ఆయుష్
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో రికార్డు స్థాయి భాగస్వామ్యంతో ప్రపంచ ఉద్యమంగా ఆవిర్భవించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026
‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా’ ఇతివృత్తంతో సాగిన ప్రపంచవ్యాప్త వేడుకల్లో పాల్గొన్న లక్షలాది మంది ప్రజలు
780 జిల్లాల పరిధిలో 3 కోట్లకు పైగా ప్రజల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన యోగా సంగమ వేదిక... దేశవ్యాప్త ఉద్యమంలో భాగస్వాములైన 7.64 లక్షలకు పైగా సంస్థలు
సియాచిన్ మంచు శిఖరాల నుంచి సముద్రాల వరకు, చారిత్రక వారసత్వ ప్రదేశాల నుంచి అంతర్జాతీయ ప్రసిద్ధ కట్టడాల వరకు.. ఆరోగ్యం, సామరస్యానికి సార్వత్రిక చిహ్నంగా నిలిచిన ఐడీవై 2026
प्रविष्टि तिथि:
23 JUN 2026 4:11PM by PIB Hyderabad
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేడుకలు భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా మునుపెన్నడూ లేని రీతిలో భారీ ప్రజా భాగస్వామ్యానికి సాక్ష్యంగా నిలిచింది. సమగ్ర ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రపంచ ఉద్యమంగా యోగా ఎదుగుతున్న తీరును ఈ వేడుకలు మరోసారి స్పష్టం చేశాయి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో యోగా ప్రదర్శనలు, సామూహిక కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో గల చరిత్రాత్మక రెడ్ రోడ్లో జరిగిన వేడుకల్లో ఏకంగా 35,000 మంది పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సంవత్సరం “ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా” ఇతివృత్తంతో నిర్వహించిన ఈ వేడుకలు.. శారీరక దృఢత్వం, మానసిక స్థితిస్థాపకత, సమగ్ర శ్రేయస్సుకు యోగా అందించే సహకారాన్ని చాటిచెప్పింది. యోగాను ఒక జీవన విధానంగా మార్చుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఇది స్ఫూర్తినిచ్చింది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026ను ఒక నిజమైన ప్రపంచ వేడుకగా మార్చినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఈజిప్టు, అనేక ఇతర దేశాలతో సహా వివిధ ఖండాల్లో భారీ ఎత్తున యోగా కార్యక్రమాలను నిర్వహించారు. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం నుంచి ఐరోపా, పశ్చిమ ఆసియా, ఆఫ్రికా, తూర్పు ఆసియాలోని ప్రధాన నగరాల వరకు ప్రతిచోటా ప్రజలు ఈ వేడుకల్లో భాగస్వాములయ్యారు. ఇది ఆరోగ్యం, ప్రంశాతత, సామూహిక శ్రేయస్సుకు ఒక వారధిగా విశ్వవ్యాప్తంగా యోగాకు లభించిన గొప్ప ఆదరణను ప్రతిబింబించింది.
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పౌరులు, యోగా అభ్యాసకులు, వాలంటీర్లు, వివిధ సంస్థల సహకారాన్ని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్ జాదవ్ అభినందించారు. “ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా” ఇతివృత్తంతో సాగిన ఈ కార్యక్రమంలో ప్రజలు చూపిన ఉత్సాహం.. ఆరోగ్యం, సామరస్యం, సామూహిక శ్రేయస్సును పెంపొందించడంలో యోగా పాత్రను మరోసారి నిరూపించిందని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రజలు చూపిన ఉత్సాహంపై కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా హర్షం వ్యక్తం చేశారు. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనడం చూస్తుంటే యోగా ఒక జీవన విధానంగా విశ్వవ్యాప్త ఆదరణ పొందుతోందని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఇంతటి ఘన విజయం సాధించడానికి సహకరించిన పౌరులు, వాలంటీర్లు, నిర్వాహక సంస్థలు, భాగస్వాములందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సంవత్సరం ఇతివృత్తం ‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా’ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ.. సమగ్ర ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ యోగాను తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు.
దేశంలో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో దేశ సర్వోన్నత నాయకులు స్వయంగా పాల్గొన్నారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన యోగా ప్రదర్శనలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పాల్గొనగా, లడఖ్లోని లేహ్లో జరిగిన వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ భాగస్వామ్యులయ్యారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో ఎంపీలతో కలిసి లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా యోగా కార్యక్రమానికి నాయకత్వం వహించి దేశవ్యాప్త భాగస్వామ్య స్పూర్తిని చాటారు.
ఈ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా కేంద్రం, జాతీయ ఆయుష్ మిషన్ సంయుక్తంగా నిర్వహించిన ‘‘గంగోత్రి నుంచి గంగా సాగర్ వరకు’’ ప్రచార కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు దాదాపు 2,525 కిలోమీటర్ల మేర సాగిన ఈ ప్రచారంలో.. రిషికేశ్, హరిద్వార్, ప్రయాగ్రాజ్, వారణాసి, పాట్నా, హుగ్లీలోని ప్రసిద్ధ నదితీర ప్రాంతాలను కలుపుతూ ఉమ్మడి యోగా నియమావళి ప్రకారం యోగాసనాల ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. దేశపు అత్యంత గొప్ప చారిత్రక వారసత్వాలైన పవిత్ర గంగానది, ప్రాచీన యోగా అభ్యాసాన్ని ప్రతీకాత్మకంగా ఏకం చేస్తూ సాగిన ఈ కార్యక్రమం.. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలందరిలో “ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా”, సమగ్ర ఆరోగ్య సందేశాన్ని పంపింది.
