వ్యవసాయ మంత్రిత్వ శాఖ
వికసిత భారత్- 2047 దిశగా ‘వికసిత కృషి - సమృద్ధ రైతు’ సాహసోపేతమైన లక్ష్యాన్ని ప్రకటించిన శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
న్యూఢిల్లీలో ఐసీఏఆర్ 98వ వ్యవస్థాపక దినోత్సవం
భారత రైతులను సాధికారులను చేయడమే లక్ష్యంగా 43 కొత్త పంట రకాలు, 17 సాంకేతికతలు, 14 ప్రచురణల విడుదల: శివరాజ్ సింగ్ చౌహాన్
వాతావరణ మార్పులను తట్టుకొనే 100 గ్రామాల నిర్మాణం, ఐసీఏఆర్ సాంకేతికతలను 10 కోట్ల మంది రైతులకు చేరవేయడాన్ని లక్ష్యంగా నిర్దేశించిన కేంద్ర వ్యవసాయ మంత్రి
‘ఒక సంస్థ - ఒక గొప్ప ఆవిష్కరణ’: ప్రతి ఐసీఏఆర్ సంస్థ ఒక విప్లవాత్మక పురోగతి సాధించాలని శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపు
నకిలీ విత్తనాలు, పురుగుమందులపై కఠిన చట్టాలు చేయాలన్న మంత్రి.. పరిశోధన ఫలితాలను వేగంగా క్షేత్రస్థాయికి చేరవేయాలని పిలుపు
శాస్త్రీయ సలహాలనూ, సాంకేతికతనూ ప్రతి రైతు మొబైల్కు ఉచితంగా అందించేలా సార్వత్రిక డిజిటల్ విజ్ఞాన వేదిక
కొత్త వ్యాక్సిన్లు, మెరుగైన పంట రకాలు, అధునాతన సాంకేతికతలతో వ్యవసాయ స్వావలంబన దిశగా మరింత వేగంగా భారత్ పురోగతి: శివరాజ్ సింగ్ చౌహాన్
प्रविष्टि तिथि:
16 JUL 2026 8:37PM by PIB Hyderabad
భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) 98వ వ్యవస్థాపక దినోత్సవాన్ని న్యూఢిల్లీలోని ఎన్ఏఎస్సీ కాంప్లెక్సులో ఉన్న భారతరత్న సి. సుబ్రమణియం ఆడిటోరియంలో ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రసంగించారు. ‘వికసిత భారత్ – 2047’ సాధనలో వ్యవసాయ రంగాన్ని కీలకమైన ఆధారంగా పేర్కొంటూ.. ‘వికసిత కృషి - సమృద్ధ కిసాన్’ లక్ష్యంతో ఒక సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా పలు ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను కేంద్ర మంత్రి ప్రకటించారు. వాతావరణ మార్పులను తట్టుకునేలా 100 ‘వాతావరణ అనుకూల గ్రామాల’ అభివృద్ధి, ఐసీఏఆర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని 10 కోట్ల మంది రైతులకు చేరవేయడం, ‘ఒక సంస్థ - ఒక గొప్ప ఆవిష్కరణ’ విధానాన్ని ప్రవేశపెట్టడం వంటి కీలక నిర్ణయాలను ఆయన వెల్లడించారు. వీటితోపాటు ఐసీఏఆర్ సార్వత్రిక డిజిటల్ విజ్ఞాన వేదిక ఏర్పాటు, నకిలీ విత్తనాలు - పురుగుమందుల నియంత్రణకు చట్టాలను మరింత బలోపేతం చేయడం, సరికొత్త ఆవిష్కరణలు - సాంకేతికత వాణిజ్యీకరణ ద్వారా ఐసీఏఆర్ను ఆర్థికంగా స్వయంసమృద్ధంగా తీర్చిదిద్దడం వంటి లక్ష్యాలను ఆయన నిర్దేశించారు. సంస్థ చరిత్రలో మొదటిసారిగా 150 మందికి పైగా ఐసీఏఆర్ ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరిస్తూ తీసుకున్న సంతోషకరమైన నిర్ణయాన్ని కూడా కేంద్ర మంత్రి వెల్లడించారు.
