పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమ ఆసియాలో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో చేపట్టిన చర్యలపై వివిధమంత్రిత్వ శాఖల తాజా సమాచారం
ఎరువుల ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాల లభ్యతపై నిరంతర సమీక్ష: ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఎరువుల సరఫరా
ఖరీఫ్ 2026 సీజన్కు సంబంధించి ఎరువుల అవసరం 383.9 లక్షల మెట్రిక్ టన్నులుగా తాజా అంచనా; సాధారణ 33 శాతం నిల్వల స్థాయి కంటే అదనంగా ప్రస్తుతం అందుబాటులో 51 శాతానికి పైగా నిల్వలు
గడిచిన 4 రోజుల్లో సుమారు 1.67 కోట్ల ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్ లకు గానూ 1.77 కోట్ల సిలిండర్ల పంపిణీ
మార్చి 2026 నుంచి ఇప్పటివరకు సుమారు 9.16 లక్షల పీఎన్జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా ప్రారంభం; కమరో 3.05 లక్షల కనెక్షన్ల కోసం మౌలిక సదుపాయాలు సిద్ధం; దాదాపు మరో 9.24 లక్షల మంది కొత్త వినియోగదారుల నమోదు
స్వచ్ఛమైన, మరింత అందుబాటు ధరలో పర్యావరణహిత రవాణా సౌకర్యానికి దోహదపడుతూ పెట్రోల్ కంటే లీటరుకు దాదాపు రూ. 20 తక్కువ ధరకే లభిస్తున్న ఈ85 ఇంధనం
ఎంటీ మారివెక్స్ నౌకలో అగ్నిప్రమాదం; నౌకలోని 24 మంది భారతీయ నౌకా సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు సమాచారం
భారతీయ నౌకా సిబ్బందికి అవసరమైన సహాయాన్ని అందిస్తున్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారత నౌకాదళం
प्रविष्टि तिथि:
08 JUN 2026 7:33PM by PIB Hyderabad
పశ్చిమ ఆసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో, దేశ ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించేందుకు భారత ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈరోజు ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొని దేశంలో ఇంధన లభ్యత, నౌకా రవాణా కార్యకలాపాలు, కీలక రంగాలలో స్థిరత్వాన్ని కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ కూడా దేశంలో ఎరువుల లభ్యత, ప్రస్తుత నిల్వల స్థితిగతులపై తాజా సమాచారాన్ని పంచుకుంది.
ఎరువుల నిల్వ పరిస్థితి - లభ్యత
దేశంలో ఎరువుల లభ్యత, మొత్తం నిల్వలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి.
ఖరీఫ్ 2026 సీజన్కు సంబంధించి ఎరువుల అవసరాన్ని వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ తాజాగా 383.9 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటీ)గా అంచనా వేసింది. ఇందులో నేటి వరకు దాదాపు 197.56 లక్షల మెట్రిక్ టన్నుల (51 శాతానిపైగా) నిల్వలు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఉండే 33 శాతం నిల్వల స్థాయి కంటే ఇది చాలా ఎక్కువ. ప్రభుత్వ ముందస్తు ప్రణాళిక, ముందస్తు నిల్వలు సమర్థవంతమైన రవాణా నిర్వహణకు ఇది నిదర్శనం.
ప్రస్తుత ఖరీఫ్-2026 సీజన్లో 07.06.2026 నాటికి భారతీయ రైతులు ఇప్పటికే మొత్తం 86.65 ఎల్ఎమ్టి రసాయన ఎరువులను కొనుగోలు చేశారు. ఇది మొత్తం అవసరంలో దాదాపు 22.57 శాతానికి సమానం.
