యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
దేశానికి యువతే అతిపెద్ద బలం, వికసిత్ భారత్ సాధనలో వారిది కీలకపాత్ర
మై భారత్ యూత్ కన్వెన్షన్లో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
యువత ఆలోచనలు, ఆవిష్కరణలు, ఆకాంక్షలకు అనుగుణంగా వికసిత్ భారత్ రూపుదిద్దుకోవాలనేదే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్ష: డాక్టర్ మాండవీయ
తమ ప్రతిభ, పట్టుదల, కృషి ద్వారా దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు భారత యువత సిద్ధం: ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా
దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రధాన యువజన భాగస్వామ్య కార్యక్రమాలను ప్రదర్శించిన మై భారత్ యూత్ కన్వెన్షన్.. పాల్గొన్న 6000కు పైగా యువతీయువకులు
प्रविष्टि तिथि:
06 JUN 2026 4:15PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని త్యాగరాజ్ క్రీడా ప్రాంగణంలో నేడు నిర్వహించిన ‘యూత్ ఫర్ వికసిత్ భారత్: మై భారత్ యూత్ కాన్వెన్షన్’ సమ్మేళనంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 6,000 మందికి పైగా యువతీ యువకులు హాజరయ్యారు. ఇందులో విద్యార్థులు, యువ నిపుణులు, యువతులు, పారిశ్రామికవేత్తలు, కంటెంట్ క్రియేటర్లు, ఆవిష్కర్తలు, యువ నాయకులు, వివిధ రంగాలలో అసాధారణ ప్రతిభ కనబరిచిన విజేతలు పాల్గొన్నారు.
దేశ నిర్మాణంలో యువత పోషించాల్సిన విప్లవాత్మక పాత్రను, 2047 నాటికి భారత్ను ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రయాణంలో వారి భాగస్వామ్యాన్ని ఈ సమావేశం ప్రతిబింబించింది.
మై భారత్ యువ సమ్మేళనంలో ప్రముఖ గాయని, ఎమ్మెల్యే శ్రీమతి మైథిలి ఠాకూర్, ప్రముఖ నటుడు శ్రీ విక్రాంత్ మాస్సే, పారిశ్రామికవేత్త శ్రీ అమన్ గుప్తా, భారత క్రికెటర్ శ్రీ జితేష్ శర్మ పాల్గొని మై భారత్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో సంభాషించారు. వారు తమ జీవిత అనుభవాలను యువతతో పంచుకున్నారు. ప్రతి రంగంలోనూ గొప్పగా రాణించాలని, దేశ అభివృద్ధిలో అర్ధవంతమైన పాత్రను పోషించాలని యువతను ఉత్సాహపరిచారు.
6,000 మందికి పైగా యువకులు పాల్గొన్న ఈ యువజన సదస్సు, దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రధాన యువజన భాగస్వామ్య కార్యక్రమాలను ప్రదర్శించింది.
ఈ సదస్సులో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రసంగిస్తూ.. దేశానికి యువతే అత్యంత గొప్ప శక్తి అని, వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో వారే కీలకమని తెలిపారు. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న వారే ఉన్నారని చెప్పారు. మన దేశానికి ఉన్న ఈ జనాభా పరమైన ఆధిక్యతను దేశ ప్రగతి కోసం అద్భుతంగా ఉపయోగించుకోవాలని ఆయన ఈస్పష్టం చేశారు.
‘‘యువతే మన శక్తి, మన గర్వం, మన సంకల్పం, మన భవిష్యత్తు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో నవ భారత యువత సరికొత్త ఆవిష్కరణలు చేయడానికి, తమ ప్రతిభను చాటడానికి, దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావడానికి మునుపెన్నడూ లేని విధంగా అపూర్వమైన అవకాశాలు లభించాయి. అంకుర సంస్థలు, క్రీడలు, ప్రజా సేవ, పారిశ్రామిక రంగం లేదా సృజనాత్మక రంగాలు.. ఇలా ఏ రంగంలో చూసినా భారతీయ యువత తమ అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్టను మరింత పెంచుతున్నారు’’ అని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కొనియాడారు.
యువతలోని నైపుణ్యాలను, సామర్థ్యాలను సరైన దిశలో పెంపొందించి, దేశ నిర్మాణానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దడంలో మై భారత్ వేదిక చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు.
