పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
విశాఖపట్నంలో 2026 ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ స్థాయి వేడుకలు 2026
ఏనుగుల సంరక్షణ, నిర్వహణలో విశేష కృషి చేసిన వారికి గజ గౌరవ పురస్కారాలు 2026 అందజేత
ఏనుగుల సంరక్షణ పట్ల భారత్ నిబద్ధత కేవలం ఒక విధానపరమైన ఎంపిక మాత్రమే కాదు, అది నాగరికత విలువలు, పర్యావరణ బాధ్యతకు ప్రతిబింబం: కేంద్ర సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్
మానవులు-ఏనుగుల సంఘర్షణ కేసుల పరిష్కారంలో ‘ఘర్షణ నుంచి సహజీవనం వైపు’ అనేదే రాష్ట్ర ప్రభుత్వ నినాదం: ఏపీ ఉప ముఖ్యమంత్రి శ్రీ కే పవన్ కల్యాణ్
కేంద్ర సహాయ మంత్రి అధ్యక్షతన ప్రాజెక్టు ఎలిఫెంట్ 23వ స్టీరింగ్ కమిటీ సమావేశం.. ‘మానవ–ఏనుగుల సంఘర్షణ: భారత్లో వివిధ పరిస్థితులు’ అంశంపై వర్క్షాప్ నిర్వహణ
దక్షిణ భారత్లో మనుషుల-ఏనుగుల ఘర్షణను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ప్రాంతీయ కార్యాచరణ ప్రణాళిక విడుదల
प्रविष्टि तिथि:
13 AUG 2026 2:27PM by PIB Hyderabad
నేడు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ప్రపంచ ఏనుగుల దినోత్సవం 2026 సందర్భంగా... జాతీయస్థాయి వేడుకలను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులశాఖ సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులశాఖ కార్యదర్శి శ్రీ తన్మయ్ కుమార్, అటవీ విభాగం డైరెక్టర్ జనరల్, ప్రత్యేక కార్యదర్శి శ్రీ సుశీల్ కుమార్ అవస్థి, ఏడీజీ (వన్యప్రాణి) శ్రీ రమేష్ పాండేలతో పాటు కేంద్ర మంత్రిత్వశాఖ, ఆంధ్రప్రదేశ్ అటవీశాఖకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీరితో పాటు రైల్వే మంత్రిత్వశాఖ అధికారులు, వివిధ రాష్ట్రాల అటవీశాఖల ప్రతినిధులు, శాస్త్రీయ పరిశోధనా సంస్థల నిపుణులు, ఇతర భాగస్వామ్య పక్షాలు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ ఏనుగుల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఏనుగుల ఆవాసాలను రక్షించడానికి, వాటి సుస్థిర భవిష్యత్తు కోసం కృత్రిమ మేధ, రిమోట్ సెన్సింగ్, జియోస్పేషియల్ మ్యాపింగ్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సంప్రదాయ జ్ఞానంతో అనుసంధానిస్తున్నట్లు వివరించారు. మనుషులు-ఏనుగుల ఘర్షణను సమర్థవంతంగా తగ్గించడానికి, స్థానిక ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వివిధ ప్రభుత్వ విభాగాలు పరస్పరం సహకరించుకోవాలని, సమాజ భాగస్వామ్యాన్ని పెంచాలని, శాస్త్రీయ పద్ధతులను అవలంబించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఏనుగుల సంరక్షణ పట్ల భారత్ చూపుతున్న నిబద్ధత కేవలం విధానపరమైన నిర్ణయం మాత్రమే కాదని, అది మన నాగరికతా విలువలు, పర్యావరణ బాధ్యతలకు ప్రతిబింబమని కేంద్రమంత్రి శ్రీ సింగ్ పేర్కొన్నారు. దేశంలో 33 ఏనుగుల అభయారణ్యాలు, శాస్త్రీయంగా గుర్తించిన 150 ఏనుగుల కారిడార్లు ఉన్నాయని, ప్రపంచంలోని అడవి ఆసియా ఏనుగుల జనాభాలో దాదాపు 60 శాతం భారత్లోనే ఉన్నాయని తెలిపారు. ఏనుగుల సంరక్షణలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. మనుషుల-ఏనుగుల సంఘర్షణ సంక్లిష్టమైన సమస్య అని, దీనికి వివిధ వర్గాలను భాగస్వామ్యం చేస్తూ, క్షేత్రస్థాయిలో ధ్రువీకరించిన శాస్త్రీయ సమాచారాన్ని వినియోగించి సమన్వయంతో పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ.. మనుషుల-ఏనుగుల సంఘర్షణ (హెచ్ఈసీ) కేసుల పరిష్కారంలో ‘సంఘర్షణ నుంచి సహజీవనం వైపు’ అనేది ప్రభుత్వ నినాదామని తెలిపారు. ఇది రాష్ట్రాల పరిపాలనా సరిహద్దులకు అతీతమైన ఉమ్మడి బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. వన్యప్రాణుల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన హనుమాన్ (వన్యప్రాణుల పర్యవేక్షణ, సహాయం, సంరక్షణ కోసం చికిత్స, పోషణ కేంద్రాలు-హెచ్ఏఎన్యూఎంఏఎన్) కార్యక్రమాన్ని ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. రాష్ట్రంలో వన్యప్రాణులను రక్షించడంలో ఆధునిక సాంకేతికతను వినియోగించడంతో పాటు స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నామని, క్షేత్రస్థాయిలో పనిచేసే అటవీ సిబ్బంది సామర్థ్యాలను పెంపొందిస్తున్నామని తెలిపారు.