పశ్చిమ ఆసియా సంక్షోభం తర్వాత భారతీయ రైతులు 11.17 ఎల్ఎమ్టి సేంద్రీయ ఎరువులను (ఎఫ్ఓఎం/.ఎల్ఎఫ్ఓఎం/పీఆర్ఓఎం) కొనుగోలు చేశారు. గత ఏడాది ఇదే కాలంలో ఇది కేవలం 3.20 ఎల్ఎమ్టి మాత్రమే. రాష్ట్రాల వారీగా చూస్తే పంజాబ్ 2.83 ఎల్ఎమ్టి, ఉత్తరప్రదేశ్ 2.71 ఎల్ఎమ్టి, హర్యానా 1.33 ఎల్ఎమ్టి, మధ్యప్రదేశ్ 1.25 ఎల్ఎమ్టి, గుజరాత్ 0.96 ఎల్ఎమ్టి, మహారాష్ట్ర 0.84 ఎల్ఎమ్టి చొప్పున సేంద్రీయ ఎరువులను సేకరించాయి. ఈ భారీ పెరుగుదల సేంద్రీయ పోషక వనరుల పట్ల రైతులలో పెరుగుతున్న ఆసక్తిని సూచించడమే కాకుండా, రసాయన ఎరువుల నుంచి సేంద్రీయ ప్రత్యామ్నాయాల వైపు రైతుల ప్రాధాన్యతలు క్రమంగా మారుతున్నాయని స్పష్టం చేస్తోంది.
ప్రస్తుతానికి, ఈ ఖరీఫ్ సీజన్లో ఎరువుల లభ్యతకు సంబంధించి ఎలాంటి ప్రధాన సవాళ్లు లేదా అడ్డంకులు లేవు.
సంక్షోభం తలెత్తిన తర్వాత దేశీయ ఉత్పత్తి ఎరువుల దిగుమతుల వివరాలు (లక్షల టన్నులలో):-
|
ఉత్పత్తి
|
సంక్షోభం తరువాత దేశీయ ఉత్పత్తి
|
సంక్షోభం తరువాత భారతీయ రేవులకు దిగుమతులు
|
|
యూరియా
|
69.15
|
18.35
|
|
డీఏపీ
|
9.78
|
2.53
|
|
ఎన్పీకేఎస్
|
22.13
|
7.87
|
|
ఎస్ఎస్పీ
|
13.14
|
0
|
|
ఎంఓపీ
|
0
|
4.45
|
|
మొత్తం
|
114.20
|
33.20
|
-
సంక్షోభం అనంతర పరిస్థితుల్లో దిగుమతులు, దేశీయ ఉత్పత్తి ద్వారా దాదాపు 147.40 ఎల్ఎమ్టి ఎరువులు అదనంగా అందుబాటులోకి వచ్చాయి.
-
ప్రస్తుత జూన్ నెలలో, భారతీయ రేవులకు దిగుమతి చేసుకున్న యూరియా, డీఏపీ, ఎన్పీకే ఎరువులు 25 ఎల్ఎమ్టి పైగా చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు.
-
మరో 17 ఎల్ఎమ్టి యూరియా కొనుగోలు కోసం భారత్ అంతర్జాతీయ టెండర్ను జారీ చేసింది, దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం పురోగతిలో ఉంది.
-
యూరియా, పీ అండ్ కే ఎరువుల ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాల లభ్యతను ఎరువుల శాఖ నిరంతరం పర్యవేక్షిస్తూ, సమీక్షిస్తోంది.
-
ఎరువుల కంపెనీలు దాఖలు చేసే సబ్సిడీ బిల్లులన్నింటినీ ఎరువుల శాఖ ప్రతి వారం క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. ప్రస్తుతం ఎరువుల సబ్సిడీ చెల్లింపుల కోసం తగినంత బడ్జెట్ అందుబాటులో ఉంది.
-
దేశంలో ఎరువుల కొరత లేకుండా, తగినంత లభ్యత కోసం ఇప్పటివరకు ఉన్నతాధికారుల సాధికార కమిటీ 11 సమావేశాలను నిర్వహించింది. లభ్యతకు సంబంధించి ఎదురైన మెజారిటీ సవాళ్లను ఈ కమిటీ పరిష్కరించింది.
