మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
కొచ్చిలో బ్రిక్స్ మహిళా మంత్రుల స్థాయి సదస్సు
మహిళా సదస్సుల చరిత్రలోనే తొలిసారిగా సంయుక్త ప్రకటన ఆమోదం... ఈ ఏడాది మహిళా మంత్రుల సమావేశంలో నూతన అధ్యాయం
మహిళా సాధికారత కోసం విజ్ఞాన భాగస్వామ్యం, పరస్పర అభ్యాసం, సామర్థ్య పెంపులను బలోపేతం చేసేందుకు రెండు సరికొత్త కార్యక్రమాలకు భారత్ నాయకత్వం
प्रविष्टि तिथि:
09 JUL 2026 4:24PM by PIB Hyderabad
భారత 2026 బ్రిక్స్ అధ్యక్షతన కొచ్చిలో నాలుగు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ మహిళా మంత్రుల స్థాయి సదస్సు ఈ రోజు విజయవంతంగా ముగిసింది. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య మహిళల నేతృత్వంలోని అభివృద్ధిపై సహకారాన్ని పెంపొందించడంలో ఇది ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. 2026 జూలై 6 నుంచి 9 వరకు జరిగిన ఈ సదస్సులో బ్రిక్స్ మహిళా అధ్యయన బృందం (వర్కింగ్ గ్రూప్), బ్రిక్స్ మహిళా మంత్రుల స్థాయి సమావేశాలు జరిగాయి. లింగ సమానత్వం, మహిళా సాధికారతను పెంపొందించడం కోసం ఉమ్మడి ప్రాధాన్యతలపై చర్చించేందుకు బ్రిక్స్ కుటుంబానికి చెందిన మంత్రులు, డిప్యూటీ మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సందర్భంగా ఒకే వేదికపైకి వచ్చారు.
మంత్రుల స్థాయి ముగింపు సదస్సులో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి మాట్లాడుతూ, బ్రిక్స్ సభ్య దేశాలకు విభిన్నమైన భౌగోళిక, సామాజిక, ఆర్థిక సాంస్కృతిక నేపథ్యాలు ఉన్నప్పటికీ మహిళా సాధికారత విషయంలో పలు ఉమ్మడి అంశాలనూ, సమస్యలనూ అవి పంచుకుంటున్నాయని పేర్కొన్నారు. సభ్య దేశాల మధ్య చర్చలను ప్రోత్సహించడానికీ, పరస్పర సహకారాన్ని పెంపొందించడానికీ బ్రిక్స్ మహిళా మంత్రుల వేదిక వంటివి అత్యంత కీలకమని ఈ ఉమ్మడి అంశాలు స్పష్టం చేస్తున్నాయని ఆమె అన్నారు.
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ అనిల్ మాలిక్ మాట్లాడుతూ, భారత్ అధ్యక్షతన జరిగిన ఈ చర్చల ప్రాధాన్యతను వివరించారు. బ్రిక్స్ మహిళా మంత్రుల సదస్సు సంయుక్త ప్రకటనను ఆమోదించడం ఉమ్మడి సవాళ్లను ఎదుర్కోవడంలో ఉమ్మడి సంకల్పానికి ఒక స్పష్టమైన నిదర్శనమని పేర్కొన్నారు.
మహిళా సదస్సుల చరిత్రలోనే తొలిసారిగా సంయుక్త ప్రకటనను ఆమోదించడం ఈ ఏడాది మహిళా మంత్రుల సమావేశంలో ఒక విజయం. అన్ని రంగాలలో మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని ప్రోత్సహించడంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి బ్రిక్స్ సభ్య దేశాలకున్న ఉమ్మడి సంకల్పాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.
బ్రిక్స్ మహిళా వేదిక కింద దీర్ఘకాల సహకారాన్ని బలోపేతం చేయడం కోసం భారత్ ప్రతిపాదించిన రెండు కొత్త కార్యక్రమాలను కూడా ఈ సమావేశాలు స్వాగతించాయి:
i) బ్రిక్స్ సభ్య దేశాల్లో మహిళా సాధికారతకు సంబంధించిన విజయవంతమైన విధానాలు, కార్యక్రమాలు, వినూత్న ఆవిష్కరణలను నమోదు చేసి, పరస్పరం పంచుకునేందుకు ఉద్దేశించిన ఉమ్మడి వేదికగా బ్రిక్స్ డిజిటల్ రిపోజిటరీ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్ పనిచేయనుంది.
ii) బ్రిక్స్ డిజిటల్ కెపాసిటీ బిల్డింగ్ మార్గదర్శకాలు సంస్థాగత సహకారాన్ని ప్రోత్సహించడం, విజ్ఞాన మార్పిడిని సులభతరం చేయడం, నిరంతర సహకారం ద్వారా మహిళా సాధికారతను వేగవంతం చేసేందుకు సామర్థ్య నిర్మాణాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా రూపుదిద్దుకున్నాయి.
బ్రిక్స్ మంత్రుల స్థాయి సదస్సులో భాగంగా ప్రత్యేక ప్యానెల్ చర్చలను భారత్ నిర్వహించింది. డిజిటల్ భాగస్వామ్యం, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, ఆర్థిక సాధికారత, వాతావరణ సుస్థిరత, ఆహార భద్రత, పోషకాహారం మొదలైన అంశాలపై తమ అనుభవాలను, ఉత్తమ విధానాలను పంచుకోవడానికి విధాన నిర్ణేతలు, నిపుణులు, క్షేత్రస్థాయి కార్యకర్తలు, అభివృద్ధి భాగస్వాములను ఈ చర్చలు ఒకే వేదికపైకి తీసుకువచ్చాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాలలో భారత్ చేపట్టిన 'మహిళల నేతృత్వంలోని అభివృద్ధి కార్యక్రమాలను ప్రదర్శించే ఎగ్జిబిషన్ను కూడా నిర్వహించారు. కేంద్ర మంత్రులు, ప్రముఖులు, విదేశీ ప్రతినిధులు ఈ ఎగ్జిబిషన్ను సందర్శించారు.
వివిధ మంత్రిత్వ శాఖలూ, విభాగాలూ చేపట్టిన కార్యక్రమాలను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు. వీటిలో సారస్, లఖ్పతి దీదీ కార్యక్రమాల ద్వారా గ్రామీణ జీవనోపాధి అభివృద్ధి, అస్మిత ద్వారా క్రీడల్లో మహిళల భాగస్వామ్యం, స్టెమ్ ద్వారా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం రంగాల్లో మహిళలకు ప్రోత్సాహం, ఆర్థిక సమ్మిళిత కార్యక్రమాలు, మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న షీ-బాక్స్, వన్ స్టాప్ సెంటర్లు, మహిళా హెల్ప్లైన్ వంటి కార్యక్రమాలు ఉన్నాయి.
సమ్మిళిత, సుస్థిరమైన వృద్ధికి ప్రధాన చోదక శక్తిగా మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికీ, పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికీ, సంస్థాగత భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికీ, విజ్ఞానం, ఉత్తమ విధానాల మార్పిడిని ప్రోత్సహించడానికీ బ్రిక్స్ సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం పునరుద్ఘాటించింది.
***
(रिलीज़ आईडी: 2283085)
आगंतुक पटल : 21