రైతులు ఆత్మ, శాస్త్రవేత్తలు మెదడు
శ్రీ చౌహాన్ మాట్లాడుతూ.. ఈ వ్యవస్థాపక దినోత్సవం ఒక అధికారిక కార్యక్రమం మాత్రమే కాదన్నారు. ఆహార కొరత ఉన్న దశ నుంచి స్వయం సమృద్ధ స్థితికీ, సవాళ్ల దశ నుంచి పరిష్కారాల ఆవిష్కరణల స్థాయికీ దేశం ఎదిగేలా నిరంతరం కృషి చేసిన ఎందరో శాస్త్రవేత్తల త్యాగాలను స్మరించుకునేందుకు ఇదొక గొప్ప అవకాశమన్నారు.
‘‘వ్యవసాయానికి రైతు ఆత్మ లాంటివాడైతే, శాస్త్రవేత్తలు మెదడు లాంటివారు. ప్రభుత్వ విధానాలు, రైతుల శ్రమ, శాస్త్రవేత్తల ప్రతిభ.. ఈ మూడూ కలిసి పని చేస్తేనే మన వ్యవసాయ క్షేత్రాల్లో అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి’’ అంటూ రైతులు, శాస్త్రవేత్తల మధ్య సమన్వయంపై ఆయన వ్యాఖ్యానించారు. దేశ వ్యవసాయ రంగానికి బలమైన పునాదిని నిర్మించడంలో విశేష కృషి చేసిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్తలను, ఐసీఏఆర్ మాజీ సారథులను ఆయన కృతజ్ఞతతో స్మరించుకున్నారు.
150 మందికి పైగా ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరిస్తూ నియామక పత్రాలు
మొదటిసారిగా 150 మందికి పైగా తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ నియామక పత్రాలు అందించిన విషయాన్ని కేంద్ర మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎంతో కాలంగా వారికి జరుగుతున్న అన్యాయానికి పరిహారంగా దీనిని పేర్కొన్నారు. ఎట్టకేలకు వారికి రావాల్సిన గుర్తింపు లభించడం పట్ల ఐసీఏఆర్ కుటుంబమంతా ఎంతగానో సంతోషిస్తోందనీ, వారికి ఇవి భావోద్వేగభరిత క్షణాలనీ ఆయన అన్నారు. కొత్తగా క్రమబద్ధీకరణ పొందిన ఉద్యోగులందరినీ ఈ సందర్భంగా ఆయన అభినందించారు. సంస్థ ప్రయాణంలో కీలకమని కొనియాడారు.
ఉత్పత్తి మాత్రమే కాదు.. నాణ్యత కూడా
ఆహార ధాన్యాలు, ఉద్యాన పంటలు, పాలు, మత్స్య ఉత్పత్తుల్లో దేశం అద్భుత వృద్ధిని సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన శ్రీ చౌహాన్.. అదే సమయంలో అతివిశ్వాసానికీ, అలసత్వానికీ తావివ్వకూడదని హెచ్చరించారు. ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు, అంతర్జాతీయ మార్కెట్లలో మన ఉత్పత్తులు బలంగా పోటీపడేలా చేయాలంటే.. ‘పరిమాణం కన్నా నాణ్యతే ముఖ్యం’ సూత్రం ప్రాతిపదికన ఇకమీదట దేశ వ్యవసాయ వికాసం కొనసాగాలని ఆయన స్పష్టం చేశారు. ఎల్నినో, వాతావరణ మార్పుల వల్ల తలెత్తుతున్న సవాళ్లను ప్రస్తావిస్తూ.. వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులు, జిల్లా స్థాయి ప్రత్యేక ప్రణాళికల