యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
వికసిత్ భారత్ క్విజ్తో ప్రారంభమైన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్-2027
యువతకు ప్రధానమంత్రిని కలిసి, వికసిత్ భారత్ కోసం ఆలోచనలు పంచుకునే అవకాశం
प्रविष्टि तिथि:
19 AUG 2026 4:39PM by PIB Hyderabad
వికసిత్ భారత్ క్విజ్ కార్యక్రమంతో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ (వీబీవైఎల్డీ)-2027 ప్రారంభమైంది. నాయకత్వం, ఆవిష్కరణ, దేశ నిర్మాణానికి సంబంధించి వ్యవస్థీకృత, ప్రతిభ ఆధారిత ప్రయాణంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న యువతకు ఇది అద్భుతమైన అవకాశం. న్యూఢిల్లీలో జరిగే జాతీయ వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్తో ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఎంపికైన యువత ఆలోచనలను ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం లభిస్తుంది.

రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువ నాయకులను తయారు చేయాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా వీబీవైఎల్డీ-2027 కార్యక్రమం ఉంది. రాజకీయ నేపథ్యం లేని ప్రతిభావంతులైన భారత యువతను ప్రజా జీవితంలోకి తీసుకువచ్చేందుకు, ఆలోచనలను పంచుకునేందుకు, దేశ నిర్మాణ ప్రక్రియలో భాగస్వాములను చేసేందుకు ఇది అవకాశాన్ని కల్పిస్తుంది.
వికసిత్ భారత్-2047 సాధించాలనే ఆశయంతో ఉన్న యువతను గుర్తించి, ప్రోత్సహించి, వారికి జాతీయ వేదికను కల్పించటమే ఈ కార్యక్రమం ఉద్దేశం. పారదర్శకమైన, ప్రతిభ ఆధారిత, వివిధ స్థాయులతో కూడిన ప్రక్రియల ద్వారా పాల్గొనేవారు... డిజిటల్ క్విజ్ నుంచి వ్యాసరచన పోటీ, జిల్లా ఛాంపియన్షిప్లు, రాష్ట్ర, యూటీ స్థాయి వీబీవైఎల్డీల ద్వారా జాతీయ స్థాయి వీబీవైఎల్డీకి చేరుకుంటారు.
దేశవ్యాప్తంగా భాగస్వామ్యానికి వికసిత్ భారత్ క్విజ్ ఆహ్వానం
వికసిత్ భారత్ ఛాలెంజ్ మొదటి దశలో మైభారత్ పోర్టల్ ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు వికసిత్ భారత్ క్విజ్ నిర్వహిస్తారు.
15 నుంచి 29 ఏళ్ల వయసు గల భారత యువత ఈ పోటీలో పాల్గొనవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న యువత పాల్గొనేలా డిజిటల్ విధానంలో పలు భాషల్లో ఈ క్విజ్ను నిర్వహిస్తున్నారు.
క్విజ్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 10 శాతం మంది... అంటే, గరిష్ఠంగా నాలుగు లక్షల మంది వరకు తదుపరి దశ వికసిత్ భారత్ వ్యాస రచన పోటీకి ఎంపికవుతారు. అర్హత సాధించిన వారు మైభారత్ పోర్టల్ ద్వారా వికసిత్ భారత్ అంశంపై 500 పదాల వ్యాసాన్ని రాయాల్సి ఉంటుంది.
క్విజ్ నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి ఛాంపియన్ల వరకు
వికసిత్ భారత్ పోటీలు అయిదు దశల్లో ఉంటాయి.
వికసిత్ భారత్ క్విజ్ → వ్యాసరచన పోటీ → జిల్లా ఛాంపియన్షిప్ → రాష్ట్ర, యూటీ వీబీవైఎల్డీ → జాతీయ వీబీవైఎల్డీ
జిల్లా స్థాయి పోటీలో ప్రతీ జిల్లా నుంచి ఉత్తమ 50 వ్యాసాలను అభ్యర్థులు నేరుగా వివరించేందుకు ఎంపిక చేస్తారు. ప్రతీ జిల్లా నుంచి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఇద్దరు అభ్యర్థులు రాష్ట్ర స్థాయి వీబీవైఎల్డీ పోటీకి అర్హత సాధిస్తారు. నవంబర్ 10 నుంచి 16 వరకు జిల్లా స్థాయి పోటీలను నిర్వహిస్తారు.
నవంబర్ 17 నుంచి డిసెంబర్ 7, 2026 వరకు జరగనున్న రాష్ట్ర, యూటీ వీబీవైఎల్డీ... వివిధ వీబీవైఎల్డీ విభాగాలను ఒకచోట చేర్చుతుంది. జిల్లా స్థాయి విజేతలు న్యాయనిర్ణేతల ఎదుట ఆలోచనలను తెలియజేస్తారు. ప్రతిభ ఆధారంగా రాష్ట్ర బృందాలను జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు.
యువ ప్రతిభ, నాయకత్వం, ఆవిష్కరణల ప్రదర్శనకు ఆరు విభాగాలు
ఆరు ప్రధాన మార్గాల ద్వారా భారత యువతకు అవకాశాలను కల్పిస్తున్న వీబీవైఎల్డీ-2027:
వికసిత్ భారత్ ఛాలెంజ్: క్విజ్, వ్యాసరచన పోటీ, ప్రజెంటేషన్ వంటి ఎంపిక ప్రక్రియల ద్వారా వికసిత్ భారత్-2047 కోసం యువత వినూత్న ఆలోచనలు, పరిష్కారాలను వ్యక్తపరచటానికి వీలు కల్పించే ప్రధాన విభాగం.
