పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఎబోలా ఆరోగ్య పరీక్షల కోసం భారత్లోని పీఓఈల వద్ద ఎయిర్ సువిధ 2.O పోర్టల్ను ప్రారంభించిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీఐఏఎల్
प्रविष्टि तिथि:
25 JUN 2026 12:20PM by PIB Hyderabad
ఎబోలా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో దేశంలోకి ప్రవేశించే మార్గాల వద్ద ప్రజారోగ్య నిఘాను మరింత బలోపేతం చేయటానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్ (డీఐఏఎల్) నేడు ఎయిర్ సువిధ 2.O పోర్టల్ను ప్రారంభించాయి. ఇది ప్రయాణికుల ఆరోగ్య వివరాలను స్వయంగా సమర్పించే అత్యాధునిక కాంటాక్ట్లెస్ డిజిటల్ వేదిక.
అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల (ఐహెచ్ఆర్)-2005 ప్రకారం... డెమెక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో, ఉగాండాల్లో విజృంభిస్తున్న ఎబోలా, బుందిబుగ్యో వైరస్ వ్యాధిని మే 17, 2026న అంతర్జాతీయ ఆందోళనకర ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి (పీహెచ్ఈఐసీ)గా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఈ ప్రకటనను అనుసరించి భారత్లో ఈ కొత్త పోర్టల్ను ప్రారంభించారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి బుందిబుగ్యో వైరస్ డిసీజ్ (బీవీడీ)గా నిర్ధారణ అయింది. కాంగో, ఉగాండాకు సరిహద్దు దేశాలైన సౌత్ సూడాన్ వంటి పొరుగు దేశాలకు కూడా ఈ వ్యాధి వేగంగా సంక్రమించే ప్రమాదం ఉందని తాజా నివేదికలో డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) భాగస్వామ్యంతో ఈ పోర్టల్ను రూపొందించారు. దీనిద్వారా అంతర్జాతీయ ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్కు ముందుగానే ఆన్లైన్లో హెల్త్ సెల్ఫ్-డిక్లరేషన్ సమర్పించటం తప్పనిసరి. ఇందులో గత 21 రోజుల ప్రయాణ వివరాలు, వ్యాధిగ్రస్తులతో ఉన్నారా లేదా అనే సమాచారం, ఏవైనా లక్షణాలు ఉంటే వాటి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ పోర్టల్ ద్వారా వచ్చే సమాచారం ఎప్పటికప్పుడు ఎయిర్పోర్టు హెల్త్ ఆఫీసర్, బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్, ఐడీఎస్పీ, స్టేట్ సర్వైలెన్స్ ఆఫీసర్లకు అందుతుంది. దీనివల్ల ప్రమాదం పొంచి ఉన్న ప్రయాణికులను త్వరగా గుర్తించి, చికిత్స అందించవచ్చు. ప్రయాణికులు విమానాశ్రయంలో దిగాక ఎలాంటి పేపర్లను ఇవ్వాల్సిన పని లేకుండా, సులభంగా, కాంటాక్ట్లెస్ పద్ధతిలో ప్రయాణాన్ని ముగించుకోవచ్చు.
భారతదేశానికి చేరుకోవటానికి 24 గంటల ముందే ఎయిర్ సువిధ సెల్ఫ్ డిక్లరేషన్ ఫారంను (ఎస్డీఎఫ్) పూర్తి చేయాలి. ప్రయాణాన్ని వేగంగా ముగించుకునేందుకు ప్రయాణికులు విమానం ఎక్కటానికి ముందుగానే, వెబ్ చెక్-ఇన్ సమయంలోనే ఈ ఫారాలను నింపాల్సి ఉంటుంది. విమానాశ్రయంలో దిగిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్న ఎస్డీఎఫ్ ఫారాన్ని ఇంటర్నేషనల్ ట్రావెల్ హెల్త్ డెస్క్, ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద చూపిస్తే సరిపోతుంది.
ప్రయాణికుల భద్రత, ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా అంతర్జాతీయ ప్రయాణికులందరూ సెల్ఫ్-డిక్లరేషన్ వివరాలను ఖచ్చితంగా, ముందుగానే సమర్పించాల్సిందిగా అధికారులు కోరారు.
ఈ https://airsuvidha.civilaviation.gov.in/ వెబ్సైట్ లింక్ ద్వారా పోర్టల్ సేవలను పొందవచ్చు.
***
(रिलीज़ आईडी: 2277733)
आगंतुक पटल : 22