రాష్ట్రపతి సచివాలయం
ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొన్న భారత రాష్ట్రపతి
నూతన ఆలోచనల అన్వేషణకు, జ్ఞానార్జనకు ధైర్యాన్ని పెంపొందించుకోండి: విద్యార్థులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు
प्रविष्टि तिथि:
01 JUL 2026 2:24PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలో ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇవాళ (జూలై 1, 2026) జరిగిన తొలి స్నాతకోత్సవానికి భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయ మొదటి స్నాతకోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు.. ఈ నూతన సంస్థ ప్రయాణంలో కీలక ఘట్టమని అన్నారు. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా ఈ విశ్వవిద్యాలయం దీర్ఘకాలిక దార్శనికతను అభివృద్ధి చేసుకోవటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సుస్థిరాభివృద్ధి, నాణ్యమైన విద్యకు సంబంధించిన లక్ష్యాల పట్ల సంస్థకున్న నిబద్ధత.. సమ్మిళిత, సమానత్వ అభివృద్ధి పట్ల బాధ్యతాయుతమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని రాష్ట్రపతి అన్నారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అత్యున్నత విద్యా కేంద్రంగా ఎదుగుతుందని, 2047 నాటికి వికసిత్ భారత్ విజన్ సాకారంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి విద్యార్థులు చూపిన పట్టుదల, కృషికి ఈ స్నాతకోత్సవం ముగింపు అని రాష్ట్రపతి అన్నారు. ఎన్నో కలలతో విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించిన వారు.. ఇవాళ విజ్ఞానం, ఆత్మవిశ్వాసం, సరికొత్త అవకాశాలను పొందే డిగ్రీతో వెళ్తున్నారని పేర్కొన్నారు.
విద్యార్థుల విజయం వారి స్వయం కృషి ఫలితమే అయినప్పటికీ... తల్లిదండ్రుల త్యాగాలు, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, సమాజ మద్దతు కూడా ఉందని రాష్ట్రపతి అన్నారు. కాబట్టి తిరిగి సమాజానికి మేలు చేయాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని తెలిపారు. వారు ఉపాధిని కల్పించే పారిశ్రామికవేత్తలుగా, ఆవిష్కరణలకు బాటలు వేసే శాస్త్రవేత్తలుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, సమాజ సేవ చేసే దాతలుగా ఏ రంగంలో స్థిరపడినా.. వారి విజ్ఞానం అట్టడుగు వర్గాలకు బలమైన ఆసరాగా నిలవాలని కాంక్షించారు.
సాంకేతిక పురోగతి.. ప్రతి రంగంలో సమూల మార్పులను తీసుకువస్తోందని రాష్ట్రపతి అన్నారు. శరవేగంగా మారుతున్న ప్రపంచంలో కేవలం డిగ్రీని పొందటంతోనే నేర్చుకోవటం ముగిసిపోకూడదు. నూతన సాంకేతికతలకు అనుగుణంగా మారాలనే తపన విద్యార్థులకు గొప్ప బలంగా మారుతుంది. నూతన ఆలోచనల అన్వేషణకు, జ్ఞానార్జన కోసం ధైర్యాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.
నేర్చుకునే తత్వం, పట్టుదల, సృజనాత్మకత గల మన యువతే అమూల్యమైన జాతీయ సంపదని రాష్ట్రపతి అన్నారు. సృజనాత్మకత, పట్టుదల, బాధ్యతా స్ఫూర్తితో జ్ఞానాన్ని జోడించటం ద్వారా సవాళ్లను అవకాశాలుగా మలచుకుని, మరింత సమ్మిళిత, సుసంపన్నమైన భారతదేశ నిర్మాణానికి మన యువత సహకరించగలరని అన్నారు.
నైతిక విలువలను అలవరచుకోవటం విద్యార్థులకు ఎంతో సహాయపడుతుందని రాష్ట్రపతి చెప్పారు. నిజాయితీ, కరుణ, సానుభూతి, ప్రకృతి పట్ల గౌరవం కేవలం ఉన్నత నైతిక ఆదర్శాలు మాత్రమే కాదని.. సమగ్రాభివృద్ధికి పునాదులని అన్నారు. ఈ గుణాలు జీవితాన్ని సుసంపన్నం చేసుకోవటానికి, సమాజానికి, దేశానికి అర్థవంతమైన సహకారాన్ని అందించేందుకు తోడ్పడతాయని తెలిపారు.
యువత శక్తి, ప్రతిభ, నిబద్ధత ద్వారా మాత్రమే వికసిత్ భారత్ కల సాకారం అవుతుందని రాష్ట్రపతి అన్నారు. యువత ఏ మార్గాన్ని ఎంచుకున్నా.. అంకితభావం, నిజాయితీతో పనిచేసి ఉత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రపతి ప్రసంగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
***
(रिलीज़ आईडी: 2279957)
आगंतुक पटल : 32