ఉప రాష్ట్రపతి సచివాలయం
అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం-2026 వేడుకల్లో పాల్గొన్న ఉప రాష్ట్రపతి... ఎంఎస్ఎంఈల కోసం కీలక డిజిటల్ కార్యక్రమాల ప్రారంభం
ఎంఎస్ఎంఈల దీర్ఘకాలిక విజయానికి నాణ్యత, ఆవిష్కరణ, సాంకేతికతను అందిపుచ్చుకోవటం అత్యంత అవసరం: ఉప రాష్ట్రపతి
ఎంఎస్ఎంఈల క్రమబద్ధీకరణ, బ్యాంకు రుణాలు, సాంకేతికత పెంపునకు ప్రభుత్వ కృషిని అభినందించిన ఉప రాష్ట్రపతి
సాంకేతికత, ఏఐని ముప్పుగా కాకుండా అవకాశంగా స్వీకరించాలని పిలుపునిచ్చిన శ్రీ సీపీ రాధాకృష్ణన్
వ్యాపార ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న ఉప రాష్ట్రపతి... కష్టపడే తత్వం, నిరంతర అభ్యాసం అలవరచుకోవాలని యువతకు పిలుపు
प्रविष्टि तिथि:
27 JUN 2026 2:32PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం-2026 వేడుకలకు భారత ఉప రాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కేవలం ఆర్థిక రంగానికి సంబంధించినవి మాత్రమే కాదని... తొలితరం పారిశ్రామికవేత్తల సాహసానికి, యువత ఆకాంక్షలకు, మహిళా పారిశ్రామికవేత్తల పట్టుదలకు, సవాళ్లను అవకాశాలుగా మార్చుకున్న లక్షలాది చిన్న వ్యాపారాల స్థిరత్వానికి ప్రతీకలని కొనియాడారు. వికసిత్ భారత్-2047 దిశగా భారతదేశ ప్రయాణానికి శక్తిమంతమైన, చైతన్యవంతమైన ఎంఎస్ఎంఈ రంగం ఊతమిస్తుందని తెలిపారు.
పారిశ్రామికవేత్తగా తన ప్రయాణాన్ని ఉప రాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత తండ్రి ఇచ్చిన ఆర్థిక సహకారంతో దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రారంభంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి వివరిస్తూ.. ప్రజా జీవితంలోకి ప్రవేశించటానికి ముందుగానే తనకున్న పట్టుదల, నిరంతర అభ్యాసం, కఠిన శ్రమతో ప్రముఖ నిట్వేర్ ఎగుమతి వ్యాపారాన్ని నిర్మించినట్లు తెలిపారు. ప్రారంభ అడ్డంకులను చూసి ఎప్పుడూ నిరుత్సాహపడవద్దని, వృత్తిలో నైపుణ్యం సాధించేందుకు పూర్తి అంకితభావంతో పనిచేయాలని యువ పారిశ్రామికవేత్తలకు సూచించారు.
కాయిర్ బోర్డు ఛైర్మన్గా పదవీకాలాన్ని గుర్తుచేసుకుంటూ శ్రీ సీపీ రాధాకృష్ణన్ పలు అంశాలను వివరించారు. ఈ రంగానికి సంబంధించి అంతకుముందు పెద్దగా అవగాహన లేదని... పరిశ్రమకు సంబంధించిన ప్రతి కోణాన్ని అర్థం చేసుకోవటంలో పూర్తిగా లీనమైనట్లు శ్రీ సీపీ రాధాకృష్ణన్ చెప్పారు. ఎగుమతిదారులతో కలిసి, ప్రతిష్ఠాత్మకమైన లక్ష్యాలను నిర్దేశించుకోవటం ద్వారా ఈ రంగం అద్భుతమైన వృద్ధిని సాధించిందన్నారు. "మీరు ఏదైనా సాధించాలని నిర్ణయించుకుంటే కష్టపడి మీ రంగానికి సంబంధించిన ప్రతి విషయాన్ని నేర్చుకోండి. అప్పుడు విజయం ఖచ్చితంగా మిమ్మల్ని వరిస్తుంది" అని అన్నారు.
నాణ్యతా ప్రాముఖ్యత గురించి చెబుతూ... నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని ఉపరాష్ట్రపతి అన్నారు. ఖర్చులను తగ్గించుకునేందుకు నాణ్యతను ఎప్పుడూ పణంగా పెట్టకూడదని తెలిపారు. "పోటీదారుల కంటే మెరుగైన సేవలను, అత్యుత్తమ నాణ్యతను అందిస్తూ ఖర్చులను తగ్గించుకోవటంలోనే అసలైన విజయం దాగి ఉంది" అని చెప్పారు. రోజురోజుకూ పెరుగుతున్న పోటీతత్వ ప్రపంచ మార్కెట్లలో వ్యాపారాలు నిలదొక్కుకునేందుకు నాణ్యతే కీలకమని స్పష్టం చేశారు.