ఇటీవల మై భారత్ సాధించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఘనతను ఆయన అభినందించారు. యువత ఈ వేదికలో చురుగ్గా భాగస్వామ్యమవ్వాలని, ఇందులో లభించే స్వచ్ఛంద సేవ అవకాశాలను ఉపయోగించుకుంటూ దేశ ప్రగతి కార్యక్రమాల్లో తోడ్పడాలని పిలుపునిచ్చారు.
యువత తమ సామర్థ్యాన్ని గుర్తించి, శ్రేష్ఠత కోసం కృషి చేయాలని కోరుతూ మంత్రి మాండవీయ ఇలా అన్నారు...‘‘ఈ సమయం యువతదే. భారత యువత సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు, వారి ఆకాంక్షల ఆధారంగానే వికసిత్ భారత్ రూపుదిద్దుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. 140 కోట్ల మంది భారత పౌరుల కలలను నిజం చేస్తూ ప్రపంచంతో పోటీపడే, ఆత్మవిశ్వాసం కలిగిన, ఆత్మనిర్భరత కలిగిన భారత్ను మనమందరం కలిసి నిర్మించాలి."
ఈ సదస్సును ఉద్దేశించి ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా మాట్లాడుతూ.. భారత యువత తమ అసాధారణ ప్రతిభ, పట్టుదల, కఠోర శ్రమతో దేశాన్ని మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
దేశ నిర్మాణంలో యువత పోషిస్తున్న కీలక పాత్రను ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రస్తావించారు. భారతీయ యువత కష్టపడే తత్వం, గొప్ప దార్శనికత, సృజనాత్మకత, ధైర్యసాహసాలు కలిగినవారని కొనియాడారు. ఒక భారతీయ యువకుడు, యువతి సాధించే ప్రతి విజయం దేశాన్ని వికసిత్ భారత్ వైపు మరింత వేగంగా నడిపిస్తుందని తెలిపారు.
ఏ రంగంలోనైనా రాణించాలంటే పట్టుదల, క్రమశిక్షణ, అంకితభావం అవసరమని పేర్కొన్నారు. క్రీడలు, పారిశ్రామిక రంగం, కంటెంట్ క్రియేషన్, కళలు, ప్రజా సేవ వంటి వివిధ రంగాల్లో భారత యువత సాధిస్తున్న విజయాలను ఆమె ప్రశంసించారు.
యువ సమ్మేళనంలో ప్రముఖ నటుడు విక్రాంత్ మాస్సే మాట్లాడుతూ.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ క్రియేటర్ ఎకానమీ అద్భుతమైన వృద్ధిని సాధించిందని కొనియాడారు. డిజిటల్ సాధికారత, సాంకేతిక ఆవిష్కరణల ద్వారా నేడు యువతకు అపారమైన అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు.
దేశంలో నూతన ఆవిష్కరణలను, పారిశ్రామిక స్ఫూర్తిని ప్రోత్సహిస్తూ, వ్యాపారానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా దేశాన్ని ప్రపంచానికే స్టార్టప్ రాజధానిగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రముఖ పారిశ్రామికవేత్త అమన్ గుప్తా ప్రశంసించారు.
క్రీడారంగంలో అసాధారణ ప్రతిభ కనబరిచి, భారత క్రీడల పురోగతికి తోడ్పడిన ప్రముఖ క్రీడాకారులను ఈ సదస్సులో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా భారత క్రికెటర్ జితేష్ శర్మ ‘ప్లే ఇన్ ఇండియా, ప్లే ఫర్ ఇండియా’ (భారత్లో ఆడండి, భారత్ కోసం ఆడండి) అనే అంశంపై తన అనుభవాలను పంచుకున్నారు. క్రీడల్లో అత్యుత్తమంగా రాణించి, దేశ క్రీడా ఆకాంక్షలను నెరవేర్చాలని యువతను ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో యువజన వ్యవహారాల కార్యదర్శి శ్రీమతి పల్లవి జైన్ గోవిల్ కూడా పాల్గొని ప్రసంగించారు. దేశ నిర్మాణంలో యువత నిరంతరం భాగస్వాములు కావాలని కోరారు. యువ నాయకులను బలోపేతం చేయడానికి, వారికి తగిన సాధికారత కల్పించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే 2047 నాటికి.. భారత్ను అభివృద్ధి చెందిన, స్వయంసమృద్ధి కలిగిన, సమ్మిళిత దేశ నిర్మాణానికి చురుగ్గా తోడ్పడాలనే యువత నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ.. వికసిత్ భారత్ సంకల్పంతో మై భారత్ యువ సమ్మేళనం ముగిసింది.
***
(रिलीज़ आईडी: 2269910)
आगंतुक पटल : 6