రూపకల్పన, వ్యవసాయ రంగంలో నష్ట నివారణ చర్యలపై కృషిని వేగవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో కొత్త అంతర్జాతీయ మార్కెట్లు భారత్కు అందుబాటులోకి రావడమే కాకుండా.. సరికొత్త వాణిజ్య ఒప్పందాలను మన దేశం కుదుర్చుకుంటోందన్నారు. కాబట్టి అత్యంత నాణ్యమైన, ఎగుమతి యోగ్యమైన, ప్రజారోగ్యానికి మేలు చేసే వ్యవసాయోత్పత్తులను పండించడం ఇప్పుడు అత్యావశ్యకమని మంత్రి స్పష్టం చేశారు.*
కేంద్ర మంత్రి ప్రకటించిన ఏడు ప్రధాన లక్ష్యాలు:
1. 100 వాతావరణ- అనుకూల గ్రామాల అభివృద్ధి
ఐసీఏఆర్ వందో వసంతంలోకి అడుగుపెట్టే లోపే.. ఆ సంస్థ, దాని అనుబంధ సంస్థలు సంయుక్తంగా కనీసం 100 వాతావరణ అనుకూల (మార్పులను తట్టుకునే) గ్రామాలను అభివృద్ధి చేయాలని శ్రీ చౌహాన్ పిలుపునిచ్చారు. ఈ గ్రామాల్లో వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులు, సమగ్ర సాగు పద్ధతులు, నీరు, నేల పరిరక్షణ చర్యలతోపాటు ఆచరణాత్మక నష్ట నివారణ చర్యలపై రైతులకు నేరుగా అవగాహన కల్పిస్తారు. తద్వారా మారుతున్న వాతావరణ పరిస్థితులకు రైతులు విజయవంతంగా అలవాటు పడేలా చేయడం దీని ముఖ్య లక్ష్యం.
2. ఒక సంస్థ – ఒక గొప్ప ఆవిష్కరణ
అన్ని ఐసీఏఆర్ సంస్థలకు శ్రీ చౌహాన్ స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. ‘ఒక సంస్థ - ఒక గొప్ప ఆవిష్కరణ’ (వన్ ఇనిస్టిట్యూట్- వన్ గ్రాండ్ ఇన్నొవేషన్) దిశగా ముందుకు సాగుతూ.. వచ్చే రెండేళ్లలో ప్రతి సంస్థ కనీసం ఒక విప్లవాత్మక ఆవిష్కరణను తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఒక కొత్త రకం పంట వంగడం, వ్యాక్సిన్, ఏదైనా డిజిటల్ సాధనం లేదా వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ సాధనం... ఇలా ఆవిష్కరణ ఏదయినా, అది దేశవ్యాప్తంగా విస్తృత ప్రభావాన్ని చూపడంతోపాటు రైతుల జీవితాల్లో స్పష్టమైన మార్పును తెచ్చేవిగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
3. ఐసీఏఆర్ సాంకేతికతలు 10 కోట్ల మంది రైతులకు చేరేలా చర్యలు
ఐసీఏఆర్ శతాబ్ది ఉత్సవాల నాటికి.. సంస్థ రూపొందించిన వైజ్ఞానిక సాంకేతికతలు, సరికొత్త ఆవిష్కరణలు, ఆధునిక వ్యవసాయ పరిష్కారాలు దేశవ్యాప్తంగా కనీసం 10 కోట్ల మంది రైతులకు అందుబాటులోకి రావడం లక్ష్యంగా పెట్టుకోవాలని శ్రీ చౌహాన్ నిర్దేశించారు. వికసిత భారత్-2047 సంకల్పంలో భాగంగా ‘వికసిత కృషి - సమృద్ధ కిసాన్’ దార్శనికతను సాకారం చేసే దిశగా ఇదొక కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు.
