మంత్రిమండలి

ఇండోర్ లో మెట్రో రైల్ అనుసంధానానికి ప్రోత్సాహం

బెంగాలీ స్క్వేర్ - విజయ నగర్ - భావర్సల - విమానాశ్రయం - పటాసియా - బెంగాలీ స్క్వేర్ - రింగు మార్గంతో కూడిన ఇండోర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది.

Posted On: 03 OCT 2018 6:57PM by PIB Hyderabad

ఇండోర్ లోని  ప్రధాన ప్రదేశాలు, నగర క్లస్టర్లను కలుపుతూ - 31.55 కిలోమీటర్ల మేర - బెంగాలీ స్క్వేర్ - విజయ నగర్ - భావర్సల - విమానాశ్రయం -  పటాసియా   - బెంగాలీ స్క్వేర్ - రింగు మార్గంతో కూడిన ఇండోర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. 

వివరాలు :

1.   రింగు లైను మార్గం పొడవు 31.55 కిలోమీటర్లు. 

2.  ఈ రింగు లైను మార్గం బెంగాలీ స్క్వేర్ నుండి ప్రారంభమై - విజయ నగర్ -భావర్సల - విమానాశ్రయం - పలాసియా - మీదుగా తిరిగి బెంగాలీ స్క్వేర్ వరకు ఉంటుంది.  

3.  ఈ రింగు లైను లో 30 స్టేషన్లు ఉంటాయి. 

4.  భారీ పట్టణీకరణ నేపథ్యంలో - ఈ ప్రాజెక్టు - అందుబాటు ధరల్లో, నమ్మకమైన, సురక్షితమైన, నిరపాయమైన, అతుకులు లేని నిరంతర రవాణా విధానాన్ని అందజేస్తుంది. దీనివల్ల ప్రమాదాలు, కాలుష్యం, ప్రయాణ సమయం, ఇంధన వినియోగం, అసాంఘిక సంఘటనలు తగ్గడంతో  పాటు - పట్టణ విస్తరణ, సుస్థిర అభివృద్ధి  క్రమబద్దీకరించబడుతుంది.  

5.   నాలుగు సంవత్సరాలలో పూర్తయ్యే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 7,500.80కోట్లు 

ప్రయోజనాలు :

మెట్రో రైలు ప్రాజెక్ట్ ద్వారా 30 లక్షల ఇండోర్ జనాభా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రయోజనం పొందుతారు.   

ఈ మార్గాలు రైలు స్టేషన్, బి ఆర్ టి ఎస్ స్టేషన్లతో అనుసంధానించబడి ఉంటాయి. అలాగే బస్సు, అంతర్గత ప్రజా రవాణా వ్యవస్థ (ఐ పి టి), మోటార్లు లేని రవాణా (ఎన్ ఎమ్ టి) విధానాలతో కూడా అనుసంధానించబడి ఉంటాయి.   రవాణా ఛార్జీలకు అదనంగా - అద్దెలు, వ్యాపార ప్రకటనల వంటి మార్గాలతో పాటు,  ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్ మెంట్ (టి ఓ డి),  అభివృద్ధి హక్కులను బదిలీ చేయడం - (టి డి ఆర్)  వంటి విధానాల  ద్వారా కూడా ఈ ప్రాజెక్ట్ కు ఆదాయం లభిస్తుంది.   

మెట్రో రైల్ మార్గాల వెంబడి ఉండే నివాస ప్రాంతాలు ఈ  ప్రాజెక్ట్ ద్వారా బహుళ ప్రయోజనం పొందుతారు.  ప్రజలు తమ నివాస ప్రాంతానికి దగ్గర నుండి నగరంలోని వివిధ ప్రాంతాలకు ఎంతో సౌకర్యవంతంగా ప్రయాణం చేయగలరు.   

ఈ రింగు లైను - నగరంలో  ఎంతో జనసమ్మర్ధంగా ఉండే  ప్రాంతాలను, ఇప్పుడు కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను - రైల్వే స్టేషన్, విమానాశ్రయంతో అనుసంధానం చేస్తుంది.   ప్రజలు, ప్రయాణీకులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, సందర్శకులకు - ఈ మెట్రో ప్రాజెక్టు - పర్యావరణ హితమైన, సుస్థిరమైన ప్రజా రవాణా విధానాన్ని అందుబాటులోకి తెస్తుంది. 
 
ప్రగతి :
 
*  ఈ ప్రాజెక్టు అమలుకు మధ్యప్రదేశ్ మెట్రో రైల్ కంపెనీ లిమిటెడ్ (ఎమ్ పి ఎమ్ ఆర్ సి ఎల్) అనే ఒక ఎస్ పి వి ఏర్పాటైంది. 

*  ఇండోర్ మెట్రో రైల్ ప్రాజెక్టు కు పాక్షికంగా కేంద్రప్రభుత్వం, అంతే మొత్తంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తాయి.  అదే విధంగా ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏ డి బి), న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు లు పాక్షికంగా ఋణ సహాయం చేస్తాయి. 

* లూయిస్ బెర్గెర్ ఎస్ ఏ ఎస్ సంస్థ జియో డేటా ఇంజనీరింగ్ ఎస్.పి.ఏ సంస్థలతో కూడిన - డి బి ఇంజనీరింగ్ & కన్సల్టింగ్ జి ఎం బి హెచ్ సంస్థను - ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు కు - జనరల్ కన్సల్టెంట్  (జి.సి) గా నియమించారు. 


* ఈ ప్రాజెక్ట్ మొదటి సివిల్ పనులు చేపట్టడం కోసం టెండర్లను ఆహ్వానించారు. త్వరలో పనులు ప్రారంభమౌతాయి. 
 

***



(Release ID: 1548507) Visitor Counter : 139