యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో చోటు దక్కించుకున్న మై భారత్
వారం వ్యవధిలో ఆన్లైన్ క్విజ్లో అత్యధిక సంఖ్యలో పాల్గొన్న యువత
ఈ ఘనత దేశ యువతదే.. వికసిత భారత్@2047 దిశగా దేశ ప్రయాణంపై వారి విశ్వాసానికి ఇది నిదర్శనం: డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ
प्रविष्टि तिथि:
04 JUN 2026 2:33PM by PIB Hyderabad
భారతీయ యువత కోసం ఉద్దేశించిన ప్రతిష్ఠాత్మక వేదిక మేరా యువభారత్ (మై భారత్) గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో స్థానం సంపాదించింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని యువజన వ్యవహారాల విభాగం దీనిని నిర్వహిస్తోంది. ఒకే వారంలో అత్యధిక సంఖ్యలో ఆన్లైన్ క్విజ్లో పాల్గొన్న విభాగంలో మై భారత్ ఈ ఘనతను సాధించింది. అధికారికంగా ధ్రువీకరించిన సమయానికి 3,90,812 మంది ఇందులో పాల్గొన్నారు.

కేంద్ర యువజన వ్యవహారాలు - క్రీడలు, కార్మిక - ఉపాధి శాఖల మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ, యువజన వ్యవహారాలు - క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్సే, యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి డాక్టర్ పల్లవీ జైన్ గోవిల్, సంబంధిత సీనియర్ అధికారులు, గిన్నిస్ ప్రపంచ రికార్డుల ప్రతినిధులు, యువజన ప్రతినిధుల సమక్షంలో... న్యూఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో ఈ రోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో గిన్నిస్ ప్రపంచ రికార్డుల న్యాయనిర్ణేత శ్రీ రిషినాథ్ మై భారత్కు ధ్రువీకరణ పత్రాన్ని అందించారు.
వికసిత భారత్@2047 దార్శనికతలో యువత అవగాహనను, వారి భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా చేపట్టిన దేశవ్యాప్తం యువ సమ్మిళిత కార్యక్రమం ‘వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ (వీడీవైఎల్డీ) క్విజ్’కు ఈ అరుదైన గుర్తింపు దక్కింది. మై భారత్ పోర్టల్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 50.42 లక్షల యువత పాల్గొన్నారు. దీంతో ఇది దేశంలో చేపట్టిన అతిపెద్ద డిజిటల్ యువ సమ్మిళిత కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది.
ఈ అద్భుత విజయాన్ని సాధించిన మై భారత్ను, బృందాన్ని మంత్రి అభినందించారు. దేశ జనాభాలో దాదాపు 65 శాతంగా ఉన్న 35 ఏళ్ల లోపు యువత ఆకాంక్షలకు ఈ పోర్టల్ బలాన్నిస్తోందన్నారు.

కేవలం మూడేళ్లలోనే మై భారత్లో 2.19 కోట్ల మంది యువత నమోదు కావడం, రోజూ కొత్తగా వేలాదిగా యువత ఇందులో చేరుతుండడాన్ని బట్టి.. ఈ పోర్టల్పై దేశ యువత నమ్మకం, విశ్వాసం స్పష్టమవుతోందని మంత్రి అన్నారు.
గిన్నిస్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకోవడంపై దేశ యువతను మంత్రి అభినందించారు. ఈ ఘనత నిజంగా యువతదేననీ, వికసిత భారత్ ప్రస్థానంపై వారి విశ్వాసానికి ఇది నిదర్శనమనీ వ్యాఖ్యానించారు.
మై భారత్ పోర్టల్ కేవలం ఒక డిజిటల్ వేదిక మాత్రమే కాదని మంత్రి అన్నారు. యువత అర్థవంతమైన భాగస్వామ్యానికీ, తమ ఆలోచనలను పంచుకోవడానికీ వేదికగా దీనిని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత భారత్ను సాకారం చేసుకోవాలన్న ప్రధానమంత్రి లక్ష్యానికి దోహదపడే అవకాశాన్నిచ్చే విశ్వసనీయ, యువ సాధికారతా వేదికగా ఈ పోర్టల్ను అభివర్ణించారు. వీడీవైఎల్డీ ద్వారా యువత పంచుకున్న ఆలోచనలు.. 2026 కేంద్ర బడ్జెటులో ప్రతిబింబించడమే ఇందుకు నిదర్శనమన్నారు.
దేశవ్యాప్తంగా యువత అర్థవంతమైన భాగస్వామ్యానికి మై భారత్ పోర్టల్ ఒక విశ్వసనీయ వేదికగా నిలిచిందని యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీమతి పల్లవీ జైన్ గోవిల్ అన్నారు. యువత స్వచ్ఛందంగా, తమంతట తాముగా వివిధ రూపాల్లో భాగస్వాములవడానికి ఈ పోర్టల్ అవకాశాన్నిస్తుందన్నారు.

2025 అక్టోబర్ 25 నుంచి 31 అక్టోబర్ వరకు జరిగిన అధికారిక గిన్నిస్ ప్రపంచ రికార్డుల మదింపు సమయంలో ఈ పోర్టల్ వేదికగా 8.39 లక్షలకు పైగా యువత క్విజ్లో పాల్గొన్నారు. స్వతంత్ర డిజిటల్ ఫోరెన్సిక్ ఆడిట్లు, ఆధారాల ధ్రువీకరణ, భాగస్వామ్య రికార్డుల సమగ్ర పరిశీలనతో కూడిన సమగ్ర ధ్రువీకరణ ప్రక్రియ అనంతరం.. ఈ క్విజ్లో 3,90,812 మంది అర్హులు పాల్గొన్నారని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ధ్రువీకరించింది. దాంతో మై భారత్ పోర్టల్ సరికొత్త రికార్డును నెలకొల్పింది.
డిజిటల్ సాంకేతికతలను ఉపయోగించి యువత భాగస్వామ్యం కోసం అవకాశాలను విస్తరించడంలో భారత ప్రభుత్వ నిబద్ధతకు ఈ విజయం నిదర్శనం. స్వచ్ఛంద సేవ, అనుభవ పూర్వక అభ్యాసం, నాయకత్వ అభివృద్ధి, సామాజిక కార్యాచరణ దిశగా జాతీయ వేదికగా మై భారత్ పాత్ర విస్తరిస్తోందనీ దీని ద్వారా స్పష్టమవుతోంది.
యువత సాధికారత, ప్రజల భాగస్వామ్యం కోసం డిజిటల్ ఆవిష్కరణలను సద్వినియోగం చేసుకోవడంతోపాటు.. ఉమ్మడి సంకల్పమైన వికసిత భారత్@2047ను ముందుకు తీసుకెళ్లేలా భారత్ తీసుకుంటున్న చర్యల్లో గిన్నిస్ ప్రపంచ రికార్డు ఒక విశేష విజయంగా నిలుస్తుంది.
***
(रिलीज़ आईडी: 2268948)
आगंतुक पटल : 25