హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మాదక ద్రవ్యాల నిరోధంపై గోవా రాజధాని పనాజిలో హోంమంత్రి శ్రీ అమిత్ షా మీడియా సమావేశం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, 2029 నాటికి ‘మాదకద్రవ్యాల రహిత భారత్‘ సంకల్పాన్ని నెరవేరుస్తాం
దేశం నుంచి నక్సలిజాన్ని నిర్మూలించిన తరహాలోనే, మత్తుపదార్థాల సమస్యను కూడా నిర్మూలిస్తాం
‘మత్తుపదార్థాలు లేని భారతదేశం’ సాధన కోసం జూలై 2026 నుంచి జూలై 2029 వరకు మూడేళ్ల కార్యాచరణ ప్రణాళిక
నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ కాలపరిమితితో కూడిన వ్యవధిలో సాధించాలనే దృఢ సంకల్పంతో ఉన్నాం
‘మాదకద్రవ్య రహిత భారత్‌’ కోసం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక నాలుగు ప్రధాన స్తంభాలపై ఆధారపడి ఉంది - నిఘా సమాచారం - ఆపరేషన్‌ ఆధారిత అమలు, మాదకద్రవ్యాల తయారీలో ఉపయోగించే రసాయనాలు, సింథటిక్‌ డ్రగ్స్‌ నియంత్రణ, వినియోగం - హాని తగ్గింపు, సామర్థ్య పెంపు - సమన్వయం.
నాలుగంచెల వ్యూహం ద్వారా మాదకద్రవ్యాల ఉత్పత్తి, నిల్వ, అక్రమ రవాణాకు కీలకంగా ఉన్న ప్రాంతాలు, భౌగోళిక ప్రాంతంలో విస్తరించిన మాదకద్రవ్యాల అక్రమ రవాణా మార్గాల (డెత్ ట్రయాంగిల్, డెత్ క్రెసెంట్) ద్వారా దేశంలోకి మత్తుపదార్థాల అక్రమ రవాణాను అరికట్టడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం
మోదీ ప్రభుత్వం మత్తుపదార్థాల వ్యతిరేక పోరాటాన్ని జాతీయ భద్రతా ప్రాధాన్యతాంశంగా చేపట్టింది
విద్యా మంత్రిత్వ శాఖ, యువజన - క్రీడల శాఖలతో పాటు విద్యా సంస్థలు కూడా విద్యా సంస్థలను మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నాయి
ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్, మై భారత్‌ కార్యక్రమాల ద్వారా లక్షలాది మంది ‘నషా ముక్త్‌ భారత్‌ మిత్ర’లను సిద్ధం చేస్తాం
మోదీ ప్రభుత్వం ఆర్థిక విచారణలు, పీఐటీ - ఎన్‌డీపీఎస్ నిబంధనలపై ప్రత్యేక దృష్టితో దిగువ స్థాయి నుంచి పై స్థాయి వరకు, పై స్థాయి నుంచి అట్టడుగు స్థాయి వరకు దర్యాప్తు సరళిలో ఒక నూతన వ్యూహాత్మక విధానాన్ని ప్రవేశపెట్టింది.
2004 నుంచి 2014 వరకు రూ.40,000 కోట్ల విలువైన 26 లక్షల కిలోగ్రాముల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకోగా, 2014 నుంచి 2026 వరకు రూ.1.89 లక్షల కోట్ల విలువైన 1.19 కోట్ల కిలోగ్రాములకు పైగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాం.
నషా ముక్త్ భారత్ అభియాన్ కింద ఇప్పటివరకు 25 కోట్లమంది పౌరులు ప్రతిజ్ఞ చేశారు… చికిత్స, పునరావాస చర్యల ద్వారా 5.70 లక్షల మంది పౌరులు మత్తుపదార్థాల వ్యసనం నుంచి విముక్తులయ్యారు
సామాజిక న్యాయం, ఆరోగ్య, జైళ్ల శాఖలు కలసి మాదకద్రవ్యాల వ్యసన విముక్తి కేంద్రాల సంఖ్యను మూడు రెట్లు పెంచి 1,751కు చేర

