సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఎన్ఐటీ జైపూర్లో అడ్వాన్స్డ్ క్వాంటం, కృత్రిమ మేధ ల్యాబ్లను ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించిన శ్రీ అశ్వినీ వైష్ణవ్
విద్యార్థులకు అందుబాటులోకి రానున్న ల్యామ్ రీసెర్చ్కు చెందిన 'సెమివర్స్ సెమికండక్టర్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్'
प्रविष्टि तिथि:
11 JUN 2026 5:22PM by PIB Hyderabad
జైపూర్లోని మాలవీయ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (ఎంఎన్ఐటీ) అడ్వాన్స్డ్ క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు ఎలక్ట్రానిక్స్ - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైల్వే, సమాచార- ప్రసారాల కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ రోజు ప్రకటించారు.
ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (మైటీ) పరిధిలోని 'ఎలక్ట్రానిక్స్, ఐసీటీ అకడమిక్ ప్రాజెక్ట్' కింద ఈ ల్యాబ్ను ఏర్పాటు చేయనున్నారు.
ఇది క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ (క్యూకేడీ), క్వాంటం కంప్యూటింగ్ సిమ్యులేషన్, క్వాంటం సెన్సింగ్ హార్డ్వేర్ విభాగాల్లో స్వదేశీ సామర్థ్యాల పెంపొందింపుపై దృష్టి సారిస్తుంది.
విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత సాంకేతిక విప్లవం కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా నడుస్తుండగా క్వాంటం టెక్నాలజీ తదుపరి ప్రధాన సాంకేతిక విప్లవాన్ని తీసుకొస్తుందని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్ట్ కింద చేపట్టబోయే పనులు దేశానికి ఎంతో ముఖ్యమని కేంద్ర మంత్రి తెలిపారు. జాతీయ భద్రతా దృష్ట్యా అత్యంత కీలకమైన క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ (క్యూకేడీ) రంగంలో కూడా ఈ ల్యాబ్ పరిశోధనలు నిర్వహిస్తుంది.
పోస్ట్-క్వాంటం క్రిప్టోగ్రఫీ రంగంలో ఎంఎన్ఐటీ జైపూర్ ముందంజలో ఉండి నాయకత్వ పాత్ర వహించాలని శ్రీ అశ్వినీ వైష్ణవ్ పిలుపునిచ్చారు.
ల్యామ్ రీసెర్చ్కు చెందిన ‘సెమివర్స్’ ప్లాట్ఫామ్
డిజిటల్ ట్విన్ ఆధారిత సెమీకండక్టర్ తయారీ, శిక్షణ వ్యవస్థ అయిన ల్యామ్ రీసెర్చ్కు చెందిన 'సెమివర్స్' ప్లాట్ఫామ్ను ఎంఎన్ఐటీ జైపూర్ విద్యార్థులు ఉపయోగించొచ్చని కేంద్ర మంత్రి తెలిపారు.
సెమివర్స్ ద్వారా విద్యార్థులు ఇప్పుడు సెమికండక్టర్ చిప్ నిర్మాణాలను 3డీ రూపంలో అధ్యయనం చేయొచ్చు. దీని ద్వారా విద్యార్థులు చిప్ తయారీ ప్రక్రియలను అర్థం చేసుకోవటమే కాకుండా వర్చువల్ పద్ధతిలో ఫ్యాబ్రికేషన్ దశలను సిమ్యులేట్ చేయవచ్చు.
పరిశ్రమ అంచనాల ప్రకారం పది లక్షల కంటే ఎక్కువ మంది సెమీకండక్టర్ డిజైన్ నిపుణుల అవసరం ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ లోటును భారత్ సులభంగా భర్తీ చేయగలదు. ఇప్పటికే ఎన్విడియా, క్వాల్కమ్, ఏఆర్ఎం, ఏఎండీ వంటి కంపెనీలు భారత్లోనే 2, 3 నానోమీటర్ల అధునాతన సెమీకండక్టర్ చిప్లను డిజైన్ చేస్తున్నాయి. డిజైన్ విభాగంలో స్థానికంగా నిపుణులు అందుబాటులో ఉండటం వల్లే ఇది సాధ్యమైంది.
కేంద్ర ప్రభుత్వం ‘సీటూఎస్ (చిప్స్ టు స్టార్టప్)’ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 323 కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలకు ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ (ఈడీఏ) సాధనాలను అందిస్తోందని శ్రీ అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇవి సైనాప్సిస్, కాడెన్స్, రెనెసాస్ వంటి ప్రముఖ కంపెనీలకు చెందిన అత్యాధునిక సెమీకండక్టర్ డిజైన్ పరికరాలు.
ఈ సాధనాలను ఉపయోగించి భారత్లోని వివిధ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు డిజైన్ చేసిన 100 కంటే ఎక్కువ చిప్లను మొహాలీలోని సెమీకండక్టర్ లాబొరేటరీలో (ఎస్సీఎల్) విజయవంతంగా తయారు చేశారు. ఈ అధునాతన ఈడీఏ సాధనాలను విద్యార్థులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.
కృత్రిమ మేధ ల్యాబ్
ఎంఎన్ఐటీ జైపూర్లో కృత్రిమ మేధ ల్యాబ్ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ఈ ల్యాబ్ పరిశోధన, ఆవిష్కరణల కోసం అధునాతన కంప్యూటింగ్, అవసరమైన పరికరాలతో కూడిన సౌకర్యాలను అందిస్తుంది.
ఈ ల్యాబ్ను 'ఇండియా-ఏఐ' మిషన్ నెట్వర్క్తో అనుసంధానించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ సందర్భంగా డీప్ఫేక్ గుర్తింపు సాంకేతికతకు సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) జోధ్పూర్ చేస్తున్న కృషిని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
'మేకర్స్ ల్యాబ్' ప్రారంభం
అనంతరం రాజస్థాన్ ప్రభుత్వ ఇంధన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ హీరాలాల్ నగర్, రాజస్థాన్ శాసనసభ సభ్యులు (సివిల్ లైన్స్ జైపూర్) శ్రీ గోపాల్ శర్మతో కలిసి ఎంఎన్ఐటీ జైపూర్లో 'మేకర్స్ ల్యాబ్'ను శ్రీ అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు.
మేకర్స్ ల్యాబ్ విద్యార్థులకు సాఫ్ట్వేర్, హార్డ్వేర్ సాంకేతికతలలో ప్రయోగాత్మక, ప్రత్యక్ష శిక్షణ అందించనుంది. ఇందులో సెన్సార్లు, ఎంబెడెడ్ సిస్టమ్స్, కంప్యూటింగ్ పరికరాలు, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలు ఉంటాయి.
దీనికంటే ముందు విద్యార్థులు, అధ్యాపకులతో కేంద్ర మంత్రి మాట్లాడారు. విద్యార్థులు తాము తయారు చేసిన ఏఐ, రోబోటిక్స్, డ్రోన్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, పోస్ట్-క్వాంటం క్రిప్టోగ్రఫీ రంగాలకు చెందిన పలు ప్రాజెక్టులు, అప్లికేషన్లను మంత్రికి వివరించారు.
***
(रिलीज़ आईडी: 2271953)
आगंतुक पटल : 12