మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
వారణాసిలో సెప్టెంబర్ 9న తొమ్మిదో రాష్ట్రీయ పోషణ మాసం – 2026ను ప్రారభించనున్న కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి
పోషణ, బాల వికాసం కోసం సమాజ ఆధారిత చర్యల్లో అంగన్వాడీల కేంద్రాలను కీలకంగా మార్చేలా ‘‘హమారీ అంగన్వాడీ హమారీ జిమ్మేదారి’’ ఇతివృత్తం
పోషణ మాసం ప్రధాన ఇతివృత్తంగా సామాజిక యాజమాన్యం, జవాబుదారీతనం
ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ నిర్వహణ కమిటీల ఏర్పాటును, కార్యకలాపాలను వేగవంతం చేసే ఇతివృత్తం
సవరించిన ఎస్ఎన్పీ మార్గదర్శకాలతో వేగాన్ని సంతరించుకున్న ఈ ఏడాది ప్రచారం: మార్గదర్శకాల్లో మొదటిసారి వేడి భోజనానికి నిర్వచనం, ఎస్ఎన్పీ బోర్డుల ఏర్పాటు తప్పనిసరి, అంగన్వాడీ నిర్వహణ కమిటీల ఏర్పాటుకు సూచనలు
దశాబ్దంగా మాతృ పోషణ, ఆరోగ్యానికి తోడ్పాటునిస్తున్న ప్రసూతి ప్రయోజన కార్యక్రమమైన ప్రధానమంత్రి మాతృవందన యోజనకు పదేళ్లు పూర్తయిన సందర్భాన్ని నిర్వహిస్తున్న పోషణ మాసం–2026
వికసిత్ భారత్–2047కు పునాదిగా సుపోషిత్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో నెల రోజుల ప్రచార నిర్వహణ
నాడు పోస్టు చేయడమైనది:
07 SEP 2026 10:46AM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రుద్రాక్ష ఇంటర్నేషనల్ కోపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో 2026 సెప్టెంబర్ 9న తొమ్మిదో రాష్ట్రీయ పోషణా మాసం–2026ను కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రారంభిస్తుంది. నెల రోజులు నిర్వహించే ఈ ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి ప్రారంభిస్తారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి సావిత్రి ఠాకూర్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి, పోషణ మంత్రి శ్రీమతి బేబీ రాణి మౌర్య ఈ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల ఉన్నతాధికారులు, అభివృద్ధి భాగస్వాములు, క్షేత్రస్థాయి అధికారులు, లబ్ధిదారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
వికసిత్ భారత్ – 2047 లక్ష్యానికి పునాదిగా సుపోషిత్ భారత్ను నిర్మించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత అందిస్తున్న మార్గదర్శకత్వంలో పోషణ అభియాన్ను చేపడుతున్నారు. జాతీయ అభివృద్ధి అజెండాలో పోషణకు ముఖ్యమైన స్థానాన్ని అందించేందుకు 2018లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి సెప్టెంబరులో రాష్ట్రీయ పోషణ మాసాన్ని పాటిస్తారు. ఇది ప్రారంభమైన నాటి నుంచి మహిళలు, బాలలు, కిశోర దశలో ఉన్నవారి పోషణనూ, ఆరోగ్యాన్నీ, సరంక్షణనూ బలోపేతం చేయడంలో సమాజాన్ని ఏకం చేసే ప్రజా కార్యక్రమంగా రూపుదిద్దుకుంది. ‘‘హమారీ అంగన్వాడీ హమారీ జిమ్మేదారి’’ అనే ఇతివృత్తంతో ఈ ప్రయాణాన్ని ఈ తొమ్మిదో సంచిక ముందుకు తీసుకెళుతుంది. దేశంలోని చిన్నారులకు పోషణ, ఆరోగ్యం, సంరక్షణ, ప్రాథమిక విద్యకు తొలి కేంద్రంగా ఉన్న అంగన్వాడీ కేంద్రం పట్ల ప్రతి పౌరుడూ బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిస్తోంది.
