మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
కొచ్చిలో నేటి నుంచి బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ సమావేశం ప్రారంభం
నాడు పోస్టు చేయడమైనది:
06 JUL 2026 12:17PM by PIB Hyderabad
కొచ్చి, జూలై 6, 2026: భారత్ అధ్యక్షతన బ్రిక్స్ సదస్సు-2026 ఆధ్వర్యంలో బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ (డబ్ల్యూడబ్ల్యూజీ) సమావేశం కేరళలోని కొచ్చిలో ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉన్నత స్థాయి సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన సీనియర్ ప్రభుత్వ అధికారులు పాల్గొంటున్నారు. మహిళా సాధికారత, మహిళల నేతృత్వంలో అభివృద్ధి వంటి కీలక అంశాలపై చర్చించడంతోపాటు, పరస్పర ప్రయోజనాలు కలిగిన రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ సదస్సు సాగుతోంది.
ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతినిధులకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ అనిల్ మాలిక్ ఘనంగా స్వాగతం పలికారు. భౌగోళిక సరిహద్దులు మనల్ని భౌతికంగా దూరంగా ఉంచినప్పటికీ, మహిళా సాధికారతను పెంపొందించాలనే మన ఉమ్మడి సంకల్పమే మనల్ని ఇంత దగ్గరగా చేర్చిందని పేర్కొన్నారు. ఈ రెండు రోజుల సమావేశం అర్థవంతమైన చర్చలకు, పరస్పర అభ్యాసానికి, నిర్మాణాత్మక సహకారానికి వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళల అభ్యున్నతి కోసం బ్రిక్స్ దేశాల ఉమ్మడి నిబద్ధతను ఈ సదస్సు మరింత బలోపేతం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
భారతదేశ బ్రిక్స్ అధ్యక్షత కాలంలో మహిళా సాధికారత విభాగం ప్రధానంగా నాలుగు కీలక ప్రాధాన్యత రంగాల ఆధారంగా ముందుకు సాగుతోందని అనిల్ మాలిక్ వివరించారు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి ఆకాంక్షలు, ప్రస్తుత ప్రపంచ సవాళ్లను ప్రతిబింబించేలా ఈ రంగాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. వాటిలో మొదటిది.. మహిళల పాలన, నాయకత్వం ద్వారా మరింత పటిష్టమైన బ్రిక్స్ కూటమిని నిర్మించడం, రెండోది.. మార్పునకు చోదక శక్తులుగా ఆర్థిక, డిజిటల్ రంగాలలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, మూడోది.. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, వారి నైపుణ్యాభివృద్ధికి తోడ్పడటం, నాల్గవది.. వాతావరణ మార్పుల నియంత్రణ చర్యలు, ఆహార భద్రత, పోషకాహార లభ్యతలో మహిళల పాత్రను మరింత బలోపేతం చేయడం.
గత కొన్ని నెలలుగా జరిగిన వివిధ కార్యక్రమాలకు ఈ ప్రాధాన్యతా రంగాలు ఒక బలమైన వేదికను అందించాయని, కొచ్చి సమావేశంలో జరిగే చర్చలకు కూడా ఇవే దిశానిర్దేశం చేస్తాయని కేంద్ర కార్యదర్శి అనిల్ మాలిక్ పేర్కొన్నారు. ఈ సదస్సు కోసం జరిగిన ముందస్తు సంప్రదింపుల సమయంలో సభ్య దేశాలు ప్రదర్శించిన నిర్మాణాత్మక వైఖరి, రాబోయే రెండు రోజుల చర్చల్లోనూ కొనసాగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. దీని వల్ల వివిధ దేశాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి, ఉమ్మడి అవగాహనను పెంపొందించుకోవడానికి, ఈ సమావేశ నిర్ణయాలపై ఒక సమష్టి ఒప్పందానికి రావడానికి వీలవుతుందని తెలిపారు.
భారతదేశ అధ్యక్షతన బ్రిక్స్ సదస్సు ఇతివృత్తమైన ‘‘స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం’’ నినాదానికి అనుగుణంగా ఈ చర్చలు జరుగుతున్నాయి. ఈ ఇతివృత్తం ప్రధానంగా ప్రజల సంక్షేమానికి, మానవత్వమే ప్రథమం అనే విధానానికి పెద్దపీట వేస్తుంది. కొచ్చిలో ప్రస్తుతం జరుగుతున్న ఈ మహిళా వర్కింగ్ గ్రూప్ సమావేశం ముగిసిన వెంటనే జూలై 8, 9 తేదీల్లోలో రెండు రోజుల పాటు బ్రిక్స్ దేశాల మహిళా మంత్రుల స్థాయి సదస్సు కూడా ఇక్కడే జరగనుంది.
***
(రిలీజ్ ఐడి: 2281666)
సందర్శకుల సూచీ సంఖ్య : : 19