నాడు పోస్టు చేయడమైనది: 06 SEP 2026 6:38PM by PIB Hyderabad

మాదక ద్రవ్యాల నియంత్రణపై ఈరోజు గోవా రాజధాని పనాజీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగించారు. గోవా ముఖ్యమంత్రి శ్రీ ప్రమోద్ సావంత్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

శ్రీ అమిత్ షా మాట్లాడుతూ, శ్రీ నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి న దేశ అంతర్గత భద్రతను సుదృఢం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని తెలిపారు. శ్రీ మోదీ ప్రధాని అయ్యే నాటికి దేశం మూడు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటోందని, వాటిలో జమ్మూ కాశ్మీర్‌లో పెరుగుతున్న ఉగ్రవాదం, తీవ్రవాదం, ఈశాన్య ప్రాంతంలో అనేక సాయుధ సంస్థలు సృష్టిస్తున్న తీవ్రమైన అశాంతి ముఖ్యమైనవని ఆయన పేర్కొన్నారు. దీనికి తోడు, అంతర్గత భద్రత పరంగా వరుస బాంబు పేలుళ్లతో దేశం తీవ్ర అశాంతికి గురైందని ఆయన పేర్కొన్నారు. మహిళల భద్రతకు సంబంధించి కూడా అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు జరిగాయని గుర్తుచేశారు. సరిగ్గా అదే క్లిష్ట సమయంలో శ్రీ మోదీ దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారని తెలిపారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఆయన సమర్థ నాయకత్వంలో పరిస్థితి పూర్తి స్థాయిలో సానుకూలంగా మారిందని హోం మంత్రి స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో 370వ అధికరణ రద్దు తర్వాత వేర్పాటువాద భావన గణనీయంగా తగ్గింది. ఉగ్రవాద రహిత వాతావరణం నెలకొంటూ, ఆ గణాంకాలు క్రమంగా శూన్యానికి చేరువవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి బాటలో వేగంగా పయనిస్తోంది. జమ్మూ కాశ్మీర్‌కు, దేశంలోని ఇతర ప్రాంతాలకు మధ్య ఉన్న భావోద్వేగ దూరాన్ని తొలగించేందుకు చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. ఐదు శతాబ్దాల నాటి నక్సలిజం సమస్య నేడు దాదాపు గతంగా మారిపోయింది. రెడ్‌ కారిడార్‌ ఏర్పాటుకు కలలు కన్న వారిలో అత్యధికులు నేడు ఆయుధాలను వదిలి లొంగిపోతూ జన జీవన స్రవంతిలో కలుస్తున్నారు. ఈశాన్య భారతంలో కూడా దాదాపు 11,000 మంది యువకులు ఆయుధాలను విడిచిపెట్టారు. కేంద్ర ప్రభుత్వం వారితో 14 పైగా ఒప్పందాలపై సంతకాలు చేసింది. ఫలితంగా నేడు ఈశాన్య ప్రాంతం కూడా అభివృద్ధి బాటలో వేగంగా ముందుకు సాగుతోంది. 2019 తర్వాత నేరాలకు పాల్పడి దేశం దాటి విదేశాలకు పారిపోయిన నేరస్థులపై ప్రత్యేక చర్యలు మొదలయ్యాయి. 2019 నుంచి 2026 జూలై వరకు 36 విదేశాల నుంచి 274 మంది పరారీ నేరస్థులను విజయవంతంగా తిరిగి స్వదేశానికి రప్పించాం. వీరిలో ఆర్థిక నేరాలు, తీవ్రవాదం, మత్తుపదార్థాల అక్రమ రవాణా, గ్యాంగ్ వార్‌ల వంటి తీవ్రమైన నేరాలలో ప్రమేయం ఉన్నవారు ఉన్నారు. వీరందరినీ భారతీయ న్యాయస్థానాల ముందు నిలబెట్టారు. గత మూడేళ్లలో పరారీలోని నేరస్థులపై 401 రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ దిశగా ‘భారత్ పోల్’ రూపంలో ఒక నూతన వ్యవస్థను ఏర్పాటు అయింది. 14 పైగా కేంద్ర దర్యాప్తు సంస్థలు, అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాలు ఈ ‘భారత్ పోల్’ వేదికతో అనుసంధానమయ్యాయి. ప్రతి రాష్ట్రానికి చెందిన పరారీలోని నేరస్థులను స్వదేశానికి రప్పించేందుకు ‘భారత్ పోల్’ ద్వారా ఒక అత్యంత వ్యవస్థీకృత యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. 2019 నుంచి 2026 వరకు పరారీలో ఉన్న నేరస్థులకు చెందిన సుమారు రూ. 17,874 కోట్ల విలువైన ఆస్తులను జప్తు లేదా సీజ్ చేశారు. నూతన నేర నియంత్రణ చట్టాలు, న్యాయ సంహితలతో పరారీలో ఉన్న నేరస్థులపై చట్టపరమైన చర్యలు చేపట్టే ప్రక్రియ మరింత సులభతరమయింది.  

సైబర్ నేరాల నిరోధానికి కూడా ఒక క్రమబద్ధమైన యంత్రాంగాన్ని సిద్ధం చేసినట్లు శ్రీ అమిత్ షా తెలిపారు. దీనిని స్వయంగా ప్రధాని మోదీ పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. నేడు సైబర్ నేరాల నుంచి రక్షణ పొందేందుకు '1930' హెల్ప్‌లైన్ ఒక అత్యంత ప్రభావవంతమైన సాధనంగా మారిందని ఆయన అన్నారు. రాష్ట్రాల సహకారంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా మూడు నూతన నేర నియంత్రణ చట్టాలను పోలీస్ స్టేషన్ స్థాయి వరకు విజయవంతంగా అమలు చేయడం సాధ్యపడిందని తెలిపారు. నూతన న్యాయ సంహితలతో పాటు మూడు నేర నియంత్రణ చట్టాలను అత్యల్ప వ్యవధిలోనే సమర్థవంతంగా అమలు చేస్తూ, తక్కువ సమయంలోనే కొత్త న్యాయ సంహితతో పాటు మూడు కొత్త క్రిమినల్‌ చట్టాలను అమలు చేసి, రాష్ట్రంలో నేర నిర్ధారణ రేటును 53.2 శాతానికి పెంచినందుకు గోవా ముఖ్యమంత్రికి, గోవా పోలీసులకు ఆయన అభినందనలు తెలిపారు. అంటే, నమోదైన ఎఫ్ఐఆర్‌లలో నిందితులకు శిక్షలు పడే రేటు సుమారు 30 శాతం పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

 

మత్తుపదార్థాల అక్రమ రవాణా మన భావి తరాలను సర్వనాశనం చేసే ఒక తీవ్రమైన నేరమని శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు. వాటి వ్యాపారం ద్వారా వచ్చే అక్రమ సంపాదనను ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లిస్తున్నారని ఆయన తెలిపారు. నేడు ప్రపంచంలోని అనేక దేశాల్లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయం, మద్దతు అందించే (నార్కో - టెర్రర్) వ్యవస్థ విస్తరించిందని, ఈ క్లిష్టమైన సమస్యతో ప్రపంచమంతా పోరాడుతోందని ఆయన పేర్కొన్నారు.

 

