ప్రధాన మంత్రి కార్యాలయం
జకార్తాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
07 JUL 2026 9:16PM by PIB Hyderabad
ఈ రోజు జకార్తాలో జరిగిన ప్రవాస భారతీయుల సమ్మేళనంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రవాస భారతీయులు, ఇండోనేషియా మిత్రులు ప్రధానికి ఉత్సాహభరితంగా ఘన స్వాగతం పలికారు. ఒక ప్రత్యేక గౌరవ పురస్సరంగా ఇండోనేషియా దేశాధ్యక్షుడు శ్రీ ప్రబోవో సుబియాంతో కూడా ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆహూతులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి.. తమకు లభించిన ఉత్సాహభరిత స్వాగతానికి గాను భారతీయ సమాజానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధ్యక్షుడు ప్రబోవోకు ప్రధాని కృతజ్ఞతలు చెబుతూ... ఆయనను ఒక గొప్ప నాయకుడుగా, భారత దేశానికి నిజమైన మిత్రుడిగా అభివర్ణించారు. ఇండోనేషియా పురోగతి, శ్రేయస్సులో ప్రవాస భారతీయులు అందిస్తున్న సహకారాన్ని ఇరు దేశాల మధ్య మైత్రికి ప్రతీకగా అభివర్ణించారు. పరస్పర విశ్వాసం, భాగస్వామ్య వారసత్వం, సముద్ర అనుబంధాల ఆధారంగా ఇండోనేషియాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య ఉన్న ప్రాచీన నాగరికత సంబంధాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. బాలి యాత్ర, వైశాఖ పూర్ణిమ తీర్థయాత్ర వంటి సంప్రదాయాలతో పాటు ప్రస్తుత నలంద విశ్వవిద్యాలయం ద్వారా కొనసాగుతున్న ఆధునిక అనుసంధానాలు ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న వైవిధ్యభరిత, ఉత్సాహభరిత సంబంధాలను నిరంతరం పెంపొందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో భారత్ సాధించిన విశేషమైన పురోగతిని ప్రధానమంత్రి ప్రముఖంగా చెప్పారు. నవతరం మౌలిక వసతుల కల్పన మొదలుకొని అంకుర విప్లవం వరకు ప్రస్తావించిన ఆయన.. 25 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేలా చేసిన సామాజిక అభివృద్ధి కార్యక్రమాల విస్తరణ గురించి మాట్లాడారు. గత కొన్నేళ్లుగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతోందని.. ఇది దేశాన్ని ప్రపంచ వృద్ధికి ఒక కీలక చోదకశక్తిగా మార్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్లో చోటుచేసుకుంటున్న మార్పులను 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలుగా చూడాలని ప్రధాని అన్నారు.
వికసిత్ భారత్ 2047, ఇండోనేషియా ఎమాస్ 2045 పరస్పర ఆకాంక్షలను సాకారం చేసే దిశగా కృషి చేయాలని ఆయన భారతీయ సమాజానికి పిలుపునిచ్చారు. ఇండోనేషియాతో పాటు ఆసియాన్ ప్రాంతంలో పురోగతి, శ్రేయస్సును తీసుకురావడానికి.. శక్తిని ఎన్నోరెట్లు పెంచేదిగా భారత్ పనిచేయడానికి కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
భారత్, ఇండోనేషియా దేశాలు రెండు వేల సంవత్సరాలకు పైగా అత్యంత సన్నిహిత నాగరికత, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలను పంచుకుంటున్నాయి. ప్రస్తుతం ఇండోనేషియాలో సుమారు 1,50,000 మంది భారత సంతతి వ్యక్తులు (పీఐఓ).. దాదాపు 15,000 మంది ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ) నివసిస్తున్నారు. ఇండోనేషియా ఆర్థిక వృద్ధికి, బహుళ సంస్కృతుల సమాజానికి భారతీయ సమాజం నిరంతరం విలువైన సహకారాన్ని అందిస్తూ భారత్, ఇండోనేషియా మధ్య ఒక ముఖ్యమైన అనుసంధానంగా ఉంటూ సేవలందిస్తోంది.
***
(रिलीज़ आईडी: 2282389)
आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam