మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు-2026
ఇతివృత్తం: ‘‘స్థిరమైన జీవిత ప్రారంభానికి తల్లిపాలు: సత్ఫలితాలనిచ్చే విధానాలను బలోపేతం చేయడం’’
పోషణ్ అభియాన్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల నిర్వహణ
प्रविष्टि तिथि:
05 AUG 2026 3:22PM by PIB Hyderabad
కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు-2026 ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది “స్థిరమైన జీవిత ప్రారంభానికి తల్లిపాలు: సత్ఫలితాలనిచ్చే విధానాలను బలోపేతం చేద్దాం” అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ వారోత్సవాలు కొనసాగుతున్నాయి. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రచారాన్ని వేగవంతం చేశారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, సమాజిక సేవా వేదికలు, డిజిటల్ మీడియా ద్వారా వారం రోజుల పాటు విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి శిశువు జన్మించిన తర్వాత మొదటి ఆరు నెలలు, ఆపై 24 నెలల (రెండేళ్ల) వరకు ఉండే తొలి 1000 రోజుల కాలం పిల్లల పెంపకంలో అత్యంత కీలకమైనదని ఈ ప్రచారం స్పష్టం చేస్తోంది. ఈ సమయంలో లభించే సరైన పోషణ, సంరక్షణ, అప్యాయత పిల్లల మెదడు ఎదుగుదల, రోగనిరోధక శక్తి, నేర్చుకునే సామర్థ్యం, జీవితకాల ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. పిల్లల సురక్షిత భవిష్యత్తుకు, సమగ్ర వికాసానికి తల్లిపాలు పట్టడమే అత్యంత ప్రభావవంతమైన మార్గంగా నిలుస్తుంది.
శిశువు జన్మించిన మొదటి గంట వ్యవధిని గోల్డెన్ అవర్గా పరిగణిస్తారు. ఈ సమయంలోనే నవజాత శిశువుకు ఖచ్చితంగా తల్లిపాలు పట్టాలని కుటుంబాలను మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేస్తోంది. కాన్పు అయిన వెంటనే వచ్చే చిక్కటి ముర్రుపాలు అయిన కొలోస్ట్రమ్ బిడ్డకు మొదటి సహజమైన టీకా మాదిరి రక్షణను అందిస్తాయి. ముర్రుపాలు వ్యాధి నిరోధకతనూ, అత్యవసర పోషకాలతోనూ ఉంటాయి. వీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ పారబోయకూడదు. కాన్పు కాగానే తల్లీ, బిడ్డల మధ్య ఉండే శరీర స్పర్శ అనుబంధం తల్లిపాలు త్వరగా పడటానికి దోహదపడటమే కాకుండా, వారిద్దరి మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
పుట్టిన ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఈ ఆరు నెలల కాలంలో శిశువుకు నీళ్లు, తేనె, గుత్తి, గ్లూకోజ్ లేదా ఫార్ములా పాలు లేకుండా కేవలం తల్లిపాలు మాత్రమే అందించాలి. బిడ్డకు కావాల్సిన పోషకాలతో పాటు నీటి అవసరాలను తీర్చడానికి తల్లిపాలు ఒక్కటే సరిపోతాయి. ఇవి బిడ్డను రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. ఆరు నెలలు పూర్తయిన తర్వాత తల్లిపాలతో పాటు వయసుకు తగ్గ పోషకాహారాన్ని (అదనపు ఆహారం) అందించాలి. ఈ విధంగా రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలు ఇవ్వడం కొనసాగించాలి.
ఈ వారోత్సవాల్లో భాగంగా తల్లులకు సరైన పద్ధతిలో పాలు పట్టడం, ఆసరా ఇవ్వడంపై కూడా మార్గనిర్దేశం చేస్తున్నారు. తల్లికీ, బిడ్డకు అత్యంత సౌకర్యవంతంగా ఉండే పద్ధతిలో పాలు పట్టేలా ప్రోత్సహిస్తున్నారు. బిడ్డ ఆకలిని బట్టి అవసరమైనప్పుడల్లా పాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే సమీపంలోని అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు లేదా ఆరోగ్య కేంద్రాల సహాయం తీసుకోవాలని కోరుతున్నారు. ఉద్యోగాలకు వెళ్లే తల్లులు పాలను సురక్షితంగా తీసి, భద్రపరిచే విధానాలపై కౌన్సిలింగ్ ఇస్తున్నారు. దీనివల్ల బిడ్డకు పాల సరఫరాలో అంతరాయం కలగకుండా ఉంటుంది.
ప్రతి తల్లికి పాలు ఇచ్చే ధైర్యాన్ని, సౌకర్యాన్ని కల్పించడంలో.. ప్రతి చిన్నారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలో సమాజం, కుటుంబాలు, ఆరోగ్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు భాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
***
(रिलीज़ आईडी: 2295044)
आगंतुक पटल : 5