ఈ రంగంలో మరింత చైతన్యం రావాలని పిలుపునిస్తూ ప్రతి సూక్ష్మ పరిశ్రమ చిన్న పరిశ్రమగా, ప్రతి చిన్న పరిశ్రమ మధ్యతరహా పరిశ్రమగా ఎదగాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. కుటీర పరిశ్రమలుగా ప్రయాణాన్ని ప్రారంభించే వ్యవస్థాపకులు జీవితాంతం అదే స్థాయిలో ఉండిపోకూడదన్నారు. ఈ మార్పును సులభతరం చేసేందుకు తగిన పెట్టుబడులు, విధానపరమైన మద్దతు, సులభమైన రుణాల లభ్యత వంటివి ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
ఎంఎస్ఎంఈల సార్వత్రిక నమోదును ప్రోత్సహించాలని ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖను ఉప రాష్ట్రపతి కోరారు. మెరుగైన నమోదు వల్ల డేటా నాణ్యత పెరుగుతుందని, తద్వారా ఈ రంగం కోసం వాస్తవ అవసరాల ఆధారంగా మరింత సమర్థవంతమైన విధానాలను రూపొందించేందుకు వీలవుతుందని అన్నారు.
ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి ఇతివృత్తం "ఏఐ-ఆధారిత భవిష్యత్తులో మానవ వ్యవస్థాపకత" ను ప్రస్తావిస్తూ సాంకేతిక మార్పులను ముప్పుగా కాకుండా అవకాశంగా భావించాలని శ్రీ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. గతంలో కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చిన సమయంలో వ్యక్తమైన ఆందోళనలను గుర్తుచేస్తూ సాంకేతికత చివరికి కొత్త ఉపాధి అవకాశాలనే సృష్టించిందని చెప్పారు. కృత్రిమ మేథను కూడా నిర్మాణాత్మకంగా స్వీకరిస్తే వృద్ధికి కొత్త మార్గాలను సృష్టిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఖాదీ, గ్రామ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) సేవలను అభినందిస్తూ తేనె ఉత్పత్తి, ఖాదీ వస్త్రాల వంటి రంగాల్లో ఈ సంస్థ అద్భుతమైన మార్పును తీసుకువచ్చిందని శ్రీ సీపీ రాధాకృష్ణన్ కొనియాడారు. ఖాదీ వస్త్రాలు గాంధేయ ఆదర్శాల నుంచి స్ఫూర్తి పొందినప్పటికీ అంతర్జాతీయ పోటీని తట్టుకుని నిలబడాలంటే మారుతున్న వినియోగదారుల అభిరుచులకు, సాంకేతిక పురోగతికి అనుగుణంగా నిరంతరం మారాల్సి ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జాతీయ చిన్న పరిశ్రమల కార్పొరేషన్ (ఎన్ఎస్ఐసీ) షెడ్యూల్ 'A' కంపెనీగా పదోన్నతి పొందినందుకు ఉప రాష్ట్రపతి అభినందనలు తెలిపారు. పీఎంఈజీపీ 2.0 పోర్టల్, సమాధాన్ 2.0 పోర్టల్, ప్రొక్యూర్మెంట్, మార్కెటింగ్ సపోర్ట్ (పీఎంఎస్) 2.0 పోర్టల్, ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్ 2.0 పోర్టల్, టెస్టింగ్ సెంటర్ పోర్టల్తో పాటు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు చెందిన బహుభాషా సదుపాయాల కార్యక్రమాన్ని ఉప రాష్ట్రపతి ప్రారంభించారు. ఎంఎస్ఎంఈ ఐడియా హాకథాన్ 6.0ను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమం సందర్భంగా స్వావలంబన భారత్ (ఎస్ఆర్ఐ) ఫండ్, పీఎం విశ్వకర్మ (పీఎంవీ) పథకాలకు సంబంధించిన ఈ-బుక్స్ను ఉప రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) నూతన ఉత్పత్తులను కూడా మార్కెట్లోకి విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి శ్రీ జితన్ రామ్ మాంఝీ, ఎంఎస్ఎంఈ శాఖ సహాయమంత్రి సుశ్రీ శోభా కరంద్లాజే, కేవీఐసీ చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్, ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ భరత్ ఖేరా, మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, పరిశ్రమల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2278534)
आगंतुक पटल : 14