ప్రధాన మంత్రి కార్యాలయం
‘రిపబ్లిక్ సదస్సు-2026’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
భారత్ వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు... నమ్మకమైన భాగస్వామి కూడా: పీఎం
అభివృద్ధి చెందుతున్న, విశ్వసనీయమైన శక్తి భారత్: పీఎం
దేశమే ప్రథమం.. ఇదే భారత్కు అత్యున్నత మార్గదర్శక సూత్రం: పీఎం
భారత్లో మావోయిస్టు తీవ్రవాదం కొనఊపిరితో ఉంది: పీఎం
‘‘ఇది ఎప్పటికీ జరగదు’’ అనే ఆలోచన నుంచి ‘‘ఇది జరుగుతుంది’’ అనే భావనకు మారడమే భారత్ సాధించిన గొప్ప విజయం: పీఎం
పేద, మధ్య తరగతి వర్గాలను సాధికారపరుస్తోన్న ప్రభుత్వం: పీఎం
వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసే 140 కోట్ల మంది భారతీయుల ఉమ్మడి ప్రయత్నాలు: పీఎం
प्रविष्टि तिथि:
22 JUN 2026 10:05PM by PIB Hyderabad
రిపబ్లిక్ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రస్తుత ప్రపంచం వేగవంతమైన, ముఖ్యమైన పరిణామాలను ఎదుర్కొంటున్న తరుణంలో ‘‘గ్రేట్ పవర్ ఇండియా: నేషన్ ఫస్ట్’’ అనే ఇతివృత్తంతో చర్చను ఏర్పాటు చేసిన నిర్వాహకులను ప్రధానమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి శుభాకాంక్షలు తెలియజేశారు.గడచిన దశాబ్దంగా భారత్ సాధిస్తున్న విజయాలకు, విశ్వసనీయమైన అంతర్జాతీయ శక్తిగా ఎదగడానికి ‘‘దేశమే ప్రథమం’’ అనే సిద్ధాంతమే మార్గదర్శక సూత్రంగా నిలిచిందని ప్రధానమంత్రి తెలియజేశారు. భారతదేశానికి సుదీర్ఘమైన చరిత్ర ఉందని, అభివృద్ది, ప్రతికూలతల నుంచి నేర్చుకునే ప్రత్యేక సామర్థ్యం ఉందని శ్రీ మోదీ చెప్పారు. ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న చర్యలు.. రాబోయే శతాబ్దాల్లో దేశ భవిష్యత్తుకు పునాది వేస్తున్నాయని స్పష్టం చేశారు. ‘‘ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మాత్రమే కాకుండా.. విశ్వసనీయమైన, నమ్మకమైన భాగస్వామిగా కూడా భారత్ ఎదుగుతోంది. నమ్మకం, స్థిరత్వం, ప్రపంచ క్షేమం కోసం నిబద్ధతే ఆధారంగా భారత్ వృద్ధి చెందుతోంది’’ అని ప్రధాని వివరించారు.
ఇటీవలే జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశాన్ని ప్రధానమంత్రి గుర్తు చేసుకుంటూ.. ‘‘దేశమే ప్రథమం’’ అనే సూత్రానికి భారతదేశం కట్టుబడి ఉన్నట్టు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు గుర్తించారని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ధి పథంలో ముందుకు వెళుతున్న కొద్దీ ఈ మార్గదర్శక స్ఫూర్తి... దేశ విధానాలు, ప్రాధాన్యాలు, ఆకాంక్షలను తీర్చిదిద్దుతూనే ఉంటుందని ప్రధాని తెలియజేశారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ దేశానికే ప్రథమ ప్రాధాన్యమిస్తూ.. పౌరుల ప్రదర్శించిన స్ఫూర్తి వల్లే స్వచ్ఛభారత్, మేక్ ఇన్ ఇండియా, ఖాదీకి ప్రోత్సాహం, స్థానిక ఉత్పత్తులకు ప్రచారం లాంటి కార్యక్రమాలు విజయం సాధించాయని చెప్పారు. ఈ విధానం గిరిజన, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకొచ్చిన మార్పుల గురించి ప్రధానమంత్రి వివరించారు. ‘‘ఒకప్పుడు హింస, వెనకబాటుతనంతో ఉన్న ఈ ప్రాంతాలు మునుపెన్నడూ లేని రీతిలో పురోగతిని సాధిస్తున్నాయి. గడచిన దశాబ్ద కాలంలో.. ప్రభావిత ప్రాంతాల్లో 12,000 కి.మీ.కు పైగా రహదారులు, 9,500కు పైగా మొబైల్ టవర్లు, బ్యాంకింగ్ సౌకర్యాలు, తపాలా కార్యాలయాలు, సమాచార వ్యవస్థలు ఏర్పాటయ్యాయి’’ అని వెల్లడించారు.
