వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
మాల్దీవులకు కర్ణాటక నీలమ్, తోతాపురి మామిడిపళ్లు..
విమానంలో ఎగుమతి.. సాయపడిన అపెడా
నేరుగా ప్రపంచ మార్కెట్టుతో అనుబంధం.. రైతులకు 50 శాతానికిపైగా అధిక ప్రతిఫలం
प्रविष्टि तिथि:
31 JUL 2026 12:15PM by PIB Hyderabad
నీలమ్, తోతాపురి రకాల మామిడిపళ్లను కర్ణాటక నుంచి మాల్దీవులకు మొదటిసారిగా విమానంలో ఎగుమతి చేయడానికి అగ్రికల్చరల్, ప్రాసెస్డ్ ఫూడ్ ప్రాడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ.. ‘అపెడా’) సహకరించింది. కర్ణాటకలో సీజను దాటాక వచ్చే ఈ రకాలకు చెందిన మామిడి పండ్ల ఎగుమతి కార్యక్రమాన్ని నిన్న.. అంటే 2026 జులై 30న ప్రారంభించారు. ఈ రెండు రకాల మామిడి పండ్లను అంతర్జాతీయ మార్కెట్లకు చేరవేయడాన్ని ప్రోత్సహించడంలోనూ, భారత మామిడిపండ్ల ఎగుమతుల్ని మరింత విస్తరించడంలోనూ ఈ కార్యక్రమం ఓ కీలక ఘట్టంగా నిలిచింది.
సరుకు ఎగుమతి కార్యక్రమాన్ని అపెడా చైర్మన్, ఐఏఎస్ అధికారి శ్రీ అభిషేక్ దేవ్ ప్రారంభించారు. దీనికి వెన్నుదన్నుగా నిలిచిన ఎగుమతి సంస్థనీ, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ (ఎఫ్పీసీ)నీ, రైతుల్నీ, మిగతా ఆసక్తిదారుల్నీ ఆయన అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు భారతదేశ మామిడిపండ్లకు మార్కెట్ లభ్యతను పెంచుతాయనీ, ఆలస్యంగా పండే రకాలకు ఎగుమతి అవకాశాల్ని అందించడంతో పాటు రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి కూడా తోడ్పడాయనీ శ్రీ అభిషేక్ దేవ్ అన్నారు.
కర్ణాటక.. కోలార్ జిల్లాలో కేజీఎఫ్ తాలూకాకు చెందిన ప్రాకృతిక్ మాయా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీతో కలిసి పనిచేస్తున్న రైతుల వద్ద నుంచి ఒక మెట్రిక్ టన్ను నీలమ్, తోతాపురీ మామిడి పండ్ల ఎగుమతి సరుకును సేకరించారు. ఈ సరుకును అహల్య దేవి వెంచర్స్ డైరెక్టరు శ్రీమతి ఎ.అశ్వినీ ఆధ్వర్యంలో ఎగుమతి చేశారు. శ్రీమతి ఎ.అశ్వినీ కొత్తగా నమోదైన మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్త, ఎగుమతిదారు. భారత వ్యవసాయ ప్రధాన ఎగుమతుల విస్తారిత అనుబంధ వ్యవస్థలో మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం అంతకంతకూ పెరుగుతోందని ఈ ఎగుమతి కార్యక్రమం చాటిచెబుతోంది.
నీలమ్ మామిడిపండ్లు తీయదనానికీ, రసాన్నిచ్చే గుజ్జుకీ, చక్కనైన సువాసనకీ పేరు పొందాయి. వీటిని మిఠాయిలు, స్మూదీలు, పానీయాల తయారీకి కూడా ఉపయోగిస్తారు. తోతాపురీ మామిడిపండ్లు తీపి, పులుపు రుచుల కలగలుపుగా ఉండి నేరుగా వాడుకోవడానికీ, శుద్ధి చేసి వాడటానికీ అనువైనవని ప్రసిద్ధి చెందాయి. జూన్ చివరి నుంచి జులై చివరి వరకు కోతకు వచ్చి, ఆలస్యంగా పండే ఈ రకాలు భారత్ మామిడిపండ్ల ఎగుమతి కాలాన్ని పొడిగించడానికీ, పీక్ హార్వెస్ట్ పీరియడ్ ముగిసిన తరువాతి కాలంలోనూ అంతర్జాతీయ డిమాండును తీర్చే అవకాశాల్ని అందిస్తున్నాయి.
విమానం ద్వారా ఎగుమతి కర్ణాటకలో ఉద్యాన రంగం ఎగుమతి సామర్థ్యం అంతకంతకూ పెరుగుతోందని స్పష్టం చేస్తోంది. ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలు సంఘటిత పద్ధతి, నాణ్యమైన ఉత్పత్తి, ఎగుమతి ప్రధాన సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసి, రైతుల్ని అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించడానికి దోహదం చేస్తున్నాయని కూడా ఈ ఎగుమతి కార్యక్రమం స్పష్టం చేసింది.
ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీతో అనుబంధం కలిగి ఉన్న రైతులు ఈ ఎగుమతి కార్యక్రమం ద్వారా సాంప్రదాయిక మార్కెట్ల కన్నా 50 శాతానికి పైగా ప్రతిఫలాన్ని పొందగలిగారు. సరుకును నేరుగా కొనుగోలు చేయడం, ఎగుమతి మార్కెట్లతో పరిచయాలు, సంఘటిత పద్ధతిని అనుసరించడం వల్ల సమకూరే ప్రయోజనాలను ఈ ఘటన సూచిస్తోంది. ఈ ఎగుమతి కార్యక్రమం రైతుల ఆదాయాన్ని పెంచుతూ, ఎగుమతి ప్రధాన సాగు పద్థతులను పెద్ద ఎత్తున అనుసరించేలా ప్రోత్సాహాన్ని కూడా అందిస్తుంది.
కర్ణాటక మామిడిపండ్ల ఎగుమతుల చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ఈ ఎగుమతి కార్యక్రమంతో ఆరంభమైంది. దీనితో అధిక నాణ్యత కలిగిన ఉద్యానవన ఉత్పాదనలను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించడంలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు (ఎఫ్పీఓలు), ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలు (ఎఫ్పీసీలు), ఎగుమతిదారులు, వ్యవసాయ రంగ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఇదివరకటి కన్నా ఎక్కువగా పాలుపంచుకొనేటట్లు ప్రోత్సాహం లభించగలదని భావిస్తున్నారు.
ఎగుమతులకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనను బలోపేతం చేయడానికీ, అంతర్జాతీయ మార్కెట్ల వరకూ చేరుకోవడానికి మార్గాన్ని సుగమం చేయడానికీ, అధిక నాణ్యత కలిగిన భారత పండ్లకు అంతర్జాతీయ మార్కెట్లలో ఆదరణ లభించేలా చూడటానికీ రాష్ట్ర ప్రభుత్వాలు, ఎగుమతిదారులు, ఎఫ్పీఓలు, ఎఫ్పీసీలు, ఇతర ఆసక్తిదారులతో ‘అపెడా’ కలిసి పనిచేస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు రైతులకీ, తోటపంటల రంగానికీ సుస్థిర అవకాశాలను అందజేయడంతో పాటు భారతదేశ వ్యవసాయ ఎగుమతుల విస్తరణకు కూడా తోడ్పడతాయి.
***
(रिलीज़ आईडी: 2292573)
आगंतुक पटल : 5