొత్త టీకా మందుల చేరిక తో, మేము సుదూర ప్రాంతాల కు సైతం లభ్యత ను మెరుగు పరచాము.
రెండో స్తంభం ఏదంటే అది తక్కువ ఖర్చు లో ఆరోగ్య సంరక్షణ. మేము ప్రపంచం లో కెల్లా అతి భారీదైన ఆరోగ్య హామీ పథకం- ఆయుష్మాన్ భారత్- ను అమలు లోకి తీసుకు వచ్చాము. దీని లో భాగం గా 500 మిలియన్ మంది పేదల కు ప్రతి ఒక్క సంవత్సరాని కి 5 లక్షల రూపాయల వరకు ఉచిత రోగ చికిత్స ను అందించడం జరుగుతోంది. ఒక్క గడచిన సంవత్సర కాలం లోనే 4.5 మిలియన్ మంది దీని ద్వారా లాభపడ్డారు.
మేము అయిదు వేల కు పైగా ప్రత్యేక ఔషధ దుకాణాల ను ప్రారంభించాము. వాటి లో 800కు పైగా అత్యవసర మందులు తక్కువ ధరల కు దొరుకుతున్నాయి.
గుండె కు అమర్చే స్టెంట్ ఖరీదు ను 80 శాతం మేర తగ్గించడం జరిగింది. మోకాలి చిప్ప మార్పిడి ఖరీదు ను కూడా 50 నుండి 70 శాతం మేరకు తగ్గించడమైంది.
మూత్ర పిండం సమస్య లతో బాధపడుతున్న లక్షల మంది భారతదేశం లో డాయేలిసిస్ సదుపాయాన్ని ఉచితం గా పొందుతున్నారు.
ఇక మూడో స్తంభం - సరఫరా లను మెరుగు పరచడం. దీనికోసం మేము భారతదేశం లో నాణ్యమైన వైద్య విద్య మరియు వైద్య సంబంధిత మౌలిక సదుపాయాల కల్పన దిశ గా అనేక చరిత్రాత్మకమైన చర్యల ను తీసుకొన్నాము. వైద్య సంబంధ మౌలిక సదుపాయాల కల్పన రంగం లో మేము సమూల సంస్కరణల ను తీసుకు వచ్చాము.
నాలుగో స్తంభం ఏది అంటే అది.. ఉద్యమ తరహా లో జోక్యం చేసుకోవడం. తల్లులు, పిల్లలు.. వీరు ఇరువురూ ఆరోగ్యం గా ఉంటే, అప్పుడు మొత్తం సమాజాన్ని ఆరోగ్యం గా ఉంచేందుకు ఒక పునాది ని వేసినట్లు అవుతుంది. ఈ కారణం గా మేము నేశనల్ న్యూట్రిశన్ క్యాంపేన్ వంటి కార్యక్రమాల ను ఉద్యమ తరహా లో చేపడుతున్నాము.
టిబి ని 2030వ సంవత్సరం కల్లా అరికట్టాలనేది సుస్థిర అభివృద్ధి లక్ష్యాల యొక్క ధ్యేయాల లో ఒకటి గా ఉంది. దీని ని 2025వ సంవత్సరం నాటికే సాధించాలని మేము తలపోస్తున్నాము. ఈ లక్ష్యాన్ని సైతం మేము సాధిస్తామన్న నమ్మకం నాలో ఉంది.
వాయు కాలుష్యం కారణం గా వచ్చే రోగాలు, అలాగే పశువుల నుండి మనుషుల కు సోకే రోగాల ను నివారించడం కోసం కూడా ఒక ప్రచార ఉద్యమాన్ని మేము ఆరంభించాము.
ఎక్స్లెన్సీస్,
ఆరోగ్యం అంటే రోగాల బారి నుండి బయటపడడం ఒక్కటే కాదు, ఆరోగ్యవంతమైన జీవితం ప్రతి ఒక్కరి హక్కు కూడా. ఇందుకోసం శాయశక్తులా కృషి చేయడం మన ప్రభుత్వాల యొక్క బాధ్యత.
మరి భారతదేశం యొక్క ప్రయత్నాలు కేవలం భారతదేశ సరిహద్దుల కే పరిమితమైనవి కావు. మేము టెలి-మెడిసిన్ ద్వారా అనేక దేశాల లో, ప్రత్యేకించి ఆఫ్రికా ఖండం లోని దేశాల లో, తక్కువ ఖర్చు లో ఆరోగ్య సంరక్షణ అందుబాటు ను పెంచడం కోసం సహకరించాము. ఈ సహకారాన్ని ఇక మీదట కూడా మేము కొనసాగిస్తాము.
మా అనుభవం మరియు మా శక్తియుక్తులు అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాల కు అందుబాటు లో ఉంటాయి.
ఎక్స్లెన్సీస్,
సర్వే భవంతు సుఖినహ,
సర్వే సంతు నిరామయా
అనే భావన తో నేను నా ఈ సంభాషణ ను ముగిస్తాను. దీని కి అర్థం ఏమిటి అంటే.. అందరూ సంతోషం గా ఉండాలి. అందరి కీ రోగ రహితమైన జీవనం లభించాలి.. అని.
అనేకానేక ధన్యవాదాలు.
**
(रिलीज़ आईडी: 1586501)
आगंतुक पटल : 154