2019 నుంచి మత్తుపదార్థాల వినియోగాన్ని, అక్రమ రవాణాను అరికట్టేందుకు అత్యంత సుదృఢమైన వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా పాత పద్ధతులను మార్చామని, సరఫరా ముఠాలను ఛేదించామని, వారికి నిధులు అందే మార్గాలను దెబ్బతీశామని పేర్కొన్నారు. మత్తుపదార్థాలకు బానిసలైన వారిని ఆ మహమ్మారి నుంచి విముక్తులను చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలను అందించినట్లు వివరించారు. 2014 కంటే ముందు ఈ పోరాటం విడివిడిగా, అరకొరగా సాగిందని, చిన్న చిన్న మొత్తాలలో మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకోవడం, సాధారణ నిందితులను పట్టుకోవడంతోనే సరి పెట్టారని అన్నారు. అయితే 2019 నుంచి మోదీ ప్రభుత్వం ఈ అంశానికి జాతీయ భద్రతలో అత్యున్నత ప్రాధాన్యతనిచ్చిందని ఆయన తెలిపారు. మత్తుపదార్థాల పై పోరాటం కేవలం ఫైళ్లు, వేర్వేరు ఏజెన్సీల చర్యలకే పరిమితం కాకుండా, నేడు జాతీయ స్థాయిలో అత్యంత సమన్వయంతో కూడిన నిరంతర ప్రచారోద్యమంగా మార్పు చెందిందని ఆయన స్పష్టం చేశారు.

2019లో నాలుగు అంచెల నార్కో కోఆర్డినేషన్ సెంటర్ (ఎన్సీఓఆర్డీ) ను ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోం మంత్రి తెలిపారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేక యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ (ఏఎన్‌టీఎఫ్‌) ల ఏర్పాటు కోసం ఒక నమూనాను పంపారు. ఒక జాయింట్ కోఆర్డినేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కేంద్ర ఏజెన్సీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, వారి శాఖల సమన్వయంతో పెద్ద నెట్‌వర్క్‌లు, వాటి అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సంబంధాలు, పనితీరులోని లోపాలను సరిదిద్దడానికి ఒక శాస్త్రీయ పద్ధతిని స్వీకరించారు. మత్తుపదార్థాల బారిన పడిన యువత పునరావాసం కోసం 1933 నెంబర్ తో మానస్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో క్యాడర్‌ను పునర్వ్యవస్థీకరించారు. నిదాన్ పోర్టల్ ద్వారా మత్తుపదార్థాల నేరస్థుల జాతీయ డేటాబేస్‌ను తయారు చేశారు. సీసీటీఎన్ఎస్ డేటా, ఇంటిగ్రేటెడ్ డేటా ఫ్యూజన్ ఉపయోగించి, దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల హాట్‌స్పాట్‌లు, నేరాల సరళి, స్వాధీనాలకు సంబంధించిన డేటా ఆధారిత మ్యాప్‌ను రూపొందించారు. దర్యాప్తులో పై స్థాయి నుంచి కింది వరకు, కింది స్థాయి నుంచి పై వరకు విధానాలతో కూడిన సరికొత్త ప్రక్రియను స్వీకరించారు. ఇప్పుడు చిన్న మొత్తంలో మాదకద్రవ్యాల ప్యాకెట్‌ స్వాధీనం చేసుకున్నా, అది దేశంలో ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. అదే విధంగా, సరిహద్దుల్లో భారీగా మాదకద్రవ్యాల సరుకు పట్టుబడితే, అది చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో యువతకు ఎలా చేరుతుందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ విధంగా మొత్తం మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై రివర్స్‌ దర్యాప్తును ప్రారంభించారు.

 