-
దేశంలో ఎరువుల భద్రత అత్యంత బలంగా, స్థిరంగా, సువ్యవస్థితంగా ఉంది. అన్ని ప్రధాన రకాల ఎరువులూ కూడా నిరంతరం అవసరానికి మించి తగినంతగా అందుబాటులో ఉంటున్నాయి.
"భారత ప్రభుత్వ సమర్థవంతమైన ప్రయత్నాల వల్ల దేశంలో ఎరువుల ఉత్పత్తి నిరంతరం పెరుగుతోంది. దేశంలో ఎరువుల నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయి. రైతులకు అవసరమైన ఎరువులు క్రమం తప్పకుండా సరఫరా అవుతున్నాయి. వారికి తక్కువ ధరలకే కూడా ఎరువులు సులభంగా లభిస్తున్నాయి."
ఇంధన సరఫరా- ఇంధన లభ్యత
పశ్చిమ ఆసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో, పెట్రోలియం ఉత్పత్తులు ఎల్పీజీలకు ఎలాంటి కొరత లేకుండా నిరంతరాయంగా లభ్యమయ్యేలా చూసేందుకు తీసుకుంటున్న చర్యలను గురించి పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని అందించింది. అందులోని ముఖ్యాంశాలు:
ప్రజలకు సూచనలు - అవగాహన
*దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ లభ్యత నిరంతరాయంగా ఉండేలా చూసేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. పౌరులు ఎవరూ ఆందోళనతో ముందస్తుగా పెట్రోల్, డీజిల్ను కొనుగోలు చేయవద్దని, అలాగే ఎల్పీజీ సిలిండర్లను బుక్ చేసుకోవద్దని సూచించారు.
*వదంతులను నమ్మవద్దని, సరైన సమాచారం కోసం అధికార వర్గాలను మాత్రమే విశ్వసించాలని కోరారు.
*పీఎన్జీ, ఇండక్షన్/ఎలక్ట్రిక్ స్టవ్లు వంటి ప్రత్యామ్నాయ ఇంధన, వంట వనరులను వినియోగించుకోవాలని ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు.
*డీజిల్ను భారీ మొత్తంలో వినియోగించేవారు, పారిశ్రామిక వినియోగదారులు కేవలం అధీకృత సేకరణ మార్గాల ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలని కోరారు.
*ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలంతా తమ దైనందిన జీవితంలో ఇంధనాన్ని, విద్యుత్ ను ఆదా చేసేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలూ చేయాలని కోరారు.
ప్రభుత్వ సంసిద్ధత - సరఫరా నిర్వహణ చర్యలు
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులతో నిమిత్తం లేకుండా గృహ వినియోగ ఎల్పీజీ, గృహ వినియోగ పీఎన్జీ రవాణా రంగానికి చెందిన సీఎన్జీ సరఫరాను 100 శాతం నిరంతరాయంగా అందించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది.
*వాణిజ్య ఎల్పీజీ సరఫరాలో ఆసుపత్రులు, విద్యా సంస్థలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. వీటితో పాటు ఫార్మా, స్టీల్, ఆటోమొబైల్, విత్తనోత్పత్తి, వ్యవసాయం తదితర కీలక రంగాలకు కూడా ప్రాధాన్యత కల్పించారు. వలస కార్మికులకు అందించే 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల సరఫరాను 2026 మార్చి 2, 3 తేదీలలో జరిగిన సగటు దినసరి సరఫరా ఆధారంగా రెట్టింపు చేశారు.
*ప్రభుత్వం ఇప్పటికే సరఫరా, డిమాండ్ . విభాగాలలో పలు హేతుబద్ధీకరణ చర్యలను అమలు చేసింది. ఇందులో భాగంగా రిఫైనరీలలో ఉత్పత్తిని పెంపు, ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ కాల వ్యవధిని పట్టణ ప్రాంతాల్లో 21 రోజుల నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు ప్ పెంపు, వివిధ రంగాల అవసరాలను బట్టి సరఫరాలో ప్రాధాన్యతలను నిర్ణయించడం వంటి చర్యలు చేపట్టింది.
