రాష్ట్రపతి సచివాలయం
ఉత్తర మాసిడోనియాలో భారత రాష్ట్రపతి పర్యటన
ఉత్తర మాసిడోనియా అధ్యక్షురాలితో ద్వైపాక్షిక చర్చలు, ప్రతినిధుల స్థాయి చర్చలకు నేతృత్వం
భారత్-ఉత్తర మాసిడోనియా ద్వైపాక్షిక సంబంధాలకు ఆర్థిక సహకారమే అత్యంత కీలకం: రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము
प्रविष्टि तिथि:
21 JUL 2026 4:32PM by PIB Hyderabad
మోల్డోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల అధికారిక పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము నిన్న సాయంత్రం (2026 జులై 20) ఉత్తర మాసిడోనియా రాజధాని స్కోప్జేకు చేరుకున్నారు. ఉత్తర మాసిడోనియాలో భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే మొదటిసారి.
స్కోప్జే అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి ఉత్తర మాసిడోనియా విదేశీ వ్యవహారాలు, విదేశీ వాణిజ్య శాఖ మంత్రి శ్రీ టిమ్చో ముకున్స్కీ ఘన స్వాగతం పలికారు.
ఈ అధికారిక పర్యటనలో రాష్ట్రపతి వెంట వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి శ్రీమతి నిముబెన్ జయంతిభాయ్ బంభానియా, పార్లమెంటు సభ్యులు డాక్టర్ దినేష్ శర్మ, శ్రీ విజయ్ బఘేల్ ఉన్నారు.
నేడు (2026 జులై 21) ఉత్తర మాసిడోనియా అధ్యక్షురాలి అధికారిక నివాసం, కార్యాలయమైన విల్లా వోడ్నో సందర్శనతో రాష్ట్రపతి అధికారిక కార్యక్రమాలను ప్రారంభించారు. అక్కడ ఆమెకు ఉత్తర మాసిడోనియా అధ్యక్షురాలు డాక్టర్ గోర్డానా సిల్జానోవ్స్కా దావ్కోవా ఆత్మీయ స్వాగతం పలికారు. అధికారిక లాంఛనాల అనంతరం గౌరవ వందనం సమర్పించారు. భారత రాష్ట్రపతి, ఉత్తర మాసిడోనియా అధ్యక్షురాలి మధ్య ముఖాముఖి భేటీతో పాటు ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఇరుదేశాల నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించారు. పరస్పర ప్రయోజనకరమైన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రజాస్వామ్య విలువలు, పరస్పర గౌరవం ఆధారంగా కొనసాగుతున్న ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక, సన్నిహిత ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయాలని ఇరు దేశాల నేతలు స్పష్టం చేశారు.
భారత్, ఉత్తర మాసిడోనియా ద్వైపాక్షిక సంబంధాలకు ఆర్థిక సహకారమే అత్యంత ముఖ్యమైన ఆధారమని రాష్ట్రపతి అన్నారు. ఐటీ/ఐటీఈఎస్, వ్యవసాయం, ఆహార శుద్ధి, ఔషధ రంగాలు , జౌళి, బయో టెక్నాలజీ, పర్యాటకం, ఆతిథ్యం, సినిమా రంగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
రెండు దేశాల మధ్య సాంస్కృతిక, ప్రజల మధ్య ఉన్న అనుబంధం ఎల్లప్పుడూ ద్వైపాక్షిక సంబంధాలకు కీలకంగా నిలిచిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. సాంస్కృతిక సహకారంలో సృజనాత్మక రంగ భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైన అంశమని ఆమె తెలిపారు.
అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ), విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్ఐ), గ్లోబల్ బయోఫ్యూయెల్స్ అలయెన్స్ వంటి అంతర్జాతీయ కార్యక్రమాల ద్వారా ప్రపంచ దేశాల మధ్య సహకారాన్ని పెంచేందుకు భారత్ కృషి చేస్తోందని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఈ ప్రపంచ కార్యక్రమాల్లో చేరడానికి ఉత్తర మాసిడోనియా చూపుతున్న ఆసక్తిని ఆమె స్వాగతించారు. ఈ కూటముల్లో చేరడం వల్ల పునరుత్పాదక ఇంధన రంగాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు విపత్తుల నుంచి కోలుకునే సామర్థ్యాన్ని సాధించడంలో అంతర్జాతీయ అత్యుత్తమ విధానాలు, సాంకేతిక నైపుణ్యాన్ని ఉత్తర మాసిడోనియా వినియోగించుకోగలదని పేర్కొన్నారు.
ఉత్తర మాసిడోనియా కోసం కృత్రిమ మేధ కోర్సులతో సహా భారత సాంకేతిక, ఆర్థిక సహకార (ఐటీఈసీ) శిక్షణ కేటాయింపుల సంఖ్యను రెట్టింపు చేయాలని భారత్ నిర్ణయించినట్లు రాష్ట్రపతి ప్రకటించారు. ఈ పర్యటన భారత్-ఉత్తర మాసిడోనియా మధ్య బహుముఖ భాగస్వామ్యాన్ని మరింత బలపరిచి, రాబోయే ఏళ్లలో ఇరుదేశాల మైత్రిని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని ఇరు దేశాల అగ్రనేతలు ఆకాంక్షించారు.
ఉత్తర మాసిడోనియా పత్రికా ప్రకటన కోసం ఇక్కడ క్లిక్ చేయండి
***
(रिलीज़ आईडी: 2287517)
आगंतुक पटल : 10