గత దశాబ్దాల్లో మావోయిస్టు హింసకు వేలాది మంది బలయ్యారని శ్రీ మోదీ అన్నారు. పటిష్టమైన భద్రతా చర్యలు, వేగవంతమైన అభివృద్ధి కారణంగా.. ఇప్పుడు అది చివరి దశకు చేరుకుందని తెలియజేశారు. ‘‘ఒకప్పుడు ఈ ప్రాంతాల్లో నెలకొన్న భయం, అనిశ్చితి స్థానంలో యువత ఆకాంక్షలు, ప్రతిభ ముందుకు వస్తున్నాయి. దీనికి బస్తర్ ఒలింపిక్స్ సాధించిన విజయమే నిదర్శనం’’ అని స్పష్టం చేశారు.
ఆకాంక్షాత్మక భారత్ ఆవిర్భావం గురించి శ్రీ మోదీ వివరించారు. నిరాశావాదం నుంచి ఆత్మవిశ్వాసం, అవకాశాలున్న యుగంలోకి దేశం ప్రవేశించిందని చెప్పారు. ‘‘మార్పు సాధ్యమే’’ అనే నమ్మకం దేశానికున్న విశిష్ట సామర్థ్యాల్లో ఒకటిగా మారిందన్నారు. ‘‘ఆకాంక్షాత్మక జిల్లాలు, ఆకాంక్షాత్మక బ్లాకుల కార్యక్రమం దేశంలో అత్యంత వెనకబడిన కొన్ని ప్రాంతాలను అభివృద్ధిలో ముందుకు నడిపించేవిగా మార్చింది. ఈ ప్రయత్నాలు లక్షలాది పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, అవకాశాలను విస్తరించడానికి గణనీయంగా దోహదపడ్డాయి" అని శ్రీ మోదీ వివరించారు.
అభివృద్ధి వల్ల కలిగే ప్రయోజనాలు లబ్ధిదారులకు మాత్రమే కాకుండా.. మొత్తం సమాజ శ్రేయస్సుకు కూడా దోహదపడతాయని ప్రధానమంత్రి అన్నారు. ‘‘ఇటీవలి కాలంలో సుమారుగా 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడటంతో.. నవ మధ్యతరగతి వర్గం ఆవిర్భవించింది. ఇది ఆర్థిక కార్యకలాపాలనను బలోపేతం చేయడంతో పాటు.. వివిధ రంగాల్లో అవకాశాలను విస్తరించింది. పేదరిక నిర్మూలన లక్ష్యం సంక్షేమపరమైనది మాత్రమే కాదు.. అది అభివృద్ధికి, ఆకాంక్షలకు, సామాజిక మార్పులకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది’’ అని చెప్పారు.
గడచిన దశాబ్ద కాలంగా మధ్యతరగతి వర్గానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం గురించి శ్రీ మోదీ తెలియజేశారు. మధ్యతరగతి కుటుంబాలకు జీవన సౌలభ్యాన్ని పెంపొందించడం తమ ప్రాధాన్యాంశంగా ఉందన్నారు. నిలిచిపోయిన గృహనిర్మాణ ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు. పనులు ఆగిపోయిన గృహ సముదాయాలను పూర్తి చేయడానికి రూ. 25,000 కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించామని వెల్లడించారు. ఫలితంగా దేశవ్యాప్తంగా వేలాది మంది గృహ కొనుగోలుదారులకు ఇళ్లను అందించగలిగామన్నారు. ‘‘తక్కువ వడ్డీకే ఇళ్ల రుణాలు, డిజిటల్ సేవలు, మెరుగైన పట్టణ మౌలిక వసతులు ప్రజల జీవన నాణ్యతను గణనీయంగా పెంపొందించాయి. చౌకయిన, మధ్య శ్రేణి ఆదాయ గృహాల కోసం ప్రత్యేక విండో (స్వామిహ్) నిధి లాంటి ప్రత్యేక చర్యలు... నిలిచిపోయిన వేలాది గృహాలను పూర్తి చేసి, కొనుగోలుదారులకు అందించడంలో సహాయపడ్డాయి” అని స్పష్టం చేశారు.
గత దశాబ్దంలో భారత దేశ రవాణా, అనుసంధాన మౌలిక సదుపాయాలు గణనీయంగా విస్తరించాయని ప్రధానమంత్రి అన్నారు. ‘‘రోజుకి కోటి మంది ప్రయాణికులకు మెట్రో రైలు వ్యవస్థలు సేవలందిస్తున్నాయి. వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ రైళ్లు దేశవ్యాప్తంగా రవాణా అనుసంధానాన్ని బలోపేతం చేస్తున్నాయి. విస్తరించిన రోడ్డు వ్యవస్థలు, జాతీయ రహదారులు, విమానాశ్రయాలు రాకపోకలను మెరుగుపరిచాయి. అలాగే పట్టణాల్లోనూ, అభివృద్ధి కేంద్రాలుగా మారుతున్న ప్రాంతాల్లోనూ కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి’’ అని శ్రీ మోదీ తెలియజేశారు.
పన్ను చెల్లింపుదారులకు మిగులు నికర ఆదాయాన్ని పెంచడం, పన్ను నిబంధనల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా చేపట్టిన పన్ను సంస్కరణల గురించి ప్రధానమంత్రి వివరించారు. ప్రత్యక్ష హాజరు అవసరం లేని ప్రక్రియలు, ఆన్లైన్ ఫైలింగ్ ప్రక్రియలతో సహా సరళమైన, సాంకేతిక ఆధారిత పన్ను విధానాలు... సౌకర్యాన్ని, పారదర్శకతను పెంపొందిస్తున్నాయని చెప్పారు.