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో సమన్వయ ప్రయత్నాలు - సంస్థాగత యంత్రాంగం
నిత్యావసర వస్తువుల చట్టం. 1955 ఎల్పీజీ కంట్రోల్ ఆర్డర్, 2000 ప్రకారం ఇంధన సరఫరాను పర్యవేక్షించడానికి, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అధికారాలు కల్పించారు.
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సహా అన్ని నిత్యావసర వస్తువుల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడంలోనూ, క్రమబద్ధీకరించడంలోనూ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని భారత ప్రభుత్వం పలు లేఖలు, వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరోసారి స్పష్టం చేసింది.
దేశంలో తగినంత ఇంధన లభ్యత ఉందనే విషయాన్ని పౌరులకు స్పష్టం చేస్తూ, వారిలో నమ్మకాన్ని పెంపొందించడానికి ప్రజలకు సమాచారం అందించాలని, అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని పలు లేఖలు, వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా భారత ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది.
26.05.2026 నాటి లేఖ ద్వారా జిల్లా వారీగా హై స్పీడ్ డీజిల్ / మోటార్ స్పిరిట్/పెట్రోల్ వినియోగ సరళిని నిరంతరం పర్యవేక్షించాలని, సమీక్షించాలని జిల్లా యంత్రాంగాలకు తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను కోరింది.
పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు రిటైల్ అవుట్లెట్ల ద్వారా అనధికారికంగా డీజిల్ సేకరించడాన్ని నిరోధించడానికి సమస్యాత్మక ప్రాంతాలు, ప్రధాన రవాణా మార్గాలు, పారిశ్రామిక కారిడార్లలో తనిఖీలను, అమలు ప్రక్రియలను మరింత తీవ్రతరం చేయాలని, నిబంధనలను ఉల్లంఘించే వారిపై తక్షణమే కఠిన శిక్షార్హమైన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో స్పష్టం చేసింది.
అమలు, పర్యవేక్షణ చర్యలు
-
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడానికి దేశవ్యాప్తంగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా తనిఖీలు చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి.
-
ఎల్పీజీ సంబంధిత అమలు చర్యలు: ఎల్పీజీ సిలిండర్ల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్లను అదుపు చేయడానికి గత 4 రోజుల్లో 7 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇద్దర్ని అరెస్టు చేశారు.
-
పెట్రోల్, డీజిల్ సంబంధిత అమలు చర్యలు: గత 4 రోజుల్లో దేశవ్యాప్తంగా 1800 పైగా దాడులు నిర్వహించారు.
-
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థల అధికారుల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు కూడా నిరంతరం కొనసాగుతున్నాయి –
-
ఎల్పీజీ (డిస్ట్రిబ్యూటర్షిప్లు: గత 4 రోజుల్లో సుమారు 890 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్షిప్లలో తనిఖీలు జరిపారు. నిబంధనలు ఉల్లంఘించిన 105 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్షిప్లపై జరిమానాలు విధించారు.
-
రిటైల్ అవుట్లెట్లు: గత 4 రోజుల్లో 2400 పైగా రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన 22 రిటైల్ అవుట్లెట్లకు జరిమానాలు విధించారు. 554 రిటైల్ అవుట్లెట్లను సస్పెన్షన్లో ఉంచారు.
ఎల్పీజీ సరఫరా
గృహావసరాల ఎల్పీజీ
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది.
గృహ వినియోగదారులకు సంబంధించిన ఎల్పీజీ సరఫరాకు అత్యంత ప్రాధాన్యత లభిస్తోంది.
ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్షిప్ల వద్ద ఎక్కడా నిల్వల కొరత ఉన్నట్లు నివేదికలు అందలేదు.
నిన్న పరిశ్రమవ్యాప్తంగా ఆన్లైన్ ఎల్పీజీ బుకింగ్లు సుమారు 99 శాతానికి పెరిగాయి.
సిలిండర్ల దారి మళ్లింపును అరికట్టడానికి డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత పంపిణీ విధానాన్ని సుమారు 96 శాతానికి పెంచారు. నమోదు చేసుకున్న ఫోన్ నంబర్కు డీఏసీ వస్తుంది.
