యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
వికసిత్ భారత్ 2047 లక్ష్యాలపై యువత వినూత్న ఆలోచనలు, సరికొత్త దృక్పథాలతో వికసిత్ భారత్ యువ పార్లమెంట్ 2026 జాతీయ స్థాయి సదస్సు ప్రారంభం
వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడంలో దేశ యువతదే కీలక పాత్ర: లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా
జెన్ జీ అంటేనే అమితమైన పట్టుదల, ఉత్సాహానికి నిదర్శనం... వారి ఆలోచనలను, శక్తిని దేశ నిర్మాణానికి ఉపయోగపడే దిశగా నడిపించాలి: కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
प्रविष्टि तिथि:
16 JUN 2026 2:29PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో వికసిత్ భారత్ యువ పార్లమెంట్ 2026 జాతీయ స్థాయి సదస్సును లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ప్రారంభించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయతోపాటు యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి పల్లవి జైన్ గోవిల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా 757 విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల నుంచి ఎంపికైన యువ ప్రతినిధులు ఒకే వేదికపై చేరి వికసిత్ భారత్@2047 లక్ష్యాలపై తమ వినూత్న ఆలోచనలను, దృక్పథాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా మాట్లాడుతూ.. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో దేశ యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. భారతీయ యువత ఉన్నత ఆశయాలు, గొప్ప లక్ష్యాలు, పెద్ద కలలతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ‘‘అభివృద్ధి చెందిన దేశ భవిష్యత్తుకు యువతే అతిపెద్ద బలం’’గా అభివర్ణించారు. వారి దృఢ సంకల్పం, వినూత్న ఆలోచనలు, నాయకత్వ సామర్థ్యాలే 2047 నాటి భారత్ను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ‘‘రాబోయే సంవత్సరాల్లో శాస్త్ర, సాంకేతికత, పరిశోధన, ఆవిష్కరణల రంగాల్లో భారతీయ యువత ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని.. నేడు ప్రపంచమంతా దేశ యువతను ఆశకు, ఆత్మవిశ్వాసానికి, భవిష్యత్తు అవకాశాలకు ప్రతీకగా చూస్తోంది’’ అని పేర్కొన్నారు. వికసిత్ భారత్ అనేది సమష్టి లక్ష్యమని చెబుతూ.. అభివృద్ధి చెందిన భారత్ కల ఏ ఒక్క వ్యక్తిదో, సంస్థదో లేదా ప్రభుత్వానిదో కాదన్నారు. ‘‘వికసిత్ భారత్ 140 కోట్ల మంది భారతీయుల ఉమ్మడి జాతీయ సంకల్పం’’ అని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ మహత్తరమైన లక్ష్యాన్ని 2047 నాటికి సాధించే బాధ్యత ప్రధానంగా నేటి యువత భుజాలపైనే ఉందన్నారు. యువతలోని అపారమైన శక్తి, ఆవిష్కరణల ఆలోచన, ధైర్యం, పట్టుదలే వికసిత్ భారత్ కలను నిజం చేయడానికి బలమైన శక్తులుగా మారుతాయని శ్రీ ఓం బిర్లా తెలిపారు.
ఈ సదస్సును ఉద్దేశించి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రసంగిస్తూ... దేశ నిర్మాణంలో యువత పోషించాల్సిన విప్లవాత్మక పాత్రను వివరించారు. సదస్సుకు హాజరైన ప్రతినిధులకు స్వాగతం పలికిన ఆయన.. ఎంతో కఠినమైన ఎంపిక ప్రక్రియ ద్వారా అర్హతను సాధించి యువత ఇక్కడికి వచ్చారని పేర్కొన్నారు. లోక్సభ స్పీకర్ ముందే తమ అమూల్యమైన అభిప్రాయాలను పంచుకునే అద్భుతమైన అవకాశం వీరికి దక్కడం ఎంతో అదృష్టమని అన్నారు.
వికసిత్ భారత్ దార్శనికత గురించి డాక్టర్ మాండవీయ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తి చేసుకునే 2047 నాటికి భారత్ను ఒక అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంకల్పించారని తెలిపారు. ఈ జాతీయ లక్ష్యాన్ని సాధించడానికి యువత తమ వంతు సహకారాన్ని అందించాలని పిలుపునిచ్చారు. దేశంలోని యువశక్తి ప్రాధాన్యతను వివరిస్తూ.. ‘‘ఈ యువశక్తే మన బలం, మన శక్తి. యువత కేవలం మన భవిష్యత్తు మాత్రమే కాదు, దేశ సమస్యలన్నింటికీ వారే పరిష్కారం కూడా’’ అని వ్యాఖ్యానించారు.
దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారేనని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇంతటి అపారమైన యువశక్తి గల మన దేశంలో యువత కలిసికట్టుగా సమష్టి సంకల్పాన్ని తీసుకుంటే, దేశం ఎదుర్కొంటున్న ఎలాంటి సవాలుకైనా సులభంగా పరిష్కారాలను కనుగొనవచ్చని తెలిపారు.
దేశంలోని యువత సామర్థ్యాలపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఎల్లప్పుడూ అపారమైన నమ్మకం ఉందని కేంద్రమంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాలు, తీర ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలతో సహా విభిన్న నేపథ్యాల నుంచి లక్ష మంది యువ నాయకులను తయారు చేయాలని ప్రధాని పిలుపునిచ్చారని తెలిపారు. ‘‘దేశ నిర్మాణంలో చురుగ్గా పాలుపంచుకునేలా ఇలాంటి లక్ష మంది యువ నాయకులను సిద్ధం చేయాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. శ్రీ మోదీ ఆశయాలకు అనుగుణంగా కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ బాధ్యతను తీసుకుంది’’ అని తెలిపారు.
మై భారత్ వేదిక ఆధ్వర్యంలో యువత నేతృత్వంలో సాగుతున్న వినూత్న కార్యక్రమాలపై పెరుగుతున్న ప్రభావాన్ని కూడా మంత్రి మాండవీయ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇందులో భాగంగా వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్, వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమం, వికసిత్ భారత్ బడ్జెట్ క్విజ్, యువ కనెక్ట్, అనుభవపూర్వ అభ్యాస కార్యక్రమాలు వంటివి యువతను ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమాల ద్వారా యువతీ యువకులు ప్రభుత్వ పాలన, సామాజిక సేవ, దేశ నిర్మాణ ప్రక్రియలలో నేరుగా భాగస్వాములు అవుతున్నారని కేంద్ర మంత్రి వెల్లడించారు.
నేటి తరం యువత ఆలోచనా విధానాన్ని, వారిలోని ఉత్సాహాన్ని మంత్రి ప్రస్తావిస్తూ.. ‘‘యువతలో ఉన్న అపారమైన శక్తి, పట్టుదల, వినూత్న ఆలోచనలను వికసిత్ భారత్ నిర్మాణానికి ఉపయోగపడేలా సరైన దిశలో మళ్లించాలి’’ అని పేర్కొన్నారు. యువ పార్లమెంట్ వంటి వేదికలు భవిష్యత్తు నాయకులకు ఎంతో మేలు చేస్తాయని, ఎన్నో విషయాలను నేర్చుకోవడానికి, చర్చించడానికి, ప్రజాస్వామ్య ప్రక్రియల్లో భాగస్వాములు కావడానికి, దేశ ప్రగతికి అర్థవంతమైన సహకారాన్ని అందించడానికి అద్భుతమైన అవకాశాలను కల్పిస్తాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో లోక్సభ సెక్రటరీ జనరల్ శ్రీ ఉత్పల్ కుమార్ సింగ్, కేంద్ర యువజన వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి శ్రీ నితేష్ మిశ్రాతో పాటు మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ వికసిత్ భారత్ యువ పార్లమెంట్ 2026 సదస్సు న్యూఢిల్లీలో 2026 జూన్ 15 నుంచి జూన్ 17 వరకు జరగనుంది. ప్రజాస్వామ్య ప్రక్రియలపై యువతకు అవగాహనను మరింత పెంపొందించడానికి, ప్రభుత్వ పాలన, విధానపరమైన చర్చలు, పార్లమెంటు పనితీరుపై వారికి ప్రత్యక్ష అనుభవాన్ని కల్పించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
ఈ జాతీయ స్థాయి సదస్సులో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన యువ ప్రతినిధులు ఒకే చోటికి చేరి.. జాతీయ ప్రాధాన్యత కలిగిన కీలకమైన అంశాలపై చర్చిస్తూ, వికసిత్ భారత్@2047 దార్శనికతకు తమ వంతు మేధోపరమైన సహకారాన్ని అందిస్తున్నారు.
***
(रिलीज़ आईडी: 2273605)
आगंतुक पटल : 20