మిషన్ సాక్షం ఆంగన్వాడీ, పోషణ్ 2.0 పరిధిలో సవరించిన సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ (ఎస్ఎన్పీ) మార్గదర్శకాలతో ఈ ఏడాది ప్రచారం మరింత వేగం సాధించింది. తొలిసారిగా వేడి భోజనాన్ని ఈ మార్గదర్శకాలు నిర్వచించాయి. అలాగే ఎస్ఎన్పీ బోర్డులను తప్పనిసరి చేశాయి. అదే విధంగా అంగన్వాడీ నిర్వహణ కమిటీల ఏర్పాటుకు సైతం సూచనలను అందించాయి. ఈ సంస్కరణల ఆధారంగా పరస్పరం బలోపేతం చేసుకొనే అయిదు అంశాలపై ఆధారపడి పోషణ మాసం – 2026 ముందుకు సాగుతుంది.
మొదటి అంశం... ఆహార వైవిధ్యం, తగినంత ప్రొటీన్. దీని ద్వారా అన్ని ఆహార గ్రూపులకు సంబంధించి చవకగా, స్థానికంగా లభించే పదార్థాలను ఉపయోగించి ఆరోగ్యకరమైన వంటకాల ప్రదర్శనలు నిర్వహిస్తారు. అదే సమయంలో సమతుల ఆహారాన్ని, రోజువారీ ఆహారంలో వృక్ష, జంతు సంబంధ ప్రొటీన్ను చేర్చుకొనే ఆచరణాత్మక మార్గాలను పోషణ మేళాలు, ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాల ప్రచారం ప్రోత్సహిస్తాయి.
రెండో అంశం.. అంగన్వాడీ కేంద్రాల్లో వేడివేడిగా తాజా భోజనం. రాగులు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, కాలానుగుణ తాజా కూరగాయలను ఉపయోగించి వారానికి మెనూని తయారు చేసేలా రాష్ట్రాలు, యూటీలను ప్రోత్సహిస్తున్నారు. తల్లిదండ్రులు, పంచాయతీలు, స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్జీ), అంగన్వాడీ నిర్వహణ కమిటీల (ఏఎంసీలు) భాగస్వామ్యంతో నిర్వహించే ప్రత్యక్ష వంట ప్రదర్శనలు, కమ్యూనిటీ టేస్టింగ్ సెషన్స్ ద్వారా ప్రజల్లో అవగాహన పెరుగుతుంది.
ఈ సేవలందించటంలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచటానికి కమ్యూనిటీ యాజమాన్యం, జవాబుదారీతనాన్ని పోషణ మాసం మూడో ముఖ్యమైన అంశంగా గుర్తించింది. జూన్ 25, 2026న మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం… దేశవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ నిర్వహణ కమిటీల (ఏఎంసీల)ను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి, అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఈ అంశం తోడ్పడుతుంది. సేవల తీరును సమీక్షించేందుకు, సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించటానికి పోషణ మాసంలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో కనీసం ఒక ఏఎంసీ సమావేశాన్ని నిర్వహిస్తారు. రోజువారీ మెనూ, హక్కుల గురించి అందరికీ తెలిసేలా అనుబంధ పోషకాహార కార్యక్రమం (ఎస్ఎన్పీ) మెనూ బోర్డులను ప్రతీ కేంద్రంలో ప్రదర్శిస్తారు. భోజనం నాణ్యతను, మెనూ అమలు తీరును ఏఎంసీలు, తల్లుల కమిటీలు పర్యవేక్షిస్తాయి.