గడచిన 4 రోజుల్లో సుమారు 1.67 కోట్ల ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్లు కాగా దాదాపు 1.77 కోట్ల సిలిండర్లను వినియోగదారులకు పంపిణీ చేశారు.
వాణిజ్య ఎల్పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు
మొత్తం వాణిజ్య ఎల్పీజీ కేటాయింపులు సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో సుమారు 70 శాతానికి పెరిగాయి. ఇందులో 10 శాతం సంస్కరణలతో ముడిపడి ఉన్న కేటాయింపులు కూడా ఉన్నాయి.
గత 4 రోజుల్లో దాదాపు 1.89 లక్షల 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి.
గడచిన 4 రోజుల్లో సుమారు 878 ప్రత్యేక శిబిరాల ద్వారా 9,800 కంటే ఎక్కువ 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి.
గత 4 రోజుల్లో మొత్తం 22,811 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్పీజీ విక్రయాలు నమోదయ్యాయి.
గడచిన 4 రోజుల్లో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (పీఎస్యూ ఓఎంసీ) దాదాపు 748 మెట్రిక్ టన్నుల వాహన ఎల్పీజీని విక్రయించాయి.
సహజ వాయువు సరఫరా, పీఎన్జీ విస్తరణ చర్యలు
వినియోగదారుల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ గృహావసరాల పీఎన్జీ, రవాణా సీఎన్జీ విభాగాలకు 100 శాతం సరఫరాను అందిస్తున్నారు.
ప్రస్తుతం నడుస్తోన్న యూరియా కర్మాగారాలకు మొత్తం గ్యాస్ కేటాయింపును వాటి గత ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు 98 శాతానికి పెంచారు.
సీజీడీ నెట్వర్క్ల ద్వారా జరిగే సరఫరాతో సహా ఇతర పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరాను 80 శాతం వరకు పెంచారు.
వాణిజ్య ఎల్పీజీ లభ్యతకు సంబంధించి తలెత్తే ఆందోళనలను తగ్గించేందుకు అన్ని భౌగోళిక ప్రాంతాల్లో(జీఏ) రెస్టారెంట్లు, హోటళ్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్జీ కనెక్షన్లను ప్రాధాన్యత క్రమంలో ఇవ్వాలని సీజీడీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.
సీజీడీ నెట్వర్క్ల విస్తరణకు అవసరమైన అనుమతులను వేగవంతం చేయాలని రాష్ట్రాలు- కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలను భారత ప్రభుత్వం కోరింది.
కేంద్ర ప్రభుత్వం 18.03.2026 నాటి లేఖ ద్వారా ఎల్పీజీ నుంచి పీఎన్జీకి దీర్ఘకాలిక పరివర్తనలో సహాయపడే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 10 శాతం వాణిజ్య ఎల్పీజీ కేటాయించనున్నట్లు ప్రతిపాదించింది. పీఎన్జీ విస్తరణ సంస్కరణలతో అనుసంధానమైన అదనపు వాణిజ్య ఎల్పీజీ కేటాయింపును ప్రస్తుతం 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పొందుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం 24.03.2026 నాటి గెజిట్ ద్వారా నిత్యావసర వస్తువుల చట్టం- 1955 కింద 'సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్లైన్లు, ఇతర సౌకర్యాల ఏర్పాటు, నిర్మాణం, నిర్వహణ విస్తరణ ద్వారా) ఉత్తర్వు- 2026'ను నోటిఫై చేసింది. ఈ ఉత్తర్వు దేశవ్యాప్తంగా పైప్లైన్ల ఏర్పాటు, విస్తరణ కోసం క్రమబద్ధీకరించిన, కాలపరిమితితో కూడిన ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది. ఇది అనుమతులలో జాప్యం, భూసేకరణ సమస్యలను పరిష్కరిస్తూ నివాస ప్రాంతాలతో సహా అన్ని చోట్లా సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇది పీఎన్జీ నెట్వర్క్ వృద్ధిని వేగవంతం చేయటం, చిట్టచివరి వరకు కనెక్టివిటీని మెరుగుపరచటంతో పాటు స్వచ్ఛమైన ఇంధనాల వైపు పరివర్తనకు మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. తద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేస్తూ భారతదేశ గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ఇది ముందుకు తీసుకెళ్తుంది.