చౌక ధరలకే ఔషధాలను అందించే జన ఔషధీ కేంద్రాలు, వివిధ సంక్షేమ పథకాల ద్వారా వృద్ధులకు ఆరోగ్య బీమా, తదితర కార్యక్రమాల ద్వారా చికిత్సకయ్యే ఖర్చును తగ్గించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించి ప్రధానమంత్రి తెలియజెప్పారు. ఇవి లక్షలాది కుటుంబాలకు మెరుగైన ఆరోగ్యసేవలను అందించడడంతో పాటు, వారి డబ్బును ఆదా చేశాయని వెల్లడించారు.
మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో చేపట్టిన ఆర్థిక సంస్కరణల గురించి కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. పన్ను ఉపశమన చర్యలు.. పన్ను రహిత ఆదాయ పరిమితులను గణనీయంగా పెంచాయని, తద్వారా ప్రజల వద్ద నికర మిగులు ఆదాయం పెరిగిందని చెప్పారు. ఆన్లైన్ ఫైలింగ్ వ్యవస్థలు, ప్రత్యక్ష హాజరు అవసరంలేని మదింపు వ్యవస్థలతో సహా సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత సంస్కరణల ద్వారా పన్ను విధానాలను సరళీకరించామని చెప్పారు. అలాగే నిబంధనల భారాన్ని తగ్గి, పారదర్శకత మెరుగుపడిందన్నారు.
‘‘భారత్ సాగిస్తున్న అభివృద్ధి ప్రయాణం.. అంచనాలు పెరిగే సంస్కృతిని సృష్టించింది. మెరుగైన మౌలిక వసతులను, వేగవంతమైన సేవలను, ఉన్నత జీవన ప్రమాణాలను ప్రజలు కోరుకుంటున్నారు. దేశ భవిష్యత్తుపై పెరుగుతున్న విశ్వాసానికి ఈ ఆకాంక్షలు సానుకూల సంకేతంగా మారాయి. అలాగే.. ప్రగతి సాధ్యమే అన్న ప్రజల నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయి’’ అని మారుతున్న ప్రజల ఆకాంక్షల గురించి ప్రధానమంత్రి తెలియజేశారు.
ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో కొత్తగా పుట్టుకొస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవడంలో భారతీయ యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, అంకుర సంస్థలు ముందున్నాయని ప్రధానమంత్రి అన్నారు. దేశమే ప్రథమం అనే స్ఫూర్తి అందిస్తున్న మార్గనిర్దేశంతో సంస్కరణలు, ఆవిష్కరణలు, పౌర కేంద్రక పరిపాలన పట్ల ప్రభుత్వానికున్న నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు. వేగంగా మారుతున్న భారత ప్రజల ఆకాంక్షలకు, ప్రతికూలత, వ్యతిరేకతలతో కూడిన రాజకీయ చర్చలకు మధ్య భేదాన్ని వివరించారు. పౌరులు మెరుగైన మౌలిక వసతులను, సాంకేతిక పరిజ్ఞానాలను, అనుసంధానాన్ని, అవకాశాలను కోరుకుంటారన్నారు. అయితే కొన్ని వర్గాలు అభివృద్ధి కార్యక్రమాలను వ్యతిరేకిస్తారని, కానీ వాటి ద్వారా వచ్చే ఫలితాలను మాత్రం ఆశిస్తుంటాయని ఆక్షేపించారు. దేశ నిర్మాణంలో నిర్మాణాత్మక భాగస్వామ్య ప్రాధాన్యం గురించి ప్రధానమంత్రి వివరించారు. దేశ ప్రజలు ముఖ్యంగా యువత భారత్ అభివృద్ధి లక్ష్యాలపై, దేశమే ప్రథమం అనే సూత్రంపై దృష్టి సారించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
మునుపెన్నడూ లేని విధంగా సంప్రదాయ విధానాలకు సవాలు విసురుతున్న విధ్వంసాలను ప్రపంచం చూస్తోందని ప్రధానమంత్రి అన్నారు. అదే సమయంలో వృద్ధికి, ఆవిష్కరణలకు నూతన అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకొని దేశ ప్రగతికి సహకరించాలని భారతీయ యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, అంకురంస్థలకు పిలుపునిచ్చారు. ‘‘ఈ పరివర్తనాత్మక ప్రయాణంలో ప్రజలకు అండగా ప్రభుత్వం నిలుస్తుంది. అభివృద్ధి మార్గంలో దేశం వేగంగా ప్రయాణిస్తోంది. ఈ వేగం మరింత పెరుగుతుంది' అని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. 1.4 బిలియన్ల మంది భారతీయుల సమిష్టి కృషి, ఆకాంక్షలు.. వికసిత్ భారత్ కలను సాకారం చేస్తాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ.. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
***
(रिलीज़ आईडी: 2277075)
आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Kannada