ఆర్థిక దర్యాప్తుతో పాటు పీఐటీ-ఎన్‌డీపీఎస్‌ చట్టం అమలుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చామని, ఇందుకోసం ఉన్నతస్థాయి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని శ్రీ అమిత్‌ షా తెలిపారు. డార్క్‌నెట్‌, ఎన్‌క్రిప్టెడ్‌ కమ్యూనికేషన్‌, క్రిప్టో లావాదేవీలు, డెడ్‌ డ్రాప్‌ డెలివరీ విధానాలపై సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన దర్యాప్తును ప్రారంభించామని చెప్పారు. ఏఎన్‌టీఎఫ్‌లో ప్రత్యేకంగా ‘డార్క్‌నెట్‌-క్రిప్టో సెల్‌’ ఏర్పాటుకు కూడా చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రీకర్సర్‌ రసాయనాలు, సింథటిక్‌ మాదకద్రవ్యాల నియంత్రణ కోసం అంతర్‌ మంత్రిత్వ శాఖల సమన్వయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇచ్చాయని ఆయన తెలిపారు. ప్రతిపక్షాల పాలనలో 2004 నుంచి 2014 వరకు సుమారు రూ. 40,000 కోట్ల విలువైన 26 లక్షల కిలోగ్రాముల మత్తు పదార్థాలు పట్టుబడ్డాయని శ్రీ షా చెప్పారు. శ్రీ మోదీ నాయకత్వంలో 2014 నుంచి న 2026 వరకు ఈ రికవరీ సుమారు లక్షా 89 వేల కోట్ల విలువైన కోటి 19 లక్షల కిలోగ్రాములు పైగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు. 2004 నుంచి 2014 వరకు 3.36 లక్షల కిలోగ్రాముల మాదకద్రవ్యాలను ధ్వంసం చేయగా, 2014 నుంచి 2026 వరకు 48.68 లక్షల కిలోగ్రాముల మాదకద్రవ్యాలను ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు.

ఎన్సీఓఆర్డీ 10 అపెక్స్ సమావేశాలు, 7 ఎగ్జిక్యూటివ్ సమావేశాలు, 277 రాష్ట్ర స్థాయి సమావేశాలు, 16,798 జిల్లా స్థాయి సమావేశాలు జరిగినట్లు కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా తెలిపారు. అంతర్జాతీయ సహకారం కోసం 46 దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కింద 25 కోట్ల మంది పౌరులను చేర్చి వారితో ప్రతిజ్ఞ చేయించారు. చికిత్స, పునరావాసం కింద 5 లక్షల 70 వేల మంది పౌరులను డ్రగ్స్ బారిన పడకుండా విముక్తి చేశారు. గోవాలో కూడా ఇదే సమయంలో చర్యలు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. మాదకద్రవ్యాల నిర్మూలనకు జూలై 2026 నుంచి జూలై 2029 వరకు మూడేళ్ల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు శ్రీ అమిత్ షా తెలిపారు. నిర్దేశిత వ్యవధిలో అన్ని లక్ష్యాలను సాధించాలని నిర్ణయించారు. మత్తుపదార్థాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటాన్ని దేశంలోనే అతిపెద్ద జాతీయ పోరాటాలలో ఒకటిగా ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. 2047 నాటికి డ్రగ్స్ లేని యువశక్తి వికసిత భారత్‌కు పునాది కావాలన్నదే ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ మిషన్‌ను విజయవంతం చేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. 2026 నుంచి 2029 వరకు కాలాన్ని 'మిషన్ మోడ్'గా ప్రకటించినట్లు చెప్పారు. గడువుల నిర్దేశం జరిగిందని, వివిధ మంత్రిత్వ శాఖలకు జవాబుదారీతనం అప్పగించామని, ఎలాంటి ఫలితాలు రావాలో ఖరారు చేశారని, ప్రతి త్రైమాసికంలో ఫలితాల ఆధారిత సమీక్షలతో పాటు జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తారని పేర్కొన్నారు.ఈ మిషన్ కార్యాచరణ ప్రణాళిక నాలుగు స్తంభాలపై ఆధారపడి ఉందని ఆయన తెలిపారు. మొదటిది - నిఘా, ఆపరేషన్ ఆధారిత అమలు, రెండోది - రసాయనాలు, సింథటిక్ డ్రగ్స్ నిరోధం, మూడోది - వినియోగం, హాని తగ్గింపు, నాలుగోది - సామర్థ్య పెంపుదల, సమన్వయం. ఈ నాలుగు స్తంభాల సమన్వయంతో మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాల ప్రధాన సూత్రధారులపై సమగ్ర సమాచార నివేదికలను సిద్ధం చేయడంతో పాటు, అక్రమ రవాణా వెనుక, ముందు ఉన్న సంబంధాలపై సమన్వయంతో దర్యాప్తు చేపడతామని ఆయన తెలిపారు. వాణిజ్య పరిమాణంలో మాదకద్రవ్యాలు పట్టుబడిన ప్రతి కేసులో ఆర్థిక దర్యాప్తు చేపట్టి, నిందితులపై ఉచ్చు మరింత బిగిస్తామని చెప్పారు. బీఎస్ఎఫ్‌, సీఐఎస్ఎఫ్‌, భారత తీర రక్షక దళం, కస్టమ్స్‌, డీఆర్ఐ సంస్థలు ప్రమాద ఆధారిత తనిఖీ చేపట్టి, భూ సరిహద్దులు, ఓడరేవులు, విమానాశ్రయాలు, కార్గో కేంద్రాల్లో స్కానర్లను ఏర్పాటు చేసి మరింత కట్టుదిట్టమైన నిఘాను కొనసాగిస్తాయని ఆయన తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను సీబీఐ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇంటర్‌పోల్‌ సమన్వయంతో భారత్‌కు తిరిగి తీసుకువస్తాయని కేంద్ర హోంమంత్రి తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఎఫ్ఐయూ), బ్యాంకింగ్‌ వ్యవస్థలు అక్రమ లావాదేవీల ఆర్థిక ఆనవాళ్లను గుర్తిస్తాయని చెప్పారు.

ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్‌, మై భారత్‌ కార్యక్రమాల ద్వారా లక్షలాది మంది ‘నషాముక్తి మిత్ర’లను తీర్చిదిద్దుతామని శ్రీ అమిత్‌ షా తెలిపారు. విద్యా మంత్రిత్వ శాఖ, యువజన వ్యవహారాలు - క్రీడల మంత్రిత్వ శాఖలతో పాటు విద్యా సంస్థలు కూడా విద్యా సంస్థలను మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు సంకల్పిస్తున్నాయని చెప్పారు. సామాజిక న్యాయ శాఖ, ఆరోగ్య శాఖ, జైళ్ల శాఖలు సంయుక్తంగా పనిచేస్తూ, మాదకద్రవ్యాల వ్యసన విముక్తి కేంద్రాల సంఖ్యను మూడు రెట్లు పెంచి 1,751కు చేర్చనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 10 వేల మంది స్వచ్ఛంద కార్యకర్తలు సేవలందించనున్నారని శ్రీ అమిత్‌ షా వెల్లడించారు. సామర్థ్య నిర్మాణంలో భాగంగా, 2027 మార్చి నాటికి ప్రతి రాష్ట్రంలో అన్ని సదుపాయాలతో కూడిన యాంటీ నార్కోటిక్స్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఏఎన్‌టీఎఫ్‌)లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం నుంచి 7 శాతం ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఫోరెన్సిక్‌ నివేదికలు 30 రోజుల్లోగా అందేలా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు చేయనుంది. ఈ నాలుగు స్తంభాల కింద 25 అంశాలు, 200కు పైగా కార్యాచరణ అంశాలను నిర్దిష్ట కాలపరిమితితో అమలు చేసేలా నిర్ణయించినట్లు తెలిపారు.

 

భారత్‌ లోకి విదేశీయులకు స్వాగతం ఉందని, అయితే మాదకద్రవ్యాలతో వస్తే మాత్రం అనుమతి లేదని శ్రీ అమిత్‌ షా స్పష్టం చేశారు. చతుర్ముఖ వ్యూహం ద్వారా మాదకద్రవ్యాల ఉత్పత్తి, నిల్వ, అక్రమ రవాణాకు కీలకంగా ఉన్న ప్రాంతాలు, భౌగోళిక ప్రాంతంలో విస్తరించిన మాదకద్రవ్యాల అక్రమ రవాణా (డెత్ ట్రయాంగిల్, డెత్ క్రెసెంట్) మార్గాల ద్వారా దేశంలోకి మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశం నుంచి నక్సలిజాన్ని ఏ విధంగా తరిమికొట్టామో అదే సంకల్పంతో మాదకద్రవ్యాల సమస్యను కూడా నిర్మూలిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

***


(రిలీజ్ ఐడి: 2307356) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Gujarati , Odia , Kannada , Malayalam