గృహావసరాల పీఎన్జీ కనెక్షన్లను వేగవంతం చేయాలని అన్ని సీజీడీ సంస్థలను పీఎన్జీఆర్బీ ఆదేశించింది. అలాగే పీఎన్జీ విస్తరణలో వేగాన్ని కొనసాగించడానికి 'జాతీయ పీఎన్జీ డ్రైవ్ 2.0' (01.01.2026-31.03.2026) గడువును 30.06.2026 వరకు పొడిగించారు.
స్వచ్ఛమైన, సురక్షితమైన, స్వయం సమృద్ధి కలిగిన ఇంధన భవిష్యత్తును ప్రోత్సహించడానికి ఒక నమూనా డ్రాఫ్ట్ 'స్టేట్ సీబీడీ (కంప్రెస్డ్ బయోగ్యాస్) విధానాన్ని' రూపొందించింది. రాష్ట్రాలు సొంత పెట్టుబడిదారుల అనుకూల, అమలు-ఆధారిత వ్యవస్థను సృష్టించుకోవడానికి ఇది ఒక సమగ్ర, సరళమైన మార్గదర్శక ఫ్రేమ్వర్క్గా ఉపయోగపడుతుంది. ఈ విధానాన్ని ఎంచుకునే రాష్ట్రాలకు తదుపరి విడత అదనపు వాణిజ్య ఎల్పీజీ కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
2026 మార్చి నుంచి దేశంలో దాదాపు 9.16 లక్షల పీఎన్జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా ప్రారంభమైంది. దీనికి అదనంగా మరో 3.05 లక్షల కనెక్షన్ల కోసం మౌలిక సదుపాయాలను సిద్ధం చేయడంతో మొత్తం కనెక్షన్ల సంఖ్య 12.21 లక్షలకు చేరుకుంది. కొత్త కనెక్షన్ల కోసం సుమారు 9.24 లక్షల మంది వినియోగదారులు నమోదు చేసుకున్నారు.
2026 జూన్ 7వ తేదీ వరకు సుమారు 82,000 మంది పీఎన్జీ వినియోగదారులు MYPNGD.in వెబ్సైట్ ద్వారా ఎల్పీజీ సిలిండర్ కనెక్షన్లను స్వచ్ఛందంగా వదులుకున్నారు.
ముడి చమురు పరిస్థితి, చమురు శుద్ధి కార్యకలాపాలు
అన్ని చమురు శుద్ధి కేంద్రాలు తగినంత ముడి చమురు నిల్వలతో పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ విషయంలో తగినంత నిల్వలు ఉన్నాయి.
గృహ వినియోగానికి మద్దతుగా చమురు శుద్ధి కేంద్రాల నుంచి గృహావసరాల ఎల్పీజీ ఉత్పత్తిని పెంచారు.
దేశీయ మార్కెట్కు పెట్రోకెమికల్ ఫీడ్స్టాక్ సరఫరా లభ్యతను నిర్ధారించడానికి వివిధ మంత్రిత్వ శాఖలతో కూడిన ఉమ్మడి కార్యవర్గ బృందాన్ని (జేడబ్ల్యూజీ) ఏర్పాటు చేశారు. తదనంతరం కేంద్ర ప్రభుత్వం 01.04.2026 నాటి ఉత్తర్వు ద్వారా సీహెచ్టీ (సెంటర్ ఫర్ హై టెక్నాలజీ) నిర్ణయించిన ప్రకారం కీలక రంగాలకు అవసరమైన కనీస పరిమాణంలో సీ3, సీ4 స్ట్రీమ్లను అందుబాటులో ఉంచడానికి పెట్రోకెమికల్ కాంప్లెక్స్లతో సహా చమురు శుద్ధి కర్మాగారాలకు అనుమతినిచ్చింది.