జాతీయ వేడుకల్లో భాగంగా ఏనుగుల సంరక్షణ, నిర్వహణలో విశేష కృషి చేసిన వారికి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ గజ గౌరవ్ అవార్డులు 2026ను ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో 2020-2026 కాలంలో ప్రాజెక్టు ఎలిఫెంట్ కింద చేపట్టిన 30 ముఖ్య విజయాలను, ఏనుగుల సంరక్షణ చర్యలను వివరిస్తూ ‘30 జెయింట్ స్టెప్స్’ను విడుదల చేశారు. 1992లో కేంద్ర ప్రాయోజిత పథకంగా ప్రారంభమైన ప్రాజెక్టు ఎలిఫెంట్ మూడు దశాబ్దాలకు పైగా ఏనుగులు, వాటి ఆవాసాలు, ఏనుగుల కారిడార్ల సంరక్షణతో పాటు మనుషులు–ఏనుగుల సంఘర్షణను పరిష్కరించడం, మానవ సంరక్షణలో ఉన్న ఏనుగుల సంక్షేమం కోసం కృషి చేస్తోంది.
దక్షిణ భారత్లో (కర్ణాటక, కేరళం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు) మనుషులు-ఏనుగుల సంఘర్షణ సమగ్ర అవగాహన, నిర్వహణ కోసం ప్రాంతీయ కార్యాచరణ ప్రణాళికను ఆవిష్కరించారు. ప్రాజెక్టు ఎలిఫెంట్ కింద దక్షిణ ప్రాంతాల్లో ఏనుగులు సంచరించే రాష్ట్రాలు, శాస్త్రీయ సంస్థలు, నిపుణులతో సంప్రదింపులు జరిపి ఈ ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రాంతాల్లో మనుషుల-ఏనుగుల సంఘర్షణను సమగ్రంగా పరిష్కరించేందుకు విస్తృత స్థాయి విధానాన్ని ఈ ప్రణాళిక అవలంబిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అందించే రూ.500 కోట్ల మద్దతుతో రూపొందిన ఈ ప్రణాళికలో ఆవాసాల అనుసంధానం, కారిడార్ల సంరక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, సంఘర్షణ నివారణ మౌలిక వసతులు, ఆవాసాల పునరుద్ధరణ, ప్రజల భాగస్వామ్యం, పరిశోధన, పర్యవేక్షణ, తక్షణ స్పందన వ్యవస్థలు, సామర్థ్య పెంపు, రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై దృష్టి సారించనున్నాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా భారత్లో ఏనుగుల సంరక్షణకు మూడు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ‘జర్నల్ ఆఫ్ వైల్డ్లైఫ్ సైన్స్’ ప్రత్యేక సంచికను విడుదల చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఏనుగుల సంరక్షణకు సంబంధించి రూపొందిన శాస్త్రీయ పరిజ్ఞానం, పరిశోధనలను ఈ ప్రత్యేక సంచికలో పొందుపరిచారు. ప్రాజెక్టు ఎలిఫెంట్ కింద భవిష్యత్తులో ఏనుగుల సంరక్షణ, నిర్వహణకు ఇవి ఉపయోగపడనున్నాయి. మధ్య భారత్లో ఏనుగుల విస్తరణ, స్థితిగతులు, మనుషులు-ఏనుగుల సంబంధాలకు సంబంధించిన కీలక చారిత్రక వివరాలను ఇది అందించే ‘1947కి ముందు మధ్య భారత్లో ఆసియా ఏనుగులు’ పేరుతో రూపొందించిన మోనోగ్రాఫ్ను కూడా విడుదల చేశారు.
