మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ సన్నద్ధతపై కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం
పరీక్షా నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు, పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరి: శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
కేంద్ర విద్యాశాఖ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్టీఏ, ఉన్నత విద్యా సంస్థలకు చెందిన సీనియర్ అధికారులు, ప్రతినిధులతో చర్చలు
प्रविष्टि तिथि:
18 JUN 2026 2:00PM by PIB Hyderabad
జూన్ 21, 2026న నిర్వహించనున్న నీట్ యూజీ రీ ఎగ్జామ్కు (పునఃపరీక్ష) సంబంధించిన సన్నద్ధతను సమీక్షించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన నేడు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ), ఉన్నత విద్యా సంస్థలకు చెందిన సీనియర్ అధికారులు, ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్, ఉన్నత విద్యా విభాగం కార్యదర్శి శ్రీ వినీత్ జోషి, ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ శ్రీ అభిషేక్ సింగ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సమావేశంలో కేంద్రమంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. పరీక్షా నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పాటించడం ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ విషయంలో సంబంధిత అధికారులందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని, పూర్తి సన్నద్ధతతో పనిచేయాలని ఆదేశించారు. ఈ పరీక్షలో ఎలాంటి అవకతవకలు లేకుండా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు ముందస్తుగానే చేపట్టాలని అధికారులను అదేశించారు. అన్ని స్థాయిల్లో సమన్వయం ఉండటం ఎంతో అవసరమని చెప్పారు. ఈ రీ ఎగ్జామ్ ప్రక్రియను పర్యవేక్షించడానికి, సమన్వయం చేయడానికి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా నియమించిన అధికారులు అన్ని రాష్ట్రాలకు చేరుకుంటారని తెలిపారు. ఈ అధికారులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ నేతృత్వంలోని ప్రధాన కమాండ్ సెంటర్కు నేరుగా నివేదిస్తారని మంత్రి చెప్పారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేని వాతావరణంలో పరీక్ష రాసేలా రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన నోడల్ అధికారులు అవసరమైన అన్ని వసతులను కల్పించాలని ఆదేశించారు.
కేంద్ర పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది లేకుండా, పూర్తి ప్రశాంతతతో పరీక్ష రాసేలా చూడాలని కోరారు. పరీక్ష ప్రారంభానికి ముందే విద్యార్థులకు కూర్చునేందుకు ఏర్పాట్లు చేయడం, తాగునీటి సదుపాయం కల్పించడంతో పాటు అవసరమైన అన్ని సదుపాయాలను సిద్ధం చేయాలని సూచించారు. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు, తక్షణ చర్యలు తీసుకోవాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నోడల్ అధికారులను కోరారు.
ప్రస్తుత సమయం నుంచి రీ ఎగ్జామ్ జరిగే తేదీ వరకు ఉన్న కాలం అత్యంత కీలకమైనదని కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి శ్రీ వినీత్ జోషి పేర్కొన్నారు. ఈ సమయంలో ముందస్తుగా, చురుకైన సమన్వయంతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. పరీక్షకు సంబంధించిన ఆదేశాలను, నిబంధనలను ఎప్పటికప్పుడు సకాలంలో అందరికీ చేరవేయాలని, నిర్దేశించిన అన్ని నిబంధనలన్నింటినీ కచ్చితంగా పాటించాలని ఆయన తెలిపారు.
నీట్ యూజీ రీ ఎగ్జామ్ను ఎలాంటి ఆటంకాలు లేకుండా, సజావుగా నిర్వహించడానికి ఎన్టీఏ అన్ని వర్గాలతో కలిసి పనిచేస్తోందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ శ్రీ అభిషేక్ సింగ్ తెలిపారు. జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా స్థాయి సమన్వయ కమిటీలు, రాష్ట్ర పోలీసు విభాగాలు, నిఘ సంస్థలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ.. పరీక్షను అత్యంత సురక్షితమైన, పారదర్శకమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.
ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పరీక్షా సన్నద్ధత, వివిధ విభాగాల మధ్య సమన్వయం, కట్టుదిట్టమైన భద్రతా నియమాలు, నిర్వహణ ఏర్పాట్లు, విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కార వేదికలు, పరీక్షా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించడం వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పరీక్షను సజావుగా, పారదర్శకంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సంబంధిత భాగస్వాములతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు.
హైబ్రిడ్ పద్దతిలో జరిగిన ఈ కీలక సమావేశానికి దేశవ్యాప్తంగా మొత్తం 222 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఉన్నతాధికారులు, కేంద్ర నిధుల ద్వారా నడిచే విద్యాసంస్థల నోడల్ అధికారులు, దేశంలోని ప్రముఖ ఉన్నత విద్యాసంస్థల వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించడానికి కేంద్ర విద్యాశాఖకు సంపూర్ణంగా సహకరిస్తామని వారంతా హామీ ఇచ్చారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేని, ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షా అనుభవాన్ని అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2274766)
आगंतुक पटल : 8