ఔషధ విభాగం, రసాయనాలు- పెట్రో కెమికల్స్ విభాగం (డీసీపీసీ), పరిశ్రమలు - అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఫార్మా - రసాయన రంగ సంస్థల కోసం ఎల్పీజీ పూల్ నుంచి రోజుకు 1,120 మెట్రిక్ టన్నుల (ఎంటీ) సీ3, సీ4 గ్యాస్ను కేటాయించారు.
2026 జూన్ 1వ తేదీ నుంచి ముంబయి, కొచ్చి, విశాఖపట్నం, చెన్నై, మథుర, గుజరాత్ చమురు శుద్ధి కేంద్రాలు రసాయన, ఔషధ, పెయింట్ పరిశ్రమలకు 2,760 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ సీ3-సీ4 గ్యాస్.. 1,660 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ బ్యూటైల్ అక్రిలేట్ను సరఫరా చేశాయి.
రిటైల్ ఇంధన లభ్యత, ధరల నియంత్రణ చర్యలు
దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ విక్రయ కేంద్రాలు యథావిధిగా నడుస్తున్నాయి.
మధ్యప్రాచ్యం సంక్షోభం కారణంగా ముడి చమురు ధరలు అసాధారణంగా పెరిగినప్పటికీ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 10 చొప్పున తగ్గించింది.
కేంద్ర ప్రభుత్వం 31.05.2026 నాటి గెజెట్ నోటిఫికేషన్ ద్వారా పెట్రోల్పై ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ. 3 నుంచి రూ. 1.5కి.. డీజిల్పై లీటరుకు రూ. 16.50 నుంచి రూ. 13.50కి, విమానయాన ఇంధనంపై (ఏటీఎఫ్) లీటరుకు రూ. 16 నుంచి రూ. 9.5కి తగ్గించింది.
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల్లో తగినంత మోతాదులో పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయి.
మిశ్రమ ఇంధనాలు
మిశ్రమ ఇంధనాలతో నడిచే వాహనాల (ఎఫ్ఎఫ్వీ) విడుదల
రోడ్డు రవాణా- జాతీయ రహదారుల శాఖ మంత్రి, పెట్రోలియం- సహజ వాయువు శాఖ మంత్రి సంయుక్తంగా 03.06.2026న హీరో మోటోకార్ప్ సంస్థకు చెందిన మిశ్రమ ఇంధనాలతో నడిచే 2 ద్విచక్ర వాహనాలను, 04.06.2026న మారుతి సుజుకి సంస్థకు చెందిన మిశ్రమ ఇంధనంతో నడిచే వ్యాగన్ఆర్ కారును విడుదల చేశారు.
ఈ-85 ఇంధనం
05.06.2026న పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి ఈ-85 ఇంధనాన్ని విడుదల చేశారు.
బీఐఎస్ 16634:2023 ప్రమాణాలకు అనుగుణంగా మిశ్రమ ఇంధన (ఫ్లెక్స్-ఫ్యూయల్) వాహనాలలో ఉపయోగించడం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ-85 ఇంధనంలో 80-85 శాతం ఇథనాల్, 14-19 శాతం పెట్రోల్ మిశ్రమం ఉంటుంది. ఇది అత్యధిక ఇథనాల్ శాతం ఉన్న ఒక మిశ్రమ ఇంధనం.
ఈ-85 ఇంధనాన్ని కేవలం ప్రత్యేకంగా రూపొందించిన మిశ్రమ ఇంధన వాహనాల్లో(ఎఫ్ఎఫ్వీ) మాత్రమే ఉపయోగించొచ్చు. సాధారణ పెట్రోల్ వాహనాలలో దీనిని ఉపయోగించకూడదు.
ఈ ఈ-85 ఇంధనం ధర ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సాధారణ ఈ-20 పెట్రోల్ ధర కంటే లీటరుకు దాదాపు రూ. 20 తక్కువగా ఉంటుంది.