విశాఖపట్నంలో శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ అధ్యక్షతన ప్రాజెక్టు ఎలిఫెంట్ 23వ స్టీరింగ్ కమిటీ సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో ఏనుగుల సంరక్షణ, నిర్వహణకు సంబంధించిన ప్రస్తుత సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ‘ది ట్రంపెట్’ 6వ సంపుటి, 1వ సంచిక, నీలగిరి ఏనుగుల సంరక్షణ ప్రాంతం కోసం నమూనా ఏనుగుల సంరక్షణ ప్రణాళిక, ‘క్యాప్టివ్ ఎలిఫెంట్ హస్బెండ్రీ: సైన్స్, వెల్ఫేర్, ప్రాక్టీస్’ (మానవ సంరక్షణలో ఏనుగుల పెంపకం: శాస్త్రం, సంక్షేమం, ఆచరణ), మనుషులు- ఏనుగుల సంఘర్షణ అధ్యయనం రెండో దశను విడుదల చేశారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ అధ్యయనం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాలు శాస్త్రీయంగా ఏనుగుల సంరక్షణ, మానవ రక్షణలోని ఏనుగుల సంక్షేమం, విస్తృత స్థాయిలో మనుషులు-ఏనుగుల పరస్పర ఘర్షణల నివారణ మరింత బలోపేతం చేయనున్నాయి.

ఈ జాతీయ వేడుకల్లో భాగంగా ‘మానవ–ఏనుగు సంఘర్షణ: భారత్లో వివిధ పరిస్థితులు’ అనే అంశంపై వర్క్షాప్ను కూడా నిర్వహించారు. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లోని రాష్ట్రాలకు చెందిన నియంత్రణ అధికారులు, శాస్త్రీయ సంస్థలు, క్షేత్రస్థాయి సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. శాస్త్రీయ ఆధారాలు, దీర్ఘకాలిక సమాచార గణాంకాలు, క్షేత్రస్థాయి అనుభవాల ఆధారంగా మనుషులు-ఏనుగు దాడి ఘటనల పరిస్థితి, ప్రాంతాల వారీగా ఉన్న వ్యత్యాసాలను ఈ వర్క్షాప్లో సమీక్షించారు. సంఘర్షణను తగ్గించేందుకు వినూత్న విధానాలు, సాంకేతికతలు, ఉత్తమ పద్ధతులపై చర్చించారు. ఇందులో పశువైద్య చర్యలు, విద్యుదాఘాతాల వల్ల ఏనుగుల మృతిని నివారించడం, రైల్వే సంబంధిత ఏనుగుల మరణాలను అరికట్టడం, ఏనుగుల ఆవాసాలు, కారిడార్ల నిర్వహణ, సమగ్ర భూభాగ నిర్వహణ విధానాలు వంటి అంశాలు ఉన్నాయి. మనుషులు-ఏనుగుల మధ్య సామరస్య జీవనాన్ని ప్రోత్సహించేందుకు సమన్వయంతో, శాస్త్రీయ ఆధారాలతో కూడిన వ్యూహాలను రూపొందించడానికి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర అటవీ శాఖలు, పరిశోధనా సంస్థలు, భారతీయ రైల్వేలు, ఇతర భాగస్వామ్య వర్గాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈ వర్క్షాప్ పేర్కొంది.
జాతీయస్థాయి వేడుకల్లో భాగంగా నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ సమన్వయంతో ‘ప్రాజెక్టు ఎలిఫెంట్’ పేరుతో దేశవ్యాప్తంగా భారీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ప్రచార కార్యక్రమంలో 21,450 పాఠశాలల నుంచి 20 లక్షలకు పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఏనుగుల పర్యావరణ, సాంస్కృతిక ప్రాముఖ్యత గురించి, వాటి ఆవాసాలను పరిరక్షించాల్సిన ఆవశ్యకతపై పిల్లల్లో అవగాహన కల్పించడానికి చిత్రలేఖనం, మాస్క్ తయారీ పోటీలు, ర్యాలీలు, వీధి నాటకాలు, అవగాహన కార్యక్రమాలు, ప్రతిజ్ఞా కార్యక్రమాలు నిర్వహించారు. ఏనుగులను రక్షించి, సంరక్షిస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే యువ అంబాసిడర్లుగా మారేందుకు తమ నిబద్ధతను చాటారు.


విశాఖపట్నంలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవం 2026 వేడుకలు.. జాతీయ వారసత్వ జంతువైన ఏనుగుల భవిష్యత్తును సురక్షితం చేయడానికి దేశం కట్టుబడి ఉందనే విషయాన్ని మరోసారి చాటిచెప్పాయి. శాస్త్రీయ పద్ధతులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వన్యప్రాణుల ఆవాసాలు, కారిడార్ల సంరక్షణ, స్థానిక ప్రజల భాగస్వామ్యం, అన్ని విభాగాల సమన్వయ చర్యల ద్వారా రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన ఏనుగుల జనాభాను, పటిష్టమైన అటవీ ప్రాంతాలను అందించడమే లక్ష్యంగా భారత్ ముందుకు సాగుతోందని ఈ సదస్సు స్పష్టం చేసింది.
***
(रिलीज़ आईडी: 2299021)
आगंतुक पटल : 13