4. ‘మిషన్ ఐసీఏఆర్-100’, సరికొత్త పాత్రలో కృషి విజ్ఞాన కేంద్రాలు
వచ్చే రెండేళ్లను ‘మిషన్ ఐసీఏఆర్-100’గా పాటించాలని మంత్రి ప్రతిపాదించారు. ఈ మిషన్లో భాగంగా కృషి విజ్ఞాన్ కేంద్రాలు కేవలం శిక్షణ కేంద్రాలుగానే పరిమితం కాకుండా.. ఆవిష్కరణల కేంద్రాలుగా, వాతావరణ సలహా కేంద్రాలుగా, అంకుర సంస్థలకు సహాయక కేంద్రాలుగా, రైతులకు సాంకేతిక అవగాహన కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని సూచించారు. రైతుల మధ్య ఐసీఏఆర్ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించుకునేందుకు పక్షం రోజుల పాటు దేశవ్యాప్త అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా శ్రీ చౌహాన్ ప్రతిపాదించారు. ఈ సమయంలో ప్రతి కృషి విజ్ఞాన కేంద్రం కనీసం 100 గ్రామాలను సందర్శించి.. ఐసీఏఆర్ పరిశోధన, సాంకేతికతలను పెద్ద ఎత్తున ప్రదర్శించాలి.
5. ఐసీఏఆర్ సార్వత్రిక డిజిటల్ విజ్ఞాన వేదిక
ఐసీఏఆర్ సాంకేతికతలు, శాస్త్రీయ సలహాలు, సూచనల వీడియోలను రైతులకు ఉచితంగా అందుబాటులోకి తేవడం లక్ష్యంగా, వాటిని నేరుగా రైతుల మొబైల్ ఫోన్లకు చేర్చేలా.. ఐసీఏఆర్ సార్వత్రిక డిజిటల్ విజ్ఞాన వేదికను రూపొందించాలని శ్రీ చౌహాన్ ప్రతిపాదించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేయడంలో ‘మొబైల్కే తొలి ప్రాధాన్యం’ అన్న విధానాన్ని అవలంబించాలన్నారు. దాంతో రైతులు పొలం గట్ల నుంచే నేరుగా స్మార్ట్ఫోన్ల ద్వారా భూసార పరీక్షల మార్గదర్శకాలు, పంటల సాగు సూచనలు, వాతావరణ అంచనాలు, మార్కెట్ సమాచారాన్ని సులభంగా పొందగలరని ఆయన అన్నారు.
6. నకిలీ విత్తనాలు, పురుగుమందులపై కఠిన చట్టాలు
నకిలీ, నాసిరకం వ్యవసాయ ఉత్పత్తుల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ విస్తృతంగా ఫిర్యాదులు వస్తున్నాయని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందుల విక్రేతలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన విత్తనాలు, పురుగుమందుల నాణ్యతను రైతులు అక్కడికక్కడే పరీక్షించుకునేలా.. సులభమైన క్షేత్రస్థాయి సాంకేతికతలను, గుర్తింపు సాధనాలను రూపొందించాలని శాస్త్రవేత్తలను ఆయన కోరారు. తద్వారా రైతులు మోసాలకు గురికాకుండా వారిని రక్షించడంతో పాటు, పంట నష్టాలను కూడా నివారించవచ్చని మంత్రి పేర్కొన్నారు.
7. 2029 నాటికి రూ. 10,000 కోట్ల అంతర్గత వనరుల సమీకరణ లక్ష్యం
కేవలం ప్రభుత్వ నిధులపైనే ఆధారపడడాన్ని ఐసీఏఆర్ క్రమంగా తగ్గించుకోవాలని శ్రీ చౌహాన్ అన్నారు. సాంకేతికతలు, పంట వంగడాలు, వ్యాక్సిన్ల వాణిజ్యీకరణతోపాటు లైసెన్సింగ్ విధానాల ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. 2029 నాటికి రూ.10,000 కోట్ల అంతర్గత వనరులను సమకూర్చుకోవాలన్న లక్ష్యాన్ని ఆయన నిర్దేశించారు. సరికొత్త ఆవిష్కరణల ద్వారా సంస్థాగత స్వావలంబనను సాధించే ప్రయత్నాలకు సమాంతరంగా.. ప్రభుత్వ మద్దతు కూడా కొనసాగుతుందని మంత్రి హామీ ఇచ్చారు.
