రక్షణ మంత్రిత్వ శాఖ
సముద్రాల్ని చుట్టివచ్చిన త్రివిధ దళాల మహిళా అధికారుల బృందం
ఐఏఎస్వీ త్రివేణీ నౌకలో సాహస యాత్ర
సైనిక బృందాన్ని సత్కరించిన రక్షణ మంత్రి
‘సముద్ర ప్రదక్షిణ’ మూడు సేనల పరస్పర సహకారానికీ, ‘నారీ శక్తి’కీ నిదర్శనం..
ఇది భారత్లో ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిని ఇస్తుందన్న శ్రీ రాజ్నాథ్ సింగ్
प्रविष्टि तिथि:
30 JUL 2026 1:12PM by PIB Hyderabad
ఐఏఎస్వీ త్రివేణీ నౌకలో సముద్రాల్ని చుట్టి వచ్చిన త్రివిధ దళాలకు చెందిన తొమ్మిది మంది మహిళా అధికారులను కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ ఈ రోజు.. అంటే 2026 జులై 30న సత్కరించారు. మొట్టమొదటి సారి అందరూ మహిళలే పాల్గొన్న ‘సముద్ర ప్రదక్షిణ’ సాహసయాత్ర ఇదే. రక్షణ మంత్రి న్యూఢిల్లీలో అధికారులతో మాట్లాడుతూ, 314 రోజుల్లో నాలుగు మహాసముద్రాలను దాటుతూ సుమారు 25,500 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించి యాత్రను విజయవంతంగా పూర్తి చేసి టీము కనబరిచిన సాహసాన్నీ, దృఢసంకల్పాన్నీ ప్రశంసించారు. ఈ యాత్ర మహిళాశక్తికి ప్రమాణంగా నిలవడమే కాకుండా త్రివిధ దళాల సహకారానికీ, సమన్వయానికీ ఓ అత్యుత్తమ ఉదాహరణగా కూడా ఉందని ఆయన అన్నారు. ఇది దేశంలో ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిని అందిస్తుందన్నారు.



మహిళా అధికారులు తమ యాత్రా విశేషాలను రక్షణ మంత్రికి వివరించారు. సవాళ్లతో కూడిన ఈ సాహస యాత్ర తమకు మరపురానిదిగాను, ఫలప్రదమైందిగాను నిలుస్తుందని అన్నారు. దేశ ప్రజలు సంతోషించే పనిని చేయాలన్న దృఢసంకల్పమే స్ఫూర్తిని అందించిందనీ, ఈ కారణంగానే, శారీరక, మానసిక సవాళ్లను ఎదుర్కోగలిగామని చెప్పారు.

మహిళా అధికారుల అంకితభావం తనకు స్ఫూర్తినివ్వడంతో పాటు స్వీయ సంకల్పాన్ని బలోపేతం చేసిందని రక్షణ మంత్రి అన్నారు. దృఢవిశ్వాసం, సంకల్పం ఉంటే జీవితంలో ఏ లక్ష్యాన్ని అయినా సాధించవచ్చని వారి విజయం చాటుతోందని శ్రీ రాజ్నాథ్ సింగ్ అన్నారు. ‘‘అధికారుల సామర్థ్యం, ఆత్మవిశ్వాసం అద్భుతం’’ అని శ్రీ రాజ్నాథ్ సింగ్ కొనియాడుతూ, ఫలప్రదంగా ముగిసిన ఈ ‘సముద్ర ప్రదక్షిణ’…. మహిళలు సాహసయాత్రలను చేయలేరన్న వాదనను పటాపంచలు చేసిందన్నారు. ‘‘శారీరక పటుత్వం, మానసిక దృఢత్వం, నాయకత్వ సామర్థ్యం.. ఇవి పురుషులు, మహిళలు అనే భేదానికి మించినవి అని మీరు నిరూపించారు. మిమ్మల్ని చూసి భారత్లో ప్రతి పుత్రికా తాను కూడా సముద్రాన్ని దాటివచ్చి ప్రపంచాన్ని గెలువగలనన్న నమ్మకాన్ని పెంచుకోగలుగుతుంది’’ అని అధికారులతో ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ప్రయాణం ‘త్రివిధ దళాల సమన్వయాని’కి ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తుందని రక్షణ మంత్రి ప్రశంసించారు. భారత సైనిక, నౌకా, వైమానిక దళాల అధికారులు ఒకే జెండా నీడన, ఒకే ఉమ్మడి లక్ష్యంతో, కలిసికట్టుగా ఒకే నౌకలో సముద్రయానానికి వెళ్లారని ఆయన గుర్తు చేశారు. ‘‘మనం కలిసి ముందుకు కదిలితే ఏ దిగంతమూ గెలుచుకోలేనంతటి విశాలమైంది కాబోదు అనడానికి ఈ సాహసయాత్రే ఒక కొలమానం’’ అని ఆయన అన్నారు.
భారత ఇంజినీరింగ్ ప్రావీణ్యం, దేశీయ శక్తియుక్తుల్నీ, సాంకేతిక ప్రగతినీ బృందం తాను సందర్శించిన దేశాలకు చాటిచెప్పిందని శ్రీ రాజ్నాథ్ సింగ్ మెచ్చుకున్నారు. ‘‘ఏ రంగంలోనూ ఏ దేశానికీ భారత్ తీసిపోదు అనే సందేశాన్ని ప్రపంచానికి మీరు అందించారు’’ అని బృంద సభ్యులను ఆయన ప్రశంసించారు.
ఈ మాటామంతీ సందర్భంగా సైనిక దళ ప్రధానాధికారి జనరల్ ధీరజ్ సేఠ్, రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ రాజేశ్ కుమార్ సింగ్, వైమానిక దళ ఉప ప్రధానాధికారి ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్, నౌకాదళ ఉప ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అజయ్ కోచర్తో పాటు త్రివిధ దళాలకు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