సాధారణ పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఈ-85 ఇంధనంతో నడిచే వాహనాలు సాధారణ వాహనాలతో పోలిస్తే జీవన కాల చక్రంలో వెలువరించే హరితగృహ వాయువుల ఉద్గారాలను దాదాపు 61 శాతం వరకు తగ్గించగలవు.
దాదాపు 108 ఆర్ఓఎన్ (రీసెర్చ్ ఆక్టేన్ నంబర్) కలిగి ఉండటం వల్ల ఇథనాల్ ఇంజన్కు ఇంజన్ లోపల అకాల ఇంధన మంటను నిరోధించే విషయంలో అద్భుతమైన సామర్థ్యం (నాక్ రెసిస్టెన్స్) అందిస్తుంది. ఇది ఇంజన్లు అధిక కంప్రెషన్ రేషియో, సరైన ఇగ్నిషన్ టైమింగ్తో మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు దోహదపడుతుంది.
రవాణా రంగంలో భవిష్యత్తు ప్రయాణం ఎఫ్ఎఫ్వీ, ఈవీ, ఎఫ్సీఈవీ, హైడ్రోజన్- ఎల్ఎన్జీ మొదలైన వాటి వైపే సాగనుంది. ఈ-85 ఇంధనం పూర్తిగా దేశీయంగా తయారవుతోంది. ఇది కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా మన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మద్దతుగా నిలుస్తుంది.
సముద్రయాన భద్రత, నౌకాయాన కార్యకలాపాలు
పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుత సముద్రయాన పరిస్థితులపై ఓడరేవులు- నౌకాయానం- జలమార్గాల మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని అందించింది. ఆ ప్రాంతంలో భారతీయ నౌకలు, వాటి సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి తీసుకుంటున్న చర్యలను వివరించింది. వెల్లడించిన సమాచారం:
ఒమన్ తీరానికి సమీపంలో ఈ రోజు మధ్యాహ్నం సుమారు 1:30 గంటలకు 'ఎంటీ మారివెక్స్' అనే నౌకలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ నౌకలో 24 మంది భారతీయ నౌకా సిబ్బంది ఉన్నారు. వీరంతా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందింది. డీజీ షిప్పింగ్ ద్వారా ఈ పరిస్థితిని ఓడరేవులు- నౌకాయానం- జలమార్గాల మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. భారతీయ నౌకా సిబ్బందికి అవసరమైన సహాయాన్ని అందించడానికి మంత్రిత్వ శాఖ.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాలు, భారత నౌకాదళంతో కలిసి సమన్వయంతో పనిచేస్తోంది.
డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ తాజా సమాచారం: ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ కంట్రోల్ రూమ్ 12,020 ఫోన్ కాల్స్.. 26,832 కంటే ఎక్కువ ఈమెయిల్స్ను స్వీకరించి వాటికి పరిష్కారాలు అందించింది. గత 96 గంటల్లోనే నౌకా సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, సముద్రయాన రంగానికి చెందిన భాగస్వాముల నుంచి మొత్తం 390 కాల్స్, 968 ఈమెయిల్స్ వచ్చాయి.
స్వదేశానికి రప్పించే ప్రక్రియ (రీపాట్రియేషన్) తాజా సమాచారం: డీజీ షిప్పింగ్ ద్వారా ఇప్పటివరకు 3,506 కంటే ఎక్కువ మంది భారతీయ నౌకా సిబ్బందిని మంత్రిత్వ శాఖ సురక్షితంగా స్వదేశానికి రప్పించింది. ఇందులో గత 96 గంటల్లో గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుంచి భారత్కు వచ్చిన 32 మంది సిబ్బంది కూడా ఉన్నారు.
దేశ వ్యాప్తంగా అన్ని ఓడరేవుల కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నాయి. ఎక్కడా ఎటువంటి రద్దీ నమోదు కాలేదు.
***
(रिलीज़ आईडी: 2270601)
आगंतुक पटल : 18