ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ (పీఎంఎస్ఎంఏ) పథకానికి దశాబ్దం పూర్తయిన నేపథ్యంలో రేపటి నుంచి జాతీయ స్థాయి ఉత్సవాల ప్రారంభం
‘‘పదేళ్ల పీఎంఎస్ఎంఏ – సంరక్షణకు దశాబ్దం’’ పేరిట జరిగే ప్రారంభ ఉత్సవాలకు అధ్యక్షత వహించనున్న కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా
పీఎంఎస్ఎంఏ పరిధిలో అందించే తొమ్మిది రకాల ఉచిత సేవలను ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అవగాహన, ప్రచార కార్యక్రమాలు
పీఎంఎస్ఎంఏ పరిధిలో సురక్షిత మాతృత్వానికి దశాబ్దం పూర్తయిన సందర్భంగా రూ. 75 ప్రత్యేక స్మారక నాణెం, రూ. 5 తపాలా బిళ్లను విడుదల చేయనున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా
प्रविष्टि तिथि:
08 JUN 2026 3:19PM by PIB Hyderabad
సురక్షిత గర్భధారణను, ఆరోగ్యకరమైన మాతృత్వాన్ని అందించే లక్ష్యంతో భారత్ అమలు చేస్తున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల్లో ఒకటైన ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ (పీఎంఎస్ఎంఏ) పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం ప్రారంభించి దశాబ్ధం పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రేపటి నుంచి (2026 జూన్ 9) ‘‘పదేళ్ల పీఎంఎస్ఎంఏ – సంరక్షణకు దశాబ్దం’’ పేరిట జాతీయ స్థాయి ఉత్సవాలను నిర్వహిస్తోంది.
ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా అధ్యక్షత వహిస్తారు.
ఉత్సవాల్లో భాగంగా, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీటి ద్వారా గర్భిణులనూ, వారి కుటుంబాలనూ పీఎంఎస్ఎంఏ పరిధిలో అందిస్తున్న తొమ్మిది ఉచిత సేవలను వినియోగించుకొనేలా ప్రోత్సహిస్తారు. సకాలంలో నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణకున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తారు.
దేశవ్యాప్తంగా సురక్షితమైన మాతృత్వాన్ని ప్రోత్సహించడంలోనూ, మాతృ ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడంలోనూ దశాబ్దంగా ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ అందిస్తున్న సేవలను గౌరవిస్తూ రూ. 75 ప్రత్యేక స్మారక నాణేన్ని, రూ. 5 తపాలా బిళ్లను కేంద్ర మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా విడుదల చేస్తారు.
2016 జూన్ 9న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రతి నెల 9వ తేదీన గర్భిణులకు ఉచితంగా సమగ్రమైన, నాణ్యమైన ప్రసవపూర్వ సంరక్షణ (ఏఎన్సీ) సేవలను అందించడం ద్వారా ఈ పథకం ఒక దశాబ్ద కాలంగా మాతృ, నవజాత శిశు ఆరోగ్య సంరక్షణ స్వరూపాన్ని మారుస్తోంది.
ప్రసవ పూర్వ సంరక్షణ (ఏఎన్సీ)లో నాణ్యత, కవరేజీ, వైద్య పరీక్షలు, కౌన్సిలింగ్ సేవల్లో మార్పు తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన పునరుత్పత్తి, మాతృత్వ, నవజాత, బాల, కౌమార ఆరోగ్యం (ఆర్ఎంఎన్సీహెచ్+ఏ) వ్యూహాన్ని భారత్ అనుసరిస్తోంది. ఈ వ్యూహం పరిధిలో ప్రభుత్వం అమలు చేస్తున్న నిరంతర ఆరోగ్య సేవల్లో ప్రధాన పథకంగా దశాబ్ద కాలంగా (2016-26) ఉత్తమ సేవలను అందిస్తున్న పీఎంఎస్ఎంఏ నిలిచింది. ఇది కోట్లాది కుటుంబాలపై ప్రభావం చూపిస్తూ, దేశంలో మాతృ మరణాల రేటు (ఎంఎంఆర్)ని గణనీయంగా తగ్గిస్తోంది.
***
(रिलीज़ आईडी: 2270286)
आगंतुक पटल : 12