పశ్చిమ బెంగాల్లోని కోల్కతా రెడ్ రోడ్లో జరిగిన ప్రధాన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ముందు.. ప్రజల భాగస్వామ్యాన్ని, అవగాహనను పెంచే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా పలు యోగా నేపథ్యంతో కూడిన వినూత్న కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా కోల్కతాలోని 11 ప్రాంతాలలో ‘దౌడ్ సే ధ్యాన్’ (పరుగు నుంచి ధ్యానం వైపు) పేరిట మారథాన్లను నిర్వహించి.. పౌరులు యోగాను, ఆరోగ్యాన్ని అలవర్చుకునేలా ప్రోత్సహించారు. వీటితోపాటు హుగ్లీ నదీ తీరంలో వందే యోగం, పశ్చిమ బెంగాల్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు, కళ, ఫోటోగ్రఫీ పోటీలు, ప్రజలను భాగస్వామ్యం చేసే పలు కార్యక్రమాలను చేపట్టారు. దాదాపు 3,000 డ్రోన్లతో నిర్వహించిన మెగా డ్రోన్ షో.. భారతీయ యోగా ప్రయాణాన్ని అద్భుతంగా ఆవిష్కరించడంతో పాటు, ప్రముఖ యోగా గురువులకు ఘన నివాళులర్పించింది. ఇది యోగా దినోత్సవానికి ముందే ప్రజల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది.
దేశంలోని ప్రతి మూలకు యోగా సందేశాన్ని తీసుకెళ్లేలా.. భారత్లోని ప్రసిద్ధ చారిత్రక, పర్యాటక ప్రాంతాలలో ప్రత్యేక యోగా కార్యక్రమాలను నిర్వహించారు. వీటిలో ముఖ్యంగా ఢిల్లీలోని ఎర్రకోట, ఉత్తరాఖండ్లోని హర్ కీ పౌరీ, ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం, కర్ణాటకలోని హంపి కట్టడాలు, లడఖ్లోని లే ప్యాలెస్, తమిళనాడులోని మహాబలిపురం తీర దేవాలయం, ఉత్తరప్రదేశ్లోని సార్నాథ్, అస్సాంలోని సిల్చార్ కచారి కోట, తెలంగాణలోని హైదరాబాద్ చార్మినార్ పరిసరాలు, మహారాష్ట్ర ముంబయిలోని గేట్వే ఆఫ్ ఇండియా, బిహార్లోని నలంద మహావిహార, గుజరాత్ అహ్మదాబాద్లోని సబర్మతి నదితీరంతోపాటు దేశంలోని మరెన్నో ప్రముఖ ప్రాంతాలలో యోగా వేడుకలు వైభవంగా జరిగాయి.
నిజమైన ప్రజా భాగస్వామ్య స్ఫూర్తిని చాటుతూ.. ఆయుష్ గ్రిడ్ రూపొందించిన యోగా సంగమం వేదికలో దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 780 జిల్లాల నుంచి 3.07 కోట్లకు పైగా ప్రజల భాగస్వామ్యం నమోదైంది. దేశవ్యాప్తంగా జరిగిన వివిధ యోగా కార్యక్రమాలకు సంబంధించిన 7.46 లక్షలకు పైగా ఫోటోలను ఈ వేదికలో అప్లోడ్ చేయగా.. 2.66 లక్షలకు పైగా భాగస్వామ్య ధ్రువీకరణ పత్రాలను జారీ చేసింది.
ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా 7.64 లక్షలకు పైగా సంస్థల నుంచి రిజిస్ట్రేషన్లు లభించాయి. ఇందులో 4.24 లక్షల ప్రభుత్వ సంస్థలు, 2.46 లక్షల విద్యా సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలుతోపాటు ఇతర భాగస్వామ్య వర్గాలు ఉన్నాయి. అత్యధికంగా సంస్థలు భాగస్వామ్యమైన రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ (3.45 లక్షల సంస్థలు), రాజస్థాన్ (1.67 లక్షలు), మధ్యప్రదేశ్ (35,742), అస్సాం (25,285), ఉత్తరప్రదేశ్ (22,285) ముందు వరుసలో నిలిచాయి. యోగా బిల్బోర్డ్ సౌకర్యం ద్వారా దేశవ్యాప్త పౌరుల నుంచి 15,000 కంటే ఎక్కువ ఫోటోలు అందాయి. ఇది మరింత విస్తృతమైన ప్రజా భాగస్వామ్యానికి వీలు కల్పించింది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 ముగింపునకు ముందు జరిగిన పలు కౌంట్డౌన్ కార్యక్రమాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కీలకంగా నిలిచాయి.