పోషణ మాసం నాలుగో అంశం... తీసుకునే ఆహారాన్ని బట్టి.. పిల్లల్లో నేర్చుకునే సామర్ధ్యం అలవడుతుంది. పోషణ, ప్రాథమిక వికాసం, విద్య వంటివి పిల్లల ఆరోగ్యం, అభివృద్ధి, అభ్యాసాన్ని తొలినాళ్లలోనే పెంపొందించటంపై దృష్టి సారిస్తాయి. పుట్టినప్పటి నుంచి మూడేళ్ల వయసు గల పిల్లల కోసం అంగన్వాడీ కార్యకర్తలు నవచేతన మార్గదర్శకత్వంలో సవరించిన గృహ సందర్శన షెడ్యూల్ సహకారంతో ప్రతీ ఇంటిని సందర్శించి కుటుంబాలను కలుస్తారు. తద్వారా సంరక్షణ, వయసుకు తగిన కార్యకలాపాల ద్వారా ప్రాథమిక వికాసాన్ని ప్రోత్సహించే సందేశాలను అందిస్తారు. 34 అభివృద్ధి ఘట్టాలను పరిశీలిస్తారు. పోషణ మాసం సమయంలో నమోదు చేసుకున్న మూడేళ్ల వయసున్న పిల్లలకు సంబంధించి కీలక అంశాలను నమోదు చేసేందుకు అంగన్వాడీ కేంద్రాలు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. ఆరోగ్య శాఖ, రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే) సహకారంతో గ్రామ ఆరోగ్య పారిశుద్ధ్య, పోషకాహార దినోత్సవాల (వీహెచ్ఎస్ఎన్డీలు) సందర్భంగా వైద్య సహాయం అవసరమైన పిల్లలను గుర్తించి మెరుగైన చికిత్స కోసం పంపిస్తారు. మూడు నుంచి ఆరేళ్ల లోపు పిల్లలకు ఆధార్శిల, ఆటల పద్ధతుల ద్వారా అంగన్వాడీ కేంద్రాలు ప్రాథమిక వికాసానికి మద్దతిస్తాయి. పోషణ మాసంలో భాగంగా మూడు నుంచి ఆరేళ్ల వయసు పిల్లలు నేర్చుకున్న విషయాలను ప్రదర్శించేందుకు తల్లిదండ్రులు, పిల్లల భాగస్వామ్యంతో ప్రతి అంగన్వాడీ కేంద్రం వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రారంభ బాల్య సంరక్షణ, విద్యా దినోత్సవాన్ని జరుపుతుంది. ప్రతీ కేంద్రం అయిదు నుంచి ఆరేళ్ల వయసు గల పిల్లలను సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు తీసుకెళ్తుంది. బొమ్మలు, ఆట, అభ్యాస వస్తువుల కోసం ప్రజల సహకారంతో వనరుల సమీకరణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. పోషకాహారం, శిశు సంరక్షణ పద్ధతులపై కమ్యూనిటీ క్విజ్ పోటీలను ఈ కేంద్రాలు నిర్వహిస్తాయి. సంప్రదాయ శిశు సంరక్షణ పద్ధతులు, నవజాత శిశువుల సంరక్షణ, తల్లిదండ్రులు- శిశువుల కలయికపై ఐఈసీ వీడియోలను ప్రదర్శిస్తాయి.
ప్రధానమంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై) పదేళ్ల ప్రస్థానాన్ని పోషణ మాసం-2026 ఉత్సవంగా జరుపుకుంటుంది. దశాబ్ద కాలంగా మాతృ పోషణ, ఆరోగ్య సంరక్షణ పద్ధతులకు మద్దతుగా నిలిచిన ప్రముఖ ప్రసూతి ప్రయోజన పథకమే అయిదో ముఖ్యమైన అంశం. అర్హులైన గర్భిణులు, బాలింతలను 100 శాతం నమోదు చేస్తారు. ప్రత్యక్ష నగదు బదిలీలను వేగవంతం చేస్తారు. రాష్ట్రాలు, యూటీల వారీగా స్థానిక అవసరాలకు అనుగుణంగా పీఎంఎంవీవై టూల్కిట్ను ప్రారంభిస్తారు.
ప్రారంభ కార్యక్రమ విశేషాలు
ప్రముఖులు పోషణ్ మేళాను సందర్శించటం, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. వేడివేడి భోజనం ఇంటింటికీ రేషన్, ప్రతి ఇంటిని సందర్శించటం, ఈసీసీఈపై లబ్ధిదారుల అనుభవాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శిస్తారు. ఆ తర్వాత కేంద్రమంత్రితో అంగన్వాడీ కార్యకర్తలు నేరుగా మాట్లాడతారు. పదేళ్ల పీఎంఎంవీవై, పోషణ మాసం-2026 ప్రారంభాన్ని సూచించే లఘు చిత్రాల ప్రదర్శన అనంతరం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, యూటీల్లోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, పంచాయతీలు, గృహాల వద్ద సామాజిక కార్యక్రమాల ద్వారా రాష్ట్రీయ పోషణ మాసం-2026ను నిర్వహిస్తారు. ప్రతి బిడ్డకు పోషకాహారం అందించటం ప్రతి పౌరుడి బాధ్యత అని, వికసిత్ భారత్ నిర్మాణానికి ఇది కీలకమని ఈ కార్యక్రమం తెలియజేస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2307616)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4