వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చల కోసం భారత్కు వచ్చిన రాయబారి జామీసన్ గ్రీర్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందం
प्रविष्टि तिथि:
24 JUN 2026 3:43PM by PIB Hyderabad
యూఎస్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తూ అమెరికా వాణిజ్య ప్రతినిధి అంబాసిడర్ జామీసన్ గ్రీర్.. జూన్ 22 నుంచి 24 వరకు న్యూఢిల్లీలో పర్యటించారు. సమానమైన, పరస్పర ప్రయోజనకరమైన భారత్-యూఎస్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఫిబ్రవరి 7, 2026 నాటి ఉమ్మడి ప్రకటనకు అనుగుణంగా తాత్కాలిక ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు జరుగుతున్న నిరంతర ప్రయత్నాల్లో కీలక ముందడుగా ఈ పర్యటన నిలిచింది.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్తో అంబాసిడర్ గ్రీర్ పలుదఫాలుగా చర్చలు జరిపారు. మార్కెట్ లభ్యతను మెరుగుపరచటం, డిజిటల్ వాణిజ్యం, స్థిరమైన సరఫరా వ్యవస్థ, పన్నేతర అడ్డంకులను తగ్గించటం, వ్యూహాత్మక రంగాల్లో సహకార విస్తరణ వంటి బీటీఏ ముఖ్య అంశాలపై ఇరుదేశాల నాయకులు సమగ్ర సమీక్ష నిర్వహించారు.
ఇటీవల జరిగిన చర్చల ద్వారా బృందాలు సాధించిన గణనీయమైన పురోగతిని ఇరుపక్షాలూ గుర్తించాయి. వరుసగా జరిగిన సాంకేతిక, మంత్రిత్వ శాఖ స్థాయి చర్చల ద్వారా వేగవంతమైన వృద్ధిని స్వాగతించాయి. సమగ్ర బీటీఏ దిశగా కీలక ముందడుగా, తాత్కాలిక ఒప్పందాన్ని ముగించే మార్గాలపై ప్రధానంగా చర్చలు జరిగాయి. ఇరుదేశాల్లోని వ్యాపారాలకు, రైతులు, కార్మికులు, వినియోగదారులకు స్పష్టమైన ప్రయోజనాలను అందించేలా సమతుల్యమైన, వ్యాపారపరంగా ఉపయోగపడే ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఇరుపక్షాలు నిబద్ధతను తెలియజేశాయి.
మారుతున్న ప్రపంచ వాణిజ్య పరిణామాల మధ్య భారత్-యూఎస్ ఆర్థిక భాగస్వామ్యానికి పెరుగుతున్న ప్రాధాన్యతను గుర్తిస్తూ.. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించటం, ఆవిష్కరణలను ప్రోత్సహించటం, స్థిరమైన, విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేయటమే ఉమ్మడి లక్ష్యమని ఇరుపక్షాలూ స్పష్టం చేశాయి.
ప్రస్తుతం జరుగుతున్న చర్చలు ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని, భారత్-యూఎస్ సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత దృఢంగా మారుస్తాయని ఇరుపక్షాలు ధీమా వ్యక్తం చేశాయి.
***
(रिलीज़ आईडी: 2277681)
आगंतुक पटल : 4