మహారాష్ట్రలోని బుల్దానాలో జరిగిన 75 రోజుల కౌంట్డౌన్ కార్యక్రమంలో దాదాపు 5,000 మంది పాల్గొని ఏకకాలంలో త్రికోణాసనం వేశారు. ఇంతపెద్ద సంఖ్యలో ఈ ఆసనాన్ని ప్రదర్శించినందుకు గాను ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది. హైదరాబాద్ సమీపంలోని కన్హా శాంతి వనంలో జరిగిన 50 రోజుల కౌంట్డౌన్ వేడుకలో 6,000 మందికి పైగా ఒకేసారి భుజంగాసనం వేసి, అత్యధిక సంఖ్యలో ఏకకాలంలో యోగా ప్రదర్శన చేసినందుకు గాను మరోసారి'ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నిలిచారు. 14 జూన్ 2026న ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారిక యూట్యూబ్ ఛానెల్ ద్వారా నిర్వహించిన ప్రపంచ ఆన్లైన్ యోగా కార్యక్రమంగా ఏకంగా 4,35,831 మంది ప్రత్యక్షంగా వీక్షించారు. దీంతో అత్యధిక మంది వీక్షించిన యూట్యూబ్ లైవ్ యోగా కార్యక్రమంగా ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించింది.
యోగా దినోత్సవం 2026 వేడుకలు ప్రభుత్వంలోని అన్ని శాఖల సమష్టి భాగస్వామ్యానికి అద్దం పట్టాయి. రక్షణ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, లోక్సభ సచివాలయం, పీఐబీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీఐఎస్ఎఫ్, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, ఇన్ల్యాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వంటి పలు కీలక మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఇందులో చురుగ్గా పాల్గొన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ పౌరులలో శారీరక దృఢత్వం, ముందస్తు ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్యకరమైన వృద్ధాప్య సందేశాన్ని ప్రోత్సహించాయి.
జలశక్తి మంత్రిత్వ శాఖ, ఎంఎంసీజీ, ఐడబ్ల్యూఏఐ సంయుక్తంగా గంగా నది పరివాహక ప్రాంతంతో పాటు అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిపై గల జాతీయ జలమార్గం-2లోని జాతీయ నౌకలపై ప్రత్యేక యోగా కార్యక్రమాలను నిర్వహించాయి. ఇది శారీరక ఆరోగ్యానికి, పర్యావరణ స్పృహకు మధ్య ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పింది. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో వయో యోగా సంగమం-ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో సుమారు 1,300 మంది వృద్ధులు పాల్గొని, క్రియాశీలకమైన, గౌరవప్రదమైన వృద్ధాప్యానికి యోగా ఎంతగా దోహదపడుతుందో చూపించారు.
రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా యోగా వేడుకలు జరిగాయి. సియాచిన్ మంచు శిఖరాల నుంచి కన్యాకుమారి వరకు, కచ్ తీరం నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు, సముద్రంలోని యుద్ధనౌకలపై యోగా తరగతులను నిర్వహించారు. రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్, సైనిక ఉన్నతాధికారులు, వేలాది మంది సైనికులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళం, కోస్ట్గార్డ్ తమ తమ విభాగాల పరిధిలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశాయి. పలు దేశాల రక్షణ ప్రతినిధులు కూడా ఈ వేడుకల్లో పాల్గొనడంద్వారా యోగా అంతర్జాతీయ ప్రాముఖ్యతను ప్రతిబింబించింది.
ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు సిబ్బంది లడఖ్లోని దాదాపు 14,000 అడుగుల ఎత్తులో ఉన్న పాంగోంగ్ త్సో సరస్సు వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు. శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, మానసిక స్థితిస్థాపకతను పెంపొందించడంలో యోగా ప్రాధాన్యతను ఈ ప్రదర్శన చాటిచెప్పింది. నేషనల్ క్యాడెట్ కోర్ (ఎన్సీసీ) నిర్వహించిన యోగా దేశవ్యాప్తంగా జరిగిన అతి పెద్ద కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది. 5,000 కంటే ఎక్కువ ప్రాంతాల్లో జరిగిన సమకాలీన యోగా సెషన్లలో 8.30 లక్షల మందికి పైగా క్యాడెట్లు, అసోసియేట్ ఎన్సీసీ అధికారులు, శాశ్వత శిక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.
యోగాను ప్రపంచానికి పరిచయం చేసే దేశ ప్రయాణంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 మరో అద్భుతమైన మైలురాయిగా నిలిచింది. పౌరులు, ప్రభుత్వ సంస్థలు, సాయుధ దళాలు, యువజన సంఘాలు, అంతర్జాతీయ సమాజాల క్రియాశీల భాగస్వామ్యంతో.. శారీరక ఆరోగ్యం, మానసిక శ్రేయస్సు, మానసిక సమతుల్యత, ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా ఒక శాశ్వతమైన సాధనమని ఐడీవై 2026 నిరూపించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సమగ్ర ఆరోగ్యాన్ని పెంపొందించడంలో దేశ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసింది.
***
(रिलीज़ आईडी: 2277341)
आगंतुक पटल : 8