రక్షణ మంత్రి ఈ నెల 22న ముంబయిలో ఐఏఎస్వీ త్రివేణి బృందానికి దృశ్య మాధ్యమ సహాయంతో స్వాగతం పలికారు. గత సంవత్సరం సెప్టెంబరు 11న ఇదే బృందం యాత్ర ప్రారంభ కార్యక్రమంలో కూడా ఆయన దృశ్య మాధ్యమ సహాయంతో పాలుపంచుకున్నారు.
ప్రతిదీ పక్కాగా రూపొందించిన ప్రణాళిక, ఇంచుమించు రెండు సంవత్సరాల పాటు విస్తృత శిక్షణ, తీర ప్రాంతం నుంచి నిరంతరాయంగా సహాయాన్ని అందించిన నెట్వర్కుతో పాటు అనేక సంస్థలు, సహాయక ఏజెన్సీల తిరుగులేని నిబద్ధత.. ఇవన్నీ ఈ సాహస యాత్ర సఫలం కావడంలో తమ వంతు పాత్రలను పోషించాయి. ప్రపంచ ప్రదక్షిణకు గాను అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించిన అన్ని ప్రమాణాల్నీ ఈ సాహసయాత్ర విజయవంతంగా నెరవేర్చింది. ఈ ప్రమాణాల్లో.. అన్ని దేశాంతరాలనూ దాటడం, భూమధ్య రేఖ మీదుగా రెండు సార్లు పయనించడం, ఇంటర్నేషనల్ డేట్ లైన్ ను కూడా దాటడంతో పాటు సముద్రంలోకి చొచ్చుకొని ఉన్న మూడు మహా భూభాగాలు.. కేప్ లీయువిన్, కేప్ హార్న్, కేప్ ఆఫ్ గుడ్ హోప్.. చుట్టూరా తిరగడం వంటి మజిలీలు ఉన్నాయి.
కఠినతర డ్రేక్ జలసంధిని విజయవంతంగా దాటిన తరువాత కేప్ హార్నును చుట్టాక కేప్ హార్నర్సుకు సంబంధించిన ప్రతిష్ఠాత్మక సముదాయంలో సభ్యత్వం ఈ బృందానికి దక్కింది. ప్రపంచంలో అత్యంత సవాళ్లతో కూడిన సముద్ర మార్గాలలో ఒక మార్గాన్ని అధిగమించగలిగిన నావికులకు మాత్రమే ఈ గౌరవాన్ని ప్రదానం చేస్తారు.
‘సముద్ర ప్రదక్షిణ’ చెప్పుకోదగిన సముద్ర సంబంధిత విజయం. అంతేకాదు, సైన్య దౌత్యంతో ముడిపడిన ఒక శక్తిమంతమైన సాధనం కూడా. ప్రపంచవ్యాప్తంగా ఓడరేవులలో తన యాత్రను కొనసాగించిన క్రమంలో, ఐఏఎస్వీ త్రివేణి మిత్ర దేశాలతో సద్భావనను బలోపేతం చేయడమే కాకుండా భారత సుసంపన్న సాంస్కృతిక వారసత్వం, నౌకావాణిజ్య సంప్రదాయాలనూ, సైనిక వృత్తి నైపుణ్యాన్నీ, విలువలనూ చాటిచెప్పింది.
***
(रिलीज़ आईडी: 2291914)
आगंतुक पटल : 8