వ్యవసాయ స్వావలంబన దిశగా కొత్త వంగడాలు, వ్యాక్సిన్లు, సాంకేతికతలు
ఈ సందర్భంగా అధిక దిగుబడినిచ్చే, తెగుళ్లను తట్టుకునే పంట రకాలు, పోషక విలువలు గల పంటలు, పశువులు - మత్స్య రంగానికి ఉపయోగపడే వ్యాక్సిన్లు, డిజిటల్ వ్యవసాయ పరిష్కారాలతో కూడిన.. 43 నూతన పంట వంగడాలు, 17 రకాల సాంకేతికతలు/ఉత్పత్తులు, 14 ప్రచురణలను ఆవిష్కరించారు. పశువులకు సోకే గాలికుంటు వ్యాధితోపాటు ఇతర ముఖ్యమైన జంతు వ్యాధులను నియంత్రించడంలో ఐసీఏఆర్ కృషిని శ్రీ చౌహాన్ ప్రత్యేకంగా అభినందించారు. దేశీయంగా రూపొందించిన వ్యాక్సిన్లు, మెరుగైన పంట రకాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విత్తనాలు, ఎరువులు, పశువుల ఆరోగ్యంలో దేశం స్వావలంబన సాధించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రైవేటు రంగం, అంకుర సంస్థల భాగస్వామ్యంతో ఐసీఏఆర్ ఆవిష్కరణలను రైతులకు మరింత వేగంగా చేరవేయడం లక్ష్యంగా.. ఈ కార్యక్రమంలో 70కి పైగా అవగాహన ఒప్పందాలను, సాంకేతిక లైసెన్సింగ్ ఒప్పందాలను కుదుర్చుకున్నారు.
శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయక సందేశం
శాస్త్రీయ పరిశోధనను జాతీయ లక్ష్యంగా అభివర్ణిస్తూ.. ప్రతి శాస్త్రవేత్త బాధ్యత కేవలం ఉద్యోగానికి మాత్రమే పరిమితం కాదనీ, అంతకు మించినదనీ శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. శ్రీ కృష్ణుడి బోధనల స్ఫూర్తితో.. ఆదర్శ కార్యకర్త ఉత్సాహవంతుడిగా, అహంకారం లేనివాడిగా, సౌమ్యుడిగా, ఇతరులతో సామరస్యంతో పనిచేసే సమర్థుడిగా ఉంటాడని ఆయన అన్నారు. రైతుల ఆకాంక్షలను తమ సొంత లక్ష్యంగా భావించాలనీ, దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా పూర్తి సామర్థ్యాన్ని వినియోగించాలని ఆయన శాస్త్రవేత్తలను కోరారు. అలాంటి సమష్టి కృషితో 2047 నాటికి.. ‘వికసిత కృషి - సమృద్ధ కిసాన్’ స్వప్నం సాకారమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్, వ్యవసాయం - రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రులు శ్రీ రామ్నాథ్ ఠాకూర్, శ్రీ భగీరథ్ చౌదరి, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్. పి. సింగ్ బఘేల్, డీఏఆర్ఈ కార్యదర్శి, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం. ఎల్. జాట్, అదనపు కార్యదర్శి శ్రీ జ్ఞానేంద్ర డి. త్రిపాఠి కూడా ఈ సమావేశంలో ప్రసంగించారు.
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కృషి విజ్ఞాన కేంద్రాలు, ఐసీఏఆర్ సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, విద్యార్థులతోపాటు వ్యవసాయ రంగ ప్రముఖులు వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో దేశ వ్యవసాయ పరిశోధన వ్యవస్థ ఘనతను చాటేలా.. ఐసీఏఆర్ 98వ వ్యవస్థాపక దినోత్సవం దేశవ్యాప్త ఉత్సవంగా సాగింది.
***
(रिलीज़ आईडी: 2285752)
आगंतुक पटल : 13