సాంస్కృతిక విభాగం: జానపద నృత్యం, జానపద గీతం, చిత్ర లేఖనం, ఉపన్యాసం, కవిత్వ రచనలో పోటీలు. భారతదేశ విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని, సృజనాత్మకతను వ్యక్తపరిచేందుకు యువతకు ఇదొక వేదిక.
భారత్ కోసం రూపకల్పన: వినియోగదారుడే కేంద్రంగా ప్రస్తుత ప్రపంచంలోని అభివృద్ధి సవాళ్లకు పరిష్కారాలను రూపొందించటంపై దృష్టి సారించిన జాతీయ రూపకల్పన పోటీ.
సామాజిక ప్రయోజనానికి సాంకేతికత: సామాజిక, అభివృద్ధి సవాళ్లకు విస్తరించదగిన డిజిటల్ పరిష్కారాలను ఆహ్వానించే సాంకేతికత ఆధారిత ఆవిష్కరణల పోటీ.
యువ పారిశ్రామికవేత్తల పోటీ: జాతీయాభివృద్ధి ప్రాధాన్యతలకు అనుగుణంగా అంకురసంస్థల ప్రతిపాదనలు, వ్యాపార ప్రణాళికలను సమర్పించేందుకు యువ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించే వీబీవైఎల్డీ-2027 కోసం నూతన విభాగం.
యూత్ పార్లమెంట్: వీబీవైఎల్డీ-2027కిఅనుసంధానమైనది. దీనిద్వారా జాతీయ ఫైనలిస్టులు జాతీయ వీబీవైఎల్డీలో పాల్గొంటారు.
భారతదేశ అభివృద్ధి ప్రాధాన్యతల పరిష్కారానికి 10 ప్రాంతాల విధానం
వికసిత్ భారత్ పోటీ 10-ప్రాంతాల విధానాన్ని అవలంబిస్తుంది. విభిన్న అభివృద్ధి ప్రాధాన్యతలను, వికసిత్ భారత్-2047 దిశగా భారత ప్రయాణాన్ని ప్రతిబింబించేలా ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన ఇతివృత్తాలు ఉంటాయి.
భవిష్యత్తు పాలన, వాతావరణ భద్రత, డెమోగ్రాఫిక్ డివిడెండ్, స్థిరమైన పారిశ్రామికీకరణ, అనుసంధానత, తయారీ, గిరిజన నాయకత్వం, ఆవిష్కరణలు, సరికొత్త సాంకేతికత, బ్లూ ఎకానమీ వంటి అంశాలు ఈ ఇతివృత్తాల్లో ఉంటాయి.
దేశంలోని వివిధ ప్రాంతాల యువత... వారి ప్రాంతంలోని సవాళ్లను గుర్తించేందుకు, వినూత్నమైన పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు, భారతదేశ అభివృద్ధి ప్రయాణానికి దోహదపడే ఆలోచనలను అందించేందుకు ఈ విధానం సహకరిస్తుంది.
ప్రధానమంత్రి ఎదుట అభిప్రాయాలను వ్యక్తపరిచేందుకు జాతీయ స్థాయి చర్చా వేదిక
జనవరి 10 నుంచి 12, 2027 వరకు న్యూఢిల్లీలో జరిగే జాతీయ వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్తో ఈ పోటీ ముగుస్తుంది.
మొత్తం ఆరు విభాగాల ద్వారా ఎంపిక చేసిన రాష్ట్ర, యూటీ బృందాలు ఈ జాతీయ కార్యక్రమంలో పాల్గొంటాయి. వికసిత్ భారత్ ఛాలెంజ్ ద్వారా ప్రాంతీయ బృందాల ఆలోచనలను సంబంధిత నిపుణులు, కార్యదర్శులు, కేంద్రమంత్రులకు తెలియజేస్తారు. ప్రాంతీయ ఫైనలిస్టులకు ప్రధానమంత్రి ఎదుట ఆలోచనలను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది.
అట్టడుగు స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు యువ నాయకత్వానికి వీబీవైఎల్డీ-2027 మార్గాన్ని కల్పిస్తుంది. వికసిత్ భారత్ క్విజ్తో ప్రారంభమై, వ్యాసరచన పోటీ, జిల్లా, రాష్ట్ర, యూటీ స్థాయి ఛాంపియన్షిప్ ద్వారా ముందుకు సాగుతుంది. ఎంపికైన యువ నాయకులు న్యాయనిర్ణేతలతో కలిసి దేశ భవిష్యత్తు కోసం ఆలోచనలను తెలియజేయటంతో ఈ పోటీ ముగుస్తుంది.
కీలక తేదీలు
వికసిత్ భారత్ క్విజ్: ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు
వికసిత్ భారత్ వ్యాసరచన పోటీ: అక్టోబర్ 5 నుంచి 19, 2026 వరకు
జిల్లా స్థాయి ఛాంపియన్లు: నవంబర్ 10 నుంచి 16, 2026 వరకు
రాష్ట్ర, యూటీ వీబీవైఎల్డీ: నవంబర్ 17 నుంచి డిసెంబర్ 7, 2026 వరకు
న్యూఢిల్లీలో జాతీయ వీబీవైఎల్డీ: జనవరి 10 నుంచి 12, 2027 వరకు
***
(रिलीज़ आईडी: 2301412)
आगंतुक पटल : 2