ఆర్థిక మంత్రిత్వ శాఖ
మాల్దీవులు, భారత్ మధ్య ఫవారా- యూపీఐ చెల్లింపుల వ్యవస్థ ప్రారంభం
మాల్దీవుల నుంచి మొబైల్ బ్యాంకింగ్ యాప్ల ద్వారా భారత్లోని యూపీఐ అనుసంధానిత బ్యాంకు ఖాతాలకు తక్షణ నిధుల బదిలీకి అవకాశం
प्रविष्टि तिथि:
31 JUL 2026 1:35PM by PIB Hyderabad
మాల్దీవుల తక్షణ చెల్లింపుల వ్యవస్థ ‘ఫవారా’, భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) అనుసంధానం విజయవంతంగా పూర్తయినట్లు మాల్దీవ్స్ మానిటరీ అథారిటీ (ఎంఎఏ) ప్రకటించింది. 2026 జూలై 30 నుంచి ఈ సేవలు అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి.
మాల్దీవులు, భారత్ మధ్య జరిగే డిజిటల్ ఆర్థిక లావాదేవీల్లో, ద్వైపాక్షిక ఆర్థిక సహకారంలో ఇది ఒక కీలక ముందడుగుగా నిలిచింది.
ఈ పరిణామంలోని ముఖ్య అంశాలు..
1. తక్షణ నిధుల బదిలీ: మాల్దీవుల్లో ఉన్న వ్యక్తులు ఫవారా వ్యవస్థ ద్వారా భారత్లోని లబ్ధిదారులకు క్షణాల్లో డబ్బులు పంపవచ్చు. ఈ లావాదేవీలు మాల్దీవియన్ రుఫియా (ఎంవీఆర్) రూపంలో ప్రారంభమై, భారత్లోని ఖాతాదారులకు భారతీయ రూపాయిల (ఐఎన్ఆర్) రూపంలో జమ అవుతాయి.
2. తొలి విడత బ్యాంకుల భాగస్వామ్యం: ఈ సేవలు రెండు స్థానిక బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ పీఎల్సీ, మాల్దీవ్స్ ఇస్లామిక్ బ్యాంకు పీఎల్సీ భాగస్వామ్యంతో ప్రారంభమయ్యాయి. ఈ బ్యాంకుల వినియోగదారులు తమ మొబైల్ బ్యాంకింగ్ యాప్లు, ఫవారా చెల్లింపుల వ్యవస్థ ద్వారా భారత్లోని యూపీఐ ఖాతాలకు నేరుగా వ్యక్తి నుంచి వ్యక్తికి (పీ2పీ) బదిలీలు చేయవచ్చు.
3. అనుమతించిన కేటగిరీలు: కుటుంబ ఖర్చుల కోసం విదేశాలకు డబ్బు పంపడానికీ, తీసుకోవడానికీ అనుమతిస్తారు. నిబంధనల మేరకు బహుమతి రూపంలోనూ అనుమతిస్తారు.
4. సమష్టి విజయం: మాల్దీవ్స్ మానిటరీ అథారిటీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్), ఇరు దేశాల ఆర్థిక సంస్థలు, ఇతర భాగస్వాముల సన్నిహిత సహకారంతో ఈ విధానం అమల్లోకి వచ్చింది.
నేపథ్యం, భవిష్యత్తు కార్యాచరణ
ఎన్ఐపీఎల్, ఎంఎంఏ మధ్య జూలై 2025లో ఈ ఫవారా-యూపీఐ అనుసంధాన ఒప్పందం కుదిరింది. కేవలం 10 రోజుల సమయంలోనే టెస్టింగ్, సర్టిఫికేషన్, ఆన్బోర్డింగ్, ప్రత్యక్ష తనిఖీలను పూర్తి చేసి ఈ చెల్లింపుల వ్యవస్థను వినియోగంలోకి తెచ్చారు.
ఈ భాగస్వామ్యం ద్వారా రానున్న రోజుల్లో మరిన్ని రెండు దేశాల మధ్య డిజిటల్ చెల్లింపు సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనిలో భాగంగా క్యూఆర్ కోడ్ ఆధారిత వర్తకుల చెల్లింపులతో పాటు ఇతర నూతన డిజిటల్ సేవలను ప్రవేశపెట్టనున్నారు. ఈ చర్యలు మాల్దీవులు-భారత్ మధ్య ఆర్థిక, వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేయనున్నాయి.
ప్రస్తుతం యూపీఐని అనుమతిస్తున్న 9 దేశాలు
భారతీయ పర్యాటకులు విదేశాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా డిజిటల్ చెల్లింపులు చేసుకోవడానికి 9 దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. అవి కాంబోడియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, భూటాన్, ఖతార్, శ్రీలంక.
***
(रिलीज़ आईडी: 2292575)
आगंतुक पटल : 4